[కస్తూరి మురళీకృష్ణ అందిస్తున్న ‘చరిత్ర విశ్లేషణ – అంబేద్కర్ దృక్కోణం’ అనే వ్యాసపరంపర.]
“I want to impress upon you is that Manu did not give the law of Caste and that he could not do so. Caste existed long before Manu. He was an upholder of it and therefore philosophized about it, but certainly he did not and could not ordain the present order of Hindu Society.”
(Dr. Babasaheb Ambedkar Writings and Speeches, Vol. 1, Page No.16)
తన దృక్కోణంలో చరిత్రను విశ్లేషించేందుకు అంబేద్కర్ ప్రాచీన గ్రంథాలను విశ్లేషించారు. ఆయన భారతీయ సమాజంలో ‘అంటరానితనం’ ఆవిర్భావానికి చారిత్రిక కారణాలు అన్వేషించారు. జాతి భేదాల వల్ల అంటరానితనం ఆరంభమయిందన్న వాదనను ఆయన తిరస్కరించారు. ఆయన ‘Broken Men’ సిద్ధాంతాన్ని అంటరానితనం ఆవిర్భావానికి కారణంగా భావించారు.
ప్రాచీన కాలంలో రెండు తెగల నడుమ యుద్ధం జరిగినప్పుడు, ఓడిపోయిన తెగలవారు ఆత్మవిశ్వాసం కోల్పోయి ‘broken men’ అయ్యేవారు. ఈ ‘broken men’ వారసులే అంటరానివారిగా గుర్తింపు పొందేవారు అన్నది అంబేద్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం.
ఈ సిద్ధాంతానికి ఆధారాలు లభించవు. కానీ ఇతర సమాజాల పరిశీలన, శాస్త్రాల అధ్యయనం, భారతీయ సామాజిక పరిస్థితుల అధ్యయనం, పోల్చటం ద్వారా ఆయన తన సిద్ధాంతం సమర్థనకు ఉదాహరణలు చూపించారు. ‘Broken Men’ అంటరానివారిగా మారేరనటానికి మామూలు ఆధారాలు లేవు. కానీ అంటరానితనం ‘చిహ్నాలు’, అగ్రవర్ణల వారి చిహ్నాలకు భిన్నమైనవి. అలాగే, ‘అంత్యజ’ అన్న పదంలో ‘అంత్య’ అంటే గ్రామానికి ఆవల నివసించేవారని అర్థం చెప్తారు. మహారాష్ట్రలో ‘మహర్లు’ గ్రామం వెలుపల నివసించేవారు. ‘మహర్ల’తో గ్రామంతో ఉన్న ‘బలూటా’ ఒప్పందం కూడా అయన ఒక ఆధారంగా ఎంచుకున్నారు. గ్రామంలో నిర్దిష్టమైన విధులు నిర్వహించినందుకు వారికి కొన్ని హక్కులు లభించేవి. ఇది కేవలం మహారాష్ట్రలోనే కాదు, దేశంలోని పలు ప్రాంతాలలో అగ్రవర్ణాల వారికి, అంటరానివారికి మధ్య ఇలాంటి ‘పరస్పర సహకార ఒప్పందాలు’ ఉండడం కూడా తన సిద్ధాంతానికి ఆధారంగా బావించారు అంబేద్కర్. తాను ప్రతిపాదించిన ‘Broken Men’ సిద్ధాంతానికి సమర్థనగా ఐరిష్, వెల్ష్ గ్రామాలను చూపించారు.
బౌద్ధులకూ, బ్రాహ్మణులకూ నడుమ వైరం ఉండేదని, అంటరానివారిలో అధిక శాతం బౌద్ధులే అని ఆయన ‘అప్రత్యక్ష సాక్ష్యం’ లేక ‘ప్రాసంగిక సాక్ష్యం’ (circumstantial evidence) చూపారు. అయితే బ్రాహ్మణులు అంటరానివారిని దుశ్శకునంగా భావిస్తే, అంటరానివారు బ్రాహ్మణులను దుశ్శకునంగా భావించేవారు. దీన్ని బౌద్ధులు ‘broken men’ అనేందుకు సాక్ష్యంగా చూపారు. బ్రాహ్మణులు, బౌద్ధుల నడుమ ద్వేషభావనలుండేవని, ఇందుకు ‘మృచ్ఛకటికం’ వంటి నాటకాలలోని సంఘటలను సాక్ష్యంగా చూపారు. ఇలా సత్యాన్ని వివరణ, నిరూపణల నుండి వేరు చేయకూడదన్న E.H. Carr సిద్ధాంతాన్ని అంబేద్కర్ పాటించారు.
ఎలాంటి ఆధారాలు, కనీసం శాస్త్రాలు, కావ్యాలలో కూడా ఆధారాలు దొరకని ఆర్య సిద్ధాంతాన్ని అంబేద్కర్ ఆమోదించలేదు. ఆ సిద్ధాంతాన్ని ఆయన ‘perversion of scientific investigation’ అన్నారు. ఎందుకంటే, ఆర్యజాతి సిద్ధాంతం అనేది ‘preconceived selected facts’ ఆధారంగా నిరూపించారన్నది ఆయన అభిప్రాయం. అంటే అంబేద్కర్ దృక్కోణంలో చరిత్రను విశ్లేషించేవారు ముందుగా ఆమోదించకూడనిది, ఖండించాల్సింది ఆర్య జాతి సిద్ధాంతం అన్నమాట! ఆర్యజాతి సిద్ధాంతాన్ని అంబేద్కర్ poison of science అన్నారు. తమది అంబేద్కర్ దృక్కోణం అని చెప్పుకునేవారు ఇది గమనించాలి. ఎలా రాస్తే తమకు లాభమో, పదిమంది ఆమోదం పొందుతుందో, అలా రాసేసి తమది అంబేద్కర్ దృక్కోణం అని చెప్పుకునేవారి అసలు రూపును ప్రదర్శిస్తుందీ ఆర్యజాతి సిధ్దాంతంపట్ల వారి అభిప్రాయం.
అంబేద్కర్ దృక్కోణంలో చరిత్ర విశ్లేషణ చేసేవారు ప్రథమంగా ఆర్య జాతి సిద్ధాంతాన్ని నమ్మకూడదు, ఖండించాలి. అంబేద్కర్ ‘anthropology’ లో శిక్షణ పొందారు. ఆయన బ్రిటీష్ వారు సేకరించిన మానవ విజ్ఞాన శాస్త్ర సంబంధిత రికార్డులను పరిశీలించారు. వి. ఆర్. షిండే వంటి పరిశోధకుల పరిశోధనల ఫలితాలను ఆయన విశ్లేషించారు. మానవ విజ్ఞానశాస్త్ర పరిశోధన, విశ్లేషణ సూత్రాలను ఉపయోగించారు. కొన్ని సూత్రాలను ఆయన స్వయంగా ఏర్పాటు చేసుకున్నారు. సాంఘిక, సామాజిక అంశాల పరస్పర సంబంధాలను విశ్లేషించారు. భారతీయ సమాజాన్ని, ప్రపంచంలోని ఇతర సమాజాలతో పోల్చి విశ్లేషించారు. Deductive logic ను ఉపయోగించి తెలిసిన చరిత్ర నుంచి తెలియని చరిత్రను ఆవిష్కరించారు.
(ఇంకా ఉంది)