సమాజ అవసరాన్ని తీర్చేదే సాహిత్యం..!
కాలానుగుణంగా సమాజానికి ఏమీ అవసరమో దాన్ని సాహిత్యం తీర్చుతుందని కథ, నవల, నాటక రచయిత డాక్టర్ వి ఆర్ రాసాని అన్నారు.
24/05/2025 శనివారం తిరుపతిలోని స్థానిక యూత్ హాస్టల్లో అనంతపురం జిల్లా వాసి డాక్టర్ బి. నాగశేషు రచించిన ఏకుదారం పుస్తకావిష్కరణ జరిగింది.
ప్రాచ్య పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆచార్య పీసీ వెంకటేశ్వర్లు పుస్తకావిష్కరణ చేశారు. తొలి ప్రతిని రచయిత ఆర్ . సి.కృష్ణస్వామి రాజు అందుకున్నారు.
సభకు ఈ తరం కవిత వేదిక అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాసాని మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో బీరప్ప గురించి ఎవరికి తెలియదని చెప్పారు.
పుస్తక ఆవిష్కరణ కర్త ఆచార్య పీసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నవలలో రచయిత నాడి స్పందన ఆద్యంతం కనిపిస్తోందని తెలిపారు.
ఆత్మీయ అతిథి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై.సుభాషిణి మాట్లాడుతూ కులవృత్తిదారులు ప్రపంచీకరణలో కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో ఆత్మీయ అతిథి బొమ్మిశెట్టి రమేష్ మాట్లాడుతూ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఆత్మ పరివర్తన, ఆత్మహత్య అను రెండు మార్గాలు ఉంటాయని వాటిలో రచయిత ఆత్మ పరివర్తన దిశగా వెళ్లి అత్యద్భుతంగా అభివృద్ధి చెందారని వివరించారు.
పీలేరు డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ కే.శ్రీనివాసులు రెడ్డి పుస్తక సమీక్ష చేస్తూ స్థలం, కాలం, చలనం గురించి ఈ నవలలో స్పష్టంగా ఉంటుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రచయితలు ఆకుల మల్లేశ్వరరావు, పేరూరు బాలసుబ్రమణ్యం, మారిశెట్టి గోవిందు, డాక్టర్ యువశ్రీ, కొత్వాలు అమరేంద్ర, నాగార్జున శర్మ, పులివెందుల కొండారెడ్డి, పుస్తకం ముద్రణకర్త మంజునాథ, సాహితీ మిత్రులు, తెలుగు భాష అభిమానులు, కవులు తదితరులు పాల్గొన్నారు.