[శంకర్ నారాయణ్ గారు అనువదించిన ‘ధర్మబోధ’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]
సాహితీ మిత్రులు శ్రీ శంకర్ నారాయణ్ గారు పంపిన స్వేచ్ఛానువాద గ్రంథం ‘ధర్మబోధ’ను ఆమూలాగ్రం చదివాను. మూలాన్ని ప్రముఖ వేదాంతి శ్రీ ఖలీల్ జిబ్రాన్ ‘ది ప్రొఫెట్’ అనే పేరున రాశారు. ఇది జగత్ప్రసిద్ధం. తనను వేదాంతి అంటే జిబ్రాన్ అంగీకరించేవాడు కాదట. విద్యా దదాతి వినయం! ‘ది ప్రొఫెట్’ వందకు పైగా ఇతర భాషల లోకి అనువదితమైన గ్రంథం. ఆయన లెబనాన్ జాతీయుడు కానీ అమెరికాకు వలస వెళ్ళాడు. ఆయన గొప్ప చిత్రకారుడు కూడా. చిత్రకారుడు కవి కూడా అయితే ఆ విషయం విభిన్నంగా ఉంటుంది.
దానికి చక్కని ఉదాహరణ మన శీలా వీర్రాజు గారు. జిబ్రాన్ ప్రజ్ఞ బహుముఖీనం. ఆయన రచనల్లో మతం, న్యాయం, స్వేచ్ఛా ప్రవృత్తి, విజ్ఞాన శాస్త్రం, ప్రేమ, ఆనందం, ఆత్మ, శరీరం, మరణం లాంటి ఇతివృత్తాలుంటాయి. కవిత్వం ప్రధానంగా ప్రతీకాత్మకమై ఉంటుంది. నియో రొమాంటిక్ యుగానికి చెందుతుంది. ఆయన శైలి సరళం, భాష సులభం, సుందరం. ఆయనపై విలియం బ్లేక్ ప్రభావం ఉందని విమర్శకులంటారు. బ్లేక్ను జిబ్రాన్ ‘ది గాడ్మాన్’ గా అభివర్ణించేవారు. తర్వాత వాల్ట్ విట్మన్ గారి విశ్వ జనీన దృక్పథం, ప్రకృతిని చూసి పరవశించడం ఆయనను ఆకర్షించాయి. బ్లేక్ను, విట్మన్నూ నేను బాగా చదివాను. వారు మా ఎం.ఎ. (ఇంగ్లీష్) సిలబస్లో ఉండేవారు.
‘ది ప్రొఫెట్’ లో ఇరవై ఆరు కవితలున్నాయి. వాటిని ప్రోజ్-పొయిట్రీ అనవచ్చు. ముస్తఫా అన్న ప్రవక్త బోధనలు ఆధారంగా ఈ కవితలను జిబ్రాన్ వ్రాశారు. ఇవి మానవ జీవితంలోని అన్ని కోణాలను సమగ్రంగా విశ్లేషిస్తాయి. అన్ని మతాల సారాన్ని ప్రతిబింబిస్తాయి.
అనువాదం అనేది కత్తిమీద సాము లాంటిది. నేను అనువాదకుడిని కూడా కాబట్టి దాని సాధక బాధకాలు నాకు తెలుసు. ఒక పుస్తకాన్ని అనువదించడం కంటే సొంతంగా మనమే పుస్తకం వ్రాయడం సులభమని మా సాహితీ సోదరులు శ్రీమాన్ వేదాంతం శ్రీపతిశర్మ గారు ఒకసారి నాతో అన్నారు. వారి లఘుకావ్యం ‘భారతంలో అసలు కర్ణుడు’ ను నేను ఆంగ్లంలోనికి అనువదించాను. స్వేచ్ఛానువాదం కొంత వెసులుబాటునిస్తుంది. కానీ మూలానికి విఘాతం కలుగకుండా చూచుకోవాలి.
మిత్రుడు శ్రీ శంకర్ నారాయణ్ గారు ఈ ప్రక్రియలో చాలా వరకు కృతకృత్యులైనారని నాకనిపించింది. మూలం జోలికి పోకుండా వీరి భావవ్యక్తీకరణ, భాష ఎలా ఉన్నాయో చూద్దాము. అత్యంత గహనమైన ఆధ్యాత్మిక విషయాలను పామరులకు సైతం అర్థమయ్యే భాషలో తత్వాలుగా వ్రాసిన మహాయోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, తర్వాత వేమన, ఆ కోవలోనే ఈ ‘ధర్మబోధ’ అనే గ్రంథం వ్రాయబడింది. ‘అల్ప శబ్దంబులతో అనల్ప భావంబులను’ వెలయించు శక్తి శ్రీ శంకర్ నారాయణ్ గారికుంది. తిక్కన ఆరాధించిన హరిహరనాథుడు ఆయన పేరులోనే ఉన్నాడు. వైరాగ్యం, వైభవం మేళవించిన పేరు ఆయనది.
‘ధర్మము’ అన్న కవితలో,
“ప్రతి పనియు ధర్మమే. ప్రతి యోచనయు
పరమ ధర్మమగును పరికించి చూడ”
అంటారు కవి. ధర్మాన్ని ఇంతకంటే సరళ సుందరంగా ఎవరు నిర్వచించగలరు? అట్లే,
‘హలమును కొలిమిని’ పూజించమంటారు కవి. టాగోర్ మహాశయుని ‘గీతాంజలి’ కూడా ఇదే చెప్పింది.
“Find him in the pathmaker breaking stones
And in the tiller tilling the land
Find him in the sweat of your brow”.
శ్రమలోనే సర్వాంతర్యామిని దర్శించాలి! దీన్ని కమ్యూనిస్టులు కూడా అంగీకరిస్తారు. ‘నేరము, శిక్ష’ లో ‘నేర భావం మనసులో ఉంటే ఆనంద సీమ అందరానిదవుతుంది’ అన్న మాట గొప్పది. ‘ప్రార్థన’ అన్న కవితలో ఆధ్యాత్మిక పరిమళాలున్నాయి. ‘ప్రార్థన’ అంటే ‘స్వయముగా మీరు విరిసి గగనమంత విస్తరించుటయే’.
‘Self-enlightenment’ ను హృద్యంగా అక్షరీకరించారు కవి. దేవుడిని మనం దుఃఖంలోనే తలచుకుంటాము కానీ,
“సంతుష్టి కలిగించు సంపదలోను
అతిశయమ్మైనట్టి ఆనందమందు
భగవాను నెపుడైన పలకరించెదరె?
తలచుకుందురే మీరు తన్మయత్వమున?”
అంటారు శంకర్ నారాయణ్.
భగవంతుని పొందటమే పరిపూర్ణమును పడయటం. అదే ప్రార్థన పరమార్థం అన్న ముక్తాయింపు మన హృదయానికి హత్తుకుంటుంది.
ప్రాస కోసం పాకులాడ వలసిన పనిలేని ఛందస్సు ఇది. కానీ, యతులు ఉన్నాయి కదా! ఎక్కడా ఈయన యతికోసం భావంతో రాజీ పడినట్లు అనిపించదు. కనిపించదు కూడా. అంత సహజంగా అవి కవిత్వంలో ఒదిగి పోయాయి.
“భ్రమ అనే పొరను బ్రద్దలు కొడితే
బాధయై తెలియును భావమ్ము నందు”
ఇలాంటి వాక్యాలు వృత్యనుప్రాసాలంకారాలుగా భాసించాయి. చివర “మరొక మహిళ మోయు మాతయై నన్ను” అనడంలో పునర్జన్మను కవి స్వీకరిస్తున్నారు. జన్మ రాహిత్యాన్ని ఆయనేమీ కోరుకోవడం లేదు. అంతే గాక మాతృత్వమును కూడా glorify చేశారు. మమ్మటుడు, తన ‘కావ్య ప్రకాశము’ లో ఉటంకించిన లక్షణాలన్నీ ఈ కావ్యాన్ని సుసంపన్నం చేశాయి.
“కావ్యం, యశసే అర్థకృతీ, వ్యవహారవిదే,
శివేత రక్షతయే, సద్యః పర నిర్కృతయే
కాంతా సమ్మితోపదేశయుజే”
కావ్యమంతటా, కవిగారి ‘Non-attachment’ మనకు గోచరిస్తూ ఉంటుంది. వెరసి ‘ధర్మబోధ’ ఒక చక్కని అనువాద రచన. కవి గారికి శుభాభినందనలు.
***
మూలం: ఖలీల్ జిబ్రాన్, అనువాదం: శంకర్ నారాయణ్
పేజీలు: xii+83
వెల: ₹ 100/-
ప్రతులకు:
జి.ఎస్.ఎన్. ప్రసాద్,
డో. నెం. 3/548,
సోమనాథనగర్,
అనంతపురం. ఆంధ్ర ప్రదేశ్ 515004
pragsn@gmail.com
9490802800
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, రీడర్గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్లో సీరియల్గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.