నవ్వని పువ్వుల్లో దరహాసాల్ని వెలయిస్తావు
మధ్య తరగతి మందహాసాన్ని దృగ్గోచరం చేస్తావు
మంటల్లో చిక్కుకున్న
మానవ హృదయ ఘోషల్ని వినిపిస్తావు
నీ హృదయంలోంచి మాకు ఉదయాల్ని అందిస్తావు
నీ తపస్సుతో తేజస్సులను విరజిమ్ముతావు
నాగార్జున సాగర మథనాన్ని చేసి
కవిత్వానికి రెక్కలు కట్టి వదిలేస్తావు
విశ్వనాథ నాయకుణ్ణి, కర్పూర వసంతరాయల్ని
రామప్పలను గాఢంగా కౌగలించుకుంటావు
విశ్వంభరవై ప్రపంచపదులను పంచి
కవితలో చిరునామా చూసుకోమంటావు
గజళ్ళతో మెదళ్ళ కుదుళ్ళను కదిలిస్తావు
తేనెలూరు పాఠంతో, ఉపన్యాసంతో అలరిస్తావు
అక్షరాల గవాక్షాలను తెరచి
జనులకు జ్ఞానబోధ చేసి జ్ఞానపీఠాన్ని అధిష్ఠించావు
తెలంగాణ గెడ్డపై పుట్టిన తెలుగు తల్లి ముద్దు బిడ్ద
నీవు నిర్వహించింది మరువ లేని భూమిక
నీవు మా వాడివి – అదే చాలిక!
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.