[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భగవంతుని చేరేందుకు సులభ మార్గం’ అనే రచనని అందిస్తున్నాము.]


భగవద్గీత 8వ అధ్యాయం, 14వ శ్లోకం
అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః।
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినీః॥
ఓ పార్థా, ఎల్లప్పుడూ అనన్య భక్తితో నన్ను గురించి ఆలోచించే యోగులకు, వారు నిరంతరం నాలో నిమగ్నమై ఉండటం వలన నేను సులభంగా పొందగలను అన్నది పై శ్లోకం భావం.
అర్జునుడిని నిమిత్తం చేసుకొని భగవంతుడిని పొందేందుకు సులభమైన మార్గాన్ని భగవానుడు ఈ శ్లోకం ద్వరా మానవాళికి తెలియజేసాడు.
ఆయనను పొందడం చాలా కష్టమని ప్రజలు భావిస్తారు. కానీ సరైన మార్గంలో సాధన చేయడం ద్వారా ఆయన సులభంగా ప్రాప్తిస్తాడు. ఆయన గురించి నిరంతరం ఆలోచించేవాడు మరియు ఎల్లప్పుడూ ఆయనను పొందుతాడు. భగవంతుని గురించిన ఆలోచన తప్ప మరే ఇతర ఆలోచన నుండి మనస్సు విముక్తి పొందాలి. పంచేంద్రియాలూ భగవంతుని కొరకే ఆలోచిస్తూ వుండాలి. జిహ్వపై భగవంతుని నామం మాత్రమే కదలాడుతూ వుండాలి. మనస్సు ఆయన రూపాన్ని మాత్రమే చింతిస్తూ వుండాలి. భగవంతుడు తప్ప ఇతర చింతన ఏమీ కూడా మన చిత్తంలో ప్రవేశించకూడదు. ఇప్పుడు మరియు అప్పుడప్పుడు ఆయన గురించి ఆలోచిస్తే సరిపోదు. ఎల్లప్పుడూ మరియు ప్రతి రోజూ దేవుని గురించిన ఆలోచన మనస్సులో ఉండాలి. చిత్తశుద్ధితో, పవిత్రమైన మనస్సుతో, క్రమశిక్షణతో స్థిరమైన అభ్యాసం ద్వారా, సాధన చేయడం ద్వారా, మనస్సును భగవంతుని గురించి మరింత ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం వుంటుంది.
జీవితాంతం నిరంతరం భగవంతుడిని స్మరించుకోవడం ఆయనను పొందడానికి అత్యంత సులభమైన మార్గం అన్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. భగవంతుడి అనుగ్రహం పొందేందుకు ఇంతకంటే సులభమైన మార్గం ఇంకొకటి లేదన్నది నిర్వివాదాంశం. అనన్యచేతః అంటే సాధకుడికి మరే ఇతర వస్తువు పట్ల అనుబంధం ఉండదు. అతను తన ఇష్టదేవత తప్ప మరే ఇతర వస్తువు గురించి కలలోనైనా ఆలోచించడు. నిత్యసః చాలా కాలం. అంటే జీవితాంతం వరకు. భగవంతుడిని స్మరిస్తూ ప్రారంభించేవాడు లేదా ఆరు నెలలు ఆయనను స్మరించేవాడు, ఆపై సాధనను వదిలివేసి లౌకికమైన విషయాలలో, విషయానందంలో మునిగిపోయేవాడు ఆయనను ఎంతమాత్రం పొందలేడు. స్వీయ క్రమశిక్షణ లేని వ్యక్తి మరియు తన మనస్సును మరియు ఇంద్రియాలను నియంత్రించుకోలేని వ్యక్తి దృఢమైన సంకల్పాన్ని తీసుకోలేడు. అతని మనస్సు అనుక్షణం విచలత్వానికి గురి అవుతూ వుంటుంది. అరిషడ్వర్గాలకు, ద్వంద్వ ప్రవృత్తికి లోనవుతూ వుంటాడు. కాబట్టి దేవునిపై స్థిరమైన ధ్యానాన్ని, అర్చనను కొనసాగించలేడు. మనస్సును దేవునితో ఏకం చేయకుండా శాంతిని పొండదం అసాధ్యం; శాంతి లేకుండా, ఆనందం అసాధ్యం. ఆనందం లేని మనస్సు అశాంతికి, ఆందోళనలకు నిలయంగా వుంటుంది. అన్ని భౌతిక కోరికలను త్యజించి, దురాశ, ఆధిపత్య భావన మరియు అహంకారం లేకుండా జీవించే వ్యక్తి నిజమైన అంతర్గత శాంతిని పొందుతాడని భగవానుడు మానవాళికి సందేశం ఇస్తున్నాడు.