[కార్మికులపై శ్రీమతి శైలజామిత్ర రచించిన ‘చెమట తవసాన’ అనే దీర్ఘ కవితని అందిస్తున్నాము. ఇది 5వ భాగం.]
15.
తన బిడ్డ వేసిన రేఖలో
తనే గమ్యం అన్న భావం తెగులుగా పరవశిస్తుంది.
బలహీనమైన ఆంక్షల్లో కూడా
తన ఆశల కిరణాలు పదే పదే లయంగా విరుస్తుంటాయి.
తన భార్య ఆరగించే చివరి ముద్ద
అతడికి ఒళ్లు నిండా ఆత్మగౌరవంలా అనిపిస్తుంది.
తన పని చేతుల్లో చక్కదిద్దిన మంచం
వాడు ఎన్నడూ నిద్రపోని విశ్రాంతిగా కనిపిస్తుంది.
చిన్న కలలు అతడి గుండె కొట్టుకునే బాణాసూర్యాలు
బహుమూల్యమైనవి అయినా
ప్రపంచం వాటి వెలకట్టదు.
వాటి వెల కేవలం
తన శ్వాసల్లో కనిపించే ఓ చిన్న దీపాలా వెలిగిపోతుంది.
వాడు ఎప్పుడూ సెల్ఫీ తీసుకోడు,
కానీ తన పిల్లల పాఠశాల ఫోటోలో
తన కన్నీరు మసకబారిన వెలుగు రూపంగా నిలుస్తుంది.
తన చేతుల్లో మట్టితో చేసి మలచిన గోడలు
తన కలలే గోడలుగా మారాలని తపించేవాడు.
పిల్లల చేతుల్లోని పెన్సిల్ –
తన చేతుల్లో త్రుప్పైపోయిన చేతన్ పరికరానికి
ఒక పునర్జన్మ ఇవ్వడమే.
తన కలలు పక్కింటి వాడికి చిరునవ్వులా కనిపించొచ్చు,
కానీ ఇతడు వాటిని తన తల్లిపాలలా భావిస్తాడు.
చిన్న కలలే –
అతడిని దేవుడిలా తల్లడిల్లే జీవిగా మలుస్తాయి.
ప్రతి రాత్రి నిద్రకి ముందూ
తన గుండె అడిగేది ఒక్కటే –
“రేపు బిడ్డ నవ్వుతాడా?”
అదే ప్రశ్న తన జీవితానికి ధ్యానం, తపస్సు, నామస్మరణ.
16
తలెత్తితే తప్పు,
ప్రశ్నిస్తే శిక్ష.
శ్రమ శాంతంగా ఉండాలన్న నిబంధన
అతడి గొంతుకకి తాళం వేస్తుంది.
వాడు మాట్లాడకూడదు, వినిపించకూడదు-
ఇలా చెప్పేవారు
తన కోసం గొంతెత్తిన వారిని
ఉద్యోగం కోల్పోయేలా చేశారు.
నిశ్శబ్దం అతడి శత్రువు కాదు –
కానీ స్వేచ్ఛ కూడా కాదు.
అది అతడి కుటుంబాన్ని కాపాడే వలయంలా –
కానీ అతడు ఆ వలయంలో బందివానిలా.
తన మాట ఒక పిలుపు కాదు –
ఒక ప్రమాద సంకేతంగా భావించబడుతుంది.
అతడే కదలాలి, అతడే మోయాలి –
కానీ మాట్లాడకూడదు.
తన శ్వాసే ఒక నేరంలా మారిన సమయంలో –
మౌనం తప్ప ఇతడికి మరో ఆయుధం లేదు.
తన నిశ్శబ్దం అతడి పిల్లల భవిష్యత్తు మీద సర్దిన నీడ.
మాటల్ని ఆపుకోవడమే –
కడుపు నిండిరచే తొలి అర్హతగా మారింది.
ఆ నిశ్శబ్దం –
వేడిగా కడుతున్న మట్టిలో దాగిన
తన చెలిమి.
ఆయన గొంతు గల్లీచప్పుడు కాదు –
దానికి ఓపు లేదు.
పని చేసేప్పుడే వినిపించే శబ్దం-
తన ఉనికి మిగిలిన గుర్తుగా మిగిలిపోతుంది.
ఒక్కసారి మాట్లాడితే,
ఆ దబ్బూ పోతుంది.
ఒక్కసారి న్యాయం అడిగితే,
తన పిలవకుండానే ఇంటి దగ్గర ఆకలి అల్లరిచేస్తుంది.
అందుకే –
తన మౌనం అతడి ఇంటి గోడలకంటే బలమైనది,
తన నిశ్శబ్దం అతడి బతుకులో
ఓ తంత్రంగా, ఓ తపస్సుగా,
ఓ తలదించిన ధైర్యంగా నిలిచిపోతుంది.
17.
ఒకే నగరంలో
ఒకవైపు కాఫీ షాపులు,
ఇంకోవైపు వాడిన అన్నం.
ఒకవైపు మల్లెల పరిమళం,
ఇంకోవైపు చెమట వాసన.
ఇతడు నడుస్తున్నాడు –
ఇదే నగరంలో, కాని మధ్య గోడల నీడలో.
తన జీవితం తెర వెనుక నడిచే కథ –
ఎప్పుడూ మిగిలిపోతుంది –
కేవలం నేపథ్య సంగీతంగా మాత్రమే.
ఒకవైపు శ్వేతకల్చర్ కార్యాలయాలు,
ఇంకోవైపు కాలిన చేతులకు మాసిన బట్టలు.
ఒకవైపు వాహనాల వేగం,
ఇంకోవైపు పాదాల నెమ్మది.
వాడు నడిచే రోడ్డు –
వేగవంతమైన కార్లకు అడ్డుకాదు,
కానీ అతడి అడుగులు మాత్రం
వారి బూట్ల కింద మిగిలిపోతాయి.
ఒకవైపు లిఫ్ట్లో పైకెళ్లే కార్పొరేట్ ఉద్యోగి,
ఇంకోవైపు మెట్లమీద పడిపడిన కూలీ శరీరం.
ఒకవైపు సెల్ఫీలకు వెలుగులు,
ఇంకోవైపు తన నలుపు మూలిగిన కార్నర్లో నిర్భాగ్యపు నీడ.
నగరం అతడి పుట్టుకని గుర్తించదు –
కానీ అతడు మోసిన ఇటుకల మీదే
ఆ నగరం ఒళ్లు నిమిరింది.
ఒక ఇంటి గోడమీద అతడు వాలిన చోట
ఆ ఇంటి పేరు లేదు,
కానీ ఆ గోడకి ప్రాణం అతడి వెన్నెముక.
వాడు చూసే స్వప్నాలపై
ఈ నగరం పెద్ద బిల్బోర్డ్లు వేసుకుంది,
అతడు తనే ఎప్పటికీ
చివరి వరుసలోనుండే చూస్తూ మిగిలిపోయాడు.
నగరం పెరుగుతుంటే –
అతడి నీడ మాత్రం
చిట్టడివేలు గడిపే ఒక మూలలో పడిపోతుంది.
తన బతుకే అసమానతల మూడో పాఠం –
ఏ పాఠశాలా నేర్పించలేని నిజంగా మారింది.
18.
కూడలిలో.
కూలిన భవనంలో
ఒక శరీరం మౌనంగా మట్టిలో కరిగిపోయింది-
నిర్మాణానికి బలికావాల్సిన బ్రతుకు
ఇట్టే శబ్దం లేకుండా పాతాళంలో పడ్డాడు.
చెట్టుకింద వదిలిపెట్టిన భోజనం –
ఆవిరైపోయిన ఆశల ఉప్పుగిన్నె.
అతని చేతులలో వేసిన ముద్రలు మాత్రమే
చదవలేని అక్షరాలుగా మిగిలిపోయాయి.
ఒక జీత రశీదు –
ఒక చెరుకుపై రాసిన కుటుంబ చరిత్రలా
ఆమె చీరలో బిగుదుగా కట్టబడి ఉంది.
అది వాస్తవానికి జీతం కాదు –
ఒక కుటుంబం బతికిన/చనిపోయిన తీర్పు పత్రిక.
ఈ నిశ్శబ్ద శ్మశానపు మధ్య
తన మౌన గుండెలో నలిగిన గుభాళింపు వినిపిస్తుంది:
“మనం బతకడానికి చచ్చిపోతున్నాం..”
ఈ మాట-
రాళ్ల మధ్య పుట్టిన దాహం,
ధూళితో కప్పబడిన దీపం,
దేహమంతా తగలేసినా గుండెలో మిగిలిపోయే తాపం.
కానీ
అదే భస్మంలోని ధైర్యంతో
ఇతడు మళ్లీ నలిగిన రాళ్ల మధ్య నుంచి వెలుగు తవ్వుతాడు.
బయట పడే ప్రతి ఇనుప ముక్కలో
తన పిల్లల నవ్వు చూసి,
ముళ్ల గుబుర్లో పెట్టె మల్లిగా మార్చుతాడు.
కనిపించని భయాల గుంతల మధ్య –
తన కడుపు కాదు,
తన పిల్లల ఆకలే అతడి జీవిత లక్ష్యం.
ఆశ ఒక తాడిలా
ఆ గోఫాన గడ్డిపైనుంచి ఊగిపోతున్నా –
అతడు దాన్ని గట్టిగా పట్టుకుని
బయటికి బతుకు బిందెలు తీసుకొస్తున్నాడు.
రాత్రి నిద్రపోకపోయినా
తన కలల కన్నీరు తడిపిన మట్టి మాత్రం ఎండదు.
ఆ మట్టిలోంచే
వాడు తవ్విన ఆశల బావి –
పొదిగిన చీకట్లోనూ తేజస్సుతో వెలిగి పోతాడు.
చాలాసార్లు అతడు
బతికే శ్మశానంలో దూడపాలు తాగిన పిల్లను చూసినప్పుడు
ఓ కొత్త పుట్టుకను ఊహిస్తాడు
తన శ్రమ లోంచే పుట్టే శాంతి స్వరం.
ఆశలకే చితికిపోయే జీవితంలో
ఆత్మవిశ్వాసమే అతడి దీక్షగా మారుతుంది.
బయట పడే ప్రతి ఇనుప శబ్దం వెనక
అతడి చలించిన శరీరం ఒక ప్రాణపు పొగవలే
వికసిస్తుంది.
తన చేతుల్లో పగిలిన పళ్లు,
తన మొహంలో మాడిన వెలుగు –
అది భయం కాదు
శత్రువులకీ వినిపించని సంకేతాలే అవి –
అతడు ఇంకా తవ్వుతూనే ఉన్నాడన్న నిజానికి.
చీకటి గదిలోనూ –
తన గుండె గోడలపై
బిడ్డల నవ్వుల తొమ్మిది రూపాలు లయబద్ధంగా మెరుస్తుంటాయి.
అతడు అక్కడే –
శబ్దం చేయకుండా
ఆ నవ్వులకే బతుకుని నైవేద్యంగా అర్పిస్తున్నాడు.
ఇతడి గుండె
ఒక కొలతలేని గది.
ఎన్ని ఆశలు కోల్పోయినా
ఎన్ని ఆహారాలు దొరకకపోయినా
దాని తలుపు మూసుకోలేదు.
మట్టి మీద పడిపోతే
దేహమే కాదు, దాహమూ గాయపడుతుంది.
కానీ అదే మట్టిలో
తన నయనం రాల్చిన ప్రతీ చెమట బిందువు
ఒక కొత్త పుష్పంగా పుట్టే శక్తిని జోడిస్తుంది.
ఆయన బతకడం కోసం మట్టిని తవ్వడం కాదు,
ఆశల కోసం అంధకారాన్ని తొలగించడమే.
ఒక రాత్రి అతడి కడుపు నిండకపోయినా
ఒక ఉదయం బిడ్డ పాఠశాలకి వెళ్ళినపుడు –
పెట్టె అన్నం ముద్ద ప్రపంచం తినే ఆత్మకథగా మారిపోతుంది.
(ఇంకా ఉంది)
శైలజా మిత్ర 1966, జనవరి 15 వ తారీఖున చిన్నగొట్టిగల్లు గ్రామం, చిత్తూరు జిల్లాలో జన్మించారు. వీరు ఎం.ఏ. తెలుగు (ఉస్మానియా విశ్వవిద్యాలయం), ఆంగ్లంలో ఎం.ఏ. (వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) తిరుపతిలో, జర్నలిజం (రచన జర్నలిజం కాలేజీ, హైదరాబాద్లో పీజీ డిప్లొమా చేసారు. నేటినిజం అనే డైలీ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా దాదాపు 10 సంవత్సరాలు; అల్ ఇండియా రేడియో, ఎఫ్.ఎం.లో డీఈవోగా 3 సంవత్సరాలు, వెలుగు పత్రికలో అడ్మినిస్ట్రేటర్గా ఐదు సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం విమల సాహితి వెబ్ పత్రిక ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.
వీరి సాహితీ జీవితం 1995లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 11 కవితా సంపుటాలు, 4 కథా సంపుటాలు, 4 నవలలు, 12 అనువాదాలు రచించారు. 775 పుస్తక సమీక్షలు, 29 భక్తి–సామాజిక వ్యాసాలు, 11 ఇంటర్వ్యూలు, భావతరంగిణిలో 26 సాహితీ లేఖలు ప్రచురించారు. సాహిత్య ప్రస్థానంలో దాదాపు యాభైకి పైగా అవార్డులు అందుకున్న శైలజా మిత్రగారికి ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయితగా ‘కీర్తి పురస్కారం’ ప్రదానం చేసింది. ఉత్తమ విమర్శకురాలుగా అమృతలత గారి ‘అపురూప పురస్కారం’ పొందారు. వీరు రచించిన ‘రాతిచిగుళ్ళు’ కవితాసంపుటికి ‘ఉమ్మడిశెట్టి’ మరియు ‘శ్రీశ్రీ’ ఉత్తమగ్రంథ పురస్కారాలు లభించాయి. ఆల్ ఇండియా లాంగ్వేజ్ అండ్ లిటరరీ కాన్ఫరెన్స్ వారు ప్రతిష్ఠాత్మక ‘సాహిత్యశ్రీ’ బిరుదు ప్రదానం చేశారు.
