[ఆగస్టు 25వ తేది ఆర్టిస్ట్ చంద్ర గారి జయంతి సందర్ఙంగా వారిని స్మరించుకుంటూ ఈ రచనని అందిస్తున్నారు శ్రీమతి ఏ. అన్నపూర్ణ].
కొందరు మనకు పరిచయం లేనివారు వుంటారు. వారిని ఎప్పుడూ కలుసుకోకపోవచ్చు. కానీ వారి ప్రభావం మనకు తెలియకుండా మనమీద ఉంటుంది. అనుకోకుండా గుర్తుకువస్తారు. వారే ఒకతరం వారికి తెలిసిన చిత్రకారుడు ‘చంద్ర’.
అందులో అనవసర ఆర్భాటం లేదు. రచనలు చేసినవారు అందరూ ప్రముఖులు. కొందరు అమెరికా వాళ్ళు వున్నారు. కథలు చదివి సాయి గారికి ఉత్తరం రాసేదాన్ని. అలా కొంతకాలం తర్వాత కథలు నేనే రాస్తేనో.. అని ఆలోచన వచ్చింది. హైదరాబాదు వచ్చాక జీవిత చందా కట్టి, కథలు రాయడం మొదలుపెట్టేను. పత్రికలో ‘సాహితీ వైద్యం’ చేస్తున్న రచయిత ‘వసుంధర’ కొన్ని సూచనలు చేయడంతో మెళకువలు తెలుసుకుని మొదటి కథ ‘సెలయేరులో అల’ రాసి పంపేను.
ఆ కథ ప్రచురించారు . ఆ కథకు వేసిన చిత్రం నన్ను ఆకట్టుకుంది. అలా చూస్తూ ఉండిపోయాను . కథ వచ్చింది అనే ఆనందం కంటే ఆ చిత్రం ఎంతో బాగా వేసారో ‘చంద్ర’ అనే ఆర్టిస్టు అనుకున్నాను. వెంటనే నా మనసులో మాటను ఉత్తరం రాసాను సాయి గారికి .
అప్పుడు నాకు అంతగా చంద్ర గారి గురించి తెలియదు. రచనలో భాగస్థులు అనుకున్నాను. అంతే ఎప్పుడు రచనకు కథ పంపినా బొమ్మలు చంద్రగారివే. కొత్తలో చంద్రగారు వేసిన చిత్రాలు ‘బాపు’ చిత్రాలకు దగ్గిరగా ఉంటాయి అనేవారు. కానీ నాకు చంద్రగారివి సహజంగా తోచేవి. బాపు గారివి ఊహాజనితాలు. ఇద్దరికీ మధ్య వై విధ్యం ఇదే అని నాకు తోచేది.
నా అభిప్రాయాలు చదివిన సాయి గారు, నేను చంద్ర తో చెబుతాను అనుకోండి. మీరే ఫోను చేసి వారికి చెబితే బాగుంటుంది కదా అనేవారు. కానీ నాకు మొహమాటమెక్కువ. అందులో పెద్దవారు అన్నివిధాలా అని మరీ మొహమాటం. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడిపోయాను.
రచన పత్రిక ప్రచురణ ఆగి పోవడం వలన నాకు చంద్రగారు కోవిద్ బారిన పడినట్టు ఆలస్యంగా తెలిసింది.
ఈ ఆగస్టు 25వ తేది చంద్ర గారి జయంతి అని తెలియడం – 2016 ఆగష్టులో 70 ఏళ్ల పుట్టినరోజు పురస్కరించుకుని హేమాహేమీలైన చంద్ర గారి అభిమానులు – స్నేహితులు రాసిన పరిచయాలతో అచ్చువేసిన ‘ఒక చంద్రవంక’ అనే 120 పేజీల పుస్తకం ఒకటి ఒక ఫ్రెండ్ పంపించడం కాకతాళీయంగా జరిగింది.
వారి గురించి ఈ జ్ఞాపకం పాఠకులతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను.
ప్రతివారికి ఇలా ఏదో ఒక అనుభవం తప్పకుండా ఉంటుంది. నలుగురితో పంచుకోడం ఒక సంతోషం కదూ!
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.