[కస్తూరి మురళీకృష్ణ అందిస్తున్న ‘చరిత్ర విశ్లేషణ – అంబేద్కర్ దృక్కోణం’ అనే వ్యాసపరంపర.]
“..men who are perfectly satisfied with their own knowledge will never attempt to increase it. Men who are perfectly convinced of the accuracy of their opinions will never take the pains of examining the basis on which they are built.”
అంబేద్కర్ సంపూర్ణ రచనల నాలుగవ పుస్తకంలో ‘అపోహ’ల గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ అంబేద్కర్ ‘హెన్రీ థామస్ బకుల్’ రాసిన పై వాక్యాలను ఉదహరించారు. ఎందుకంటే, తన పరిశోధనల ఆధారంగా అంబేద్కర్ చేస్తున్న ప్రతిపాదనలను పలువురు ఎలాంటి అధ్యయనం లేకుండా తిరస్కరించి, విమర్శించటం ఆయన గమనించారు. ఎవరైతే తమ పరిజ్ఞానం పట్ల సంపూర్ణంగా సంతృప్తి చెందుతారో, వారు తమ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రయత్నించరు. వారికి తమ అభిప్రాయాలే సరైనవన్న నమ్మకం బలంగా ఉంటుంది. అందుకని వారు తమ అభిప్రాయాల ఆధారాన్ని పరీక్షించరు. వారు తమ అభిప్రాయాలకు, ప్రతిపాదనలకు వ్యతిరేకమైన అభిప్రాయాలను, ప్రతిపాదలను ఆమోదించరు. వారికి ఆగ్రహం కలుగుతుంది. వారి అభిప్రాయాలను, ప్రతిపాదనలను ‘తప్పు’ అని నిరూపించే సత్యాన్ని వారు ఆమోదించరు. ఆ కాలంలో డాక్టర్ అంబేద్కర్ ప్రతిపాదనలను ఇతర చరిత్ర రచయితలు సరైన పరిశీలన లేకుండానే విమర్శించారు. కానీ ఇప్పుడు చరిత్ర రచయితలుగా చలామణీ అవుతున్న వారనేకులు అంబేద్కర్ దృకోణం అన్న ముసుగు వెనుక దాగి, తాము ఎవరి దగ్గర నుంచీ నేర్చుకోవాల్సిందేమీ లేదని ఖరాఖండిగా ప్రకటించేస్తున్నారు. అంతెందుకు తాము చెప్పిందే ‘చివరి వాక్యం’, ‘అసలు వాక్యం’ అనీ దానికి వ్యతిరేకమైన దాన్ని దేన్నీ వినేందుకు, తెలుసుకునేందుకు ఇష్టపడక, ‘నేను చేప్పేశాను, అయిపోయింది. మీరు దాన్ని ఒప్పుకుని తీరాలి. లేకపోతే మీరు నాకు వ్యతిరేకులు’ అనే మూర్ఖ, సంకుచిత ధోరణిని ప్రదర్శిస్తున్నారు. దానికి ‘అంబేద్కర్ దృకోణం’ అన్న కవచాన్ని ధరించేస్తున్నారు. అంటే అంబేద్కర్ ఏం చేప్పారో పట్టించుకోకుండా, చరిత్ర విశ్లేషణ, విశ్లేషకులు ఎలా ఉండాలో, ఆయన చెప్పిన దానికి సంపూర్ణంగా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, ఆయన పేరును వాడుకుంటున్నారన్న మాట. ఇది గర్హనీయం.
తనను వ్యతిరేకించిన వారిని అంబేద్కర్ విమర్శించలేదు. తన ప్రతిపాదనలను త్రోసిపుచ్చిన వారిని అంబేద్కర్ దూషించలేదు. వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు. వారి ఆలోచలలో లోపాన్ని ఎత్తి చూపించారు. వారి ఆలోచన విధానంలోని పొరపాట్లను తర్కబద్ధంగా ఎత్త చూపించి, తాత్వితంగా విమర్శించారు.
“It must be recognised that the selfish interest of a person or of the class to which he belongs always acts as on internal limitation which regulated the direction of his intellect.”
ఇది మనస్తత్వ శాస్త్ర విషయం. మనస్తత్వంపై సామాజిక పరిశోధనలు చూపే ప్రభావం విషయం. ఒక వ్యక్తి ఒక సంఘటనకో, ఒక ప్రతిపాదనకో స్పందించే విధానంపై అతని వ్యక్తిగత స్వార్థం, అతని కులం, జాతికి ఒనగూడే లాభాల ప్రభావం ఉంటుంది. ఇది అతని ఆలోచనను, అవగాహనను పరిమితం చేస్తుంది. సంకుచితం చేస్తుంది. అందుకని తన ప్రతిపాదనలు అగ్రవర్ణాల నుంచి, ముఖ్యంగా బ్రాహ్మణుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావటానికి ప్రధాన కారణం తన ప్రతిపాదనలు బ్రాహ్మణుల అహాన్ని ప్రశ్నించి, దెబ్బతీసేవిగా వారు భావించటం వల్లనే అన్నది అంబేద్కర్ అవగాహన.
అంబేద్కర్ దృష్టి అణగారిన, అణచివేతకు గురయిన అట్టడగు వర్గాల వారి దృష్టి. ప్రాచీన సాహిత్యం, గ్రంథాలు ఏ రకంగా అట్టడుగు కులాల వారి సామాజిక సాంస్కృతికి చరిత్రను అర్థం చేసుకోవటంలో ఉపయోగ పడతాయన్నదే ఆయన దృష్టి. తద్వారా భారతీయ సమాజంలోని అంటరానితనాన్ని, దానికి కారణాన్ని అర్థం చేసుకుని, ఈ ‘అంటరానితనం వ్యవస్థ’ను కూకటి వేళ్లతో పెళ్లగించి వేయాలన్నది ఆయన లక్ష్యం. కానీ, ఆయన దృష్టిలో ఈ అంటరానితనం వ్యవస్థ వల్లనే అగ్రకులాల అధిక్యత అన్న భావనకు అస్తిత్వం ఉంది. జీవనం ఉంది. కాబట్టి ఈ వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టే ఏ ప్రతిపాదనను, ఆలోచనను అగ్రవర్ణాల వారు, ముఖ్యంగా బ్రహ్మణులు ఆమోదించరు అన్నది అంబేద్కర్ ప్రగాఢ విశ్వాసం.
బ్రిటీష్ వారితో సహా భారతదేశ చరిత్ర ఎవరు అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా, రచించినా అగ్ర వర్ణాల ఆధిక్యం స్పష్టంగా తెలుస్తుంటుంది. ధర్మ శాస్త్రాలలో, కావ్యాలలో పురాణాలలో జానపద గీతాలలో.. ఇలా ప్రతి ఒక్క ఆధారంలోనూ బ్రాహ్మణ ఆధిక్యత, వారికి సమాజంలో లభించిన అత్యధిక స్థానం గురించి ఎలాంటి సందేహాలు లేవు. బ్రిటీష్ వారి చరిత్ర రచన దృక్కోణాన్ని వ్యతిరేకించిన జాతీయవాదులు కూడా బ్రాహ్మణుల పాండిత్యం పైన ఆధారపడి చరిత్రను అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన ‘Brahmin subjectivity was so conditioned that it could not critically engage with Sanskrit scriptures and therefore was incapable of ascertaining historical truth’ అని నిద్ద్వంద్వంగా ప్రకటించారు. బ్రాహ్మణుల దృష్టిలో చరిత్రను విశ్లేషించటం, సత్యావిష్కరణ చేయటం కుదరని పని అన్నది అంబేద్కర్ అభిప్రాయం. చరిత్ర రచనలో బ్రాహ్మణులు ప్రధానంగా రాజ వంశాలు, పాలన వ్యవహారాలు, తేదీల నిర్ణయాలపై దృష్టి పెట్టటం ఎందుకంటే ప్రాచీన పురాణాల పవిత్రతను కాపాడటం కోసం. వాటి పవిత్రతను కాపాడటం ఎందుకంటే తమ ఆధిపత్యాన్ని, ప్రత్యేకతను కాపాడుకోవటం కోసం. తన అధిక్యతను, ప్రత్యేకతను కాపాడుకోవాలన్న తపన, చరిత్రను అర్థం చేసుకోవటంలో, సత్యావిష్కరణ చేయడంలో అడ్డుపడుతుంది. దృష్టిని సంకుచితం చేస్తుంది. స్వార్థం సత్యాన్ని సరిగ్గా దర్శింపచేయదు.
“The Brahmin scholar’s search is not for accomplishing historical truth but is intended to maintain sanctity of Sanskrit scriptures. He defends the scriptures with the view of defending Brahminic-privileges. His concern for upholding the prestige of the social system built by his forefathers prevents him from searching for the historical truth. As a result, Brahmin scholar engages himself with fixing dates and tracing genealogies.”
ఈ రకమైన దృకోణంతో చరిత్రను దర్శించటం వల్ల అంబేద్కర్ కన్నా ముందు చరిత్ర రచయితలు భారతదేశ గతాన్ని గొప్పదిగ భావించి తమ సంస్కృతి సంప్రదాయాలను గొప్పవిగా భావించి గర్వించారు. ప్రాచీన గ్రంథాలలో కనిపించే సామాజిక వ్యవస్థను సమర్థించారు. ఎందుకంటే, వారికా వ్యవస్థ కొనసాగటంలో లాభం కనిపించింది. కాబట్టి, అంబేద్కర్, అంత వరకు చరిత్ర రూపంలో చలామణీ అవుతున్న చరిత్రను తిరస్కరించి, తమదైన దృకోణంలో చరిత్రను ఆవిష్కరించి బ్రాహ్మణ పండితులకు భిన్నంగా చలామణీలో ఉన్న చరిత్రను నిరూపించటం వల్ల బ్రాహ్మణేతర, ముఖ్యంగా అంటరానివర్గాలకు చెందిన చరిత్ర రచయితలకు ఎలాంటి నష్టం కలగదు. వారికి ఈ వ్యవస్థ కొనసాగటం పట్ల వ్యామోహం లేదు. ఈ వ్యవస్థ నష్టమైనా బాధ లేదు. కాబట్టి బ్రాహ్మణేతర, ఇతర వర్గాల చరిత్ర రచయితలు శాస్త్రాలను, పురాణాలను విమర్శనాత్మకంగా దర్శిస్తారు. విశ్లేషిస్తారు. అగ్రవర్ణాల చరిత్ర రచయితలకు కనబడని సామాజికాంశాలను వారు తమ దృష్టితో చూడగలుగుతారు. అర్థం చేసుకుని ఆవిష్కరిస్తారు. ప్రతి అంశాన్ని వారు ప్రశ్నించగలరు. పవిత్ర గ్రంథాలు కాబట్టి ప్రశ్నించకూడదన్న నియమం వారికి ఉండదు. వేదం కానీ,పురాణాలు కానీ ప్రతి దాన్నీ ఒక ఆధారంగా భావించేందుకు నియమితమైన సూత్రాల ప్రకారంగా విశ్లేషిస్తారు. ఆపై అది పవిత్రమైనదో, కాదో నిర్ధారిస్తారు. సత్యాన్వేషణ మార్గంలో ఎలాంటి మొహమాటం లేకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. అయితే ఆధునిక విమర్శకులకు భిన్నంగా విచక్షణ రహితంగా శాస్త్రాలను విమర్శించటం, దూషించటం సమాజానికి చారిత్రిక సత్యాన్వేషణకూ హానికరమైనదని అంబేద్కర్ గ్రహించారు. అలా ప్రకటించారు. ప్రాచీన సాహిత్యాన్ని కథలుగా, పుక్కిటి పురాణాలుగా భావించి పనికిరాదని కొట్టేయటం చరిత్ర పరిశోధనలకు తగదని స్పష్టం చేశారు.
(ఇంకా ఉంది)