ఎన్నికలు వస్తే-
జనావళికి ఎన్ని కలలో?
పేరు తెలియని
నాయకులందరు
పుట్టలోని చీమలదండులా-
జనాలపై వరాల
దండయాత్రతో
ఆశలపల్లకీని
మోస్తారు!!
అభివృద్ది అనే
ఊతపదం
నాయకుల నాలుకపై
నాని, నాని-
చెమ్మగిల్లి
సొమ్మసిల్లేలా
నాయకులు వాడుతారు
పాత హామీలకు
చెదలు దులుపుతారు!!
నిరంతర మంచినీరు-
స్థానంలో మద్యం
ప్రవహించి, జనాలను
చిత్తడిచేస్తుంది-
నాయకుల గత హామీలు మరచేలా
జనుల మస్తిష్కం
సారా సందడిలో
మునిగితేలడం
తథ్యమవుతుంది!!
ఎన్నికల ముగింపుతో
జనావళి మత్తుమాయం,
దండాలు పెట్టి
దండలు వేయించుకున్న
నాయకులు పలాయనం.
ఇదీనేటి ఎన్నికలతీరు-
ప్రజాస్వామ్యాన్ని
పరిహసిస్తున్న
ఓటు అనే ఆయుధం!!
పార్టీలను ఎండగట్టి-
నాయకులను శపించి-
ప్రయోజనం శూన్యం.
ఓటరులోని జడత్వం-
సాగినంతకాలం-
ఎన్నికలు ఎన్ని వచ్చినా-
అవి ఎన్నోకలలు గా
మిగిలిపోవడం-
భవిష్యభారతదృశ్యం!!
సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.