[వి. నాగజ్యోతి గారు రచించిన ‘ఏం చెయ్యాలి?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
విద్యని అభ్యసించడానికి
వయోపరిమితి లేదంటారు
వెనకడుగు వేయరాదంటూనే
అర్థం కాకో, జ్ఞాపకం లేకో
మళ్ళీ అడిగితే నువ్వింకా
చిన్నపిల్లవా అని హేళన చేస్తారు
అన్నిటా ముందుండు అంటూనే
నచ్చిన పనులు చేయబోతే
నువ్వేంటి మాతో సమానంగా
అని అడ్డుచెపుతారు
అరవైలో ఇరవైలా ఉంటే
మంచిదన్న వారే
ఇంత వయసొచ్చినా
ఇంగిత జ్ఞానం లేదంటారు
ఆస్పత్రిలో డాక్టర్లు
అభ్యంతరం చెప్పకూన్నా
ఇష్టమైనవి కొనుక్కుని తింటే
కోరికలు ఇంకా చావలేదంటారు
మీ వయసులో మేమిలా లేమంటే
కాలం మారిందంటూ
బయట ప్రపంచం చూడమంటారు
సన్నిహితులతో కలిసి
సమయం గడిపితే
తిరుగుళ్ళు అవసరమా అంటూ
ఎద్దేవా చేస్తారు
ఎవరి మాట వినాలి
ఎలా ఉండాలి అనే మీమాంసలోనే
కాలం గడిచిపోతుంది
బాధ్యతలు నెరవేరుస్తూ
అదిమి పెట్టిన కోరికలతో
కట్టె కాటికి చేరుతుంది
శ్రీమతి వరికేటి నాగజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. పదవ తరగతి వరకే చదువుకున్న నాగజ్యోతి గారు దక్షిణ భారత హిందీ పరీక్షలలో భాషాప్రవీణ, హిందీ టైపింగ్ పరీక్షలు లోయర్, హైయ్యర్ పాసయ్యారు. వివాహానంతరం ఢిల్లీకి వచ్చి గృహస్థురాలి బాధ్యత స్వీకరించారు. సాహిత్యాభిలాషి. వీరు రాసిన కథలు, కవితలు, పద్యాలు పలు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.
పుస్తక సమీక్షలు కూడా చేస్తూ వుంటారు. ఇన్నేళ్ళ తరువాత కోవిడ్ కాలంలో శ్రీ పూసపాటి గురువుగారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి ద్వారా పద్య రచన, ప్రాథమిక వ్యాకరణం నేర్చుకున్నారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి సహకారంతో – ఆప్త మిత్రులు శ్రీ ధరణిగారు, సన్నిహితులు, తమ శ్రీవారి ప్రోత్సాహం వలన ‘చిట్టి తల్లి’ పద్య శతకం రాసారు.
గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ నివాసి.