[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతునికి శరణాగతి’ అనే రచనని అందిస్తున్నాము.]
అర్జున ఉవాచ:
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే।
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః॥
అర్జునుడు భగవంతుడిని నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మన్ను ఉపాసించే వారు – వీరిలో, యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు? అని అడిగాడు. అందుకు భగవానుడు భక్తి యోగం యొక్క శ్రేష్ఠతను ఈ క్రింది శ్లోకం ద్వారా తెలియజేసాడు.
శ్రీ భగవానువాచ:
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే।
శ్రద్ధయా పరాయోపేతాస్తే మే యుక్తతమా మతాః॥
నాపైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతమూ నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను అని పై శ్లోకం భావం.
అంటే నిరంతరం భగవంతుడిపైనే మనస్సు లగ్నం చేసి, భగవంతుని రూపం తప్ప మరే ఇతరమైన దానిని దర్శించక, అహర్నిశలు భగవంతుని నామాన్నే మననం చేసుకుంటూ, సర్వస్య శరణాగతితో జీవించేవారి అందరి భక్తుల కంటే శ్రేష్ఠమని పై శ్లోకం భావం.
మానవ జన్మం మాటిమాటికీ లభించేది కాదు. మానవుని జీవిత కాలం అమూల్యమైనది. గాన దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. జీవితాలను ఇతర కార్యాలకు వినియోగిస్తే జన్మ సార్థకత చెందదు. లక్ష్యం నెరవేరదు. కావున ఈ సత్యము నెఱిగి మానవులు సర్వదా భగవత్ ప్రాప్తికి వినియోగించుకోవాలి. మన హృదయం భగవానుని మందిరం గదా! ఇవన్ని ఆ మందిర ద్వారాలుగా నిరంతరం వీటిని భగవానుని కోసమే తెరచి వుంచాలి. మన సంసారాలు- సంపద- శరీరం- మనస్సు- బుద్ధి- ఇంద్రియాలు- జీవితం-ప్రాణము అన్నియు భగవంతుని వలననే మనకు లభించాయి. ప్రాప్తించాయి. వీటిని ఆ భగవానుని పొందుటకు సాధన యందే వినియోగించాలి. అప్పుడే జీవన సాఫల్యం లభిస్తుంది.
ఆధ్యాత్మిక సాధన ప్రారంభించే ముందు శరణాగతి అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. శరణాగతి అంటే – భగవంతుని పట్ల మనకు వున్న అనన్య, దివ్య ప్రేమ వలన వారికి సర్వస్వం సమర్పించుకోవడం. మన మనస్సంతా భగవంతుడే నిండిపోయి వుండాలి. భగవంతుని యొక్క ఆలోచనలు తప్పితే మరేం చేయడానికి బుద్ధి పుట్టకూడదు. వారి ప్రేమను అత్యధికంగా పొందాలని పరితపించాలి. ఒక్కొక్క సందర్భంలో ఆ ప్రేమ లభించకపోతే భగవంతుని వదలి వెళదామనుకుంన్నా వెళ్ళలేని స్థితిలో అది అసాధ్యమని అర్థం అవుతుంది. భగవంతుడిని పట్ల అవ్యాజమైన ప్రేమతో ఆయనను వదిలి వెళ్ళలేక ఆయననే అంటిపెట్టుకొని ఉండడం, అది నిజమైన శరణాగతి అని మనం తెలుసుకోవాలి. భగవంతుడ్ని భక్తితో వెతకాలి. ఆర్తితో వెతకాలి. ఆరాటంతో వెదకాలి. సాధనతో వెదకాలి. అచంచలమైన విశ్వాసంతో వెతకగలగాలి. సర్వస్వ శరణాగతితో వెతకగలగాలి.
ఇవన్నిటినీ కలుపుకుంటూ, సమన్వయం చేసుకుంటూ వెతకాలి. వెతుక్కోగలగాలి. అప్పుడు భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ మనకి కనబడతాడు. సర్వం సర్వేశ్వరమయమై సమస్త విశ్వం దైవమయం అవుతుంది
.సత్యనిష్ట, కార్యదీక్ష ఋజువర్తనం, అంకితభావం, దృఢ సంకల్పం, పాపభీతి, సేవాతత్పరతలతో మనం జీవనం కొనసాగించాలి. వీటన్నింటినీ మిళితం చేసుకుంటూ, తగుపాళ్ళలో ఈ లక్షణాలను సమన్వయం చేసుకుంటూ, సమతుల్యతతో మనం దేవుణ్ణి వెతికిన నాడు, వెతకగలిగిన నాడు, అణువణువులోను మనకు భగవంతుడు దర్శనమిస్తాడు.