[పాల్ విలియం రాబర్ట్స్ రచించిన ‘Empire of the Soul’ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం.]
యాత్రా చరిత్రలంటే ఆసక్తి ఉన్న ప్రతివారు చదవదగ్గ పుస్తకం పాల్ విలియం రాబర్ట్స్ రచించిన ‘Empire of the Soul’. పాల్ విలియం రాబర్ట్స్ జన్మతః ఇంగ్షీషు వాడైనా, కెనడాలో స్థిరపడ్డ రచయిత. పాతికేళ్లలోపే ఎంఏ ఇంగ్లీషు పాసై, హిప్పీల గుంపులో కలిసి తిరుగుతూ మత్తుపదార్థాలకు బానిసై, ఆ వ్యసనం నుంచి విముక్తి కోసం మన దేశానికి వచ్చి స్వాములు, సన్యాసులను సేవిస్తూ, ఆధ్యాత్మిక మార్గంలో అన్వేషణ కొనసాగిస్తూ, బెంగుళూరు, పూనా, బాంబే, జైసాల్మేర్, కలకత్తా, ఢిల్లీ వంటి మహా నగరాల్లో సాధుసంతుల సాన్నిధ్యంలో పొందిన ఆధ్యాత్మిక అనుభవాలను ఈ గ్రంథంలో వివరంగా రాశాడు.
పాల్ విలియం Journey of the Magi, In search of Jesus, River in the Desert, A War against Truth తదితర గ్రంథాలలో కూడా తన పర్యటనలలో తాత్విక అనుభవాలను వర్ణించాడు.
1974-75 లో పాతికేళ్ళ యువకుడుగా మొదటిసారి భారతదేశానికి వచ్చి బెంగళూరు వైట్ ఫీల్డ్లో, శ్రీశ్రీ పుట్టపర్తి సాయిబాబా వారి పరిచయం కలిగిన తర్వాత, దేశంలోని అనేకమంది యోగులను సందర్శించినా, తనకు బాబాగారి మీద విశ్వాసం కుదిరింది. పాశ్చాత్య జీవన విధానానికీ, భారతీయ సంస్కృతికి మధ్య అంతరాలు, వైరుధ్యాలు తనకు విచిత్రంగా అనిపించాయి. యాత్రాచరిత్ర లాంటి ఈ రచనలో X-ray కళ్ళతో తాను గమనించిన అన్ని విషయాలను గ్రంధస్థం చేశాడు. ఎంత చిన్న విషయమైనా అతని దృష్టి నుంచి తప్పించుకోలేదు.
బెంగళూరు వైట్ ఫీల్డులో సత్యసాయి బాబాగారి సన్నిధిలో గడిపిన సమయంలో వెంకటగిరిరాజా గారితో సన్నిహిత పరిచయం ఏర్పడింది. అతను ఈ పుస్తకంలో వెంకటగిరి రాజాగారిని ‘రాజ్ కుమార్’ అని మాత్రమే పేర్కొన్నాడు గాని, ఆయన అసలు పేరు చెప్పలేదు. 1976 నాటికి వెంకటగిరి మహారాజ భవనంలో జమీందారీ వారసుడు వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేంద్ర నివసిస్తున్నారు. వీరి తమ్ముడు ఆ రోజుల్లో మహారాజ్ కుమార్ అనే గౌరవ నామంతో అన్నగారి పేరుమీద జమీందారీ పరిపాలన, పెత్తనం చేశాడు. ప్యాలెస్లో రాణీగార్లు నివాసం ఉండే గదులకు సమీపంలోనే, రాణివాసం వద్ద రాజకుమారుడి గదిని తనుండడానికి ఏర్పాటు చేసినట్లు పాల్ విలియం పేర్కొన్నాడు కనుక, జమీందారో, లేక ఆయన తమ్ముడో నివాసం ఉండే గది పాల్ విలియంకు ఉండడానికి ఏర్పాటు చేసినట్లు పాఠకులకు అర్థమవువుతుంది. మండు వేసవిలో, డొక్కు జీపులో ఇతర ప్రయణీకులతో బాటు కడపలో బయలుదేరి వెంకటగిరి నగరు ప్రధాన ద్వారం ముందు దిగినట్లు రాశాడు. ద్వారం వద్ద నలిగిన తెల్ల పైజామా, మాసిన చొక్కా వేసుకొని నిలబడి ఉన్న ఒక స్థూలకాయుడు అతని రాకను రాజ్ కుమార్కు తెలియజేసి, పాల్ విలియంను ఒక గ్రానైట్ బండలు పరచిన మెట్ల దారిగుండా మేడపైకి తీసుకొని వెళ్ళి, చిన్న గదిలో మడత కుర్చీలో కూర్చొని ఉన్న రాజ్ కుమార్ను చూపించినట్లు, ఆయన సముఖంలో కొందరు పంచలు కట్టుకొని వున్న సామాన్యులు ఉత్త నేల మీద కూర్చొని ఆయన మాటలు శ్రద్ధగా వింటున్నట్టు, ఒక విదేశీయుడు అక్కడికి వచ్చినా వాళ్ళు పట్టించుకోలేదని ఆ దృశ్యాన్ని అతను వివరంగా వర్ణించాడు. తనను రాజ్ కుమార్ మొదట గుర్తించనట్లు క్షణకాలం మొహంపెట్టి, కూర్చోమని చేత్తో సైగచేసినట్లు కూడా అతను పేర్కొన్నాడు.
సత్యసాయిబాబా గారితో వెంకటగిరి సంస్థాన వారసులు
బెంగుళూరులో బాబాగారి సన్నిధిలో తానున్న రోజుల్లో రాజ్ కుమార్ తనతో ఆత్మీయంగా, స్నేహంగా వ్యవహరించిన విషయం అతను గుర్తు చేసుకొంటాడు. అదొక రాజభవనంగా, మహారాజుల నివాసంగా అతనికి అనిపించదు. ఆ పురాతన భవనానికి వెల్లవేసి ఏళ్ళు పూళ్ళు గడచిపోయినట్లు అనిపిస్తుంది.
రాణి వాసానికి సమీపంలో అతనుండేందుకు గది ఏర్పాటయింది. ఆ దుక్కలాంటి సేవకుడు కొన్ని పుచ్చబద్దలు, గ్లాసులో పుచ్చపళ్ళ రసం తీసుకుని వచ్చి ముందుంచుతాడు. తాను ఉదయం ఎప్పుడో తిన్నాడు, రుచించకపోయినా, ఆ సేవకుడు తినమని సైగ చేయడంతో వాటిని తినేస్తాడు. రాజ్ కుమార్ తన వెనుక నిలబడి అంతా గమనిస్తూ ఉంటారు. తను ఫ్రెష్ కావాలని పాల్ విలియం అనగానే, తన కుమారుడు ఊళ్ళో లేడని, అతని గదిలో ఉండవచ్చని, రాజ్ కుమార్ అనగానే, అతన్ని వెంటపెట్టుకుని సేవకుడు ఆ గదిలో దిగబెడతాడు. అక్కడ బాత్రూంలో ఇండియన్ కమోడ్, ప్రాథమిక సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. అతను ఉండడానికి ఏర్పాటు చేసిన గదిలో చిన్న స్ప్రింగ్ బెడ్, చిన్న టేబుల్, కిర్రు కిర్రు మని శబ్దం చేస్తూ నెమ్మదిగా తిరిగే పాతకాలపు ఫ్యాను మాటిమాటికీ కరెంట్ పోతూ వస్తూండడం వల్ల ఆగుతూ తిరుగుతూ ఉంటుంది. మూసిన గది కిటికీ కొయ్య తలుపుల చెక్కలకు పడిన కన్నాల నుంచి సూర్యకిరణాలు గదిలోకి వచ్చి పడుతుంటాయి. అతను ఆ గదిని ‘The Black Hole of Venkatagiri’ అని తిట్టుకొంటూ, ఆ పాతపరుపుపై పడుకొని డిటెక్టివ్ నవల చదవడంలో మునిగిపోయినట్లు, తొలి రోజు అనుభవం వివరంగా రాశాడు.
పన్నెండేళ్ళు కూడా లేని యిద్దరు బుల్లి కన్యలు పళ్ళెంలో అమర్చిన భోజనం గదిలో పెట్టి మరునిమిషం తుర్రుమని మాయమౌతారు. మసాలా దినుసులు, నూనె దండిగా దట్టించిన భోజనం అతనికి ఇంపితంగా ఉండదు. అతని వెనకనే నిలబడి రాజ్ కుమార్ అంతా గమనిస్తూ ఉంటాడు. తాను కాసేపు బయట తిరిగి వస్తానని అతను రాజ్ కుమార్తో అంటే, రాజ్ కుమార్ కాస్త వెటకారంగా నవ్వి, “నీకు తెలియదేమో, నాకిష్టం లేకపోతే నీవెప్పటికీ ఇక్కడినుంచి వెళ్ళలేవు” అంటూ తన నివాసానికి వెళ్లినట్లు పాల్ విలియం గుర్తు చేసుకొంటాడు.
నిశిరాత్రి వేళ కేవలం ఒంటిమీద డ్రాయరుతో ఒంటరిగా పాల్ విలియం మరుగుదొడ్డి వెతుక్కొంటూ బయలుదేరుతాడు. దీపాలన్నీ ఆర్పేసి ఉంటాయి, సేవకులెవరూ కనిపించరు. ఆ సమీపంలోనే రాణివాసం స్త్రీల గదులు. మొత్తం మీద అతను బాత్రూంకు దారి గుర్తుపడతాడు. బాత్రూం నుంచి వెలుపలికి వచ్చేసరికి తన గదికి వెళ్ళే మార్గంలో తలుపులు బిగించి ఉంటాయి. తలుపు తెరవమని ఎంత పెద్దగా కేకలు పెట్టినా ఫలితం లేదు, జవాబు రాలేదు. తన బలాన్నంతా ఉపయోగించి తలుపులు తెరిచే ప్రయత్నం చేస్తాడు కానీ ఫలితం ఉండదు. చివరకు తుప్పు పట్టిన కిటికీ కమ్ములు వంచి, సందు చేసుకొని బయట వరండాలోకి వెళ్ళి, ఆ దారి వెంట నడిచి అంతఃపురం ప్రధాన ద్వారం వద్దకు చేరుకొంటాడు.
ఆ మహాద్వారం తలుపులు మూసి ఉంటాయి. అక్కడ నిలిపి ఉన్న నెట్టుడు బండి పైకెక్కి ఆ ద్వారం సమీపంలో ఉన్న మహా వృక్షంపైకి ఎగబాకి, అక్కడినుంచి కిందికి దూకుతాడు, ఆ ప్రయత్నంలో కాలు బెణుకుతుంది, వక్షస్థలం, చేతులు గీరుకొని పోతాయి. అక్కడ కటిక బండలమీద ఏమీ పరుచుకోకుండానే కొందరు ఆడవాళ్ళు ఆ వెన్నెల రాత్రి గాఢనిద్రలో ఉంటారు. ఒంటిమీద డ్రాయరు తప్ప ఆచ్ఛాదనేమీ లేకుండా ఒక విదేశీయుడు జనానా స్త్రీలుండే చోట, ఆ వేళప్పుడు సంచరించడం చెడు విషయం అని తన మనసులో అనుకొంటాడు. ఏదో అద్భుతం జరిగినట్లు అతని గదికి వెళ్ళే దారి తెలుస్తుంది. వెండి జరీచీరలు కట్టుకొని వెన్నెల్లో నిద్రిస్తున్న స్త్రీల ముఖాలు అందంగా కనిపించినట్లు అతను రాసుకొన్నాడు.
రాజా డాక్టర్ వి. భాస్కర సాయికృష్ణ యాచేంద్ర గారితో రచయిత
తానా గదిలో ఒంటరిగా ఎన్నిరోజులున్నాడో గుర్తుపెట్టుకోడానికి గోడమీద గీతలు గీస్తాడు.
చినిగిన బట్టలు ధరించి ఇద్దరు బాలికలు భోజనం పళ్ళెంలో అమర్చుకొని తెచ్చారు. అతను తనకు తెలిసిన నాలుగు తెలుగు మాటలతో వాళ్ళను పలకరిస్తాడు.
మరుసటిరోజు సేవకులు పాత జీపులో అతన్ని ఎక్కించుకొని రాళ్ళు గుట్టలు, బండల నడుమ ఎడ్లబండి బాటలో తీసుకొని వెళ్ళి పోలో గ్రౌండ్లో భవనం ముందు దింపుతారు. మరమ్మత్తులు లేక ఆ భవనం శిథిలావస్థకు చేరినట్లు పాల్ విలియం పేర్కొన్నాడు. ఆ భవనం లోపల గోడలకు సెపియా రంగు వెలిసిపోయిన పాత ఫోటోలు వేలాడుతూ ఉంటాయి. ఎన్నడో అక్కడ క్రికెట్ ఆడేవారట! ఆ క్రికెట్ పిచ్కి దూరంగా సాలుగా పెంకుటిళ్ళు, అవి అశ్వశాల, గజశాలలని రాజ్ కుమార్ తర్వాత వివరించారు. క్రికెట్ క్రీడామైదానం, ఆ శిథిలావస్థకు చేరిన బంగళా పూర్వ వైభవానికి నిదర్శనంగా నిలిచి వున్నాయి. వందలాది గుర్రాలు, ఏనుగులు – ఆ పూర్వవైభవం ఏమయిపోయిందో! ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ వేసవి వేడిగాడ్పులు హోరున వీస్తున్నాయి. ఆ దృశ్యాలు అతని మనసును ఏదో విషాదంతో నింపేశాయి.
రాజ్ కుమార్ పాల్ విలియంను వెంటపెట్టుకొని తనగదికి తీసుకొనివెళ్ళి, సింహాసనం వంటి ఒక ఆసనం మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే, సాదా పంచెలు కట్టుకొని కొందరు ఆయన సముఖంలో, గ్రానేట్ బండలు పరచిన నేలమీద కూర్చొని వింటున్నారు. ఒక పరదేశీ అక్కడ ఉన్నాడని వారేమీ పట్టించుకోలేదని అతను గుర్తుచేసుకొంటాడు. “ఈ రోజు రాత్రి టెన్నిస్ క్లబ్ చూచి వస్తాము” అని, రాజ్ కుమార్ అతణ్ణి టెన్నిస్ క్లబ్కు వెంటపెట్టుకొని పోతారు. ఈ క్లబ్ ప్యాలెస్కు సమీపంలోనే ఉంది. వాళ్ళు వెళ్ళిన సమయంలో టెన్నిస్ ఆట సాగుతోంది, క్లబ్బులో తన పక్కన కూర్చొన్న పెద్దమనిషి తనతో విద్యావిధానం, సిలబసు గురించి ఆహ్లాదకరంగా మాట్లాడిన వ్యక్తిని గురించి, ప్రస్తావిస్తూ “ఆయనెవరో తెలుసా? రేపు ఉదయం ఆయన జైలుకు పోవలసిఉంది” అని రాజ్ కుమార్ పాల్ విలియంతో అంటారు.
ఆరోజు రాత్రి రాజ్ కుమార్ తనతో మనసు విప్పి తన ఆర్థిక విషయాలు, తనను వేధిస్తున్న సమస్యలను ప్రస్తావిస్తూ, అంతగా పేరూప్రఖ్యాతి లేని ఒక చిన్న తమిళ సినిమానటి వలపులో చిక్కుకొని, మానసికంగా తాను పడుతున్న నైతిక ఘర్షణ గురించి వివరించి, అది తనను బాధిస్తోందని అంటారు.
మురికిగా ఉన్న వంటశాలలోపలనుంచి మెట్లమీదుగా పరిశుభ్రంగా, రిచ్గా ఉన్న ప్రదేశానికి తనను వెంటపెట్టుకొని వెళ్ళి, అందంగా ఏనుగు దంతంతో చెక్కి, ముత్యాలతో అలంకరించిన ebony sofa లో పాల్ విలియను కూర్చోబెట్టి, రాజ్ కుమార్ తన భార్యాబిడ్డలను పాల్ విలియం ఉన్న గదికి తీసుకొనివచ్చి పరిచయం చేస్తూ, “వీళ్ళు జీవితంలో ఎప్పుడూ అపరిచితులను కలుసుకోలేదు” అని అంటూ, తన యిద్దరు కుమార్తెలను పరిచయం చేస్తారు. ఆ అమ్మాయిలు యిద్దరు పమిటెల వెనుక చిరునవ్వులు చిందిస్తూ, దక్షిణదేశ మినియేచర్ చిత్రాల్లో సుందరులలాగా, తాకితే కందిపోయేంత కోమలంగా ఉన్న ఆ బాలికలిద్దరూ సిగ్గుపడుతూనే, కుతూహలంగా తనను ప్రశ్నించి, అడిగి విషయాలు తెలుసుకున్నారని, రాజ్ కుమార్ గారి శ్రీమతి- రాణీ గారు పట్టుచీరలో స్థూలకాయాన్ని దాచుకొని నిర్లిప్తంగా కనిపించారని, అతను అభిప్రాయం వ్యక్తపరిచాడు..
ఇద్దరమ్మాయిలో ఒకరికి 16 ఏళ్ళుంటాయి. ఆ యువతి అందంగా బైండు చేయించిన తన పెళ్లివేడుకల ఆల్బమ్ ఆతని ముందు పెట్టింది. crimasan రంగు జరీచీరలో ఆ విశాల నయన వెలిగిపోతోంది. బహుశా కేజీ బంగారం ఆ చీర నేతకు వినియోగించి ఉంటారని అతను అనుకొంటాడు. ఎలిజిబత్ టేలర్ ధరించిన గోల్డా మేయర్ పాత్రకు మేకప్ చేసినట్లు ఈ అమ్మాయికి పెళ్లిలో మేకప్ చేశారని రాశాడు.. కెంపురంగులో మెరుస్తున్న జరీచీరతో ఆ విశాల నయన వెలిగిపోతోంది. పెద్ద ముత్యం తాపిన ముక్కెరను బంగారు తీగతో ఆమె ధరించిన కర్ణాభరణంతో కలిపారు. మెడలో నీలాలు, పచ్చలు పొదివిన హారాలు వేసుకొని, ఆమె కాస్తంత నెర్వస్గా ఉనట్లు ఫోటోలో కనిపించిందని, ఆతను అభిప్రాయపడ్డాడు. ఈ నగలన్నీ ధరించి, తెల్లని టెంటులోకి ప్రవేశిస్తున్న ఫోటో ఒకటి. ఆమె టెంటులో ప్రవేశించగానే దాని ద్వారం మూసేస్తారు.
తాను ఈ బ్యాగ్ వంటి టెంటులో కూర్చొని ఉంటే పెళ్లి తంతు జరుపుతారని, పెళ్ళికి ముందు తన కాబోయే భర్తను ఎన్నడూ చూడనేలేదని, పెళ్లి తర్వాతనే భర్తను తొలిసారి చూచినట్లు ఆమె సిగ్గుపడుతూ వివరిస్తుంది. ఆమె తల్లిగారికి ఇంగ్షీషు వచ్చినట్లు లేదని అతను గ్రహిస్తాడు. ఆమె నిర్లిప్తంగా కూర్చొని ఈ సంభాషణ వింటూ ఉంటుంది.
ఆ పెళ్లి తర్వాత, వెంకటగిరి రాజ వీధిలో పురజనులు స్త్రీ పురుషులుగా రెండు వరుసలలో నిలబడితే, వారికి రాజ్ కుమార్ స్వహస్తాలతో నూతన వస్త్రాలు బహూకరిస్తారు. ఇది అక్కడ సంప్రదాయం.
రాజకుమార్తెలతో జరిగిన సంభాషణలో సినిమాల ప్రసక్తి వచ్చినపుడు, “సినిమా ప్రపంచం వాస్తవం కాదు, కల్పన” అని ఆ యువతులు సమాధానం చెప్తారు.
మరుసటిరోజు రాజ్ కుమార్ పాల్ విలియంని వెంటపెట్టుకొని, ప్యాలెస్ అంతా తిప్పి చూపుతారు. టూత్ పేస్టు బ్రష్ మీద వేసి అందించే పని నుంచి ప్రతిదీ చేసిపెట్టే దాసీజనం పేలెస్లో ప్రతి ఒక్కరికీ. రాజ్ కుమార్ ప్యాలెస్కు కాస్త దూరంగా ఉన్న భవనాన్ని చూపించి, “భగవాన్ బాబాగారు పసివారుగా ఉన్నరోజుల్లో ఇక్కడే ఉన్నారు. భగవాన్ ఉన్నపుడు ఆ గది ఎట్లా ఉండేదో, ఇప్పుడూ దాన్ని ఆట్లాగే ఉంచాము” అని కాస్త అతిశయంగా అతనితో అంటారు. తర్వాత దర్బారు హాలు చూపిస్తారు.
మరుసటి రోజు రాజ్ కుమార్ పనిమీద మద్రాసు వెళ్తూ, అతణ్ణి మద్రాసుకు తీసుకొనిపోతారు. అతను మరికొంత కాలం అక్కడ ఉండాలని అనుకొన్నట్లుందిగాని, అతని వెంకటగిరి అనుభవం అర్ధాంతరంగా ముగుస్తుంది.
పాల్ విలియం భారతదేశం అంతా పర్యటించాడు. కొంతకాలం బొంబాయిలో రజనీష్ ఆశ్రమంలో గడిపి, అక్కడ అమెరికా యువతులు కాషాయ వస్త్రాలు ధరించి, సన్యాసినుల వేషంలో ఆశ్రమం నిర్వహిస్తున్నట్లు, అప్పటికే స్వామి అస్వస్థులుగా ఉన్నట్లు రాశాడు. ఆ వాతావరణం అతనికేమీ నచ్చలేదు. కొంతకాలం కలకత్తాలో మదర్ థెరిస్సా ఆశ్రమంలో ఉన్నాడు, బెనారసు, రుషీకేశ్ వంటి పవిత్ర ప్రదేశాలు సందర్శించాడు. తూర్పు దేశాల అమెరికాల మధ్య అనేక పర్యాయాలు తిరిగాడు. జీవితంలో చాలా కాలం ఆధ్యాత్మిక అన్వేషణలలో సాగింది. అతను దేన్నీ నిరాకరించడు, క్రైస్తవ భావాలను పూర్తిగా వదలలేదు. ఈ జీవిత అనుభవ సారాన్ని అనేక గ్రంథాలలో వివరించాడు.
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.