Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సరికొత్త ధారావాహిక ‘చంద్రునికో నూలుపోగు’ – ప్రకటన

సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘చంద్రునికో నూలుపోగు’ అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.

***

వెన్నెల రాత్రుళ్ళని ఆస్వాదించని వాళ్ళుంటారా? వెండి రజనులా జాలువారే వెన్నెల.. మత్తెక్కించే చల్లదనంతో శరీరాల్ని అల్లుకునే వెన్నెల.. వెన్నెలని ఉదారంగా కురిపించే చంద్రుడే లేకపోతే?

చంద్రుడు అకస్మాత్తుగా మాయమైపోతే? చంద్రుణ్ణి ఏలియన్ గ్రహవాసులు తరలించుకుపోయి, తమ గ్రహం చుట్టూ కట్టేసుకుంటే? అదసలు సాధ్యమా? చంద్రుడేమైనా బంతిలాంటి ఆటవస్తువా తస్కరించి తమ గ్రహానికి తీసుకెళ్ళి తిప్పుకోడానికి?

అదో ఉపగ్రహం.. మూడువేల నాలుగు వందల డెబ్బయ్ అయిదు కిలోమీటర్ల వ్యాసంతో కొన్ని లక్షల కోట్ల టన్నుల బరువుతో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ఉపగ్రహం. ఐనప్పటికీ నిఫిలిక్స్ అనే గ్రహవాసులు సాహసించి, ఖగోళ శాస్త్ర చరిత్రలో కనీవిని ఎరుగని దుశ్చర్యకు పూనుకున్నారు. తమకెంతో ప్రియమైన చంద్రుణ్ణి భూగ్రహవాసులు కాపాడుకోడానికి చేసిన ప్రయత్నాలేమిటి? వాటిలో విజయం సాధించారా? వాళ్ళకు ఎదురైన సవాళ్ళేమిటి? ఇత్యాది విషయాల్ని చర్చిస్తుంది సలీం గారి సైఫై నవలిక ‘చంద్రునికో నూలుపోగు’.

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘విఠాల లలిత కౌమార బాలల సైన్స్ ఫిక్షన్ నవలల పోటీ 2024’లో బహుమతి పొందిన ఈ నవల, బాల బాలికల కోసం ఉద్దేశింపబడినప్పటికీ, పెద్దల్ని సైతం ఆసక్తిగా చదివింపజేస్తుంది.

***

వచ్చే వారం నుంచి సంచికలో ధారావాహికగా..

చదవండి.. చదివించండి..

‘చంద్రునికో నూలుపోగు’.

Exit mobile version