[మాయా ఏంజిలో రచించిన ‘Communication 2’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(ప్రాచీన సాహితీ భాండాగారాన్ని నేటి తరం చదవకపోవడం బాధాకరం అన్న సత్యం గోచరిస్తుందీ కవితలో!)
~
విద్యార్థి
♠
పురాతన గ్రంథాల కాగితపు ధూళి
అతడి ముఖాన్ని ఎప్పుడూ తాకలేదు
ఏమీ తెలియని యువకుడి వెనకాల
ఫౌంటెన్ కలాలు
చీకట్లో నిశ్శబ్దంగా
ఒకచోట భద్రపరచి ఉన్నాయి
~
గురువు
♠
ఆమె తన అక్షర కృషిని పంచుకుంది
నగిషీలు చెక్కబడిన
ప్రాచీన కుడ్యాల మీద
పొడిబారిన ఆమె స్వప్నాలు
పెద్ద గదుల కిందుగా
పునర్నిర్మాణపు వేదనతో
ప్రతిధ్వనిస్తున్నాయి!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి.
‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు.
ఇప్పుడు ‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందిస్తున్నారు.