[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
మళ్లీ స్కూళ్ళు తెరుస్తున్నారు
స్కూల్సు తెరుస్తున్నారనగానే పిల్లలు ఉన్న అందరి ఇళ్లల్లోనూ సందడి మొదలవుతుంది. ఈ రోజుల్లో పిల్లల్ని స్కూల్లో చేర్చటం అంటే అదొక పెద్ద యజ్ఞం లాగే తయారైంది. పూర్వం దానాలు అన్నిటి లోకీ అన్నదానం, విద్యాదానం గొప్పవి అనేవాళ్లు, దానధర్మాల రోజులు పోయాయి. “ఎంతవరకు చదువుకున్నావ్?” అన్న ప్రశ్న ఇప్పుడు “ఎంతవరకు చదువు కొన్నావ్?” అనే ప్రశ్నగా మారింది. అన్నదానం, విద్యాదానం, రెండు అతి పెద్ద వ్యాపారాలుగా మారాయి.
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు విద్య, వైద్యం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఆ కోట్లు ఏమై పోతున్నాయో తెలియదుగానీ, వీటిని భరించటం సామాన్యుడికి తలకు మించిన భారం అయిపోతోంది. పిల్లలు అందరికీ నిర్బంధంగా విద్య నేర్పిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకాలు పెట్టి ప్రాథమిక విద్య నేర్పిస్తున్నారు. ప్రభుత్వం ఖర్చు చేయటమే కనిపిస్తోంది గానీ, ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించటానికి కొందరు తల్లిదండ్రులు అంగీకరించటం లేదు. కారణం ఆ పాఠశాలల్లో చదివిస్తే సరియైన మార్కులూ, ర్యాంకులూ రావనీ, ఈ పోటీ ప్రపంచంలో తమ పిల్లలు భవిష్యత్తులో పోటీ పడలేరని అభిప్రాయపడుతున్నారు. అది కొంత వరకూ నిజమే, పదో తరగతి ఫలితాలు వెలువడినప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంటోంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల ఉత్తర్ణత జీరో శాతం కూడా ఉంటోంది. అందుచేత ఎన్ని భోజన పధకాలు పెట్టినా, అసలు విద్య అబ్బటం లేదు గనుక, మరీ గత్యంతరం లేని వాళ్లు తప్ప, ఒక మాదిరి స్తోమత ఉన్నవాళ్లు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించటం లేదు. ఏదో మొక్కుబడిగా టీచర్లు బడికి వెళ్లి వస్తుంటారే గానీ, పిల్లలకు శ్రద్ధగా చదువు చెప్పాలన్న ఆకాంక్ష ఉండదు. ఇందుకు కారణాలు చాలానే ఉంటాయి. పాఠ్యపుస్తకాలు అందటంలో ఆలస్యం అవుతుంది. మధ్యలో ఫీజులు తగ్గించమనో, రాజకీయ పార్టీల ప్రమేయం తోనో జీవితకాలం సమ్మెలు జరుగుతాయి. వానలు వరదలు, వస్తే స్కూళ్లకు శలవులు ఇస్తారు. ఇవిగాక టీచర్లకు అప్పుడప్పుడు ఎలక్షన్ల డ్యూటీలు, జనభా లెక్కల సేకరణ, వంటి ఇతర పనులు అప్పగిస్తారు. టీచర్లకే శ్రద్ధ లేనప్పుడు పిల్లలకు మాత్రం ఏం శ్రద్ధ ఉంటుంది. పరీక్షల్లో కాపీ కొట్టటం, ప్రశ్నాపత్రాలు ముందుగానే లీక్ కావటం వంటి కారణాలు ఎన్నో విద్యా విధానంలోని లోపాలుగా కనిపిస్తుంటయి. ప్రైవేట్ కాలేజీలు, స్కూలలో పిల్లలను చదివించాలంటే, లక్షలు, లక్షలు గుమ్మరించాల్సిందే, వాళ్లు పెట్టే సవాలక్ష ఆంక్షలకు ఒప్పుకోవాల్సిందే. యూనిఫామ్స్, పుస్తకాలు, ట్రాన్స్పోర్ట్ అంటూ అదనంగా మరి కొన్ని వేలు చెల్లించాలి.
యల్.కె.జి, యు.కె.జి. పిల్లలకు కూడా ఇంటర్వూలు ఇంటాయి. కొన్ని వస్తువులు చూపించి, వాటి పేర్లు చెప్పమంటారు. అప్లికేషన్ ఫారమ్లో తండ్రి ఉద్యోగం, జీతం, అమ్మ చదువు, ఇద్దరికీ కలిపి నెలసరి ఆదాయం, సొంత ఇల్లు, కారు ఉన్నాయా వంటి ఎన్నో అంశాలను చూసి లక్షల్లో ఫీజులు కట్టగలిగిన వాళ్లకీ సీటు. వీటిలో ఏవన్నా తక్కువ అనిపిస్తే డొనేషన్ పెంచుతారు. ఇంతా చేసి ఆ స్కూల్లోనో, కాలేజీలో టీచర్లు ఏమన్నా కష్టపడతారా అంటే అదేమీ ఉండదు. పది పేజీల హోమ్ వర్క్ ఇస్తారు. డాడీగానీ, మమ్మీగానీ దగ్గర కూర్చుని హోమ్ వర్క్ చేయించాలి. లేకపోతే ఆ విదార్థితే తప్పు. ఇంక ఈ బాధ భరించలేక ట్యూషన్ టీచర్ని పెట్టుకోవాలి. ఈ విధంగా మళ్లీ చదువు అంతా పేరెంట్లు చెప్పుకోవాలి, లేదా చెప్పించుకోవాలి – అని అన్నప్పుడు అన్ని లక్షలు డొనేషన్లు, ఫీజులు కట్టి ఆ స్కూలులో, కాలేజీలోనే ఎందుకు చదివించాలంటే, అదొక స్టేటస్ సింబల్.
విద్యార్థి అంటే విద్యను ఆర్థించేవాడు. అలా అర్థించిన విద్య అతని జీవితాన్ని తీర్చిదిద్దేదిగా ఉండాలి. కానీ ఇప్పుడు ర్యాంకులూ, డిగ్రీలు, అన్నీ ఒక పెద్ద వ్యాపారంగా మారిపోతున్నయి. డాక్టరేట్ పట్టాలు కూడా డబ్బు పెట్టి కొనుక్కోగల వస్తువులుగా మారిపోతున్నాయని అక్కడక్కడా వినిపిస్తున్నదంటే, అంతకన్నా విచారించవలసిన విషయం మరొకటి ఉండదు.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.