Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బుద్ధియోగము ప్రాశస్త్యం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘బుద్ధియోగము ప్రాశస్త్యం’ అనే రచనని అందిస్తున్నాము.]

గవద్గీత 10వ అధ్యాయం, 10వ శ్లోకం:

తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్।
దధామి బుద్ధి యోగం తం యేన మాముపయాంతి తే॥

ఓ అర్జునా, ప్రేమతో నా సేవ యందే నిరంతరం ఆసక్తులై, నన్నే తలుస్తూ, నా ఆరాధన చేస్తూ, నా భజన యందే తత్పరులై వున్నవారిని నన్ను చేరగల బుద్ధి యోగాన్ని నేను ప్రసాదించి, వారిని ప్రేమతో నా అక్కున చేర్చుకుంటాను అని భగవంతుడు చెప్పడం పై శ్లోకం యొక్క భావం.

భగవంతుని చేరడానికి అత్యంత సులభమైన మార్గాన్ని ఆయనే మానవాళి యందు ప్రేమతో అర్జునుడిని నిమిత్తం చేసుకొని ప్రసాదించాడు. తమ బుద్ధితో భగవంతుడిని తెలుసుకుంటాము అనుకునేవారికి భగవంతునిపై ఎటువంటి అవగాహన లేదని అర్థం. భగవంతుడు తమ బుద్ధి పరిమితికి అతీతమైన వాడు అని తెలుసుకున్న వారే ఆయనను నిజంగా అర్థం చేసుకున్నట్టు అని సృతి కూడా స్పష్టం చేస్తోంది. సాధకుల చిత్తశుద్ధిని, పనిత్రమైన హృదయాన్ని, తనను పొందాలన్న తపనను చూసి భగవంతుడే తన దివ్య జ్ఞానాన్ని జీవాత్మకు ప్రసాదిస్తాడు. అప్పుడు ఆయన కృప లభించిన ఆ భాగ్యశాలియైన జీవాత్మ ఆయనను తెలుసుకోగలుగుతుంది అని యజుర్వేదం కూడా స్పష్టం చేస్తోంది.

ఈ శ్లోకంలో బుద్ధి యోగం అనే పదాన్ని భగవంతుడు ఉపయోగించాడు.

యోగాపీడియా ప్రకారం బుద్ధి అనేది సంస్కృత పదం, బుద్ధ అనే మూలం నుండి ఉద్భవించింది, దీని అర్థం తెలుసుకోవడం లేదా మేల్కొని/జాగృతులై ఉండటం. కాబట్టి, బుద్ధి అనేది తెలివితేటలు, జ్ఞానం మరియు అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి, విచక్షణతో మరియు నిర్ణయించడానికి మనస్సు యొక్క శక్తిని సూచిస్తుంది. బుద్ధి అనేది ఆత్మచే ప్రత్యక్షంగా ప్రభావితమవుతుంది. కాబట్టి, మనస్సు బుద్ధిని అనుసరిస్తే, అది ఇంద్రియాలను సరైన మార్గంలో నడిపించగలదు. అదే బుద్ధి మనసును అనుసరిస్తే అదుపు తప్పిన గుర్రాల వలే మనస్సు అవిశ్రాంతంగా పరుగు తీస్తుంది. తనతో పాటు ఇంద్రియాలను కూడా తీసుకొని వెళ్తుంది. తత్ఫలితంగా మనస్సుకు లోబడిపోయిన మానవుడు ఇంద్రియలోలుడై అనుక్షణం అంతులేని అశాంతిని, వేదనను పోగు చేసుకుంటాడు. కాబట్టి, ఇంద్రియ సుఖాల ఆకర్షణలకు లొంగిపోయే అవకాశం ఉన్న మనస్సును అనుసరించవద్దని, బదులుగా దానిని బుద్ధికి లోబరుచుకోవాలని కృష్ణుడు అర్జునుడికి పై శ్లోకం ద్వారా సలహా ఇచ్చాడు.

అర్జునా! నీ శరీరం ఒక రథం మరియు నీ ఇంద్రియాలు గుర్రాలు; నీ మనస్సు పగ్గాలుగా పనిచేస్తుంది మరియు నీ బుద్ధి చోదక శక్తి. నీ బుద్ధి నీ మనస్సును అదుపు చేస్తూ నీ జీవిత ప్రయాణాన్ని నడిపిస్తే అప్పుడు నువ్వు నీ అంతిమ గమ్యాన్ని సురక్షితంగా చేరుకుంటావు.

బుద్ధి యోగం బుద్ధిని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది మరియు మనస్సును ఉన్నత చైతన్యంతో ఏకం చేస్తుంది. ఆధ్యాత్మిక మనస్సును అభివృద్ధి చేయడం, చైతన్యాన్ని శుద్ధి చేయడం మరియు ఆదిమ చైతన్యంతో విలీనం కావడంలో విజయం సాధించడం బుద్ధి యోగం యొక్క దిశలు. ఇది కత్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగాల వలె భగవద్గీతలో సాధకులకు ఉపదేశించిన ఒక యోగమార్గం.

బుద్ధి యోగం అంటే, మన మేధస్సును, బుద్ధిని ఉపయోగించి, కర్మ మరియు జ్ఞానానికి అనుకూలంగా, ఆధ్యాత్మికతను సాధించే మార్గం.

సాధారణంగా, భౌతిక ప్రపంచంలోని కోరికలను నెరవేర్చుకోవడానికి మన బుద్ధిని ఉపయోగించుకుంటూ ఉంటాం. అదే విధంగా మన బుద్దితో అంతరాత్మలోకి మన ప్రయాణాన్ని సాగించడానికి దాన్ని మనం వాడుకోవాలి. మనలో జన్మ జన్మలుగా గాఢంగా లోతుగా పాతుకుపోయిన విశ్వాసాలనూ, భావోద్వేగాలనూ, ఆలోచనలనూ, చర్యలనూ, మనం మాట్లాడే మాటలను ఇలా ప్రతీ ఒక్క చర్యను మనం ప్రశ్నించడం ప్రారంభించినప్పుడు.. అంతరాత్మలోకి మనం చేసే ప్రయాణంలో బుద్ధిని ఉపయోగించడం మొదలవుతుంది. అదే మనకి దారి చూపిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తుంది. అదే బుద్ధియోగం అంటే. ఈ మార్గాన్ని అనుసరించే వారు దృఢమైన మరియు దృఢ నిశ్చయం కలిగిన బుద్ధిని కలిగి కేంద్రీకృతమైన లక్ష్యంతో ఉంటారు. అయితే, అనిశ్చిత బుద్ధి ఉన్నవారికి అనేక విరుద్ధమైన ఆలోచనలు మరియు ఆలోచనలు ఉంటాయి. క్షణం క్షణం వారి ఆలోచనలు, ప్రవర్తన మారిపోతూ వుంటుంది. అటువంటి వారికి భగవత్ ప్రాప్తి ఎన్ని జన్మలకైనా అసాధ్యం. కాబట్టి భగవంతుడు జన్మతః మనకు ప్రసాదించిన బుద్ధిని సక్రమంగా వినియోగిస్తీ, కేంద్రీకృతమైన లక్ష్యంతో సాధన చేస్తే భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా విజయం సాధించడం సులువు అవుతుంది.

ప్రతిఫలాన్ని ఆపేక్షిస్తూ చేసే పనుల్ని త్యజించాలనీ, దివ్యమైన జ్ఞానంలో బుద్ధిని నిలకడగా ఉంచి చేసే కర్మలకన్నా అవి చాలా తక్కువ స్థాయికి చెందినవనీ అర్జునుడికి శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. లక్ష్యం ఒక్కటే అయినప్పటికీ దివ్యజ్ఞానంతో చేసే కర్మల్లో బుద్ధి సమన్వయంతో (పొందికతో) ఉంటుందనీ, అదిలేని వారి బుద్ధి పరిపరివిధాల పోతుందనీ చెప్పాడు.

Exit mobile version