[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
ఊబి
ఈ మధ్య బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లినప్పుడు, సుబ్బలక్ష్మి కనిపించింది. నా పక్కనే కూర్చుంది. పెళ్లికూతురి మీద జాలి పడటం మొదలు పెట్టింది. “పెళ్ళికూతురు ఎందుకు తల వంచుకుని కూర్చుంటుందో తెల్సా?” అని అడిగింది. తెలియదని అన్నాను. “ఇంత డబ్బు పోసి ఈ పనికిరాని వాడి చేత తాళి కట్టించుకున్నానన్న బాధతో తలవంచుకునే కూర్చుంటుంది” అన్నది. ఇంక ఆడజాతి బాగుపడదు, విముక్తి లేదని చెప్పింది. పెళ్లి పేరుతో పర్మినెంటు పనిమనిషిగా, వంటమనిషిగా, వారి పిల్లలకు ముక్కుచీమిడి తుడిచి, స్నానాలు చేయించి, బట్టలు తొడిగే ఆయాగా మారిపోతోంది – అని బాధపడింది. “ఆ ఆమ్మాయి శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే నీ శాపనార్థాలు ఏమిటే?” అంటే, “మరో ఆడపిల్ల పెళ్లి పేరుతో ఊబిలోకి దిగిపోతోందన్నదే నా బాధ” అని చెప్పింది.
సుబ్బలక్ష్మి ఇంత శాడిస్టులా మారిపోవటానికి కారణం దాని పాత అనుభవాలేనని చెప్పాలి. అది కాలేజీలో చదువు వెలగబెడుతున్న రోజుల్లో, అంటే యవ్వనారంభ వేళలో, ఓ కుర్రాడు మోజుపడి, వెనకాల పడితే, అహంభావంతో, ‘చూడు వీడిని ఎలా ఏడిపిస్తానో’ అంటూ శపథం చేసింది. రోజూ అతను ఎదురు పడితే చాలు, చూపుల తోనే ఊరించేది. ధైర్యం చేసి అతను పలకరించబోతే ముహం తిప్పుకునేది. తనని కాదన్నట్లు ఎటో చూసేది. ఇది కొరుకుడు పడే సరుకు కాదని, అతను అంటే ముట్లునట్లు ఉంటే, నలుగురిలో ఉన్నప్పుడు అతనికి చేరువగా వచ్చేది. కొంటె చూపుల కోలాటాలు వేసేది. ఏమంటావ్ – అన్నట్లు కనురెప్పలు ఎగరేసేది. రెండేళ్లపాటు అతను చొరవ చూపినా వ్యవహారం అడుగు ముందుకు సాగలేదు. అతను విసిగిపోయి ‘తల్లీ నీకో నమస్కారం’ అంటూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అతను అలా దూరమైనాక ‘వాడికన్నా జారి పడి, నామీద రాలిపడిన వాన చినుకు నయం, గాలికి నా పాదాల వద్దకు కొట్టుకొచ్చిన గడ్డిపరక నయం’ అంటూ కోపగించుకుంది. సుత్తి వీరభద్రరావు లెవెల్లో తిట్టిన తిట్టు తిట్టకుండా ఆరునెలలు తిట్టింది. ఏదో అనుకుని ఆశపడినందుకు అతనికి మిగిలింది ఆ తిరస్కారమే.
ప్రేమికులు పంతాలు పట్టింపులకు పోకూడదు. ఒకరి నొకరు అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవాలి. తెగేదాకా లాగకూడదు. అతన్ని తనవెంట తిప్పుకోవటంలో తెలియని ఆనందం, ఏడిపించటంలో వింత సంతోషం పొందితే, ఆ ప్రేమ నిలవదు. పైగా ద్వేషం ఏర్పడుతుంది. ఇక ఒక వ్యక్తి మీద ఏర్పడిన ద్వేషం మగజాతి మీదకు మారుతుంది. అక్కడి నుంచీ దృక్పథం మారిపోతుంది. ప్రతిదానిలోనూ తప్పే కనిపిస్తుంది.
“అసలు కన్యాదానం ఏమిటి? ఆస్తినో, డబ్బునో దానం చేసినట్లు ఆడపిల్లను దానం చేయటం ఏమిటి? దానం ఇచ్చేది మగవాడే, దానం పుచ్చుకునేదీ మగవాడే. దానం ఇవ్వటానికి వాడెవడు, పుచ్చుకోవటానికి వీడెవడు? ఆడదాన్ని దానం చేయటం కాకుండా కట్నాలూ, కానుకలు పేరుతో లక్షలు లక్షలు ధారపోయడం ఏమిటి? పెళ్లి తంతు అంతా చూస్తుంటే, మగవాడు ఆడడాన్ని అడుగడుగునా ఎంతగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడో కనిపించటం లేదా” – అని నిలదీసింది సుబ్బులు. అమ్మాయిలు ఎవరూ మగవాడ్ని మాత్రం పెళ్లి చేసుకోకూడదన్న సుబ్బలక్ష్మి మాటలకు నవ్వు వచ్చినా, ఆపుకున్నాను. ఇల్లు ఊడవటం, వంట చేయటం, అంట్లు తోమటం – ఏమిటి ఇదంతా అని మొహం చిట్లించుకుంది. పెళ్లి చేసుకోకపోతే మాత్రం – ఆకలి వెయ్యదా, వంట చెయ్యరా, అంట్లు గిన్నెలు తోమరా? – అని అడగాలని అనుకున్నా, దాని మాటలకు అడ్డు రాదల్చుకోలేదు.
ఎంతో మంది జంటలు, భర్తతో విసిగిపోయి, విడిపోవాలని అనుకుంటున్నా, సమాజానికి భయపడి, గతి లేక పడి ఉన్నారని – చెప్పింది. ఎంతోమంది ఆడవాళ్లు హత్యలకూ, ఆత్మహత్యలకూ గురి అవుతున్నారు, ఇది దారుణం – అనీ అన్నది
కొందరు భార్య చేత ఉద్యోగం చేయించి, ఆమె సంపాదనను తామే తీసుకుని, భార్యను డబ్బు సంపాదించే ఒక యంత్రంలా చూస్తున్నారని సుబ్బులు విరుచుకుపడింది.
సమాజం ఒక క్రమ పద్ధతిలో నడవాలీ అంటే, ఒక క్రమ పద్ధతి, ఒక వ్యవస్థ అవసరం. మొదట్లో ఒక ముఠాలోని ఆడవాళ్లంతా ఒక ముఠాలోని మగపాళ్లకు భార్యలుగా ఉండేవాళ్లు. తరువాత దశలో అన్నదమ్ములందరికీ ఒక్కతే భార్యగా ఉండేది. ఇప్పటికీ టిబెట్ లాంటి కొన్ని చోట్ల ఈ పద్దతి కనిపిస్తుంది. కొంతకాలానికి ఒక వ్యక్తి ఇద్దరూ, అంతకంటే, ఎక్కువ మందిని వివాహం చేసుకునే పద్ధతి అమలులోకి వచ్చింది. రాజులకు, జమిందార్లకూ, ధనవంతులకూ ఎంతమంది భార్యలుంటే అంత హోదాగా ఉండేది. చనిపోయిన సోదరుడి భార్యను, బ్రతికి ఉన్న సోదరుడు భార్యగా స్వీకరించటమూ ఉంది. ఇప్పుడు మాత్రం ఒక వ్యక్తి, ఒక స్త్రీని మాత్రమే పెండ్లి చేసుకోవాలని నాగరిక సమాజాలు నిర్దేశిస్తున్నయి.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.