[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘దోమ.. దోమ.. దోమ!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“ఏమండీ! ఎప్పుడూ లేదు.. ఈ మధ్య ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయి. ఎందువలనో తెలియటం లేదు” అన్న పార్వతితో
“బహూశా ఇంట్లో బూజులు ఎక్కువయ్యావేమో! లేదా వాష్ బేసిన, బాత్ రూమ్ డ్రెయిన్ లలో చెత్త పేరుకు పోయిందేమో ఓసారి చూడు.. ఇంకో విషయం సంధ్య వేళలో తలుపులన్నీ మూసుంచు” అంటూ ఇంకా ఏవేవో ఉచిత సలహాలిచ్చాడు శివ ప్రసాద్.
“మీరు మరీనండీ! ప్రతిదానికి పరోక్షంగా నన్నే బాధ్యురాలని చేస్తారు. చూపించండీ.. ఎక్కడ బూజులు ఉన్నాయో! అన్ని డ్రెయిన్లూ ఈ మధ్యే కదా కెమికల్ క్లినింగ్ చేసాం” అంటూ నిష్ఠూరమాడింది పార్వతి.
“సర్లేండి మేడమ్! తప్పయిపోయింది చెమించేయండి, ఆపైన నేనేమి చేయాలో సెలవీయండి. సలహా అనుకోకపోతే నాదొక సలహా” అంటూ..
“మస్కిటో కాయిల్ గానీ, ఆల్ అవుట్ కానీ తీసుకు రానా” అని అడిగాడు శివ ప్రసాద్.
“పోనీ దోమ తెర అయితే ఎలా ఉంటుంది?”మరో ప్రతిపాదన తీసుకొచ్చాడు శివ.
దోమ తెర అంటే తనకు ఏదో ఓ రకమైన భయమని వద్దంది పార్వతి.
ఇక మిగతా వాటి గురించి “అవీ వద్దండి! అవన్నీ రసాయనాలతో ఉంటాయి.. ఆ పొగ పీల్చడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. అవన్నీ కాదు గానీ.. ఓ బ్యాట్ తీసుకురండి” అంటూ పురమాయించింది పార్వతి.
“బ్యాటా! ఎందుకు దోమలతో గాని షెటిలాడుతావా ఏమిటి?” నవ్వుతూ సెటైర్ వేసాడు శివ.
“మీ వెటకారానికి అభినందిస్తున్నాం గానీ.. పోనీ అలాగే అనుకోండి.. ఆన్లైన్లో చైనా మస్కిటో బ్యాట్ ఒకటి తెప్పించండి” ఆర్డర్ పాస్ చేసింది పార్వతి.
“సరేలే! ఈ రాత్రికి దోమలు ఎలాను వదలవు, నీవైనా నన్ను వదిలేస్తే.. రేపు ఉదయానే ఆ మారణాయుధానికై ఆర్డర్ ఇస్తాను” అని చెప్పి.. నిండా ముసుగు తన్ని నిద్రకు ఉపక్రమించాడు శివ ప్రసాద్.
అలా మగత నిద్ర లోకి జారుకుంటున్నాడనగానే.. అతనికి రాజమౌళి సినిమా లోని ఈగ ఆకారంలో, వందలలో దోమలు ఘీ..మని చుట్టూ ఎగురుతూ కనిపిస్తున్నాయి. బూతద్దంలో చూస్తున్నట్టు.. వాటి శరీరం లోని వికారమైన అవయవాలన్నీ మరింత వివరంగా కనిపిస్తున్నాయి.
బహుశా అవి ఏదో సమావేశానికి సన్నధ్ధం అవుతున్నట్టున్నాయి. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు.. అన్నీ ఓకే వైపు చూస్తున్నాయి..
అప్పుడు వాటిన్నటి కన్నా బలిష్టంగా ఉన్న ఓ పెద్ద దోమ లోపలికి వచ్చింది.
బహుశా దానికి జీవుల రక్తం తాగడంలో ఎక్కువ సామర్థ్యం ఉండటం వలననేమో నాయకుడిగా ఎన్నుకోబడినట్టుంది.
దోమల సమావేశం ప్రారంభమై, నాయకుడు మాట్లాడుతూ “మిత్రులారా ఈ రోజు ఆ భార్యాభర్తల చర్చని మీరంతా వినే ఉంటారు. అయినా మరోసారి చెబుతాను” అంటూ శివ, పార్వతులు ఆ సాయంకాలం నెరిపిన సంభాషణల సారాంశాన్ని వినిపించాడు.
“ఈ విషయం విన్నప్పటి నుండీ నాకైతే చాలా భయాందోళనలు కలుగుతున్నాయి, పాపం.. మీరంతా ఏమైపోతారోనని. వాళ్లైతే ఆ మాయదారి బ్యాట్ తీసుకు రావడం ఖాయం. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది.. దాని నుండి ఎలా తప్పించుకోవాలనేదే. అందుకని నేనొక పత్రం తయారు చేసాను. అయితే రాత్రి ఎక్కువ పాటలు పాడటం వలన నా గొంతు పట్టినటుంది, అందుకే చదివి వినిపించలేను. ఈ పత్రాన్ని ఈ గోడకి అంటిస్తాను చదువుకోండి” అంటూ ఓ పేద్ద కాగితాన్ని గోడకు అంటించాడు నాయకుడు.
చిత్రం! ఆ పత్రం మీది అక్షరాలు శివ ప్రసాద్కి చాలా వివరంగా కనిపిస్తున్నాయి.. ఆత్రంగా చదువుతూ పోతున్నాడు.
“మనం చావు నుండి తప్పించుకుని, అదను చూసి ఆ కుటుంబంలోని ముగ్గురి పైనా దాడి చేయడానికిన్ను, మన వర్గానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నాను.. అవేమంటే..
- సాయంసమయంలో వేటకు బయలుదేరకుండా ఉండటం..
- దాడంటూ చేస్తే వాళ్లు లైట్స్ ఆపేసి నిద్రలోకి జారుకున్నప్పుడు మాత్రమే చేయడం..
- అంత వరకు వారి వారి మంచాలకు తలవైపో, కాళ్ల వైపో ఉన్న అనుకూల ప్రదేశాలలో మాటు వేసి ఉండాలి.
- ఈ పోరాటం ఎంత వరకూ కొన సాగాలంటే వాళ్లు ఆ బ్యాట్ వాడటం మనేసే అంత వరకూ..
అంటూ ఆ పత్రం సారాంశం ముగిసింది.
శివ ప్రసాద్ ఒత్తిడికి లోనవుతున్నట్టు రెండు చేతులతో తల గోక్కుంటూ.. ఏదో కలవరిస్తున్నాడు.
ఇంతలో పత్రంలోని విషయమంతా వేగంగా చదివేసిన ఓ యువ మశకం
“మరి వాళ్లు ఆల్ అవుట్కో లేక కాయిల్కో మారితే ఏం చేస్తాం?” తన సంధేహాన్ని నాయకుడి ముందుంచాడు. శివ ప్రసాద్ మళ్లీ కలలోకి లీనమవుతున్నాడు.
“మంచి ప్రశ్న మిత్రమా! కానీ వాటి వలన మనకు ఎటువంటి నష్టమూ ఉండదు. అవి మండుతున్న వాసన వచ్చిన వెంటనే మనం జాగ్రత్త పడి అటువైపే వెళ్లడం మనేస్తాం. కానీ ఆ మాయదారి బ్యాట్ అలా కాదుగా.. అది ఓ యమపాశం.. దాన్ని ఎలాగైనా ఆ ఇంటి నుండి తరిమేయాలంటూ.. అయితే ఓ రోజు వాళ్లు ఆల్అవుట్ కూడా తీసుకు రావచ్చు. ఎందుకంటే ఈ ఇంటి యజమాని ముందు అవే తీసుకొద్దామన్నాడు.. కాని ఆ ఇంటి రాకాసి.. బ్యాట్ని తీసుకురమ్మంది..అందుచేత మీరంతా నా సలహాలను పాటించి అప్రమత్తంగా ఉండాలి” అని చెప్పి దోమల రాజు సభ ముగించాడు.
పిచ్చి కల ముగిసింది. శివ పిచ్చిగా ఓ నవ్వుకుని.. కొంచెం మంచినీళ్ళు తాగి మళ్లీ నిద్రకుపక్రమించాడు.
మరునాటి ఉదయాన తన కల గురించి చెబితే నవ్వుతారని, చెప్పకుండా ఊరుకున్నాడు.
మొత్తం మీద పార్వతి మాటే నెగ్గి, శివ ప్రసాద్ ఓ బ్యాట్ ఆర్డరివ్వటం, వచ్చేయడం జరిగింది.
ఇక ఆ రోజు నుండీ చీకటి ముసురుతోంది అనగానే ఇంట్లో అందరూ.. ఒకే బ్యాట్ని వంతుల వారిగా పంచుకుంటూ గ్రౌండ్లో షెటిల్ ఆడినట్లు దోమలతో ఆడుకుంటున్నారు.
ఈ మారణకాండకు భయపడి.. ఆ మూల, ఈ మూల ఉన్న దోమలన్నీ అత్యవసర సమావేశమైనాయి..
ఇక ఆ రోజు నుండి దోమలు.. ఓ పథకం ప్రకారం దాడి చేస్తూ.. వాటికి చిన్న, చితకా ప్రాణ నష్టం జరిగినా, అలుపెరగకుండా ఆ కుటుంబానికి ముప్పు తిప్పలు పెట్టడం మొదలెట్టాయి.
వీలైనంత వరకు వాళ్లు నిద్రపోయే సమయానికి దుప్పటి బయటవున్న చేతులపై కుట్టడం.. చెవుల దగ్గర కర్ణ కఠోర సంగీతం వినిపించడం, ఏ చిన్న అవకాశం ఉన్నా కాళ్లనూ చెడా మడా కుట్టేయడం చేస్తున్నాయి.
అయితే బ్యాట్ వద్దని చెప్పిన శివప్రసాద్ అంటే.. వాటికి ఓ సానుకూల భావన ఉన్నా, భార్య మాటకు తలొగ్గి బ్యాట్ కొన్నందుకు అతనిపైనా కొంత గుర్రుగా ఉన్నాయి.
పాపం, అతను ఆ దోమల వలన రాత్రి సరిగా నిద్రపట్టక, కార్యాలయానికి లేట్ అవ్వడం, పనిలో తోటి వారితో గొడవ పడటం జరుగుతున్నాయి. పని సామర్థ్యం కూడా తగ్గి పై వారితో చీవాట్లు పడటం.. రోజు రోజుకి జీవితం దుర్బరంగా మారుతోంది.
ఇంట్లో ఉన్న వాళ్ల పరిస్థితి కూడా వేరేగా ఏమీ లేదు.
రాత్రి నిద్ర సరిపోక, రోజంతా జోగుతూ ఉండటం. దోమ కాట్లు తీవ్రంగా ఉండటం.. పాపం చాలా ఆందోళనలో ఉన్నారు.
శివ ప్రసాద్ తనకొచ్చిన కలను తీసి పడేయలేక పోతున్నాడు. కలలో అవి చేసిన ప్రతిజ్ఞ ప్రకారమే.. ఒక్కో సంఘటన జరుగుతోంది. కానీ తన సిల్లీ కలని బయటకు చెబితే సిల్లీ ఫెలో అనుకుంటారని జంకుతో.. అప్పటికీ కల(థ)ని ఎవరికీ చెప్పకుండా నిభాయించుకుంటూ.. కిం కర్తవ్యం? అనుకుంటూ..
కలలో ఓ యువ మశకం ఆల్అవుట్, కాయిల్ గురించి లేవనెత్తిన ప్రశ్నలో తనకు జవాబు దొరికి..
ఇక లాభం లేదనుకుని ఆ కుటుంబం ఓ నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే.. ఇకపై ఆల్అవుట్ ఇంటిలో వెలిగించుకోవటం ఉత్తమమని..
అప్పుడే టీవీలో ఏదో ప్రకటన వస్తోంది. అదే.. ఓ ఆల్అవుట్కి సంబందించి.. ఆ ఆల్అవుట్ ప్రత్యేకత ఏమిటంటే.. కరెంట్ పోయినా అది కొన్ని గంటలు మండుతునే ఉంటుంది.
శివ ప్రసాద్ ఇక ఆలస్యం చేయకుండా, ఆన్లైన్ జోలికి పోకుండా.. రోడ్ లైన్ పట్టి వెళ్లి ఓ మూడు ఆల్అవుట్లు పట్టుకొచ్చి కసిగా నడి మధ్యాహ్నమే మూడూ.. మూడు గదులలో వెలిగించాడు.
అయితే బయటకు వెళ్లిన దోమల దండుకు ఈ విషయం తెలియక, సాయంకాలపు వేటకై తిరిగి వస్తూ.. శివ ప్రసాద్ ఇంటి పరిసరరాలలో వ్యాపించి ఉన్న వాసనలలో మోగుతున్న మృత్యు ఘంటికలు చెవిన పడి.. అనుకున్నంతా అయిందిరా.. బ్రతుకు జీవుడా అనుకుంటూ వెంటనే పలాయనం చిత్తగించాయి.
ఆ రోజు నుండి శివప్రసాద్ ఫామిలీ పిచ్చి కలలు లేకుండా కంటి నిండా నిద్రపోతోంది.
గతం గతః..
ఆల్ అవుట్ విష ప్రాయమని తలచి శివప్రసాద్ కుటుంబం.. నిద్ర సరిపోక తమ ఆరోగ్య పరిస్థితిలను విషమం చేసుకున్నందుకు..
బ్యాట్ను బహిష్కరించాలనే దోమల పంతం నెగ్గినా, ఆల్ఆవుట్ల వలన పాపం వాటి నోటి దగ్గరి నెత్తురు విందును కోల్పోయినందకు..
పరస్పరం సంతాపాలు తెలుపుకోక పోయినా..
రెండు వర్గాలు ఎంతో కొంత సంతాప, పశ్చాతాపపడి ఉంటాయి.
భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు,100 కవితలు రాశాను.