Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిన్నోడు పెద్దోడు

[ప్రపంచ జానపద కథలలో భాగంగా, బాలబాలికల కోసం డా. ఎం. హరికిషన్ అందిస్తున్న కథ ‘చిన్నోడు పెద్దోడు’.]

క వ్యాపారికి ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. పెద్దోడేమో పెద్ద టక్కరోడు. పైకి చానా మంచివానిలా వినయంగా నటిస్తూ మాటలతో మనుషులను బురిడీ కొట్టించేవాడు. చిన్నోడు అలా కాదు. చానా మంచోడు, అమాయకుడు. జాలీ దయా ఉన్నోడు. పదిమందికి మేలు చేయాలి అనుకునేవాడు.

వ్యాపారి ముసలివాడయ్యాడు. ఒకసారి తన పిల్లలు వ్యాపారం ఎలా చేయగలరో చూద్దామని ఇద్దరినీ పిలిచి తలా పది బంగారు వరహాలు చేతిలో పెట్టి “వారం లోపల మీకు తోచిన వ్యాపారం చేసి మరింత సంపాదించుకొని రండి” అని పంపించాడు. ఇద్దరూ సరేనని తలా ఒక దిక్కుకు బయలుదేరారు.

పెద్దోడు పోతావుంటే ఒకచోట ఒక సంత జరుగుతూ ఉంది. అక్కడ కొందరు మూడుముక్కలాట ఆడతా ఉన్నారు. పెద్దోడు పోయి తానూ ఆ జూదం ఆడడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే జేబులోని బంగారు వరహాలన్నీ వరుసగా పోయాయి. ఏం చేయాలో తోచలేదు. ఆ రోజు రాత్రి అక్కడే పండుకున్నాడు. అర్ధరాత్రి లేచి ఒక పెద్ద అంగడి వైపు పోయాడు. అక్కడ అందరూ నిద్రపోతా ఉన్నారు. చప్పుడు కాకుండా లోపలికిపోయి చేతికి చిక్కిన వరహాలన్నీ తీసుకొని జేబులో వేసుకున్నాడు. రాత్రికి రాత్రే ఆ చోటును వదిలి పారిపోయాడు.

చిన్నోడు పోతూవుంటే ఒకచోట పెద్ద గాలీవానా వచ్చింది. ఉరుక్కుంటూ పోయి ఒక పెద్ద వేపచెట్టు కింద నిలబడ్డాడు. ఆ చెట్టు మీద ఒక పక్షి గూడు ఉంది. అందులో రెండు చిన్న పిల్లలు ఉన్నాయి. గాలి పెద్దగా వీచడంతో ఆ గూటిలోంచి పిల్లలు కిందపడ్డాయి. పాపం అవి బాధతో కిచకిచమంటూ అల్లాడిపోతూ వుంటే చిన్నోడు చూశాడు. ఉరుక్కుంటూ పోయి వెంటనే జాగ్రత్తగా ఆ పిల్లలను తీసుకొచ్చి వాన తగ్గేదాకా తన ఒడిలో పెట్టుకున్నాడు. ఆ తరువాత వాటిని తీసుకుపోయి గూటిలో వదిలాడు.

సరిగ్గా అదే సమయానికి ఆహారం కోసం పోయిన తల్లి పక్షి అక్కడికి వచ్చింది. జరిగిందంతా తెలుసుకొంది. “కళ్ళముందు సాటి మనుషులు చస్తావున్నా చూసీ చూడనట్లు వెళ్లిపోతున్న ఈ కాలంలో నా పిల్లలను కన్నతండ్రిలా కాపాడావు. చెప్పు నీకేం కావాలో” అని అడిగింది. దానికి చిన్నోడు “అమ్మా.. నేనేదో ఆశపడి ఈ సాయం చేయలేదు. కళ్ళ ముందు చిన్నపిల్లలు బాధపడతా వుంటే చూడలేక చేశాను. నాకేం వద్దు” అన్నాడు. కానీ ఆ పక్షి పట్టిన పట్టు వదల్లేదు.

“చిన్నదో పెద్దదో ఏదో ఒకటి అడుగు. నీ రుణం ఉంచుకోలేను. నన్ను బాధ పెట్టకు” అంటూ బ్రతిమలాడింది. దాంతో చిన్నోడు “సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కదా.. అయితే విను. నాకు మీ పకక్షులు అంటే చానా ఇష్టం. కాబట్టి మీ పక్షి భాష నేర్పించు. చాలు” అన్నాడు. ఆ పక్షి ‘సరే’ అంది.

వెంటనే చిన్నోడు పక్కనే ఉన్న ఒక ఊరికి పోయి తన దగ్గర ఉన్న బంగారు వరహాలతో వారం రోజులకు సరిపోయే ఆహార పదార్థాలన్నీ కొనుక్కొని వచ్చి చెట్టు కిందికి చేరుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ పక్షి ఒక్కొక్క అక్షరమే నేర్పిస్తూ వారం తిరిగేసరికి మొత్తం పక్షి భాషనంతా నేర్పించేసింది. చిన్నోడు సంబరంగా ఇంటి దారి పట్టాడు.

తిరిగి వచ్చిన కొడుకులిద్దరిని వ్యాపారి పిలిచి “మీరు వారంరోజుల్లో పది వరహాలతో ఏమేం చేశారో చెప్పండి” అని అడిగాడు. పెద్దోడు తన దగ్గర వున్న బంగారు వరహాలు తండ్రి ముందు పెట్టి “నాన్నా.. నేను పోతూవుంటే ఒకచోట పెద్ద జాతర జరుగుతూ ఉంది. అక్కడ లెక్కలేనంతమంది జనం ఉన్నారు. దాంతో పక్క ఊరిలో ఉన్న తోటలో మామిడికాయలు కొని వాటిని జాతరలో అమ్మడం మొదలుపెట్టాను. అలా వారం తిరిగేసరికి రెండింతలు సంపాదించాను” అని అబద్ధం చెప్పాడు.

కానీ చిన్నోడు అట్లాగాక జరిగింది జరిగినట్లు చెప్పాడు. ఆ మాటలు విన్న వ్యాపారి చిన్నోన్ని బయటికి పిలుచుకొని పోయి ఇంటి ముందు చెట్టు మీద కిచికిచలాడుకుంటున్న పకక్షుల్ని చూపించి అవి ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పు అన్నాడు. చిన్నోడు జాగ్రత్తగా విని “నాన్నా.. అబద్ధాలు చెప్పేవాళ్ళు కలకాలం విజయాలు సాధించలేరు. మంచివాడు, దయ గలిగినవాడు, నిజాయితీపరుడే చివరికి గెలుస్తాడు అని మాట్లాడుకుంటున్నాయి” అని చెప్పాడు. దానికి వాళ్ళ నాన్న “ఈ ఎదవమాటలు తెలుసుకోవడానికేనా అన్ని బంగారు వరహాలు అనవసరంగా ఖర్చు పెట్టావు. ఈ మాటల వల్ల ఎవరికి ఉపయోగం” అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు.

కొద్ది రోజుల తరువాత ఆ వ్యాపారి ఇద్దరు కొడుకులను దూరదేశంలో ఉన్న తన మిత్రుని దగ్గరికి పంపిస్తూ “మిత్రమా.. ఈ ఇద్దరిలో పెద్దోడు చానా తెలివైనవాడు. కష్టజీవి. చిన్నోడు అమాయకుడు. సోమరిపోతు. ఇద్దరినీ పరీక్షించి ఎవరికి తగిన పని వారికి ఇప్పించు” అని ఉత్తరం రాశాడు. ధనవంతుడు వాళ్ళిద్దరినీ పరీక్షించాలని ఒకరోజు – ఊరి బయట ఉన్న తోటలో ఎంతో విలువైన మట్టి ఉంది. పోయి బండినిండా తీసుకొని రండి అని చెరీ ఒక బండి ఇచ్చి పంపించాడు. ఇద్దరూ పలుగూపారా, తట్టాబుట్టా తీసుకొని తోటకూ బయలుదేరారు.

తోటంతా మొక్కలు తీగలు, చెట్లుచేమలతో నిండి ఉంది. పెద్దవాడు ఇష్టమొచ్చినట్లు అడ్డమొచ్చిన చెట్లు అన్నింటినీ నరికి వేస్తూ మట్టిని తవ్వసాగాడు. దాంతో చెట్ల మీద వున్న పకక్షులన్నీ భయంతో చెల్లాచెదురు కాసాగాయి. గూళ్లు కిందపడి గుడ్లు పగిలిపోసాగాయి. పకక్షులన్నీ భయంతో పైకి ఎగిరి గట్టిగా అరవసాగాయి. వాటి అరుపులు విన్న చిన్నోడు పరుగు పరుగున అన్న వద్దకు వచ్చి “అన్నా.. అనవసరంగా చెట్లను నరకవద్దు. ఆ పకక్షులు అన్నీ కలసి నీ మీద దాడి చేయాలి అనుకుంటున్నాయి. జాగ్రత్త” అని చెప్పాడు. కానీ పెద్దోడు వాని మాటలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ గూళ్ళన్నీ చిందర వందర చేస్తూ బండినిండా మట్టి నింపుకొని బయలుదేరాడు. చిన్నోడు చానా జాగ్రత్తగా చెట్లకు, మొక్కలకు, పక్షులకు ఏమీ కాకుండా నెమ్మది నెమ్మదిగా మట్టిని తవ్వుతూ బండి నింపుకోసాగాడు.

పెద్దోడు బండిమీద పోతూవుంటే ఒక్కసారిగా పకక్షులన్నీ కలసి దాడి చేశాయి. దాంతో బెదిరిపోయిన ఎద్దులు భయంతో పరుగులు పెట్టాయి. దారిలో ఒక చోట ఒక పెద్ద రాయి ఉంది. బండి గాను దాని మీదికి ఎక్కింది. అంతే బండి ఒక వైపుకు ఒరిగిపోయి మట్టి అంతా కింద పడిపోయింది. పెద్దోడు పకక్షులకు దొరకకుండా ఉరుక్కుంటా పోయి ఒక బండ చాటున దాచి పెట్టుకున్నాడు. అవన్నీ పోయాక వచ్చి చూస్తే ఇంకేముంది బంగారం లాంటి మట్టి కాస్తా చెత్తాచెదారంతో కలసిపోయి పనికిరాకుండా తయారయింది. బెరబెరా దాన్నే ఎత్తి బండి నిండా నింపుకున్నాడు.

తిరిగి పోతూవుంటే దారిలో చిన్నోడు కలిశాడు. కొంచెం దూరం పోయాక పెద్దోడు చిన్నోనితో “తమ్ముదూ.. పని చేసీ చేసీ బాగా అలసిపోయాం. కళ్ళు మూతలు పడుతున్నాయి. కాళ్లు చేతులు కదలమంటున్నాయి. కాసేపు ఇక్కడ చెట్టు కింద విశ్రాంతి తీసుకుని మరలా బయలుదేరుదాం” అన్నాడు. చిన్నోడు ‘సరే’ అన్నాడు. ఇద్దరూ బండ్లు పక్కపక్కనే ఆపి చెట్టు కిందికి చేరుకున్నారు. సద్ది మూటలు విప్పి తిని చల్లగాలికి పడుకున్నారు. పొద్దున్నుంచీ బాగా అలసిపోయి ఉండడంతో కాసేపటికి తమ్ముడు గురకలు కొడతా నిద్రపోసాగాడు. ఇదే సందు అనుకున్న పెద్దోడు లేచి తన ఎద్దులను తమ్ముని బండికి, తమ్ముని ఎద్దులను తన బండికి మార్చి కట్టాడు. చప్పుడు కాకుండా బండి తోలుకొని ఇంటికి చేరుకున్నాడు.

ధనవంతుని దగ్గరికి పోయి “అయ్యా.. మీరు చెప్పినట్టే బంగారం లాంటి మట్టిని తోటలో వెతికి ఒక చిన్న రాయిగానీ, పుల్లగానీ లేకుండా తీసుకొని వచ్చాను” అన్నాడు. ధనవంతుడు ఆ మట్టిని పరీక్షించి “శభాష్‌ పెద్దోడా.. చెప్పిన పని చెప్పినట్టు చేసుకొచ్చావ్‌. మరి నీ తమ్ముడేది” అన్నాడు. దానికి వాడు “అయ్యా.. మీకు తెలుసు కదా వాడు పెద్ద సోమరిపోతు. తోటకు పోకుండా దారిలో ఉన్న పనికిరాని మట్టంతా ఎత్తి బండిలో నింపుకొని హాయిగా ఒక చెట్టు కింద పడుకొని గురకలు కొడతా ఉన్నాడు” అని చెప్పాడు. ఆ మాటలు వింటూనే ధనవంతునికి కోపం ముంచుకు వచ్చింది. చిన్నోడు ఇంటికి రాగానే బండిలోని మట్టిని చూసి “సిగ్గులేదు కొంచమన్నా.. గాడిదలాగా పెరిగావు. ఏం లాభం. మీ అన్నను చూసి బుద్ధి తెచ్చుకో. నీలాంటి సోమరిపోతు నా దగ్గర ఉండడానికి అస్సలు పనికిరాడు. పో ఇక్కన్నుంచి” అంటూ తిట్టి తరిమేశాడు. పాపం చిన్నోడు దించిన తల ఎత్తకుండా కళ్ళనీళ్ళతో అక్కడినుంచి బయటపడ్డాడు.

చిన్నోడు పని కోసం వెతుక్కుంటా తిరుగుతా వుంటే ఒకచోట సముద్రంలో బయలుదేరుతున్న ఒక పెద్ద ఓడ కనపడింది. చిన్నోడు ఆ ఓడ యజమాని దగ్గరికి పోయి “అయ్యా.. మీరు ఏ పనైనా ఇప్పించండి. పొరపాటున కూడా తల ఎత్తను. ఎదిరించను. మారు మాట్లాడను. చెప్పిన పని చెప్పినట్లు చేస్తాను” అన్నాడు. దానికి ఆ ఓడ యజమాని ‘సరే’ అని లోపలికి రానిచ్చాడు.

చిన్నోడు లోపల యజమాని చెప్పిన పనులన్నీ చేస్తావుంటే ఒకచోట పెద్దోడు కనిపించాడు. అన్నను చూసి వాడు ఆశ్చర్యపోయి “అన్నా.. ఇక్కడ ఉన్నావేమి. ఎప్పుడు వచ్చావు” అన్నాడు. దానికి వాడు తమ్మునితో “ఒరేయ్‌.. నన్ను అందరి ముందు అన్నా అని పిలవకు. ఈ ఓడ యజమాని మన నాన్న మిత్రుడైన ధనవంతునికి మంచి మిత్రుడు. అందుకే నన్ను ఓడకు సలహాదారుగా నియమించాడు. ఇక్కడ నేను ఏది చెబితే అది జరుగుతుంది. నువ్వు నా తమ్మునివి అని తెలిస్తే అందరూ కిందామీదాపడి నవ్వుతారు. నా మర్యాద మట్టిలో కలుస్తుంది” అన్నాడు. చిన్నోడు మౌనంగా బాధగా తల ఊపాడు.

ఓడ పోతూవుంది. ఒకరోజు సముద్రంలో ఒక పెద్ద తుఫాను కుడివైపు నుంచి రాసాగింది. అది ఎవరికీ తెలియదు. అందరూ హాయిగా ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు. ఓడ పైభాగంలో ఉండి సముద్రాన్ని నిరంతరం గమనిస్తూ ఉండాల్సిన పెద్దోడు అదేమీ పట్టించుకోకుండా హాయిగా గురకలు పెట్టి నిద్రపోతా ఉన్నాడు. దాంతో ఓడ నెమ్మది నెమ్మదిగా తుఫానులో చిక్కుకోసాగింది. అలలకు కిందికి మీదికి ఊగసాగింది. గాలికి వానకు లోపల అంతా నీరు చేరసాగింది. అదిచూసి అందరూ భయంతో వణికి పోసాగారు. పెద్దోనికి ఏం చేయాలో, ఓడను ఎటువైపుకు తీసుకుపోవాలో తెలియడం లేదు. ఒకటే కంగారు పడసాగాడు.

అదే సమయంలో ఆ తుఫాను గాలులకి వేగంగా ఎగురుతూ వచ్చిన రెండు పకక్షులు అలసట తీర్చుకోవడం కోసం ఓడ మీద వాలాయి. అందులో ఒక పక్షి మరొక పక్షితో “మనం ఎక్కువసేపు ఈ ఓడలో ఉంటే చావడం ఖాయం. ఈ ఓడ తుఫాను వస్తున్న వైపే దూసుకుపోతుంది. దీనిని నడిపే వానికి కొంచెం కూడా తెలివి ఉన్నట్లు లేదు. తప్పించుకోవాలంటే వెంటనే మనం పడమర దిక్కుకు వెళ్ళిపోవాలి” అంది. వెంటనే ఆ రెండు పకక్షులు తమ బలమంతా ఉపయోగించి పడమర వైపుకు ఎగురుకుంటూ పోయాయి.

అక్కడే ఉన్న చిన్నోడు వాటి మాటలు విన్నాడు. దాంతో పరుగు పరుగున ఓడ యజమాని దగ్గరికి పోయి “అయ్యా.. మనం వెంటనే ఓడను వెనక్కి తిప్పి పడమర వైపుకు వెళ్లాలి. లేకుంటే తీవ్రమైన తుఫానులో చిక్కుకొని చావడం ఖాయం. నన్ను నమ్మండి. మనుషులు అబద్ధాలు చెబుతారు గానీ పక్షులు చెప్పవు” అన్నాడు. యజమాని వెంటనే పడవను పడమర వైపుకు తిప్పి వేగం పెంచమన్నాడు. దాంతో వాళ్లు నాలుగైదు గంటల్లో ఆ ఆపద నుంచి బయటపడ్డారు. యజమాని చానా సంబరపడ్డాడు. చిన్నోడిని ఓడకు సలహాదారుగాగా నియమించి పెద్దోన్ని నీళ్లు అందించే పనివానిగా మార్చాడు. చిన్నోడు జాగ్రత్తగా చుట్టుపక్కల గమనిస్తూ, కంటికి రెప్పవేయకుండా అవసరమైన సలహాలు అందిస్తూ, ఆ ఓడను తీరానికి చేర్చాడు.

ఓడలోని వ్యాపారులందరూ తమ తమ సరుకులు తీసుకుని ఆ రాజ్యంలోకి అడుగు పెట్టారు. సరుకులన్నీ మంచి ధరకు అమ్ముడు పోవడంతో వాళ్లకు చానా లాభాలు వచ్చాయి. దాంతో వాళ్లంతా సంబరంగా తమను తుఫాను నుంచి కాపాడిన చిన్నోనికి తలా కొన్ని బంగారు వరహాలు కానుకగా ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో చూస్తుండగానే ఒక పెద్ద మూట తయారయింది. చిన్నోడు ఆ వరహాలతో ఆ దేశంలోనే ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఉండిపోవాలి అనుకున్నాడు. పెద్దోడు కూడా వేరే దారి లేక తమ్ముని దగ్గరే చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తూ అక్కడే ఉండిపోయాడు.

ఆ రాజ్యంలో కాకుల సంఖ్య చానా ఎక్కువ. చూస్తుండగానే అవి రోజురోజుకీ పెరిగిపోసాగాయి. ఏ చెట్టు మీద చూసినా, ఇంటి మీద చూసినా కాకులే కనబడేవి. రాత్రింబవళ్లు సందు లేకుండా ‘కా.. కా..’ అనే అరుపులతో రాజ్యమంతా దద్దరిల్లిపోయేది. ఆ అరుపులకు రాజుకు అస్సలు నిద్ర పట్టేది కాదు. పిచ్చి పట్టినట్టుగా వుండేది. దాంతో “ఎవరైతే రాజ్యంలో కాకుల బెడద తప్పిస్తారో వాళ్లకి రాజ్యంలో సగభాగం ఇవ్వడంతో పాటు తన కూతురిని కూడా ఇచ్చి పెళ్లి జరిపిస్తానని” దండోరా వేయించాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నించారు గానీ కాకుల బెడద కొంచెం కూడా తగ్గించలేకపోయారు.

పెద్దోడు చుట్టుపక్కల ఊర్లలోని పిల్లులన్నీ పట్టుకొచ్చి రాజ్యమంతా వదిలాడు. అవి కనపడిన కాకులను కనపడినట్లు వెంటపడి చంపసాగాయి. దాంతో కాకులన్నీ భయపడి చెల్లాచెదురు కాసాగాయి. దాంతో “హమ్మయ్య ఈ కాకుల పీడ తొలిగిపోతుందిలే” అనుకున్నాడు రాజు. కానీ ఆ కాకులు పోయినట్టే పోయి ఎక్కడెక్కడి వాటి బంధువులను, స్నేహితులను అన్నింటిని పిలుచుకొని మరలా వచ్చాయి. ఒక్కసారిగా పిల్లుల మీద దాడి చేసి తమ వాడి వాడి ముక్కులతో పొడవసాగాయి. అంతే వాటి దెబ్బకు తట్టుకోలేక అవన్నీ బెదిరిపోయి దిక్కుకొకటి పుట్టకొకటి చెల్లాచెదురై పక్కనే ఉన్న అడవుల్లోకి పారిపోయాయి. దాంతో కాకుల గోల మరలా మొదటికి వచ్చింది.

చిన్నోడు ఈ కాకుల గోల ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ వుంటే ఒక మామిడిచెట్టు మీద రెండు చిలుకలు మాట్లాడుకుంటా కనపడ్డాయి. ‘అవి ఏం మాట్లాడుకుంటున్నాయా’ అని వినసాగాడు.

“బావా.. ఈ ఊరిలో కాకులకే తిండి సరిపోవడం లేదు. ఇంక మనకి ఎక్కడ దొరుకుతుంది. వేరే చోటికి వెళ్లిపోదాం పద” అంది ఆడ చిలుక.

“అవును మరదలా.. ఈ కాకులు పోతే గానీ మనలాంటి మిగతా పకక్షులకు ఇక్కడ ఆహారం దొరకదు” అంది మగచిలుక.

“అసలు ఈ కాకుల బెడద ఎప్పటికైనా పోతుందంటావా ఈ రాజ్యానికి” అంది ఆడ చిలుక.

“ఎందుకు పోదు. ఏదైనా బతకాలంటే తిండి కావాలి. ఆ తిండి దొరక్కుండా చేస్తే చాలు అవే పోతాయి” అంది మగచిలుక.

ఆ మాటలు వింటూ వుంటే చిన్నోనికి ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. వెంటనే రాజు దగ్గరికి పోయాడు. “రాజా.. మన రాజ్యం ఎక్కడ చూసినా పచ్చని పంటలతో, చక్కని వ్యాపారాలతో కలకలలాడి పోతూవుంది. దాంతో ప్రజలు చేతినిండా ధనంతో రకరకాల తిండి పదార్థాలు చేసుకొని సగం తిని మిగిలినవి బయట పారవేస్తున్నారు. కడుపునిండా తిండి దొరుకుతుండడంతో ఎక్కడెక్కడి కాకులన్నీ ఇక్కడికే చేరుకుంటున్నాయి. కాబట్టి ఒక నెల రోజులు రాజ్యంలో ఎవరూ ఒక్క అన్నం మెతుకు కూడా బయట పడవేయకూడదనీ, ధాన్యం అంతా దాచి పెట్టాలనీ, చెట్లకాయలన్నీ తెంపేయాలనీ, పంటలు కోసి భద్రపరచాలనీ ఆజ్ఞాపించండి. ఒక్క మెతుకు బయట కనపడినా వంద కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తామని బెదిరించండి” అన్నాడు. రాజు అలాగేనని సైనికులను పిలిచి “వెళ్ళండి.. ఇంటింటికి వెళ్లి తలుపు కొట్టి మరీ హెచ్చరించండి” అని ఆజ్ఞాపించాడు.

దాంతో ఇళ్ళ తలుపులన్నీ ఎక్కడివక్కడ మూసుకుపోయాయి. మనుషులు బయట తిరగడం మానేశారు. సరిపోయినంతనే వంట చేసుకోసాగారు. ఒక్క గింజ కూడా బయట కనపడకుండా దాచేశారు. అంతే.. ఒక్కసారిగా తిండి దొరకడం ఆగిపోయేసరికి కాకులన్నీ ఆకలితో అల్లాడిపోసాగాయి. ఒక్కొక్కటి ఆహారం కోసం వెతుక్కుంటూ రాజ్యం వదిలి వెళ్లిపోసాగాయి. వారం తిరిగేసరికి రాజ్యంలో ఒక్క కాకి కూడా లేదు. అన్నీ మాయమైపోయాయి.

అదిచూసి రాజు చానా సంబరపడ్డాడు. ఇచ్చిన మాట ప్రకారం సగం రాజ్యంతో పాటు తన కూతురిని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లికి చిన్నోడు పెద్దోనితో పాటు అమ్మానాన్నలను కూడా పిలిపించాడు. సింహాసనం మీద కూర్చున్న కొడుకును చూసి తండ్రి “ఒరేయ్‌ చిన్నోడా.. పక్షులు చెప్పిన మాటలు నిజమేరా. అబద్దాలు చెప్పేవాళ్లు, అవినీతికి పాల్పడేవాళ్లు కలకాలం విజయం సాధించలేరు. ఎప్పటికైనా విజయం మంచివాళ్లదే. నీలాంటి మంచి మనసు కలిగిన వాళ్ళు కొంతమందన్నా ఉన్నందువల్లే ఈ భూమ్మీద వానలు పడుతా ఉన్నాయి. పంటలు పండుతా ఉన్నాయి. కడుపుకింత తిండి దొరుకుతా వుంది. ఇలాగే కలకాలం హాయిగా దయతో, మంచి మనసుతో బ్రతుకు” అంటూ కొడుకును మెచ్చుకున్నాడు.

Exit mobile version