[కన్నడంలో వాసుదేవ్ నాడిగ్ గారు రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]
నది తన లోతును చూపకుండా
ప్రవహిస్తోంది
మేఘం తన బరువును వర్ణించకుండా
తేలియాడుతోంది
రెంటినీ కొలిచేలా
ఒక పక్షి ఎగురుతోంది
మీ కలల మల్లే
చీమకు గూడూ, ఏనుగుకు బయలూ
ఈ నేల సమకూరుస్తోంది.
చుక్కకు చోటు, ఉల్కకు ఉయ్యాల
ఆకాశం వెలిగిస్తోంది.
ఎన్నెన్నో బాధలను
తనలో ఇముడ్చుకుంటూ కాలం
పూవును వికసింపజేస్తోంది,
వెన్నెలను వెదజల్లుతోంది.
గడ్డి మేసిన జింక మెడలో
పులి పళ్ళు దిగబడ్డాయి,
చెమట పట్టిన పైకప్పు కారుతోంది,
నిట్టూర్పుల వంతెన పైనే
జీవన చక్రం సాగుతోంది.
అలసటను మర్చిపోవడానికే
మరో పనిమీద పడుతోంది.
కారుణ్య దీపపు కాంతిలో
చీకటి కథ విస్తరించింది.
వెలుతురంటూ మిడిసిపడుతూ వచ్చిన మిడత
తలుపు లోపల పట్టుబడింది.
పువ్వు బంధించిన సుగంధాన్ని
తుమ్మెద ప్రపంచానికి పంచుతోంది.
లోతు, బరువు, నొప్పి, చెమట
బంధనం, చీకటి, అలసట, పళ్ళు, నిట్టూర్పు
ఇవన్నీ జీవిత పాఠ్యాంశాన్ని
విస్తరిస్తున్నాయి, పాఠం సిద్ధమవుతోంది.
కన్నడ మూలం: వాసుదేవ్ నాడిగ్
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.