[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘చదవండోయ్.. పుస్తకాలు చదవండి..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


పుస్తకాల కోసం –
బుక్ ఎగ్జిబిషన్లు ఉన్నాయ్,
గ్రంథాలయాలున్నాయ్,
సంచార గ్రంథాలయాలున్నాయ్ ,
రకరకాల బుక్ హౌస్లున్నాయ్ ,
ఆన్లయిన్ కేంద్రాలున్నాయ్!
చేయవలసిందల్లా..
ఉచిత పుస్తకాల కోసం
ఎదురుచూడకుండా
ఆశించకుండా –
పుస్తకాలు కొనడం!
పుస్తకాలు –
కొంటేనే సరిపోతుందా?
అల్మెరాలో అందంగా
అలంకరించుకుంటే
సరిపోతుందా?
మనం పుస్తకాలు చదవాలి..
మన కుటుంబ సభ్యులతో పాటు
తెలిసిన వాళ్ళందిరి చేతా
పుస్తకాలు చదివించాలి..
ఇది ఒక మహోద్యమం కావాలి!
కథలు – కవిత్వం
నవలలు – చరిత్రలు
ఆత్మకథలు – యాత్రాకథనాలు,
సమీక్షలు-విమర్శలు
కాదేదీ సుమా..!
చదవడానికనర్హం..!!

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.