అన్నీ అంతరంగ కథనాలే!
‘మెడికో శ్యామ్ ఆత్మకథనాత్మక రచన’
‘నడిచిన పుస్తకం’ గడచిన మహనీయుని పుస్తకం. ఆ మహనీయులు చిర్రావూరి సర్వేశ్వరశర్మ గారు. ‘దొరికిన ప్రతి పుస్తకాన్ని చదవటం/వీలైతే సొంతం చేసుకోవటం/ఎప్పుడైనా రాస్తే గీస్తే క్రిస్పీగా రాయటం’ ఇదీ -ఢిల్లీ శర్మగారు! ‘దొర టోపీ, చేతిలో పుస్తకం’! స్ఫురద్రూపి, మనోహరంగా చమత్కరించగల సున్నిత హాస్యప్రియులు, సంస్కారవంతులు, ఆదర్శజీవులు, నిగర్వి; మితభాషి; మృదుస్వభావి! విలక్షణ వ్యక్తి!
శర్మగారి శతజయంతి రానున్నది. ఆ సందర్భంగా ఈ అక్షరమాల! వారి సంతానం నలుగురూ-శ్యామ్, ఘనశ్యామ్, జఘనరాణి, వల్లీశ్యామల-తండ్రి మూర్తిమత్వాన్ని వ్యక్తిత్వాన్నీ, సాహిత్య వ్యక్తిత్వాన్నీ-ఇలా అరుదైన గ్రంథరూపంలో ఆవిష్కరించారు.
ఈ జ్ఞాపక చిహ్నముద్ర-మూడు భాగాల్లో రూపొందింది – 1.సన్నిహితుల జ్ఞాపకాలు, అనుభవాలు; 2. వ్యక్తిగత జీవితంలో ప్రధాన ఘట్టాలు, 3. వారి రచనలు-కథలు, వ్యాసాలు, ఛలోక్తులు, లేఖలు.
శర్మగారి జీవనరేఖల్లో – వారి వ్యక్తిత్వ దర్శనం చేయించారు-వ్యాసకర్తలూ, సంతానం. దానికి ఈ వ్యాసం మొదటి పేరా-ఒక సంక్షిప్త శబ్దచిత్రం. కాగా,
శర్మగారి సాహిత్య వరివస్యకు ఉదాహరణ ప్రాయంగా లభించిన రచనల్ని ముద్రించారు-మూడవ విభాగంలో ‘ఆలోచనామృత గుళికలు’ ఇలా వుంటాయి
‘ఒకర్ని చూస్తే / నువ్వు / దూరందూరం/ పోతావే! ఆ / ఒకనే / మరొకరికి / ఎంత దగ్గరో కదా!’
‘కోటిమంది / కుంగితే / ఓ కోట నిలుస్తుంది / వేలమంది / నేలకూలితే / లక్షమంది / శ్రమిస్తే / క్షమిస్తే / ఒకడు పేలతాడు / ఒకడు ఏలతాడు’
– భావసారాన్నీ, వ్యక్తీకరణ విధానాన్ని చూస్తే శర్మగారి అంతరంగం, అంతఃకరణ స్వభావం అర్థమౌతున్నాయి. వారికి గల సామాజిక దృష్టి, సమతాకాంక్ష ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి.
అలాగే-వ్యాసాల్లో ఒక్క ఉదాహరణ :- వారు గిడుగు రామ్మూర్తి పంతులుగారి నిర్యాణం (22.1. 1940) నాడు ఆంధ్రప్రభలో రాసిన వ్యాసం. గిడుగుని వారు ఆంధ్ర సారస్వత స్వరూప నిర్ణేతగా అభివర్ణిస్తూ-‘ఆయన సమగ్ర జీవిత చరిత్రను ప్రకటించవలసి వున్నదని హెచ్చరిక’ అని నిష్కర్షగా చెప్పేశారు.
హెచ్.ఎమ్.రెడ్డిగారి ‘తెనాలి రామ’ చిత్రాన్ని సమీక్షిస్తూ వారన్నారు, ‘ప్రభాత్ వారు జ్ఞానేశ్వర్ తీసిన్నాడూ, ఛాప్లిన్ The great dictator విడుదల చేసిన్నాడూ, మన రెడ్డిగారు ‘తెనాలి రామన్న’ను తీసి రిలీజ్ చేశారు. ఎంత గొప్పవారు. సమకాలికులు వీరందరూ! ఎంత తమాషా!’ అని. శర్మగారి తెలుగుతనం, తెలుగువారి ప్రతిభా ఔన్నత్యాల పట్ల సమంసజమైన గర్వం – ఈ తరం వారికి స్ఫూర్తిదాయకం కావాలి!
శర్మగారు చాలా కలం పేర్లతో రచనలు చేశారు. చిత్రమైన విషయం – ‘హ్యూమర్’ రాసి ‘సీరియస్’ కలంపేరు పెట్టారు! ‘ప్రేమకథ’ని (వెలుగు-చీకటి) ‘ప్రేమికుడు’ కలం పేరుతో రాశాడు
శర్మగారు నాకంటే ఇరవైయేళ్ళు పెద్దవారు! అణాకి అరవీసె వంకాయలు వస్తున్న రోజుల్లో సంతృప్త జీవనం సాగించి, సంతానాన్ని యోగ్యపథంలో నడిపినవారు. ఆ కాలం మనుషుల్లో-ప్రత్యేకించి చదువుకున్న మధ్యతరగతి వారిలో ఏదో ఒక ఉద్యోగంలో కుదురుకోవటం, సంసారాన్ని ‘సజావు’గా సరిదిద్దుకోవటం, ‘బతకటం’ కాకుండా ‘జీవించటం’ ముఖ్యమైన ఆనందాలుగా ఉండేవనిపిస్తుంది. లలితగారి వంటి ‘ఉత్తమా ఇల్లాండ్రు’ ఉండేవారు. ఒకవిధమైన రసహృదయం, కారుణ్యం, ఆపన్నులయెడ చెమర్చే కన్నూ ఉండేవి వారికి. ఆత్మతృప్తి ప్రధాన సుగుణ విశేషంగా కనిపించేది! తన మన; పర, స్వపర సమాన అభిమానాలు, ఆప్యాయతలు ఉండేవి.
ఇవన్నీ-మనకు ఈ ‘నడిచిన పుస్తకం’ నడిపించిన అక్షరాల్లో గోచరిస్తున్నాయి. ఒక్కమాట ‘Living is an art’ ‘బ్రతకటం వో కళ’ అన్నారు శర్మగారు. ఆనాటికి అది పెద్ద గొప్ప సూక్తి కాదు! ఈ నాడు మనం ఆమాటని తిరగేసి మల్లేసి, దాని గురించి వినటానికి దానివెంట పరిగెత్తుకుపోతున్నాం!
‘ఒక నిండైన సాహిత్య కళా శతాబ్దాన్ని విజయనగరానికి, ప్రపంచానికి అందించి నిశ్శబ్దంగా కనుమరుగైపోయిన మౌని, మహానుభావుడు, నా స్నేహితుడు, నన్నింత ప్రయోజకుణ్ణి చేసిన నా పితృసమానుడు-‘ అన్నారు డా||వి శ్రీనాథ్. ఇంతకంటే శర్మగారికి ఇంకేం గొప్ప నివాళి నివ్వగలం. తిమిరం తొలగాలంటే జ్యోతి వెలగాల్సిందే!! ‘ప్రవర్తితో దీప ఇవ ప్రదీపాత్!’
ఇప్పుడు ఈ ‘నడచిన పుస్తకం’లో గల ‘నడుస్తున్న గాలిరథం’ ఒకదాన్ని పరామర్శిస్తాను.
మెడికో శ్యామ్కి ‘కథ’ చదవాల్సిన అవసరాన్ని ఎరక్కపోయి కల్పించారు ప్రవాసీమంచ్ వారు! వర్తమానాన్నీ, కథాలోకం సర్వంనీ-ఒక చూపు చూశాడు! ఆ వెంటనే తనను తాను కూడా ఆపాదమస్తకం చూసుకున్నాడు.
కనపడిందేమిటి? అసమంజస వాతావరణం; అనేక మెలడీలు! వీటికి ఏ రెమెడీల నివ్వగలం అనే విచికిత్స మొదలైంది. అది మొదలైతే మెదడులో మరి ‘పురుగు’ అవుతుంది కదా. అది ‘తొలుస్తుంది! ఆ సంవేదన, ఆత్మఘోష, అంతరంగ వీక్షణ, అంతర్మథనం-ఇదిగో ఇలా అక్షరాలకి దిగింది! ఒక చింతనపరుడైన కథకుని ‘అవసర నైవేద్యం’ ఒక బుద్ధిజీవి సొంత నివేదన-అదృష్టవంతులైన తెలుగులకు అందివచ్చింది! చదివాను; రెండుమూడుసార్లు! ఒక రాయని భాస్కరుని హృద్దర్శనం అనిపించింది. సరే-కథ అనుకుందామా? అనుకుంటే-‘అనుకో’ అన్నది. ఎందుకని? అంతా కలిపి ఆ ‘మహమ్మారి’ కల్పించిన ఒక అసహాయ స్థితి చిత్రణ కనుక. మనసెందుకో-కథ కంటే కథనం ఎక్కువ అన్నది. ‘కవితాత్మ కలిగిన కథకుడివీ, భావుకుడివీ కనుక నీకు శిథిల సౌందర్యంపట్ల ఆకర్షణవుంది. అసలు నీకు ఆడ ఫ్లేవరు చాలు…’ వంటి అనేకానేక వ్యాకరణాత్మక వాక్య సముదాయం కళ్లముందుకొచ్చి అవునవునన్నాయి. కాదు, ‘వచన కవిత్వమబ్బి’ అని గుసగుసవోయింది మనసు. ‘నువ్వెప్పుడూ ఒంటరివే. నీ పక్కింటివాడెవడో నీకు తెలీదు..’ వంటి Stanza లు చదవమని కన్నుగీటాయి. అదేంకాదు – దీన్ని కవితావచనమ్ అనాలి. అప్పుడెప్పుడో మో ‘చితి-చింత’ చదవలేదా? అని ఒక గద్దింపు వినిపించింది. అవును- ‘శ్యామ్యానా’ లాంటి అనేక నా ‘బెడ్ సైడ్’ బుక్స్ లో అదీ ఒకటి’-అని కళవళపడి సంజాయిషీ ఇచ్చుకున్నాను-‘అయితే ఒక దాఖలా చూపు’ అన్నది ‘గద్దింపు’. ‘నువ్వేదేశం వాడివైతే ఆ దేశం నీదేశం/నీలో లోపలికి తరచి చూసుకో. శ్వేతాశ్వేతాలేకాదు. మిగతా రంగుల్నుంచీ, మరకల్నుంచీ దూరంగా జరుగు. విశ్వమానవుడివి నువ్వు…’ నుంచీ ఈ మహాశయుడు చెప్పిందంతా కవితా వచనమే అని అరమోడ్పుగా, గుండె అరల్లోకి సర్దుకున్నాను. ‘శ్యామ్యానా’ చేతికొస్తే-రోజూ చదువుకొనే కథా, 107, 108 పేజీల్లో అండర్లైన్లు గద్దింపుకి మద్దతుదార్లయినాయి! శ్యామ్ వాక్య విన్యాసమంతా ‘దొరకునా ఇటువంటి సేవ’ అని రాగం తీయసాగింది!
ఏతావాతా-కథ ఉన్నదండీ! వర్తమానంలో కథకులు పెన్నులు మూసుకుని రాయని భాస్కరులైపోవటానికి గల పరిస్థితుల దుర్దశ చిత్రణ ఉన్నది. వేరే ‘కథకుడి అంతరంగం’ ఒక సంవేదనాపరుడి అశాంతి దర్పణం కనుక కవిత ఉన్నది. అంతర్మథనం కనుక కథనం వచ్చింది. వస్తురూప ప్రక్రియల్లో ‘ప్రయోగశీలి’ కనుక దీన్ని కవితావచనమే కూడా చేశాడు శ్యామ్.
ఏది చెప్పినా-‘డయోగ్నసిస్’ స్పష్టంగా ఉన్నది. ‘ప్రిస్క్రిప్షన్’ కావాలంటే-వేరే ‘ఖర్చ’వుతుంది మరి! ‘కథకుడి అంతరంగం’లో చెప్పిన దాని వెనుక చెప్పని పదా(ద+అ)ర్థం ఎక్కువ ఉన్నది. అది ‘ధ్వనిమంతు’ల ఘనత! వారంతా కథారచనలో ‘పనిమంతులు’! చదివేవాడి బుర్రకీ ‘పని’ పెడతారు!
శ్యామ్ రచనల్ని త్రిపుర, గ్రిపుర అనీ, రావిశా, కావే, వచం-అనీ కొంచెం కొంచెం పీక సన్నాయి వదులుతున్నారు. అన్యాయం సార్. శ్యామ్ రచన శ్యామ్ రచనే! అతన్ని అతను గానే అననీయండి, మననీయండి!
అప్పుడెప్పుడో చంద్ర, రచనా శాయి, నేనూ మాట్లాడుకుంటుంటే శ్యామ్ మాట వచ్చింది. ‘అతను రాస్తే బాగుంటుంది’ అనుకున్నాం-శ్లేషతో! మునిపల్లె రాజు గారి దగ్గర నేనీ ప్రసక్తి తెస్తే, వారన్నారు- ‘అతని కథలన్నీ పరిశోధన పత్రాలు కదా; పరిశోధనకైతే సమయం అక్కర్లేదు. వాటికి కావాలి’ అని నవ్వారు.
ఇప్పుడు- ‘గన్కాసే పడ్రే…!’ అన్నట్టు; చిన్నవిజ్ఞప్తి; మనవి; విన్నపం-‘డాక్టర్ గా మరీ అంత బిజీ అయితే, ఏ ‘ఐసీసీయూ’ వంటి కథనైనా పడేయండి సార్! ఎటూ మీరే అన్నారు కదా ‘కథలు రాయడం ఎలా?’ అంటే ‘ఎలా బడితే అలా’ అని!!
***
చివరగా ఒక గమనింపు: ఇదే పుస్తకంలో మాన్యులు ద్వారం దుర్గాప్రసాదరావు గారి వ్యాసం ఉంది. అంతర్మథనం గురించి శ్యామ్ గురించీ, నిండైన మేలిపలుకులున్నా, అవశ్యం పఠనీయం. చిత్తగించండి ప్లీజ్!
విహారిగా సుప్రసిద్ధులైన శ్రీ జే.యస్.మూర్తి గారు 1941 అక్టోబర్ 15 న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. విద్యార్హతలు: ఎం.ఏ., ఇన్సూరెన్స్ లో ఫెలోషిప్; హ్యూమన్ రిసోర్సెన్ మేనేజ్మెంట్, జర్నలిజంలలో డిప్లొమాలు, సర్టిఫికెట్స్, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో ప్రసంగాలు, వ్యాస పత్ర ప్రదానం.
తెలగులోని అన్ని ప్రసిద్ధ పత్రికల్లోను 350 పైగా కథలు రాశారు. టీవీల్లో, ఆకాశవాణిలో అనేక సాహిత్య చర్చల్లో పాల్గొన్నారు.
15 కథా సంపుటాలు, 5 నవలలు, 14 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, ఒక సాహిత్య కదంబం, 5 కవితా సంపుటాలు, రెండు పద్య కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కథా కావ్యం, ఒక దీర్ఘకవిత, ఒక నాటక పద్యాల వ్యాఖ్యాన గ్రంథం, ‘చేతన’ (మనోవికాస భావనలు) వ్యాస సంపుటి- పుస్తక రూపంలో వచ్చాయి. 400 ఈనాటి కథానికల గుణవిశేషాలను విశ్లేషిస్తూ వివిధ శీర్షికల ద్వారా వాటిని పరిచయం చేశారు. తెలుగు కథాసాహిత్యంలో ఇది ఒక అపూర్వమైన ప్రయోజనాత్మక ప్రయోగంగా విమర్శకుల మన్ననల్ని పొందింది.
ఆనాటి ‘భారతి’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి పత్రికల నుండి ఈనాటి ‘ఆంధ్రభూమి’ వరకు గల అనేక పత్రికలలో సుమారు 300 గ్రంథ సమీక్షలు చేశారు.
విభిన సంస్థల నుండి పలు పురస్కారాలు, బహుమతులు పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1977) గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడెమివారి Encyclopedia of Indian Writers గ్రంథంలో సుమారు 45 మంది తెలుగు సాహితీవేత్తల జీవనరేఖల్ని ఆంగ్లంలో సమర్పించారు. మహాకవి కొండేపూడి సుబ్బారావుగారి స్మారక పద్య కవితా సంపుటి పోటీలోనూ, సాహిత్య విమర్శ సంపుటి పోటీలోనూ ఒకే సంవత్సరం అపూర్వ విజయం సాధించి ఒకేసారి 2 అవార్డులు పొందారు.
అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి (లక్ష రూపాయల) జీవిత సాధన ప్రతిభామూర్తి పురస్కార గ్రహీత. రావూరి భరద్వాజ గారి ‘పాకుడురాళ్లు’ – డా. ప్రభాకర్ జైనీ గారి ‘హీరో’ నవలలపై జైనీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన తులనాత్మక పరిశీలన గ్రంథ రచన పోటీలో ప్రథమ బహుమతి (రూ.50,000/-) పొందారు. (అది ‘నవలాకృతి’ గ్రంథంగా వెలువడింది).
కవిసమ్రాట్ నోరి నరసింహ శాస్త్రి సాహిత్య పురస్కార గ్రహీత.
6,500పైగా పద్యాలతో-శ్రీ పదచిత్ర రామాయణం ఛందస్సుందర మహాకావ్యంగా ఆరు కాండములూ వ్రాసి, ప్రచురించారు. అది అనేక ప్రముఖ కవి, పండిత విమర్శకుల ప్రశంసల్ని పొందినది. ‘యోగవాసిష్ఠ సారము’ను పద్యకృతిగా వెలువరించారు.
వృత్తిరీత్యా యల్.ఐ.సి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నుండి జనరల్ మేనేజర్గా పదవీ విరమణ చేశారు.