Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రేమకై తపించే ఆధునిక యువతి జీవితం – ‘ఎందుకే నీకింత తొందరా..?’ నవల

[శ్రీమతి బలభద్రపాత్రుని రమణి రచించిన ‘ఎందుకే నీకింత తొందరా..?’ అనే నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

శ్రీ పిడపర్తి వెంకటరమణశర్మ గారి జ్ఞాపకార్థం ప్రముఖ వెబ్ పత్రిక కౌముది నిర్వహించిన నవల పోటీ (2023) లో బహుమతి పొందిన నవల ‘ఎందుకే నీకింత తొందరా..?’. సీనియర్ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారి కలం నుండి జాలువారిన ఈ నవల తొలుత కౌముది వెబ్ మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురితమైంది. ఇటీవలె సాహితీ ప్రచురణలు, విజయవాడ వారిచే పుస్తక రూపంలో ముద్రించబడి పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.

తన జీవితంలో అన్నీ తొందర తొందరగానే అయిపోయాయని చెబుతూ, తన మనస్తత్వానికి – తాను ఈ తరం ఆడపిల్లనై ఉంటే ఎలా ఉండేదన్న ఆలోచన తనకి చాలాసార్లు వచ్చేదని అంటూ, ప్రస్తుత తరం పిల్లల్లో సందిగ్ధ సంకట సంచలన ప్రవృత్తి దేనివల్ల వస్తోంది అన్న ఆలోచనతో, తాను అమెరికాలో చూసిన జీవన విధానల వల్ల కల్గిన అవగాహనతో ఈ నవల రాశానని వ్యాఖ్యానించారు రచయిత్రి.

~

ఋష్యేంద్రమణి పాత పేరు పెట్టబడిన ఆధునిక యువతి. ఆమె ఆలోచనలు, చేతలు అన్నీ మామూలు ఆడపిల్లల కంటే భిన్నంగా ఉంటాయి. తల్లిదండ్రుల ఒత్తిడి మీద ఇంజనీరింగ్ లో చేరి, అది నచ్చక, మానేసి హిస్టరీతో ఆర్ట్స్ చేస్తుంది రుషీ. తన కెరీర్‍ని, తన లైఫ్‍ని అమ్మానాన్నలే డిసైడ్ చేసేయడం రుషీకి నచ్చదు. తనతో అమ్మానాన్నలు, నానమ్మ వ్యవహరించే తీరు నచ్చదు. రుషీకి వాళ్ళ పద్ధతులూ, అభిప్రాయాలు నచ్చవు, వాళ్ళకి రుషి ప్రవర్తన, మొండితనం నచ్చవు. రుషీ ఒక రకమైన ప్రేమ రాహిత్య భావనతో ఉంటుంది. ఆమె తమ్ముడు హనీష్ అమెరికాలో ఎం.ఎస్. చేస్తున్నాడు. తమ్ముడికి మంచి పేరు పెట్టారన్న దుగ్ధ ఉంటుంది. తమ్ముడు ఫోన్‍లో మాట్లాడినప్పుడు – పొగరుగా మాట్లాడుతాడని అనుకుంటుంది.  ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుని తనకంటూ ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. తొలుత ఓ డాక్టర్ దగ్గర రిసెప్షనిస్టుగా చేరుతుంది. ఆ డాక్టర్ తన వృత్తిపరమైన టెన్షన్స్ తగ్గించుకోడం కోసం రిషీతో క్లోజ్‍గా ఉండడం స్టార్ చేస్తాడు. అది తన మీద ప్రేమ అని అపోహ పడుతుంది. కొత్త కొత్తగా అలకంరణలు చేసుకుని వెళ్ళడం మొదలుపెడుతుంది. ఇద్దరూ కొన్ని రోజులు కలిసి తిరుగుతారు ఇదంతా గమనిస్తున్న ఓ సీనియర్ నర్స్, డాక్టర్ లేని సమయంలో రిషీని హెచ్చరిస్తుంది. అయితే,ఆ డాక్టర్   ఓ రోజు తన భార్యతో హాస్పటల్‍కి వస్తాడు. ఆమె అతని భార్య అని తెలుసుకున్న రిషీ ఓ చిన్న అబద్ధంతో భార్య ముందు ఆ డాక్టరు గుట్టు బయటపెట్టేసి, ఉద్యోగం మానేస్తుంది. తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు ఇదంతా గుర్తు చేసుకుంటే, ఆలోచన కన్నా ముందు రియాక్ట్ అవడం తన అలవాటని గ్రహిస్తుంది.

అమెరికాలో ఉంటున్న మేనత్తకి ఆరోగ్యం దెబ్బతినడం, ఆమె కూతురు పరీ అందుబాటులో లేకపోవడంతో, అత్తని చూసుకోడానికి అమెరికా వెళ్తుంది రిషీ. ఇక్కడ్నించి నవల వేగం పుంజుకుంటుంది. ఫ్లయిట్‌లో పరిచయమైన ద్వారకతో స్నేహం పెరుగుతుంది.

మేనత్త ఇంటికి వచ్చాక, అత్తయ్య ధీరజ్‍ని పరిచయం చేస్తుంది. అత్తకి సర్జరీ డేట్ ఫిక్స్ అవుతుంది. కానీ పరిమళ మాత్రం రాలేకపోతుంది. రెండు మూడు రోజులయ్యాకా, ధీరజ్ పరీని ప్రేమించాడనీ, పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడనీ, కానీ పరీ తీసుకున్న ఓ నిర్ణయం నచ్చకపోవడంతో సతమతమతున్నాడని అర్థం చేసుకుంటుంది. పరీతో తన తరఫున మాట్లాడమంటాడు ధీరజ్. ఓ రోజున హాస్పటల్‍లో మళ్ళీ కలుస్తాడు ద్వారక. అతనూ, ధీరజ్ కలిసి చదువుకున్నారని తెలుస్తుంది. అత్తయ్య కోలుకుంటూ ఉంటుంది. కానీ పరీ ఓ చిత్రమైన సమస్య తెచ్చిపెడుతుంది అందరికీ. ఆమె నిర్ణయాన్ని హర్షించని ధీరజ్ ఇండియా వెళ్ళిపోతాడు.

సియాటిల్‍లో ఉన్న రోజుల్లో, ద్వారకతో స్నేహం గట్టి పడుతుంది. ఇంటికి తీసుకువెళ్ళి తమ అమ్మని పరిచయం చేస్తాడు. కాలక్రమంలో స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే ద్వారకకి ఉన్న బాధాకరమైన గతం కారణంగా పెళ్ళి అనే బంధంలో కుదురుకోవాలనుకోడు. జీవితభాగస్వామితో కాపురం చేస్తానంటాడు, పిల్లలు పుడితే పెంచుతానంటాడు. ఒకరోజు ఇద్దరూ శారీరికంగా దగ్గరవుతారు. పెళ్ళి చేసుకుందాం అని రిషీ అంటే,  తమ బంధం పెళ్ళీ, సమాజం కన్నా ఎక్కువ అంటాడు. రిషీ ఎంతో తికమకి గురవతుంది. ఉద్వేగానికి లోనవుతుంది. మేనత్త కాస్త కోలుకున్నాకా, రిషీ ఇండియా తిరిగొచ్చేస్తుంది. తన కూతురితో పెళ్ళికి ధీరజ్‍ని ఒప్పించమని చెప్తుంది అత్తయ్య.

దాంతో ఇండియాకి వచ్చాకా, సఖినేటిపల్లి పక్కన ఓ చిన్న గ్రామానికి ధీరజ్ కోసం వస్తుంది. అక్కడ ధీరజ్ తల్లి తోనూ, తాతయ్యతోను మాట్లాడాకా రిషీలో మార్పు వస్తుంది.. తల్లిదండ్రుల మీద, నానమ్మ మీద, తమ్ముడి మీద అభిమానం ప్రేమా పెరుగుతాయి. ద్వారక గురించి పూర్తిగా చెప్పకుండా, లివింగ్ టుగెదర్ చేద్దామని అనుకుంటున్నాని ఇంట్లో చెప్పేసరికి తల్లిదండ్రులు వీరంగం వేస్తారు. తండ్రికి గుండెపోటు వస్తుంది. ఆయన కోలుకున్నా, తమ్ముడి సాయంతో ఉన్నత విద్య కోసం మళ్ళీ అమెరికా వచ్చేస్తుంది రిషీ. చదువు మీద ఫోకస్ చేయమని, అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్ట్యూనిటీ మాత్రమే కాదు, లాండ్ ఆఫ్ మెచ్యూరిటీ అని చెప్తాడు తమ్ముడు. నిజంగానే అమెరికాలో ఉన్న ఈ రెండేళ్ళలో రిషీలో ఎంతో మార్పు వస్తుంది. చివరికి ఎవరి కథలకి ఏయే ఏయే ముగింపులొస్తాయన్నది ఆసక్తికరం! అవన్నీ ఎవరికి వారు చదువుకుని ఆస్వాదించాల్సిందే.

~

ఈ నవలలో కొన్ని అద్భుతమైన వాక్యాలున్నాయి. కొటేషన్స్‌లా వాటిని రాసుకుని దాచుకునేలా ఉన్నాయి.

వాటిలో కొన్ని:

~

ప్రేమ కోసం తపించిన రిషీకి అసలైన ప్రేమ దొరకటం పాఠకులకు సంతృప్తినిస్తుంది. చదువరులను నిరాశపరచదీ నవల!

***

ఎందుకే నీకింత తొందరా.. (నవల)
రచన: బలభద్రపాత్రుని రమణి
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ.
పేజీలు: 184
వెల: ₹ 150/-
ప్రతులకు:
సాహితీ బుక్స్, చుట్టుగుంట,
విజయవాడ. ఫోన్: 9849992890
నవోదయ బుక్ హౌస్,
కాచీగుడా, హైదరాబాద్. ఫోన్ 9000413413
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Balabhadrapatruni-Ramani/dp/B0DZX8YXKF

 

~
శ్రీమతి బలభద్రపాత్రుని రమణి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-balabhadrapatruni-ramani/

Exit mobile version