[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి ‘చనుబాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“చాలా బాగుంది కదే సినిమా! ఆ హీరోయిన్ ఇన్నోసెంటుగా, స్మార్టుగా ఎంత ముద్దొచ్చిందో!! సన్నగా నాజూగ్గా మెరుపు తీగలా, అందానికి తగ్గ వంపులతో. ఆ డ్రెస్సులు, ఆ మేక్-అప్ అబ్బ ఎంత చక్కగా ఉన్నాయో” అంటూ వర్ణంస్తోంది నవ్య.
“ఏమిటే ఇన్నోసెంటు?? అమ్మాయిల్ని ఏమీ తెలియనట్టు మొద్దుల్లా అలా చూపిస్తేనే మీకు నచ్చుతుందా? ఆడది అంటే అందానికి మాత్రమే ప్రతీకా, అదేమైనా విలాస వస్తువా? అందమైన బొమ్మగా కాకుండా గొప్ప వ్యక్తిత్వాన్ని చూపిస్తే మీరు చూడరేఁ? తెలివిగా, ధైర్యంగా, తెగింపుగా ఉంటే నచ్చదేఁ? హీరో అమ్మాయి వెంట పడుతూ, వెంబడిస్తూ, తరుముతున్నట్టు వేధిస్తూ, ఆఖరికి ప్రేమలో దింపడాలేనా మీకు నచ్చేది? ఫైటింగుల్లో పది మందిని ఒక్క పెట్టున కొట్టాడాలూ. ఇవన్నీ ఏళ్ళ తరబడి చూస్తున్నా విసుగు రాదా? నిజ జీవితంలోనూ అలాగే ఉండాలనుకోవడం, వుంటుందని భ్రమ పడడం వెర్రితనం కాదూ?! నాకస్సలు నచ్చలేదు” చిరాకుగా అంది అక్షర.
“నేనూ అక్షరతోనే ఏకీభవిస్తాను, ఇటీస్ ఎగైన్ ది సేమ్ రొటీన్ లవ్ డ్రామా!” అన్నాడు చేతన్.
సినిమా గురించి ఇంకా చర్చించుకుంటూ ఆనంద్ నగర్ కాలనీ వరకూ వాళ్ళింకా రాకుండానే దగ్గరగా వున్న వాడలో జరుగుతున్న గొడవ మీద పడింది వారి దృష్టి. భార్యను కొడుతున్న భర్తా, కళ్ళప్పగించి చూస్తున్న జనాలూ!!!
“పచ్చి బాలింత ఒళ్ళు. దాన్ని గట్ట సతాయిస్త వెందుకురా? కొట్టి సంపేస్తవా ఏందీ?” కోడలు స్వప్న మీద మరో దెబ్బ పడకుండా అడ్డు పడి కొడుకుని నిలదీస్తోంది రాములమ్మ.
“నువ్వు నోర్ముయ్యి, నీ అలుసు సూసుకునే గదట్ట తయారయ్యింది. పనికి పోతుందిగా, డబ్బులివ్వు అంటే ఇచ్ఛుడు లేదా ఏందీ!!” తూలిపోతూ తల్లిమీద విరుచుకు పడుతూ అన్నాడు వీరేశు.
సమాధానము కూడా చెప్పవలసిన అవసరం లేదన్నట్టు, ఒంటి మీద పడిన దెబ్బలను కూడా లెక్కచేయకుండా అక్కడి నుంచి నిర్లక్ష్యంగా వెనుకకు తిరిగి వెళ్లిపోయింది స్వప్న.
“డాక్టర్ ఇచ్చిన మందు వాడుతున్నా పాలు గిట్ల పెద్దగా వడతల్లేదంట. నీరసంతోని బేజారైనా, బాధ వడుతున్నాసరే, బిడ్డకు పాలు సాలక పనికి వోయి సంపాదిస్తే గానీ బుక్కెడు పాలు తాపలేని స్థితి స్వప్నది పాపం” జరుగుతున్న గొడవ గురించి చర్చించు కుంటున్న జనాల్లోంచి, తనకు తెలిసిన విషయాన్ని పక్కనున్న మరో స్త్రీతో చెపుతున్న యువతి మాటలు ఆక్షరతో పాటూ స్నేహితులందరికీ వినిపించాయి.
“గౌ, బీపీ పెరిగి వోయి, నొప్పులు దీయ లేకుంటే ఆపరేషను చేసి బిడ్డను తీసిండ్రు. తల్లికి పోషణ లేకుండ వట్టి బిడ్డ చానా తక్కువ బరువుతో పుట్టింది. తొలి చూరు బిడ్డ అన్న సంతోషం కూడా లేకుండా, ఆడపిల్లేగా అని తీసి పారేసి, పెండ్లాన్ని సాకకుండా తాగుడులో మునిగి తేలుతున్నాడు గా వీరేశు”, అంటూ యువతికి వివరించింది ఆ పక్కనున్న స్త్రీ.
***
ఆలోచనల బరువుతో భారంగా అలసి ఇంటికి వచ్చింది అక్షర.
“అక్షరా కోడలికి సుస్తీగా వుంది, రోజూ ఇంజక్షను చేయించాలి. నువ్వు కాస్త కార్ డ్రైవ్ చేసి తీసుకెళ్ళి తీసుకొస్తావా? పురుడొచ్చిన దగ్గర్నుంచి, బాలింత జ్వరం తగ్గకుండా బాధ పెడుతోంది” ఆర్తిగా అడిగింది శారదమ్మ.
“తప్పకుండా అంటీ. డోంట్ వర్రీ. నేను తీసుకెళ్లి తీసుకొస్తాను” అంది అక్షర.
“వ్రతమూ చెడి ఫలమూ దక్కనట్టైయ్యింది నా పని. ఈ జ్వరం కూడా తగ్గిపోతుంది కానీ, ఈ పాలు గడ్డ కట్టడంతో చాలా బాధపడిపోతున్నాను. బిడ్డకు చనుబాలు ఇచ్చుకునే అదృష్టానికి కూడా నోచుకోలేని బ్రతుకైయ్యింది. బిడ్డ దక్కకుండా పోయింది” కుమిలిపోతూ అంటున్న దీప్తి అక్కతో ఏమి మాట్లాడాలో కూడా తెలియలేదు. పెళ్లి కాని యువతిగా అక్కను ఎలా సముదాయించాలో తెలియని సందిగ్ధంలో పడింది అక్షర. ఐతే ఆనాటి దీప్తి అక్కయ్య మాటలు ఎన్నో సమస్యల పరిష్కారానికి దారి చూపే ఆలోచనలను స్పృశింప చేసాయి.
జిల్లాలోని పసికందుల ప్రభుత్వ అనాథ ఆశ్రమంలో ఒక్క రోజులో కొత్తగా పదిమంది పిల్లలు చేరారని వార్తాపత్రికలో ఆరోజే చదివిన విషయం అక్షరకు పదేపదే గుర్తొస్తోంది.
“డాక్టరు గారూ, నేను ఈ బిడ్డను పెంచలేను. నాకు ఎలాంటి అండదండలూ లేవు. ఎవరైనా పెంచుకునే వారుంటే దయచేసి వాళ్ళకి ఇచ్చేయండి!” భోరుమంటూ వేడుకుంది రేఖ. ఆ క్లిప్పింగుని టివీలో పదేపదే చూపిస్తున్నారు. చావు బ్రతుకుల మధ్య మొరపెట్టుకుంటూ రేఖ కన్నుమూయడం, అక్షర మనసుని పిండేసింది. ఆమె బిడ్డా అదే ఆశ్రమానికే చేరడమే కాకుండా మృతి చెందిందన్న వార్త మనసును దహించేసింది.
ఇవన్నీ చూసి, కేవలం వార్తలుగా భావించి విని వదిలెయ్యాలా? ఆవేమీ మనసులోంచి చెరగకపోగా అక్షరను ఎంతో వేదనకు గురిచేసాయి.
***
దీప్తి అక్క బాధ, స్వప్న నిస్సహాయత, రేఖ ఆవేదన, చిన్నారుల ఆకలి ఆర్తనాదాలూ, మాతృమూర్తుల ఆక్రందనలూ అక్షర చెవుల్లో మారు మ్రోగుతున్నాయి. ఈ సంఘటనలన్నీ అమె మనసుని శతవిధాల వేధిస్తున్నాయి.
సుమారు ఎనిమిది లక్షలమందికి పైగా శిశువులు పోషణ లోపంతో ఏటా మృతి చెందడం, మరెందరో అనాధాశ్రమాల పాలవ్వడం జరుగుతూనే వుంటోంది. పలు మార్లు వెంటాడుతున్న ఆలోచనలతో సతమతమవుతున్న అక్షర మనసులో అకస్మాత్తుగా ఒక మెరుపు మెరిసింది. ఉపాయం తోచడంతోనే తక్షణ కర్తవ్యం అర్థమైయ్యింది. కేంపస్ సెలెక్షనులో పేరొందిన సాఫ్ట్వేరు కంపెనీలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. రెండేళ్ళ లోపే ఆన్-సైటుకి పంపుతామని కూడా హామీ ఇచ్చారు. రెండేళ్ళ బాండ్ వ్రాసి ఉద్యోగంలో చేరడాన్ని నిరాకరిస్తూ జవాబిచ్చింది అక్షర. తను చదువుకున్న చదువు సమాజ శ్రేయస్సుకీ, చుట్టూ వున్న పేద ప్రజలకీ, ముఖ్యంగా అనేక సమస్యలతో బాధ పడుతున్న మహిళలకు ఉపయెగ పడాలనుకుంది. అది ఆమెకు అమితమైన ఆత్మ సంతృప్తిని ఇస్తుందని గ్రహంచింది. కంప్యూటర్ సైన్స్ చదివినందుకు నా సంపాదన కోసం నేను ఒక ఉద్యోగంలో చేరే ముందు, సమాజానికి ప్రయోజనకరమైనది ఏదో ఒకటి చేయాలని తీర్మానించుకుంది.
తన వెన్నంటే వుంటూ దేనికైనా వెనుకాడని తన స్నేహితుల సహకారాలుంటే అనుకున్న పని సాధించడం పెద్ద కష్టం కాదని అనుకుంది.
నవ్య, రాబర్ట్, రిజ్వానా, చేతన్, మరియు ధన్య తన మాట ఎప్పుడూ కాదనరనే ధైర్యంతో తాను తల పెట్టిన కార్యాన్ని క్లుప్తంగా వివరించింది. వారి సహాయ సహకారాలను ఆర్ధించింది. స్నేహితులందరూ ఒక్కటే మాటగా వెంటనే అంగీకరించి, ఆరుగురూ రంగంలోకి దిగడానికి సంసిద్ధులైయ్యారు. పది కిలోమీటర్ల వైశాల్యంలోని ఒక స్థలంలో మాతా-శిశు జనన రికార్డుల వివరాలతో డాటా-బేసును తయారు చెశారు. ఇల్లిల్లూ తిరిగి సర్వేతో మరిన్ని వివరాలను సేకరించారు. చుట్టూ వున్న మురికి వాడల ప్రజలకీ, మాతృమూర్తులకీ సంబంధిత విషయంపై అవసరమైన కౌన్సిలింగు ఇచ్చారు. సంసిద్ధత వ్యక్తం చేసిన దాతల పేర్లను నమోదు చేసి డాటాబేస్లో ఎప్పటికప్పుడు డాటాను అప్-డేట్ చేయసాగారు. కనీస-వసతులతో, మాతృమూర్తి దాతల నుంచి అత్యవసరమైన శిశువుకు తల్లి పాలు అందేలా చిన్ని స్థాయిలో సపఫరాను ప్రారంభించారు. అత్యవసరమైన చోటుకి అతి తక్కువ వ్యవధిలో అందేలా పంపిణీలూ చేయ సాగారు. చిన్న ప్రాజెక్టుగా చేపట్టినా, ఎందరినో ఆదుకున్న వారైయ్యారు. కార్యదీక్ష వల్ల ఆ చిన్ని ప్రాజెక్టు వల్ల ఎంతో మంది లబ్ది పొందగా విజయవంతమై సత్ఫలితాల నిచ్చింది.
గత సంవత్సర సంఖ్యలతో పోలిస్తే జిల్లా వారీ గణాంకాలలో శిశు-మరణాల సంఖ్యా శాతం గుర్తించ తగినంతగా తగ్గింది. మార్పు ప్రస్ఫుటంగా కనపడడంతో ఈ ప్రాజెక్టు ప్రభుత్వ దృష్టిని ఆకర్షంచింది. ఆరోగ్య శాఖ ఆసక్తి చూపుతూ జిల్లా కలెక్టరేటు నుండి వివరాలను కోరింది.
***
‘మిత్ర బృందం’ పేరుతో అక్షర ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘చనుబాలు’ వాలంటరీ సంస్థ అతి స్వల్పకాలంలో సమాజంలో తెచ్చిన మార్పులను కొనియాడుతూ జిల్లా అధికారులూ, స్వాస్థ్య నిపుణులూ వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి గారికి వివరించారు.
పట్టుమని పాతికేళ్ళు దాటని యువతీ-యువకుల టీముకి ఇట్టి వినూత్నమైన ఆలోచన కలగడమే కాక, తమ సాఫ్ట్వేర్ నైపుణ్యాన్ని ఉపయోగించి ఒక నెట్వర్కు తయారు చేసి, స్వచ్ఛన్నంగా ఇట్టి ప్రాజెక్టును చేపట్టడం విశేషమని పేర్కొన్నారు.
నేటి తరం యువత ఇంతటి మహోన్నతమైన సేవలను అందిస్తున్నారని తెలుసుకుని మనస్పూర్తిగా అభినందించారు ముఖ్యమంత్రిగారు. తదుపరి మిత్ర బృందం టీమ్తో ముఖామూఖీలో ఒక విజ్ఞప్తిని కూడా చేసారు. “దాతలైన తల్లులు స్వచ్చందంగా దానం చేసే తల్లి పాలను నిలువ చేసి అవసరమైన పసికందులకు అందించి ప్రాణాలను కాపాడుతున్న యీ చిన్ని యత్నం నేటి నుండి ఒక ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టుగా మారుతుంది. ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టుగా బాధ్యతలన్నీ ప్రభుత్వం మీకిస్తూ అందుకు గానూ నిధులను ఆమోదిస్తుంది. తగిన వివరాలతో ఒక ప్రాజెక్ట్ రిపోర్టు ద్వారా వివరాలు మా కార్యాలయానికి పంపండి. ప్రాజెక్టు పూర్తిగా అమలు జరిగేవరకూ మీరే నిర్వాహకులుగా వుంటూ, మీ ఆధ్వర్యంలో దీన్ని రాష్ట్ర సంస్థగా తీర్చిదిద్దాలి. ఇది విస్తరించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లూ ప్రభుత్వం హుటాహూటిన చేస్తుంది. అందుకు కావసిన కోల్డ్-స్టోరేజ్, పాకింగ్ యంత్ర కొనుగోళ్ళూ, ఇతర పరికరాలూ మరియు వసతుల ఏర్పాటు జరుగుతుంది.
ప్రభుత్వ పాల బ్యాంకుగా దీన్ని గొప్ప స్థాయికి తీసుకు రావలసిన బాధ్యతను మీపై మోపుతున్నాను. పోషక విలువలు మెండుగా వుండే తల్లిపాలను కావలసిన ప్రతీ శిశువుకూ యీ పాల బ్యాంకు అందచేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా యీ సేవలందేలా రూపొందుతుంది. దిస్ ఈజ్ యువర్ బేబీ అందువలన మీరెంచిన ‘చనుబాలు’ అన్న పేరే యీ బ్యాంకుకి ఎప్పటికీ వుంటుంది.” అన్నారు.
నిరుద్యోగానికి సైతం సిద్ధపడి అమూల్యమైన సేవలను అందించాలని సంకల్పించిన ‘మిత్ర బృందం’ సభ్యులు ప్రభుత్వంలో తమ నూతన పదవులను అమితానందంతో చేపట్టారు. రెట్టింపైన కార్యదీక్షతో పనిచేయగా ‘చనుబాలు’ మాతా శిశువుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించుకుని అమూల్యమైన సేవలనందిస్తూ ఆరోగ్యవంతమైన నవ సమాజాన్ని నిర్మించింది.