Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దత్తత

[రోహిణి భైరవజోశ్యులు గారు రచించిన ‘దత్తత’ అనే కథని అందిస్తున్నాము.]

“హాయ్ సృజనా” అంటూ వెనకాల నుంచి ఎవరో భుజం మీద చెయ్యి వేయడంతో కూరలు కొంటున్న సృజన వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా చిన్ననాటి స్నేహితురాలు రవళి.

ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది.

“నువ్వేంటి ఇక్కడ?” అడిగింది సృజన.

“మావారికి ఈ ఊరు ట్రాన్స్‌ఫర్ అయింది. వారం క్రితం వచ్చాము. నువ్వు ఈ ఊరిలో ఉంటావని తెలుసు కానీ ఎక్కడుంటావో తెలీదు. దేవుడి దయవల్ల ఈ రోజు ఇలా కనబడ్డావు” అన్నది రవళి.

“మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది రా వెళదాం” అంటూ సృజనను తన ఇంటికి తీసుకెళ్ళింది రవళి.

“ఇప్పుడు చెప్పు ఏంటి విశేషాలు” అని అడిగిన ప్రశ్నకు “ముందు నువ్వు చెప్పు” అన్నది సృజన.

“ఏముంది చెప్పడానికి. మావారు బ్యాంక్ ఆఫీసర్ అని తెలుసు కదా. మా పెళ్ళికి నీవూ వచ్చావుగా. ట్రాన్స్‌ఫర్ మీద ఈ ఊరు వచ్చాము. మాకు ఇద్దరు పిల్లలు పెద్దవాడు ఆరో క్లాస్, చిన్నవాడు మూడో క్లాసు చదువుతున్నారు. ఇప్పుడు నీ గురించి చెప్పు. ఎంత మంది పిల్లలు? ఏం చదువుతున్నారు?” అంటూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది రవళి.

సృజన ఏమీ జవాబు చెప్పకుండా తలవంచుకుని కూర్చుంది.

“ఏమిటే ఏమీ మాట్లాడవు” అంటున్న రవళికి.. కళ్ల నీళ్ళతో తల ఎత్తిన సృజనను చూసి “ఏమే నేనేమన్నా తప్పుగా మాట్లాడానా. ఎందుకా కన్నీళ్లు” అని భుజం చుట్టూ చేయివేసి గడ్డం పట్టుకుని స్నేహితురాలిని అడిగింది సానుభూతిగా.

కాసేపయ్యాక సృజన కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ మెల్లగా “మాకు పిల్లలు లేరు.. ఇక కలగరు కూడా” అన్నది నిర్లిప్తంగా.

రెండు నిమిషాలు మౌనం రాజ్యమేలింది.

అంతలోనే కోలుకుని “బాధపడకే.. ఏం చేస్తాం చెప్పు. మనకు ప్రాప్తం లేదు అనుకోవాలి అంతే. పోనీ ఎవరినైనా పెంచుకోకూడదూ” అన్నది రవళి.

“ఆ విషయం మీదే ఇంట్లో ఎప్పుడూ మా అత్తగారు, మామగారు గొడవలు పడుతూ ఉంటారు. మా అత్తగారు తన చెల్లెలి మనమరాలిని పెంచుకోమని అడుగుతోంది. మా మామగారేమో తన తమ్ముడి మనవడిని పెంచుకుంటే మన ఇంటివాడే వారసుడు అవుతాడు అంటూ వాదిస్తారు. వాళ్లిద్దరూ మాతో ఏమీ చర్చించకుండా వాదులాడుకుంటూ ఉంటారు. మా వారిలోనే లోపం ఉంది కాబట్టి ఆయనికి రెండో పెళ్లి చేసే ఆలోచన రాలేదు. లేకుంటేనా..” భయంగా చూసింది సృజన.

“మీవారి అభిప్రాయం ఏమిటి” అడిగింది సృజనను రవళి.

“మావారికి ఇద్దరూ ఇష్టంలేదు. వాళ్ళు మా ఆస్తి కోసం పిల్లలను దత్తత ఇస్తామంటున్నారని మావారి భావం. పోనీ పిల్లలే వద్దు అనుకుందామా అనుకుంటే మా ఇద్దరికీ పిల్లలంటే చాలా ఇష్టం. ఏం చేయాలో తెలీడం లేదు” నిట్టూర్చింది సృజన.

స్నేహితురాళ్ళిద్దరూ కాస్సేపు మౌనంగా ఉండిపోయారు.

సృజన తేరుకుని “మా విషయం చెప్పి బాధపెట్టాను. క్షమించు” అంటూ “మీ అమ్మా, నాన్న బాగున్నారా. అన్నట్టు మీ విశాలక్కయ్య ఎలా ఉంది? చిన్నప్పుడు మనల్ని ఎంతో ముద్దు చేసేది. ఆవిడ పెళ్లికి కూడా వచ్చాను. బాగా డబ్బున్న ఇంటికి ఇచ్చారని చెప్పావు. ఇప్పుడు ఎక్కడ ఉంది?” కుతూహలంగా అడిగింది.

“నీకు మా పెద్దమ్మ కూతురు విశాలక్కయ్య ఇంకా గుర్తుందా.. మా పెద్దమ్మ పెద్దనాన్నలకు ఒక్కగానొక్క కూతురు విశాల. నాకంటే చాలా పెద్దది. చాలా గారాబంగా పెరిగింది” అంటూ విశాల కథ చెప్పనారంభించింది.

***

ధనుంజయరావు, కృష్ణవేణమ్మలకు పెళ్ళైన ఎన్నో ఏళ్ల తరవాత విశాలాక్షి పుట్టింది. తెల్లగా, బొద్దుగా, పేరుకు తగ్గట్టు పెద్ద పెద్ద కళ్ళతో ఉన్న విశాలను గారాబంగా పెంచారు.

విశాలకు చదువు మీద శ్రద్ధ తక్కువే. స్కూల్ ఫైనల్ వరకు లాక్కొచ్చింది. అంతటితో చదువుకు స్వస్తి పలికింది.

ఇక పెళ్లి చేయాలంటూ తగిన సంబంధం కోసం వెతకసాగారు.

అదే ఊరిలో రాఘవయ్య, మాధవయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిని ఇద్దరూ సమానంగా పంచుకున్నారు.

రాఘవయ్య ఆ డబ్బును వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి, ఎంతో చాకచక్యంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఉన్న ఆస్తిని పదింతలు చేశాడు.

రాఘవయ్యకు ఒక్కడే సంతానం. పేరు మోహన్. మోహన్ డిగ్రీ పూర్తి చేయగానే తండ్రి తన వ్యాపారంలోని మెలకువలన్నీ నేర్పించి, కొడుకును కూడా వ్యాపారంలోకి దించాడు.

మోహన్ మంచి తెలివితేటలు కలవాడు. వ్యాపారాన్ని ఎంతో చక్కగా చూసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నాడు.

ఒకసారి ఏదో పెళ్ళిలో విశాలను చూసిన మోహన్ విశాలనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. మోహన్ కోరిక మేరకు తమ కొడుక్కు విశాలను చేసుకుంటామని కబురు పెట్టారు.

ఊరిలోకెల్లా ధనవంతులు తమ పిల్లని కోరి చేసుకుంటామని రావడంతో ధనుంజయరావు దంపతులు ఎగిరి గంతేసినంత పనిచేశారు. వాళ్ల ఆనందానికి అవధులు లేవు.

తమ కూతురు ఎంతో అదృష్టవంతురాలని పొంగిపోయారు. అనుకున్నట్టుగానే పెళ్లి చాలా వైభవంగా జరిగింది.

దురదృష్టవశాత్తూ అయిదేళ్లయినా విశాల కడుపు పండలేదు. మొక్కని దేవుడు లేడు. చేయని యాత్రలు లేవు. కనిపించిన దేవుడికల్లా మొక్కులు మొక్కారు. కానీ ఏమీ ప్రయోజనం లేక పోయింది.

డాక్టర్ల దగ్గరకు వెళ్ళి చూపించుకున్నారు. వాళ్లకు పిల్లలు పుట్టే యోగం లేదన్నారు.

‘నీ కోడలు గొడ్రాలు’ అని ఊరిలో అందరూ అంటూ ఉంటే తట్టుకోలేక, మోహన్‌కు వేరే పెళ్లి చేయాలని అనుకున్నది రాఘవయ్య భార్య ప్రమీలమ్మ. కానీ అందుకు మోహన్ ఎంత మాత్రం ఒప్పుకోలేదు.

పిల్లలు లేకపోయినా ఫరవాలేదు కానీ విశాలకు అన్యాయం చేయనన్నాడు.

దానితో ఆమె మాట మార్చింది. ఎవరినైనా బంధువుల పిల్లల్ని దత్తత తీసుకుందాం అంటూ రోజూ నస పెట్టేది.

రాఘవయ్య తమ్ముడు మాధవయ్య అదే ఊరిలో ఉంటాడు

అన్న చేసే వ్యాపారం చూసి మాధవయ్య కూడా వ్యాపారం చేశాడు. కానీ ఆ వ్యాపారం స్వయంగా చూసుకోకుండా భాగస్వాముల చేతుల్లో పెట్టి తను జల్సాలు చేసి ఉన్న ఆస్తంతా పోగొట్టుకున్నాడు.

భాగస్వాములు నష్టాలు చూపించి మోసంచేసి ఆస్తి అంతా హస్తగతం చేసుకున్నారు.

మాధవయ్యకు ఒక్కడే కొడుకు.. పేరు భాస్కర్. చదువు పెద్దగా అబ్బని భాస్కర్‌కు పెళ్లి చేశారు అతనికి నలుగురు పిల్లలు.

ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకుని పేదరికంతో బాధపడుతున్న తమ్ముడి కుటుంబాన్ని చూసి జాలిపడి రాఘవయ్య అడపాదడపా డబ్బు సహాయం చేసేవాడు.

భాస్కర్ పిల్లలలో ఎవరినన్నా దత్తత తీసుకోమని రాఘవయ్యను ఒత్తిడి చేయసాగారు మాధవయ్య దంపతులు.

ఇందుకు రాఘవయ్య దంపతులు కూడా సమ్మతించారు.

ఈ విధంగానైనా తమ్ముడి కుటుంబాన్ని ఆదుకున్నట్టు అవుతుందని ఆయన భావం.

మోహన్, విశాలలు కూడా ఆనందంగా ఒప్పుకున్నారు.

అన్నట్టుగానే అయిదునెలల పిల్లాడైన భాస్కర్ చిన్న కొడుకును దత్తత తీసుకున్నారు.

వాడికి సంతోష్ అని పేరు పెట్టుకున్నారు. వాడు తమ జీవితాలను సంతోషమయం చేయడానికి వచ్చాడని ఎంతో మురిసిపోయారు.

భాస్కర్ కుటుంబానికి బాగానే డబ్బు ముట్టచెప్పారు. దానితో తిరిగి వ్యాపారం చేయమని, దానికి తన సహాయ సహకారాలు ఉంటాయని రాఘవయ్య చెప్పాడు.

కానీ భాస్కర్ కూడా తండ్రి బాటలోనే నడిచాడు.

డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసాడు.

కొన్నాళ్ళ వరకు సంతోష్ తన తల్లిని మరచిపోలేక ఒకటే ఏడ్చేవాడు.

మోహన్ ఆ బాబును షికార్లు తిప్పి, బొమ్మలు తెచ్చి మెల్లగా తమకు అలవాటు అయ్యేలాగా తంటాలు పడ్డారు.

భాస్కర్ వాళ్లకు మొదట్లో ఇచ్చిన డబ్బు కాక నెలకు ఇంత అని పంపసాగారు రాఘవయ్య.

సంతోష్ కూడా విశాలను, మోహన్ ను “అమ్మ”, “నాన్న” అని పిలవడం మొదలు పెట్టాడు.

అలా పిలవడంతో విశాలలోని మాతృహృదయం ఎంతో పొంగిపోయింది.

రెండు నెలలు గడిచేటప్పటికి భాస్కర్ దంపతులు పిల్లాడిని చూడాలని ఉందంటూ వచ్చారు.

రాఘవయ్య కాస్త గట్టిగా చెప్పారు “మీరిలా చీటికీ మాటికి వస్తూంటే పిల్లాడు మిమ్మల్ని మరచిపోలేక, మాకు చేరిక కాలేకపోతాడు. ఇక మీరు రాకండి.”

ఈ మాటలకు వాళ్ళు కాస్త నొచ్చుకున్నారు. మళ్ళీ ఒక ఆరునెలల వరకూ రాలేదు.  కానీ వాళ్ళు ప్రతి ఆరునెల్లకు ఒకసారి రావడంతో ఏం చేయాలో తోచలేదు వాళ్లకు.

ఇలా కాదనుకుని రాఘవయ్య.. విశాలను, మోహన్‌ను, సంతోష్‌ను దూరంగా ఉన్న పట్టణానికి పంపేశాడు. దానితో భాస్కర్ వాళ్ళు రావడం తగ్గించేశారు.

సంతోష్‌ను మంచి స్కూల్‌లో చేర్పించారు. శ్రద్దగానే చదివేవాడు.

స్కూల్ చదువులు అయ్యాక వాడిని దగ్గరలోనే ఉన్న సిటీలో మంచి కాలేజీలో చేర్పించారు. అక్కడ హాస్టల్‌లో ఉండేవాడు.

సంతోష్‌కు ఒకసారి ఎవరో చుట్టాల ద్వారా తన నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలిసిపోయింది.

వాళ్ళు పేదరికంలో ఉన్నారని తెలిసి మెల్లగా విశాల వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని తన తల్లితండ్రులకు ఇవ్వడం మొదలు పెట్టాడు.

కాలేజీకి సెలవలు ఇవ్వగానే విశాల వాళ్ల దగ్గరకు రాకుండా తన సొంత తల్లితండ్రుల ఇంటికి వెళ్ళేవాడు.

భాస్కర్ దంపతులకు ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

చదువు ఆయిన వెంటనే మంచి ఉద్యోగం కూడా దొరికింది వాడికి. ఉద్యోగం దొరకగానే సంతోష్, తల్లి తండ్రులను తన దగ్గరికి తెచ్చి పెట్టుకున్నాడు.

డబ్బులు అవసరమున్నప్పుడు మాత్రం విశాల ఇంటికి వచ్చేవాడు.

కనీసం మోహన్ తల్లిదండ్రులైన రాఘవయ్య, ప్రమీలమ్మలను చూడడానికి కూడా వెళ్ళేవాడు కాదు.

వాడి చేష్టలకు విశాల, మోహన్‌లు ఎంతో కుమిలిపోయారు.

ఒక గొప్పింటి సంబంధం తెచ్చి సంతోష్ పెళ్లి చేశారు.

ఇప్పుడైనా కొడుకు కోడలు తమ ఇంట్లో సందడిగా తిరుగుతూ ఉంటే చూడాలని, వాడికి పిల్లలు పుడితే ఎత్తుకుని ముద్దాడాలని ఎంతో ఆశపడ్డారు మోహన్, విశాలలు.

వాళ్ల ఆశ అడియాశే అయింది.

భాస్కర్ దంపతుల ప్రమేయంతో ఆస్తి తన పేర పెట్టమని అడిగాడు సంతోష్.

‘మా ఆస్తి అంతా నీకే కదా’ అని మోహన్ అంటే “ఎప్పుడో మీరు పోయాక కానీ ఈ ఆస్తి నాకు రాదు. అప్పుడు ఏం అనుభవిస్తాము. ఇప్పుడే ఇచ్చెయ్యండి” అని ఒకటే గొడవ.

విశాలకు, మోహన్‌కు పిచ్చెత్తినట్టు అయింది. రాఘవయ్య ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. ఆయినవాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకుని తప్పు చేసామా అని ఊరికే బాధ పడుతూ ఉంటాడు.

***

“ఇది విశాలక్కయ్య కథ..” అని చెప్పడం ముగించింది రవళి.

దీర్ఘంగా నిట్టూర్చింది సృజన.

“ఇప్పుడు చెప్పు.. మీ అత్తగారు, మామగారు చెప్పినట్టు బంధువుల పిల్లల్ని దత్తత తీసుకుంటారా” అని ప్రశ్నించింది రవళి.

భయంగా చూసి “మరి దీనికి పరిష్కారం ఏమిటి” అన్నది సృజన.

“ఏముందీ! అనాథ శరణాలయంలో పిల్లల్ని దత్తత తీసుకోవడమే.” అన్నది రవళి.

“అమ్మో! మా అత్తగారు, మామగారు ఒప్పుకోవద్దూ” అనుమానంగా చూసింది సృజన.

“మొదట్లో ఒప్పుకోరు. కానీ నెమ్మదిగా వాళ్ళే అడ్జస్ట్ అవుతారు” ధైర్యం చెప్పింది స్నేహితురాలికి.

కృతజ్ఞతగా చూసింది రవళి వైపు.

“చాలా టైమ్ అయిందే, మీ ఇంటికి వచ్చి. ఇక ఇంటికి బయలుదేరుతాను.” అంటూ “రేపు మావారిని తీసుకుని అనాథ శరణాలయంకు వెళ్ళాలి. ఇప్పటినుంచి మా వాళ్ళను ఒప్పించాలి.” అని అంటూ బయటికి నడిచింది సృజన.

ఈ విషయం మీద ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పాలి.

“అనాథ పిల్లలంటే ఎవరి రక్తమో ఏమో. ఏం రోగాలు ఉంటాయో. ఎలాంటి బుద్ధులు వస్తాయో”అని దీర్ఘం తీశారు సృజన అత్తమామలు.

“రక్తం వల్ల బుద్ధులు రావు. మన పెంపకం వల్లనో, స్నేహితుల వల్లనో బుద్ధులు వస్తాయి. ఇక ఆరోగ్యం విషయం అంటారా.. డాక్టర్లు పూర్తి పరీక్షలు చేస్తారు. అయినా మన ఇంటికి వచ్చాక మనం వాళ్లకు మంచి ఆహారం ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటాంగా” అని నచ్చచెప్తున్నట్టుగానే అన్నా కాస్త గట్టిగానే చెప్పాడు సృజన భర్త వినయ్.

అయిష్టంగానే ఒప్పుకున్నారు పెద్దవాళ్ళు.

అనుకున్నట్టుగానే ఒక మంచి రోజు సృజన దంపతులు అనాథ శరణాలయానికి వెళ్లారు.

అక్కడి పిల్లలందరినీ చూస్తూ ఒకచోట అప్రయత్నంగా ఆగిపోయింది సృజన.

ముద్దుల మూటగట్టే అయిదు నెలలపాప బోసినవ్వులు చిందిస్తూ ఉంది.

కాస్త బలహీనంగా ఉన్నా.. తెల్లగా, పెద్ద పెద్ద కళ్ళతో ఉంగరాల జుట్టుతో ఉన్న ఆ పాప తమదైతే బాగుండునని భర్తను అడిగింది సృజన.

అనాథాశ్రమం అధికారుల దగ్గరికి వెళ్ళి తమ కోరిక తెలిపారు. ఆ పాప గురించిన వివరాలు అడిగారు.

అయిదు నెలల క్రితం తమ గేటు వద్ద ఈ పాపను ఎవరో వదిలేశారని.. బహుశా ఆ పాప తల్లే అయివుండవచ్చునని చెప్పారు. పాపతో పాటు ఒక ఉత్తరం కూడా ఉందని చెప్పి, ఆ ఉత్తరం వినయ్ చేతికి ఇచ్చారు.

ఆ ఉత్తరం ఇంగ్లీష్‌లో రాసి ఉంది. దాని సారాంశం ఏమిటంటే.. తాను ఒకరి చేతిలో మోసగింపబడ్డ ఆభాగ్యురాలని మాత్రం ఉంది. ఇంకేం వివరాలు లేవు.

అనాథాశ్రమ అధికారి ఇలా అన్నాడు “ఆ పాప దొరికిన మరుసటి రోజు ఒక అమ్మాయి రైలు కిందపడి చనిపోయిందని, పోలీసు దర్యాప్తులో ఆ అమ్మాయి పచ్చి బాలింత అని వార్త తెలిసింది. ఈ పాప తల్లి గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయేమోనని ఆశపడి మేము పరుగుపరుగున పోలీసు స్టేషన్‌కు వెళ్ళాము. కానీ ఏవివరాలు తెలియలేదు.”

అందరూ గాఢంగా నిట్టూర్చారు. “ఆ అమ్మాయి బాగా చదువుకున్న దానిలా ఉంది. ఏదో ఒక ఉద్యోగం చేస్తూ పాపను పెంచుకోవాల్సింది. పిరికితనంతో తొందరపాటు నిర్ణయం తీసుకుంది. పాపను అనాథను చేసింది.” అన్నది సృజన.

“మనం పాపను పెంచుకుంటే ఈ పాప అనాధ ఎలా అవుతుంది” అంటూ పాపను రెండుచేతులా ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నారు సృజన, వినయ్‌లు.

అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి, శరణాలయానికి కొంత డబ్బు విరాళంగా ఇచ్చారు సృజన దంపతులు.

ఒక ఆదివారం దత్తత స్వీకారం కూడా జరిగిపోయింది. పాపకు అమృత అని పేరు పెట్టుకున్నారు. తమ ఇంట్లో అమృతాన్ని కురిపిస్తుందని మురిసిపోయేవాళ్ళు.

సృజన అత్తామామలు మొదట్లో అమృతను దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. పాప దగ్గరకు వస్తే అసహ్యించుకునే వాళ్ళు.

రాను రానూ.. తమను నానమ్మా, తాతయ్యా అని పిలుస్తూ దగ్గరికి వచ్చే ఆ పాప మీద మెల్లగా మమకారం పెంచుకున్నారు సృజన అత్తామామలు కూడా.

అమృత ఆటపాటలతో, పెద్దల నవ్వులతో వాళ్ల ఇల్లు స్వర్గంలా మారిపోయింది.

Exit mobile version