[మరింగంటి సత్యభామ గారు రచించిన ‘భ్రాంతి.. భ్రమ’ అనే కవితని అందిస్తున్నాము.]
కనుల ముందు చిన్నారి రూపాలు
ఇంకా ఆడుతూ పాడుతూ కదలాడుతూ
పిల్లలకి ఇష్టమైనవి తెచ్చి ఇష్టంగా తినిపిస్తునట్లే
వాళ్ళకినచ్చినవి.. ఇస్తున్నట్లే
అపుడేనడిచిపోయాయా.. ఇన్నేళ్ళు
అమ్మా.. రా అని ప్రేమగా మనసానంద
డోలికైపోయింది.. డోలాయమానంగానూ ఐంది
ఎందుకో.. అంత ఊగిసలాట
దూరాభారాల కొలువులు
మునుపు జిల్లాలు దాటి.. రాష్ట్రాలు దాటి
నేడు విదేశాగమనాలు అభివృద్ధి సోపానాలు
సాధారణ జీవితాలు గడిపేవారు
ఈనాటి పెద్దలు.. వారి.. మానసికస్థితి
మారిన జీవన యానం.. ఈనాటి వేగ గమనంతో
పరుగులు పెట్టలేక.. అందుకోలేక
గందరగోళం.. అయోమయం
అంతలోనే.. అనంతానందం
మేము అందుకోలేని.. ఉన్నత పథాన్ని
మీరు అందుకున్నారని.. గర్వాతిశయం
అదేం ఖర్మో.. పెరిగిన ఆయుర్దాయం
నీకేం లోటు.. హాయిగా వుండు అంటారు
హాయిగా.. లోటేంటీ.. అదే.. అక్కడే చిక్కుముడి
నిష్కర్షగా చెప్పాలంటే
ఇమడలేనితనం..
ఎవరి మనసుకి నచ్చినట్లు.. వారుంటే
మన అనే.. నా.. నచ్చుబడికి చెల్లుబాటెపుడు
అస్వతంత్రపు భావం వెన్నాడదూ
మనసుకి నచ్చినట్లు.. మనసారా
ఆస్వాదనలోనేగా.. సంతృప్తి.. సంతుష్టి
ఆ.. ఆలోచనలే.. బ్రాంతులు.. భ్రమలేమో