[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]
81.
నాగరికత నేర్చి నగరాల జీవించి
నచ్చినటుల మారి నడచుకున్న
మరువరాదు తల్లి మనయూరి నెప్పుడు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
82.
పరిధి దాట వలదు ప్రతిభ యున్నదనుచు
లోకువగుదువమ్మ! లోపమున్న
మించి యెదుగ వలెను నెంచు వారల జూచి
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
83.
చెదరనీయకమ్మ చిరునవ్వు మోముపై
చింత తొలగజేయు జిన్నినవ్వె
నవ్వవలెను గాని నగుబాటు కారాదు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
84.
పొరుగువారి జూచి సరితూగ వలెనంచు
నప్పు సేయ తగదు మెప్పు కొఱకు
నాపదలను దెచ్చు నాడంబర మెపుడు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
85.
విద్య నేర్చునపుడు విసుగుచెంద వలదు
మన్ననలను పొందు మార్గ మిదియె
మనిషి తీరు మారు మంచి విద్యవలనె
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
86.
దీక్ష బూని దెచ్చె దివిజ గంగనిలకు
నల భగీరథుండు తెలియుమమ్మ!
కష్టపడిన వారి కార్యమ్ము లొనగూడు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
87.
చీడపురుగు రీతి వీడక వెన్నంటి
చెరుపు జేతు రరయ చెనటులెపుడు
తగినరీతి బల్కి తప్పించుకోవలె
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
88.
ఆస్తులన్ని బంచ నాపద లెదురౌను
ధనము వలయు సుమ్ము ధరణి యందు
విలువ నిచ్చు జగము విత్తమున్నప్పుడే
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
89.
కన్న బిడ్డ కోర్కె కష్టమైనను దీర్చు
కన్న వార లవని కల్పతరులు
ముదిమి యందు వారి వదిలించు కొనరాదు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
90.
అతిగ మాట లాడ గతితప్పి పలుకులు
గుట్టులన్ని కూడ రట్టు జేయు
నాల్కనదుపు చేయు నల్వురి నడుమన
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
(ఇంకా ఉంది)
శ్రీమతి వరికేటి నాగజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. పదవ తరగతి వరకే చదువుకున్న నాగజ్యోతి గారు దక్షిణ భారత హిందీ పరీక్షలలో భాషాప్రవీణ, హిందీ టైపింగ్ పరీక్షలు లోయర్, హైయ్యర్ పాసయ్యారు. వివాహానంతరం ఢిల్లీకి వచ్చి గృహస్థురాలి బాధ్యత స్వీకరించారు. సాహిత్యాభిలాషి. వీరు రాసిన కథలు, కవితలు, పద్యాలు పలు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.
పుస్తక సమీక్షలు కూడా చేస్తూ వుంటారు. ఇన్నేళ్ళ తరువాత కోవిడ్ కాలంలో శ్రీ పూసపాటి గురువుగారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి ద్వారా పద్య రచన, ప్రాథమిక వ్యాకరణం నేర్చుకున్నారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి సహకారంతో – ఆప్త మిత్రులు శ్రీ ధరణిగారు, సన్నిహితులు, తమ శ్రీవారి ప్రోత్సాహం వలన ‘చిట్టి తల్లి’ పద్య శతకం రాసారు.
గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ నివాసి.