Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వాలెంటైన్‌లకు ప్రేమతత్త్వం నేర్పే ‘భారతీయ ప్రేమ కథామాలిక’-3

[కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘భారతీయ ప్రేమ కథామాలిక’ అనే కథాసంపుటిని విశ్లేషిస్తూ ప్రొ. సిహెచ్. సుశీలమ్మ అందిస్తున్న వ్యాస పరంపర. ఇది మూడవది, చివరి భాగం.]

“అతను నాకు నచ్చాడు. ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను..” అంటూ భర్తని, కన్న కొడుకుని వదిలిపెట్టి తీవ్రమైన ప్రేమోన్మాదంతో వెళ్ళిపోయే కొందరు స్త్రీల కథలు, సంసారంలో పెద్దగా కష్టాలు, నష్టాలు, హింసలు లేకపోయినా, నూతనంగా పరిచయం అయిన వారి కోసం తమ తమ సంసారాల్ని వదిలి వేరే వాళ్ళతో కలిసి జీవనం చేస్తున్న కామోన్మాదుల కథలు, పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన పిచ్చి రసోన్మాదుల కథలు వస్తున్న ఈరోజుల్లో కస్తూరి మురళీకృష్ణ రాసిన ‘భారతీయ ప్రేమ కథామాలిక’లో – చిన్నప్పటి నుండి శ్రీరంగనాథునే ప్రేమించిన విష్ణుచిత్తుడు పెంచిన గోదాదేవి, పరమశివుడే నా భర్త అంటూ అన్వేషించిన శివ భక్తురాలు అక్క మహాదేవి, తన ముఖాన్ని కూడా పరపురుషుడికి చూపక ఆత్మాభిమానంతో ఆత్మాహుతి చేసుకున్న రాజపుత్ర వంశపు రాణీ పద్మిని.. వంటి వారి వ్యక్తిత్వం పరిశీలించవలసిన అవసరం ఈ తరానికి ఎంతైనా వుంది.

పర్వతరాజపుత్రి

మహాకవి కాళిదాసు రచించిన కుమారసంభవం లోని అత్యద్భుతమైన పౌరాణిక ప్రేమ గాథ పార్వతీపరమేశ్వరులది. పరమేశ్వరుడు ఉండేది స్మశానంలో. వంటికి పూసుకునేది బూడిద. చేతులకు, మెడలో అలంకారాలు సర్పాలు. ఎగుడూ దిగుడూ కన్నుల వాడు. త్రినేత్రం తెరిస్తే అగ్ని జ్వాలలు. సంతోషం వస్తే తాండవం.

మరి అతనిలో ఏమి ఆకర్షించి పర్వతరాజపుత్రి ప్రేమించింది!

శరీరసంబంధియైన కామాన్ని జయించాడు అతడు. కామాన్ని కలిగించే పంచబాణుడిని దహించాడు. ‘అపర్ణ’యై తపోబలంతో తననే సేవిస్తున్న పార్వతిని పరీక్షించదలచి కపటవేషధారియై వచ్చాడు. సతీదేవి వియోగం తర్వాత తీవ్రమైన తపస్సులో ఉన్న పరమేశ్వరుడు సతీదేవిని మరచిపోలేకో, పార్వతి ప్రేమను అంగీకరించలేకో, ఆమె ప్రేమను పరీక్షించదలచో శివున్ని హేళన చేస్తూ అనేక రకాలుగా వాదోపవాదాలు చేసాడు. పార్వతీదేవిది ఆత్మ సంబంధియైన అనశ్వరమైన ప్రేమ తత్త్వం. ఆ తత్త్వం అతనిలో ఉన్నదని గ్రహించినది కనుకనే అతన్ని ప్రేమించింది. అతని కోసం ప్రేమ తపస్సు చేసింది. తన అచంచలమైన, స్థిరమైన అభిప్రాయాలు తెలిపింది. చివరికి “అద్య ప్రభృత్యవనతాంగీ! తవాస్మ దాసః వ్రేతస్తపోభిరితి వాదిని చంద్రమౌళీ” అని పరమేశ్వరునిచే పలికించాడు కాళిదాసు. ఆ ప్రేమ పారవశ్యం జంగమములైన తిర్యగవస్థను దాటి కాళిదాసు కవితలో స్థావరములైన లతా వృక్షముల లోనికి కూడా వ్యాపించింది.

ప్రేమ కథామాలికలో మురళీకృష్ణ ప్రేమ తత్త్వాన్ని వివరిస్తూ – “మట్టి ఒకటే. ఒకచోట కుండ అవుతుంది, మరోచోట గోడ అవుతుంది. మరో చోట పొయ్యి అవుతుంది. ఇలా అనేక రూపాలు ధరిస్తుంది. అన్నీ ఒకటే కాదు. అన్నిటిలో ఉండేది మట్టే కదా అని కుండని ఎలా ఉపయోగిస్తామో గోడను అలాగే ఉపయోగిస్తామా! మా ప్రేమ జన్మజన్మలకు సంబంధించిన విషయము. ఆత్మకు సంబంధించిన విషయం. ఎలాగైతే మన్ను ఒకటే అయినా అది ధరించిన రూపాన్ని బట్టి దాన్ని ఉపయోగిస్తామో అలాగే ఆత్మ ఒకటే అయినా అది వేర్వేరు రూపాలలో ఒదగటం వల్ల భిన్నమైన లక్షణాలను ప్రదర్శిస్తుంది. నాలో ఒదిగిన ఆత్మను అతనిలో ఒదిగిన ఆత్మ ఆకర్షించింది. అతన్ని తప్ప మరొకరిని స్వీకరించలేని పరిస్థితిని కల్పించింది” అని పార్వతిచే పలికిస్తారు.

ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల పరస్పర ప్రేమ, సమాగమం వల్ల జనించి ‘కుమారుడు’ త్రిపురాసులని సంహరించి సర్వలోకాలకు చరాచర జగత్తుకు శాంతిని ప్రసాదించబోతున్నాడు. కనుక వీరి సమాగమం క్షేమకరమైన దాంపత్య సామరస్యమే కానీ కేవల లౌకిక శృంగారం కాదు.

ఆముక్త మాల్యద

విష్ణుచిత్తుడు భగవత్ ప్రసాదంగా భావించి పెంచుకున్న గోదాదేవి బాల్యం నుండి విష్ణువునే తన మనసులో నిలుపుకున్నది. కీర్తనలు, భజనలతో రోజంతా గడిపేది. అదంతా విష్ణుచిత్తుడికి ఆనందదాయకమే కానీ ఒకరోజు ఆమె ‘తాను ధరించి విడిచిన పూలమాలను విష్ణువుకి అలంకరించటం’ గమనించి అపరిమితమైన ఆవేశంతో ఊగిపోయాడు. ఆమె ప్రతిరోజు అలాగే చేస్తున్నదని తెలిసి ఆమె పైన ఆగ్రహంతోను, విష్ణువు పట్ల అపచారం జరిగిందన్న ఆవేదన తోను లోలోపల కుమిలిపోయాడు. కానీ ఆ రాత్రి స్వప్నంలో స్వయంగా విష్ణువే కనిపించి గోదా సమర్పించిన పూమాలయే తనకు అత్యంత ప్రేమ దాయకమని చెప్పడంతో శాంతించాడు.

“ఆత్మలో పరమాత్మను దర్శించి, అనుభవిస్తూ, ఆ ఆత్మను పరమాత్మకు అర్పించటానికి మించిన ప్రేమ భావన మరేం ఉంటుంది! అంతకన్నా వాంఛించేది ఏముంది” అని విష్ణుచిత్తునిచే అనిపించారు మురళీకృష్ణ. విష్ణువు పట్ల ఆమెకున్న అచంచలమైన ప్రేమ, భక్తితోనే ఆమె రచించిన 30 పాశురాల ‘తిరుప్పావై’ ఈనాటికీ ధనుర్మాసంలో దాదాపు అన్ని వైష్ణవ దేవాలయాల్లో పఠిస్తూనే ఉన్నారు. భగవంతున్ని తన మనసులోనే ప్రేమతో గెలిచిన భక్తురాలి ప్రేమ కథ, విజయగాథ ఈ కూడికుడుత్త నాచ్చియార్ కథ.

విష్ణుచిత్తుడు సపరివారంగా విలుపుత్తూరు నుండి గోదాదేవిని తీసుకొని శ్రీరంగంకి వచ్చి శ్రీరంగ నాయకుని విగ్రహానికి వివాహము జరిపించారు. అత్తవారింటికి ఎలా పంపవలెనని యోచిస్తున్నంతలో, వారందరికీ సమాధానంగా గోదాదేవి చిరునవ్వుతో అంతరాలయం లోనికి ప్రవేశించి ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది (ఇప్పటికీ పెళ్లి కాలేదని భావిస్తున్న కన్యలు, దాంపత్యంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు గోదా రంగనాథుల కళ్యాణం జరిపించినా దర్శించినా అన్ని ఆటంకాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం).

అక్కమహాదేవి

శివుని పేరు వింటేనే భరించలేని జైన మహారాజు మహాదేవిని చూచి, మోహించి, ఆమె తల్లితండ్రులను ఒప్పించి ఆమెను వివాహం ఆడాడు. చెన్న మల్లికార్జుననే ప్రేమించి, తపించి, అతనికోసం నిరీక్షిస్తున్న మహాదేవి రాజు తాకిన తన చీరను విసర్జించి నగ్నంగానే మందిరం బైటకు వచ్చి బయలుదేరింది. “శివుడినే పెళ్లి చేసుకోవాలని వెతుకుతున్న ప్రేమ సన్యాసిని, నగ్న సన్యాసిని, పిచ్చిది” అని అందరూ అంటున్నా పట్టించుకోకుండా సృష్టిలోని ప్రతి కణంలో పరమేశ్వరుని దర్శిస్తూ, అతనిలో లయమైపోవాలని తీవ్రమైన తపనతో స్మరిస్తూ అన్వేషించ సాగింది మహాదేవి.

ఊళ్ళు దాటింది. కొండలు కోనలు దాటింది. చివరకు శివభక్తులైన బసవన్న దంపతులను చేరింది. ఆమె లోని శివ స్వరూపాన్ని దర్శించాడు బసవన్న. వస్త్రాలనే కాదు ఆహారాన్నీ వదిలివేసి, శ్రీశైలం చేరి, శివునిపై ఆధ్యాత్మిక ప్రేమ ను ప్రకటిస్తూ ‘వచనాలు’ రచించి, శివైక్యం చెందింది. కర్ణాటకలో, కన్నడ సాహిత్యంలో బసవన్నకు, అక్కమహాదేవికి ప్రముఖ స్థానమున్నది.

ప్రమద్వర

ప్రేమ గురించి మాత్రమే కాదు ‘ఏమిటి బ్రతుకు, ఈ జీవితానికి అర్థం ఏమిటి’ అనే దిశగా భారతీయ పురాణాల్లో స్త్రీ పురుషుల ఆలోచనలు సాగాయి. అటువంటి తీవ్రమైన ప్రకంపనలతో కూడిన పరిస్థితి వచ్చింది రురువుకు.

ప్రమద్వర, రురువు ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా అంగీకరించడంతో త్వరలో వివాహం జరగబోతుందన్న ఆనందంలో ఉన్న ప్రమద్వర హఠాత్తుగా పాము కాటుకు గురియై విగత జీవి అయింది. తట్టుకోలేని రురువు రోదించి రోదించి, ఆమె లేని ప్రపంచమే తనకు వద్దనుకున్నాడు. “ఆమె మీద అంత ప్రేమ ఉంటే నీ ఆయుస్సులో సగం ఆమెకి ఇస్తావా” అని ఎవరో అనగా “సగం ఏమిటి, మొత్తం ఇస్తాను” అన్నాడు స్థిరంగా. అంతలో అందరి హర్షద్వానాల మధ్య ప్రమద్వర చిరునవ్వుతో లేచి కూర్చుంది. అతని ప్రేమకు ఇది తన పరీక్ష అన్నది. అందరూ సంతోషించారు. కానీ అక్కడ ఉన్న ఒక వ్యక్తిచే “మరి ఆమెకి పరీక్ష లేదా” అని ఒక ప్రశ్న వేయించి, రచయిత మురళీకృష్ణ అంటారు –

“అవసరం లేదు. స్త్రీ భావన లోని నిజాయితీని సంశయించాల్సిన అవసరం లేదు. స్త్రీ ప్రేమను శంకించాల్సిన అవసరం వస్తే ఇక ప్రపంచంలో నమ్మదగినది ఏదీ లేదని అర్థం”.

స్త్రీలపై, స్త్రీల మనసులపై, వారి వ్యక్తిత్వం పట్ల ఇంతటి పరిపూర్ణ విశ్వాసం పలకటం అద్భుతం కదా!

శశికళ

యుద్ధంలో తన తండ్రిచే ఓడింపబడి, అడవుల పాలైన సుదర్శనుని రూప వర్ణన విని అతనిని ప్రేమించింది శశికళ. తల్లిదండ్రులకు తన నిర్ణయాన్ని తెలియజేసింది. రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలైన వానికి తన కూతురు నివ్వడానికి సుబాహునికి మనస్కరించలేదు.

“స్వయంవరానికి రాజులు రావాలి అన్నారు కానీ ‘రాజ్యం ఉన్న రాజులు’ అనలేదు కదా” అన్నది శశికళ.

“నేను అతడిని ఇష్టపడటం లేదు ప్రేమిస్తున్నాను. ప్రేమకు ఇష్టపడటానికి తేడా ఉంది. ఇష్టం ఇప్పుడు ఉంటుంది తర్వాత పోతుంది. ప్రేమ అలా కాదు, అది తీవ్రమైన భావన. అది జీవితాంతం ఉంటుంది. ప్రకృతి ఎలాగ నిర్దిష్టమైన నియమ నిబంధనలకు అనుసరించి ప్రవర్తిస్తుందో, ప్రేమ కూడా అంతే. ప్రకృతిపై ఎలాగా ఎవరి అధికారం, ప్రభావం ఉండదో ప్రేమ కూడా ఎవరి అధికారానికి లొంగదు. నేను సుదర్శనునే వివాహమాడతాను” అని స్థిరంగా చెప్పింది.

సుబాహునిచే ప్రకటింపబడిన స్వయంవరానికి విచ్చేయాలని ఉవ్విళ్ళూరుతున్న వివిధ దేశాధినేతలు వీరిరువురి ప్రేమ వివరం తెలిసి ఆగ్రహోవేశాలకు లోనైనారు. స్వయంవరానికి విచ్చేసిన సుదర్శనునికి తన కుమార్తె శశికళను ఇచ్చి వివాహం చేశాడు సుబాహుడు. దంపతులు బయలుదేరిన దారి కాచి యుద్ధానికి కాలు దువ్విన రాజులను మట్టి గరిపించి గతంలో తాను కోల్పోయిన అయోధ్య రాజ్యంలోకి అడుగు పెట్టాడు సుదర్శనుడు. “శక్తి తోడు లేకపోతే శివుడు కూడా కదలలేడు. శక్తి, శివునికి నడుము ఉన్న సంబంధం, అనుబంధమే ప్రేమ” అన్నాడు అతను.

ప్రభావతి

ప్రభావతీ ప్రద్యుమ్నులది మరో అద్భుతమైన ప్రేమ గాథ. నల దమయంతుల ప్రేమకు రాయబారి అయిన హంస ఇక్కడ కూడా వీరిరువురి ప్రేమ సఫలం అవటంలో ప్రముఖ భూమిక పోషిస్తుంది. రుక్మిణీ శ్రీకృష్ణుల కుమారుడు ప్రద్యుమ్నుడు. అసమాన సౌందర్యవతి అయిన ప్రభావతి చిత్రపటాన్ని చూసి ఆమెను ప్రేమించాడు. తన తండ్రి వజ్రనాభుడికి బద్ద వైరుడైన శ్రీకృష్ణుని కుమారుడని తెలిసి కూడా ప్రద్యమున్ని చిత్రపటం చూసి ప్రభావతి కూడా ప్రేమించినది. ఇరువురు పరస్పరం చూసుకోక పోయినా శుచిముఖి అనే హంస రాయబారంతో ఒకరు గురించి ఒకరు తెలుసుకున్నారు. శ్రీకృష్ణుని వ్యూహంతో వజ్రనాభుని సభలో ప్రద్యమ్నుడు ఒక నటుడి వేషంలో తన స్నేహితులతో కలిసి ఒక నాటకాన్ని ప్రదర్శించటానికి వెళ్ళాడు. ప్రభావతి ప్రద్యుమ్నులు ఒకరినొకరు చూసుకున్నారు. హంస శుచిముఖి సాయంతో గాంధర్వ వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన వజ్రనాభుడు యుద్ధానికి కాలు దువ్వాడు. అతన్ని సంహరించడానికి సంశయిస్తున్న భర్తకి “దేవతలను అష్టకష్టాల పాలు చేస్తూ, అసురీ తత్త్వాన్ని పెంచుతూ, ద్వేషాన్ని నింపుకున్న నా తండ్రిని సంహరించి, దేవదానవులకు శుభం కలుగజేయడం తప్పు కాదు” అని కర్తవ్యాన్ని బోధించింది ప్రభావతి. శ్రీకృష్ణుడు పంపిన సుదర్శన చక్రంతో వజ్రనాభుని సంహరించాడు ప్రద్యుమ్నుడు.

“తమ ప్రేమ వల్ల జగతిలో దైవత్వం నిలపటం అసలైన ప్రేమకు నిదర్శనం. తన భర్త సంహరించినది తన తండ్రిని కాదు. అసురీతత్వాన్ని. ప్రేమ వ్యక్తిని భౌతిక పరిధిలో నుండి విముక్తను చేసి ఆధ్యాత్మిక దృష్టిని ఇస్తుంది. వ్యక్తిలోని అసురీతత్వాన్ని సంహరించి దైవత్వాన్ని నిలుపుతుంది” అని ముగిస్తారు రచయిత మురళీకృష్ణ.

ఇంకా ఈ ‘భారతీయ ప్రేమ కథామాలిక’లో ఊర్వశీ పురూరవులు, కందు మహర్షి ప్రేమలోచన, తారా శశాంకులు, యయాతి దేవయాని, మేనకా విశ్వామిత్రులు, రాధాకృష్ణులు, భద్ర ఉతధ్యులు, కచ దేవయానులు, గంగా శంతనులు వంటి భారతీయ ప్రేమ గాథలే కాక ఇరుగుపొరుగు భాషల్లోని ప్రేమ కథలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి.

ఈ రచయితే రాసిన మరొక పుస్తకం “ప్రపంచ ప్రేమ కథామాలిక” కూడా తప్పక చదవాలి. ఎందుకంటే – ఏ దేశమైనా ఏ జాతియైనా, ఏ భాషవారైనా.. అందరం మనుషులమే. శాంతి నీ, ప్రేమ నూ కోరుకునేవారమే. ప్రేమ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికీ, సమన్వయం చేసుకోవడానికీ అన్నీ చదవాలి. విశ్వ ప్రేమ భావనని పెంపొందించుకోవాలి.

వార్త ఆదివారం అనుబంధంలో వరుసగా వచ్చిన ఈ కథలను పాఠకులు ఆసక్తిగా ఆదరించారని ఆనాడు పత్రికకు వచ్చిన ఉత్తరాలే నిదర్శనం. లస్ట్ నే లవ్ అనుకుంటున్న యూత్, ఆకర్షణే అనుబంధం అనుకుని వైవాహికేతర సంబంధాలే అభివృద్ధి అనుకుంటున్నవారు, ఏదో దేని నుండో ‘విముక్తి’ అనుకుని, ఇంకేదో సాలెగూడులో చిక్కుకుని పోయి తాము, తమ వారినీ దుఃఖంలో ముంచేసేవారు నిజానిజాలు తెలుసుకోలేక పోతున్నారు. తెలుసుకునే సరికి జీవితం చేజారిపోతుంది. కస్తూరి మురళీకృష్ణ వివిధ దేశాల, నాగరికతల, సమాజాల లోని ప్రేమగాథల భిన్నత్వాన్ని, వైచిత్రాలను, ముఖ్యంగా ‘ప్రేమ తత్వాన్ని’ ఈ కథల్లో ఎంతో సంస్కారవంతంగా, ఔచిత్యంతో ఆవిష్కరించారు.

రచయితగా, వ్యక్తిగా కూడా కస్తూరి మురళీకృష్ణ పాపులారిటీకి పాకులాడరు. పబ్లిసిటీకి ఇష్టపడరు. అవార్డులకు ఆశపడరు. వేదికల కోసం ఎదురుచూడరు. పదిమందిలో జొరబడి పరిచయాలు పెంచుకోవాలని అనుకోకుండా, ఏకాంతాన్ని, పుస్తకాన్ని, రచనను, తను నిర్వహిస్తున్న ‌’సంచిక’ అంతర్జాల పత్రికను ప్రేమిస్తారు.

విస్తృతంగా, విభిన్నంగా, విశిష్టంగా తనకు నచ్చింది రాసుకుంటూ పోవడమే ఆయన నిక్కమైన నైజం.

ఆయన రాసిన పుస్తకాలన్నీ వైవిధ్యభరితమైనవే. ద్రౌపది, శ్రీకృష్ణదేవరాయలు, రోషనారా వంటివి, నీలమత పురాణం, రాజతరంగిణి, హిందీ సినిమాలు, పాటలు, గానకోకిల లత, క్రైమ్ స్టోరీస్, రియల్ స్టోరీస్, బోధిసత్వుని కథలు, భారతీయ వ్యక్తిత్వ వికాసం వంటివి.. దేనికదే విభిన్నమైన ఇతివృత్తాలు, జోనర్లు.

తను పదిమందిలోకి వెళ్ళక పోయినా తన పుస్తకాలు వెళ్ళాయి. గొప్ప సంచలనానికి కేంద్రంగా మారాయి. ఆయన భావాలను కొందరు తిడుతూనే కుతూహలంగా చదువుతారు. “తాను ఎవరికీ పోటీ కాదు” అని వినయంగా చెప్పుకునే మురళీకృష్ణ రెండు పుస్తకాలు తాజాగా విడుదలయ్యాయి.  ఆయన  మరింత సమయాన్ని కేటాయించి మరిన్ని మంచి రచనలు చేస్తారని నిర్ద్వంద్వంగా ఆశించవచ్చును.

***

భారతీయ ప్రేమ కథామాలిక (కథా సంపుటి)
రచన: కస్తూరి మురళీకృష్ణ
ప్రచురణ: సాహితీ ప్రచురణలు
పుటలు: 248
వెల: ₹ 150/-
ప్రతులకు:
సాహితీ ప్రచురణలు,
33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ 520 004
ఫోన్: 0866-2436642/43
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/Bharatiya-Prema-Kathamaalika-kasturi-Muralikrishna/dp/B084ZM6LHB

Exit mobile version