[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]
51.
గొప్ప చెప్ప తగదు గురివింద రీతిగ
తప్పు లెంచ వలెను తనవె తొలుత
దోష మసలు లేని దొడ్డవారుందురా!
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
52.
అలుసు చేయ తగదు అంగవిహీనుల
సానుభూతి జూప సబబు కాదు
చేతనైన రీతి సేవ చేసిన మేలు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
53.
ఏకలవ్యునివలె యెదుగు శిష్యుని గన
గురువు కతని మీద గురియు పెరుగు
గడన చేయకున్న గర్వమొందు మదిని
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
54.
ప్రగతి పేరు జెప్పి పచ్చని చెట్లను
నరుకచుండ మనకె నష్టమగుచు
నడవులంత మొంది నాపద లెదరౌను
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
55.
జ్ఞానమునకు మించు సంపద లేదమ్మ
నదియె యెడరులందు నరయు మనల
బంచుచున్న కొలది మించిపోవు నదియు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
56.
దుర్లభమను మాట దూరముంచ మదికి
సులభమౌను బాట సుంతయినను
నిమ్మళించి నడువ నెరవేరు లక్ష్యము
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
57.
అంబరమ్ము నంటు నల్పుని మాటకు
మోసపోదురమ్మ యాశతోడ
నిజము నిగ్గు దేల నింద జేతురు వారె
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
58.
సజ్జనుండు దెలుపు బుజ్జగించి మనకు
మంచి మార్గ మందె మరలుమనుచు
చెడ్డ మార్గమెపుడు జెఱుపుజేయును తల్లి
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
59.
నమ్మకముగ జేరి సొమ్ములు దోచుచు
హాని జేయ జూతు రవని నిపుడు
తొలగు నాపద తగు మెలకువ నుండిన
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
60.
ఎదుటివారి జూచి యెరుసు పడకెపుడు
తనకు లేదటంచు వనటవలదు
తృప్తి లేని జీవి ధృతికి దూరమగును
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
(ఇంకా ఉంది)
శ్రీమతి వరికేటి నాగజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. పదవ తరగతి వరకే చదువుకున్న నాగజ్యోతి గారు దక్షిణ భారత హిందీ పరీక్షలలో భాషాప్రవీణ, హిందీ టైపింగ్ పరీక్షలు లోయర్, హైయ్యర్ పాసయ్యారు. వివాహానంతరం ఢిల్లీకి వచ్చి గృహస్థురాలి బాధ్యత స్వీకరించారు. సాహిత్యాభిలాషి. వీరు రాసిన కథలు, కవితలు, పద్యాలు పలు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.
పుస్తక సమీక్షలు కూడా చేస్తూ వుంటారు. ఇన్నేళ్ళ తరువాత కోవిడ్ కాలంలో శ్రీ పూసపాటి గురువుగారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి ద్వారా పద్య రచన, ప్రాథమిక వ్యాకరణం నేర్చుకున్నారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి సహకారంతో – ఆప్త మిత్రులు శ్రీ ధరణిగారు, సన్నిహితులు, తమ శ్రీవారి ప్రోత్సాహం వలన ‘చిట్టి తల్లి’ పద్య శతకం రాసారు.
గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ నివాసి.