[శ్రీ బివివి ప్రసాద్ రచించిన ‘చీకటి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
చీకటి క్రమ్ముతుంది, నక్షత్రాల కంబళి విప్పుకొని,
విశాల గగనం నుండి వీధుల్లోకి దిగుతుంది,
వీధుల్లోంచి గదుల్లోకి చొరబడుతుంది
చీకటిని ప్రేమగా పలకరిస్తాయి
వీధుల్లో, గదుల్లో వెలిగే దీపాలు,
దీపాలలో వెలిగే హృదయాలు,
హృదయాల్లో వెలిగే జీవనానందాలు
ఇక, చీకటి వరద పోటెత్తిన నదిలా
కమ్ముతుంది నిన్నూ, నన్నూ,
మనం మిగుల్చుకున్న నేనునూ, నాదినీ
నల్లని చీకటి, దేహాన్ని అంటీ అంటని చీకటి,
చూపుల్ని కప్పీ, కప్పని చీకటి,
నీకు శాంతిని ఇచ్చీ, ఇవ్వని చీకటి,
నిండైన ఏకాంతాన్ని కానుక చేసే చీకటి
అప్పుడంటావు దేవుడితో
“దుఃఖ భూయిష్టమైన పగళ్ళు ఎందుకు తండ్రీ,
జీవితమంతా చీకటితో నింపు”
ఆయన నవ్వుతూ అంటారు
“నువు చూసే పగలు కూడా చీకటిలోనిదే,
కన్నా, ఈ చీకటి అంతకీ వెలుగు నువ్వే”