[కార్మికులపై శ్రీమతి శైలజామిత్ర రచించిన ‘చెమట తవసాన’ అనే దీర్ఘ కవితని అందిస్తున్నాము. ఇది 2వ భాగం.]
3.
బస్సులో అతడి ఒడిలో కూర్చునేది చెమట,
చొక్కాలో పేరుకుపోయేది నిద్రలేని రాత్రుల వాసన.
కాంక్రీట్ దుమ్ము ఊపిరిగా
ఇతడి ముక్కులోకి ప్రవేశించి, ఆశల్ని మూటగట్టేస్తుంది.
వెళ్లవెళ్లగా వచ్చే గాలిలో
అతడు ఓ చెరువు తరాలా వణుకుతాడు,
పాదాలకింద మట్టిలో కనిపించని తడులు
అతని కాళ్లచివరకు జాడలుగా వొలుస్తుంటాయి.
ఇతడు ఎక్కడికి వెళ్తున్నాడు అనే ప్రశ్నకు
పట్టణం తలవంచుతుంది.
అతడు వెళ్తున్న దారిలో
తన శ్వాస మించిన నిర్మాణం ఏమీలేదు.
బస్సు జనంతో నిండితే
తన స్థానం చెమటపారెడు మట్టిగా మారుతుంది.
పక్కవారెవరో మాటాడుతున్నా,
అతడికివ్వదా సమాధానం
ఆయన లోపల తలపులే ఘర్షణ పడుతుంటాయి.
కళ్ళలో ఉండేది నిర్మాణాల తలరాతలు,
కానీ గుండెల్లో మాత్రం
గుర్రం ఎక్కే తన కొడుకుకు పత్తిపల్లె దారిలో
ఒక ఊతం కూడలిని నిర్మించాలన్న తపన.
చాకిరీ నుంచి వస్తే
తల దించుకున్న ఇంటి గోడలమీద
చీకటి అడుగులు వేస్తుంది.
వేళ్ల మధ్య చిక్కుకున్న మట్టి,
నిరంతరంగా గిన్నెల్లోకి జారే దుప్పి నీరు
ఇవన్నీ అతడి జీవన భాష్యాలు.
తన ఇంట్లో మాటలు గోడలపైనే పలికిపోతాయి,
మాతృభాష కన్నా ఎక్కువ
అతడు వినేది పనిదారుల గర్జన.
చూసింది గొప్ప మేడలే కానీ
తన చేతుల్లో పగిలిన ఇటుకల ఒలువు ఎవరూ చూడలేదు.
చెక్కగడుల వెనుక మూలుగే శ్వాసకు
పట్టణపు గాలి అసలు సంతోషించదు.
మూసుకున్న తన కళ్ళు
పూర్తిగా మూసుకుండవు
తన ముసలితనపు కలలలో కూడా
ఇటుకలు పేర్చుకుంటూనే ఉంటాయి
4.
చెమట మింగిన భవంతులు ఎవరివి
ఇతడు తడిపిన గోడలు మెరిసిపోతున్నా
తన పేరు మాత్రం మట్టిలో కలిసిపోయింది.
ఇనుప మెట్లపై ఎక్కే అతడి ఒడుపు
ఆకాశాన్ని తాకినప్పటికీ
తన దారికే వెనుతిరిగి వస్తుంది.
గలగల మేడలు అతడి చెమటతో కట్టబడ్డాయి,
వాటిపై అతడి అడుగుజాడ వుండదు.
మేడల చాపల మధ్య
తన గొంతు మౌనంగా దాగిపోతుంది.
ఇతడు మోసినవి కేవలం ఇటుకల భారం కాదు
ఆశల ఆకారాలూ,
జీవితానికి వేస్తున్న వేదికలూ,
చిన్నతనపు కలల నుండి బరువెరిగిన వయస్సుల వరకూ
తన భుజాలపై వేసిన ఊహల నదుల పల్లకీలు.
ఇటుకల గుండెల్లో దాగిన గాత్రాలు
పగుళ్లలోంచి వెనకటి పాటలలా వినిపిస్తాయి;
ఆ పాటలు ఆయన ఒంటరి లయను తాకుతుంటే
సిమెంట్ ఘాటులో అతని కన్నీటి ఉప్పుడి రుచి గోచరిస్తుంది.
వేడిమికీ, వర్షానికీ, వానకూలీకి మధ్య
తన శరీరాన్ని కాల్చుకున్నాడు
మరెవరి ఇంటి వాతపకల కోసం.
తన ఇంటికైతే నాలుగు గోడల కలే కలిగింది
అది కూడా వడ్డీలు మింగిన గుళిక.
ఒక్కసారి కూడా ఎవడూ అడగలేదు
“ఇతడు ఎవరు?” అని,
“అతని చెమటకి పేరు ఏమిటి?” అని.
తనకు లేదే పేరు, లేదే చిరునామా
అతడు ఒక అవసరం,
ఒక సమయం ముగిసిన వెంటనే మరచిపోబడే నైమితికం.
అతడు పోయిన తర్వాత గోడలు నిలుస్తాయి,
మేడలు మెరుస్తాయి,
కానీ గాలి మాత్రం అతడి శ్వాసను వెతుకుతుంది.
చిమ్మిన మట్టిలోంచి పొంగిన గొంతు
ఏదో ముడిపడి ఎత్తుగా మొలుస్తోంది
“ఇవేనా నీ మహా నిర్మాణాలు?” అని
ప్రశ్నించేలా, ఎదురు నిలిచేలా.
5.
తలనుంచి పాదాల వరకు
ఒక శ్రమ గీతా రేఖ వేసినట్టు ఉంటుంది.
ఆ గీతల మధ్య
చిన్నగా పగిలిన సిమెంట్ సంచులు కనిపిస్తాయి.
ఒక శ్రమ గీతా రేఖ వేసినట్టు ఉంటుంది.
ఆ గీతల మధ్య
చిన్నగా పగిలిన సిమెంట్ సంచులు కనిపిస్తాయి.
చేతుల్లో పగుళ్లు,
కాలుల్లో మంట,
గుండెల్లో వణుకు –
పెన్షన్ కోసం కాదుగానీ
ఇప్పటి బతుకుని మించిపోకుండా ఆపేందుకు.
శ్రమకు వయస్సు లేదు,
శ్రమకు సెలవు లేదు.
ఆమె కడుపు నిండకముందే-
అతడు మట్టిని మోస్తున్నాడు.
తొలికిరణమే పనిగంటగా మారిన ఉదయం,
చీకటిలోనే గుడిసె తలుపు తట్టి
మరో ప్రహసనానికి బయలుదేరిన జీవం అతను.
తన చేతికొచ్చేది లేబర్ కొల –
కానీ తన నుంచి పోతుంది కాల జీవితం.
పట్టణం లెక్కలు వేసిన దూరాలను
అతడు అడుగులతో కొలుస్తున్నాడు.
రాయి కాదు ఆశల బరువే మోస్తున్నాడు,
ఇటుక కాదు భవిష్యత్ మౌన గుళ్లను నిర్మిస్తున్నాడు.
వాడు కూలి కాదు
ఒక దేశపు మూలాధారం,
ఒక నిశ్శబ్ద శిల్పి.
అతడికెవ్వరూ కవిత రాయరు,
ఆయనకు బహుమతులూ రావు,
కానీ అతడి నడక మీదే
నగరాల గర్వం నడుస్తోంది.
ఆకలి ఆగదు, కానీ గుండె ఆగదు.
చాలామంది బతుకులు గోడల మధ్య నవ్వినా,
ఆ గోడల వెనుక అతడి ఆర్తనాదం
ఇప్పటికీ మార్బిళ్ల మధ్య మెరుస్తూనే ఉంది
(ఇంకా ఉంది)
శైలజా మిత్ర 1966, జనవరి 15 వ తారీఖున చిన్నగొట్టిగల్లు గ్రామం, చిత్తూరు జిల్లాలో జన్మించారు. వీరు ఎం.ఏ. తెలుగు (ఉస్మానియా విశ్వవిద్యాలయం), ఆంగ్లంలో ఎం.ఏ. (వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) తిరుపతిలో, జర్నలిజం (రచన జర్నలిజం కాలేజీ, హైదరాబాద్లో పీజీ డిప్లొమా చేసారు. నేటినిజం అనే డైలీ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా దాదాపు 10 సంవత్సరాలు; అల్ ఇండియా రేడియో, ఎఫ్.ఎం.లో డీఈవోగా 3 సంవత్సరాలు, వెలుగు పత్రికలో అడ్మినిస్ట్రేటర్గా ఐదు సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం విమల సాహితి వెబ్ పత్రిక ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.
వీరి సాహితీ జీవితం 1995లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 11 కవితా సంపుటాలు, 4 కథా సంపుటాలు, 4 నవలలు, 12 అనువాదాలు రచించారు. 775 పుస్తక సమీక్షలు, 29 భక్తి–సామాజిక వ్యాసాలు, 11 ఇంటర్వ్యూలు, భావతరంగిణిలో 26 సాహితీ లేఖలు ప్రచురించారు. సాహిత్య ప్రస్థానంలో దాదాపు యాభైకి పైగా అవార్డులు అందుకున్న శైలజా మిత్రగారికి ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయితగా ‘కీర్తి పురస్కారం’ ప్రదానం చేసింది. ఉత్తమ విమర్శకురాలుగా అమృతలత గారి ‘అపురూప పురస్కారం’ పొందారు. వీరు రచించిన ‘రాతిచిగుళ్ళు’ కవితాసంపుటికి ‘ఉమ్మడిశెట్టి’ మరియు ‘శ్రీశ్రీ’ ఉత్తమగ్రంథ పురస్కారాలు లభించాయి. ఆల్ ఇండియా లాంగ్వేజ్ అండ్ లిటరరీ కాన్ఫరెన్స్ వారు ప్రతిష్ఠాత్మక ‘సాహిత్యశ్రీ’ బిరుదు ప్రదానం చేశారు.