[శ్రీ కొడాలి సీతారామా రావు రచించిన ‘కలెక్టర్ గారు వచ్చారు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఫోన్ మోగింది. తీశాను. నా పేరు వివరాలు అడిగి అతను చెప్పాడు – “నేను కలెక్టర్ గారి పీఏని. సారు మీ ఇంటికి ఈ రోజు సాయంత్రం 3 గంటలకి వస్తారట. మీకు వీలౌతుందేమో కనుక్కోమన్నారు. రెండు రోజులనించీ మీ గురించి ఆరా తీస్తున్నారు సారు.”
మా ఇంటికెందుకు! అదే అడిగాను. తెలియదని సమాధానం. నిజానికి ఆ సమయంలో పడుకుంటాను ఒక గంట. ఆయనొస్తున్నారని, ఇబ్బందేం లేదని చెప్పా.
మా ఆవిడ అడిగితే విషయం చెప్పా. “మళ్ళీ ఏం కంప్లైంట్ ఇచ్చారు. ఇదివరకు తాసిల్దారులు వచ్చారు. ఇప్పుడు ఏకంగా కలెక్టరే. రిటైర్ అయ్యి హాయిగా కూచోక ఈ సంఘ సేవ. భయం వేస్తోంది. ఎప్పుడేం కొంప మీదకి తీసుకొస్తారోనని.”
నిజం చెప్పద్దూ రిటైర్ అయ్యాక కొన్ని సామాన్యుల ఇబ్బందులని అధికారుల దృష్టికి తెస్తున్నా. చాలా వరకు సైలెంటుగా చేసిపెడతారు. ఎస్.ఎం.ఎస్. ద్వారా తెలియచేస్తారు. కొందరు అధికారులనో, ఉద్యోగులనో పంపి నిజ నిర్ధారణ చేసుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఏ కంప్లైంటూ ఇవ్వలేదు. అసలు ఇంచుమించు మానేశాను. ఎందుకొచ్చిన గొడవ. అటు పిల్లలు, ఇటు మా ఆవిడా వద్దంటుంటే అని. మరి ఊహించని ఈ పిడుగేంటో.
మధ్యాన్నం నిద్ర పోకుండా కూచునే వున్నా పుస్తకం చదువుకుంటూ.
సరిగ్గా మూడవుతుండగా మా సందు చివర కార్లు మలుపు తిరగటం కనిపించి లేచి బయటికి వచ్చాను. రెండో కారు మా ఇంటి ముందు ఆగింది. ముందు సీట్లో కూర్చున్నతను దిగి వెనక డోర్ తీసే లోపే వెనకనించి పొడవాటి యువకుడు దిగి నా వేపు వస్తున్నాడు.
అతనే కలెక్టర్ అని అర్థమయ్యి నేను రెండు చేతులతో నమస్కారం చేశాను. అతను నా దగ్గిరకి వచ్చి వంగుని నా కాళ్ళకి నమస్కారం చేశాడు. నేను గబుక్కున అతన్ని రెండు చేతులతో లేపి ఇంట్లోకి తీసుకొచ్చాను. మా ఆవిడ కూడా గుమ్మంలో నుంచుని వుంది. నమస్కారం చేస్తూ లోపలికి వెళ్లింది.
అతన్ని కుర్చీలో కూచోమన్నాను. ఎందుకు వచ్చాడో చెపుతాడేమోనని అతని వంక చూస్తున్నాను.
“నన్ను మీరు గుర్తు పట్టినట్టు లేదు. రేణిగుంటలో రైల్లో కలుసుకున్నాము నాలుగేళ్ల క్రితం.” చెప్పాడతను.
***
ఎన్నేళ్ల క్రితమో గుర్తులేదు సరిగ్గా. రేణిగుంటలో రైలు ఎక్కాను విజయనగరం రావటానికి. నా ఎదురు సీట్లో ఒకతను కూర్చున్నాడు. కాకి నిక్కరు, రంగు బనీను. చూస్తే లేబర్ కుర్రాడిలా అనిపించాడు.
చాలా సేపటి తరువాత అతనే పలకరించాడు ఎందాక అంటూ. అలా నా వివరాలు అతనికి, అతని వివరాలు నాకూ తెలిసాయి.
అతనిది భువనేశ్వర్ దగ్గిర పల్లె. తండ్రి వ్యవసాయం. తల్లి స్కూల్ టీచర్. తను ఆంధ్రాలో బీటెక్ చేసి, పలాసలో ఓ ఏడాది ఉద్యోగం చేసాడు ప్రైవేటు కంపెనీలో. మానేసి సివిల్స్కి తయారయాడు.
అతను సివిల్స్ రాశాడు. ఇంటర్వ్యూలో పోయింది. కోపంతో తిరుపతి వచ్చాడు వెంకన్నని తిడదామని. తీరా దర్శనం చేసుకున్నాక ఆ కోపం పోయింది. అక్కడే వుండాలని నిర్ణయించుకున్నాడు మళ్ళీ గెలిచేదాకా.
అలా ఒక టిఫిన్ సెంటర్లో కౌంటర్లో కుదురుకున్నాడు. అవసరమైతే ప్లేట్లు తీశాడు, సర్వింగ్, క్లీనింగ్ చేశాడు. ప్రస్తుతం అతని బాబాయి గారికి బాగా లేదని తెలిసి భువనేశ్వర్ వెళుతున్నాడు.
నేను అతనికి ధైర్యం చెప్పాను. “కలెక్టర్ అవుతావు. మా జిల్లాకి రావాలి. నేను నీ దగ్గిరకి వచ్చి బాబూ ఈ సహాయం చేసిపెట్టాలి అని అడగాలయ్యా.” అన్నాను.
“ఒక ఓటమి అడ్డంకి కాదు. గెలుపుకి ఓ మెట్టు ఎక్కినట్టు. మైఖేల్ జోర్డాన్ ప్రపంచంలో గొప్ప ఫుట్బాల్ ఆటగాడు. అతన్ని హైస్కూల్లో టీం నుంచి గెంటేసారు సరిగా ఆడటం లేదని. వాల్ట్ డిస్నీని ఓ న్యూస్ పేపర్ నుంచి తీసేసారు అతనికి చక్కటి ఊహాశక్తి లేదని. అతను మొదట స్థాపించిన యానిమేషన్ స్టుడియో దివాళా తీసింది. ఆ అపజయాలు అతని విజయ పరంపరని ఆపలేకపోయాయి. మనందరం చదువుకున్నట్టు – అల్వా ఎడిసన్ ఎలక్ర్టిక్ బల్బు కనుక్కునే ముందు వేల సార్లు అపజయం పొందాడు. అతను నిరాశ పడలా. పైగా ‘అన్ని వేల మార్గాలు కనుక్కున్నా’ అన్నాడు. అందు వల్ల ఒక అపజయం అడ్డంకి అనుకోవద్దు. గట్టిగా కృషి చెయ్యి దేవుడి అండ ఎప్పుడూ వుంటుంది. విజయోస్తు.” అన్నా.
అతను ఓపికగా నే చెప్పిందంతా విన్నాడు. “ఈసారి ఖాయంగా విజయం సాధిస్తా. మిమ్మల్ని కలుస్తా.” అన్నాడు.
***
అలా అతను కలెక్టరుగా ఎంపిక అవటం, అనంతపురంలో మొదటి పోస్టింగు, ఇదుగో ఇపుడు ఇక్కడ.
“మీ ఆశీర్వాదం వల్లే వెంకన్న నన్ను కరుణించాడు. అందుకే ఇక్కడికి రాంగానే మీ గురించి ఎంక్వైరీ చేశాను. నాకు చాలా సంతోషంగా వుంది మిమ్మల్ని కలుసుకున్నందుకు. మీకు ఏదన్నా పని వుంటే నా ఫోన్కి ఒక మెసేజ్ పెట్టండి చాలు.మీరు రావక్కర్లా.”
ఈ లోగా మా ఆవిడ టీ, బిస్కట్లు తెచ్చింది. అవి తీసుకున్నాక అతను లేచి వెళుతూ మళ్ళీ మా ఇద్దరికీ నమస్కారం చేస్తూ బయటికి వచ్చాడు.
అప్పటికి వీధిలో అందరూ ఇళ్ళలోంచి బయటికి వచ్చి చూస్తున్నారు కలెక్టరుగారు మా ఇంటికి ఎందుకు వచ్చారని. కాసేపాటి తరువాత అందరికీ తెలిసిపోతుంది. మా ఆవిడ చెప్పేస్తుంది కనుక. ఇప్పుడు గొప్పగా ‘మా వారి సలహా వల్లే అతను కలెక్టర్ అయ్యాడు. అందుకే కృతజ్ఞతలు చెప్పకోటానికి వచ్చాడు’ అని. ఇంకా చిలవలు పలవలుగా.