[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘భాషాభద్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
తెలుగు భాషకు ప్రాణంగా నిలిచిన శబ్దశాస్త్ర ప్రవక్తల్లో అగ్రగణ్యుడు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. ఆయన పేరు తెలుగులో పలికితే, ద్రావిడ భాషల గంభీర స్వరాల్ని, శాస్త్రీయ పరిశోధనల మూలాల్ని, పల్లె పదాల పరిమళాల్ని గుర్తుచేస్తుంది.
పశ్చిమ విద్యాసంపన్నతను భారతీయ గంభీరతతో మేళవించి, ద్రావిడభాషా కూటముల ప్రశస్తిని లోకానికి చాటిన వాడాయన.
గుండె తొలిచే శాస్త్రంగా భాష ఎదగాలని, జనపద పదజాలం నిఘంటువుల్లో వెలుగొందాలని విశ్వసించిన భద్రిరాజువారు, ఆధునిక ద్రావిడ భాషావిజ్ఞానానికి శిల్పకారుడు, చిత్రకారుడు, చరిత్రకారుడు కూడా!
పల్లెపదాల పునాదులపై అమితమైన ప్రేమ ఆయనది! ఆయన దృష్టిలో భాష అనేది తపస్సులో పుట్టే శబ్దశాస్త్రం, తలపుల మధ్య శోధించే తాత్వికం, పల్లెల్లో పలికే ప్రజాస్వరం. “దేశ్యపదం, తేలికైనది కాదు, తేజస్సుతో నిండినది” అనే ఆయన భావన, నిఘంటు నిర్మాణంలో అనేక కొత్త ఆలోచనలకు తావిచ్చింది.
వృత్తి పదకోశాల నిర్మాణం కోసం ఆయన వెచ్చించిన సమయం ప్రజల భాషకు పట్టం కట్టాలనే ఆయన తపనకు, దీక్షకు పట్టుదలకు ఒక విజయ సంకేతం!
1961లో వెలువడిన Telugu Verbal Bases అనే గ్రంథం, తెలుగు క్రియావిశ్లేషణలో మైలురాయిగా నిలిచింది. అనంతరం వచ్చిన A Grammar of Modern Telugu రచనలో ఆయన, వాడుక భాషకు అక్షర రూపం కల్పించారు. ఇది తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయంగా పాఠ్యాంశంగా అభివృద్ధి చేసింది.
ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువులో తులనాత్మకంగా ఆయన అందించిన అనేక మారుమూల తెలుగుపదాలను బర్రో ప్రభృతులు ఆయన పేరుతోనే ఆ నిఘంటువులో ఉటంకించారు.
ద్రావిడ భాషావృక్ష రూపశిల్పి ఆయన. 2003లో ప్రచురించిన The Dravidian Languages (Cambridge University Press) గ్రంథం, ద్రావిడ భాషల మూలాంశాలపై అత్యంత విశ్వసనీయమైన శాస్త్రీయ పరిశోధనగా నిలిచింది. ఇది భాషా వంశవృక్షాన్ని బహుళ పక్షాల నుంచి పరిశీలించి, దక్షిణ భారతదేశపు సంస్కృతిక బంధాన్ని భాషా మూలాల ద్వారా వివరించింది.
సంస్థాన నిర్మాణంలో సంచాలకుడు
ఆచార్యుడు కేవలం పరిశోధకుడే కాదు – ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషావిజ్ఞాన విభాగాన్ని స్థాపించిన పరిశ్రమశీలి. మైసూరు లోని కేంద్ర భారతీయ భాషా సంస్థ (CIIL)కు తొలి భారతీయ డైరెక్టర్గా బాధ్యత నిర్వహించిన ఘనత కూడా ఆయదే. పదవికి కాక, అభివృద్ధికి తన విలువను అంకితం చేసిన కర్తృత్వ పురుషుడు.
ప్రాచీన గురుకుల పద్ధతిలో, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సంస్కృత శాఖాధిపతి ముర్రే బార్ సన్ ఎమెనూ దగ్గర భద్రిరాజు వారు భాషా శాస్త్రంలో ‘Telugu verbal bases, a comparative and descriptive study’ అనే అంశం పైన పి.హెచ్.డి పూర్తి చేశారు.
1962లో మాండలిక వృత్తిపద కోశం, వ్యావసాయిక పదాల నిఘ౦టువులకు సంపాదకత్వం వహించారు. 1967లో ‘Dravidian Nasals in Brahui’ అనే అంశం మీద Comparative Linguistics భాషా శాస్త్ర విభాగంలో ఆయన వెలువరించిన వ్యాసం సంచలనం అయింది.
భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ (2008) పురస్కారం ప్రదానం చేసి గౌరవించింది. సాహిత్య అకాడెమీ ఫెలోషిప్, అనేక విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు, దేశ విదేశాల్లో ప్రసిద్ధి చెందిన ద్రావిడియన్ లింగ్విస్టిక్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి – అన్నీ ఆయన కృషికి తగిన గుర్తింపులే.
భాషాశాస్త్ర మహామహోపాధ్యాయ
తెలుగు క్రియా రూపాలకు మూలాలను సంస్కృతంలో కాకుండా సోదర ద్రావిడభాషల్లో వెదకటం అనే కృషిని భద్రిరాజువారే ప్రారంభించారు. ఆయన తన సిద్ధాంత గ్రంథంలో 1236 తెలుగు క్రియలకు సోదర భాషల నుంచి సరూప పదాలను, అర్థాలను కూర్చారు. వృత్తి పదాలను ఒక మాండలికంగా సంభావిస్తూ వృత్తిపదకోశాన్ని నిర్మించారాయన. ‘చేయుచున్నాడు’, ‘వచ్చుచున్నాడు’, ‘పిలుచుచున్నాడు’ వంటి రూపాలకన్న.. స్తున్నాడు’లో ‘తు’ ప్రత్యయమే ప్రాచీనమని నిరూపించారు. ఇది మనం సృష్టించిన ఆధునిక వ్యావహారిక భాషా రూపంగా భావించేవారికి ఏళ్ల నాడే మన పూర్వులు ఇలాంటి భాష మాట్లాడేవారనటం ఒక కనువిప్పు.
ఇంగ్లీషుకన్నా తెలుగులో చోటుచేసుకున్న భాషాపరమైన పరిణామాలను ఆయన తెలుగువారికి గల సామాజిక దృష్టికి నిదర్శనంగా వివరిస్తారు.
తెలుగులో దేశ, కాల భేదాన్ని స్పష్టంగా విడమర్చి చెప్పటం తక్కువ. ఉదా: “ఎంతదాకా వెళ్తావు? ఎంతదాకా ఉంటావు?” అన్నప్పుడు దేశంలో కాలంలో ఉన్న దూరపరిమితిని సూచించటానికి ‘దాకా’ అనే ప్రత్యయం ఉపయోగిస్తాం. అందాకా, అప్పటి దాకా…ఇలా! ఇంగ్లీషులో హౌ ఫార్, హౌ లాంగ్ లాంటి వ్యత్యాసాలున్నాయి.
అలాగే ఎన్ని ఆవులు అనీ ఎందరు మనుషులు అనీ వ్యక్తులను ఒక విధంగా వ్యక్తులు కాని వాటిని ఒక విధంగా పిలుస్తాం. ఇంగ్లీషులో హౌమెనీ? తో సరిపెడతారు.
ఇంగ్లీషులో హౌస్, హోమ్ అనేవి చాలా విస్తృతమైన అర్థాలు కలిగిన పదాలు. కానీ, వాటిని వాడే వ్యక్తి స్థాయి ఈ పదాలను బట్టి తెలీదు. వాడు గుడిసెలో ఉన్నాడు, వాడి పూరిపాక లోపల చల్లగా ఉంటుంది, ఆ పెంకుటింట్లో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి, ఆ డాబా గదిని అతిథుల కోసం ఇస్తారు, మేడపైన రైతింకో మిద్దె కూడా వేశాడు, ఆ మండువా ఇంట్లో పది కుటుంబాలైనా నివసిసించవచ్చు.. ఇలా తెలుగులో ఉన్నంత చక్కగా హౌస్ అనే పదం ఆర్థిక స్థాయిని సూచించేదిగా ఉండదు.
ఇలా తెలుగు భాషలో పదరూపాలు తెలుగు సమాజానికి సహజమైన పద్ధతిలో రూపొంది ఉంటాయి. ఇటీవల ఆచార్య వెల్చేరు నారాయణరావు గారు తెలుగు భాషను ఎలాఎందుకు తెల్గైఒన రీతిలో పలకాలో వివరిస్తూ మంచి పుస్తకం వెలువరించారు.
వాడుక భాషకు వ్యాకరణ సూత్రాలను నిర్ణయించేప్పుడు ఈ సామాజికాంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఉంది.
సాంకేతికపదాల అనువాదం
ఆధునిక సాంకేతికత నానాటికి విస్తరిస్తున్న కొద్దీ సాంకేతిక పారిభాషికపదాలు వ్యాప్తిలోకి వస్తున్నాయి. భాషను ఆధునికం చేసుకోవటం అంటే ఆధునికావసరాలకు తగినట్టుగా మన భాషను తీర్చిదిద్దుకోవాలని గ్విన్ కమిటీ నివేదిక సూచించగా భద్రిరాజువారు దానికి అనుబంధంగా సాంకేతికపదాల వినియోగం గురించి కొన్ని అదనపు సూచనలు చేశారు. శాస్త్ర సాంకేతిక అంశాలను తెలుగులో వ్రాయటానికి చదవటానికి ఈ సూచనలు ఉపయోగపడతాయి. అవసరమైనచోట సాంకేతికపదాలను యథాతథంగా పరిచయంచేస్తూ వివరణకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. అంతేగానీ సాంకేతిక పదాలను అనువాదం చేయాలనుకోవటం సరికాదన్నారు
“Any attempt at translating one technical term of the host language by one term in the borrowing language is bound to fail since it ignores the fact that no two languages classify concepts identically.”
1970లలో తెలుగు అకాడెమీ డిగ్రీ స్థాయి వరకూ ప్రచురించిన తెలుగు మాధ్యమం పాఠ్యపుస్తకాలలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. నేను సైన్సు విద్యార్థిని, ఇంటర్మీడియట్ తెలుగు మాధ్యమంలో చదువుకున్నాను. ఫెరన్ మొక్క ఆకులు లేతగా ఉన్నప్పుడు అవి మెలికలు తిరిగి ఉంటాయి. దీన్ని సర్సినేట్ వెర్నేషన్ అంటారు.. ఇలా వివరించినట్లయితే తెలుగు మాధ్యమం ఎంతయినా వర్థిల్లి ఉండేది. కానీ అత్యుత్సాహపరులైన సంస్కృతపండితులతో శాస్త్ర విషయాలను రాయించటం చేత కాబోలు వాళ్లు సర్సినేట్ వెర్నేషన్ అనే సాంకేతిక పదాన్ని ‘వలిత కిసలయ విన్యాసం’ అని అనువదించారు. ఇది భద్రిరాజువారి సూచనకు విరుద్ధం. వలిత అంటే మెలికలు తిరగటం, కిసలయాలంటే లేత ఆకులు. ఈ అర్ధం సైన్సు బోధించే లెక్చరర్లకు తెలీదు. ఎందుకంటే వాళ్లు సంస్కృతం చదివినవారు కాదు. ఇది చదివిన విద్యార్థికి సర్సినేట్ వెర్నేషన్ అనే సాంకేతికపదం తెలీదు. అందువలన పై చదువులకు వెళ్తే అంతా అయోమయం అయ్యింది.
వెర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక గల ప్రాణులు, ఇన్వెర్టిట్రేట్స్ అంటే వెన్నెముక లేని ప్రాణులు అని తేలికగా అర్థం అయ్యేలా సాంకేతిక పదాల వివరణ ఉండాలేగానీ కశేరుకాలు, అకశేరుకాలు అనటం ధర్మం కాదు. తెలుగులో సహజమైన పదనిర్మాణ వ్యవస్థ ఉండాలని సూచించిన మహోపాధ్యాయులు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. భాషకు సంబంధించినంతవరకూ ఆయన గురుద్రోణులే!
2005లో విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో తెలుగు భాష మీద ఒక అధ్యయన సదస్సును ప్రారంభిస్తూ, తాను తెలుగు మీడియంలో చదివాను కాబట్టే, ఈరోజు ఇలా అంతర్జాతీయ భాషావేత్తను కాగలిగాననీ, ఇప్పటి వాళ్ళలాగా ఇంగ్లీషు మీడియంలో చదువుకొని ఉంటే రెంటికీ చెడే వాణ్ణనీ చెప్పుకొన్నారు. మానసిక శాస్త్రపరమైన అనేక అంశాలు మాతృభాషని ప్రభావితం చేస్తాయని ఆ సదస్సులో ఆయన వివరించారు.
ప్రలోభాలకు లొంగని విశిష్ట వ్యక్తిత్వం
‘సుసుమూ ఓనూ’ అనే ఒక జపానీ ఔత్సాహిక భాషాశాస్త్ర పరిశోధకుడు ‘ది జెనియాలజీ ఆఫ్ జపనీస్ లాంగ్వేజీ’ వ్యాస౦లో జపానీ భాషలో కొన్ని పదాలు తమిళ పదాలుగా చిత్రించే ప్రయత్నం చేశాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో తమిళ ఆచార్యుల ప్రేరణతో ఆ విధ౦గా ఆ పరిశోధన సాగింది.
‘తొకునాగ’ అనే జపానీ భాషావేత్త ఈ అధ్యయనాన్ని ఖండిస్తూ, అది misuse of DEDR అన్నాడు. “భాషా శాస్త్ర రహస్యాలను తెలుసుకోవాలంటే, హైదరాబాదులో భద్రిరాజు కృష్ణమూర్తి అనే ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన్ను ఆశ్రయించు,” అంటూ తొకునాగ ఆ వ్యాసకర్తను మందలించారు కూడా! అవి ద్రావిడ పదాలనీ, తెలుగులో కూడా అవి సజీవంగా ఉన్నాయనీ “బౌద్ధ యుభంలో తెలుగు వారికి జపానీయులతో ఏర్పడ్డ సాంస్కృతికపరమైన, వాణిజ్య పరమైన సంబంధాలు ఇందుకు కారణం కావచ్చని నేను ‘సుసుమూ ఓనూ’కు సమాధానంగా ఒక వ్యాసం ప్రచురించాను. దానికీ భద్రిరాజువారు అంగీకరించక నాలుగు అక్షింతలు నాకూ వేశారు. “నిజంగా జపనీసుకు ఏదయినా ఉంటే, ప్రాచీన ద్రావిడ౦తో ఉండాలి తమిళంతో ఎలా ఉంటు౦ది..?” అని 1982లో జపాన్లో జరిగిన అంతర్జాతీయ భాషాశాస్త్ర సదస్సులో తాను ప్రశ్నించినట్టు ఆయన స్వయంగా పేర్కొన్నారు.
ఎక్కడయినా తమిళులు గానీ, తెలుగు వారు గానీ, జపానీయులతో సహజీవనం చేసిన దాఖలాలు ఉంటేనే పదాల ఆదాన ప్రదానాలు జరిగే అవకాశం ఉందని, అలా౦టిదేమీ జపనీయులతో లేనప్పుడు తమిళ పదాలు గానీ, తెలుగు పదాలు గానీ జపానులోకి వెళ్ళే అవకాశ౦ లేనే లేదని ఆయన కరాఖండిగా చెప్పారు.
ఈ ‘సుసుమూ ఓనూ’ ఒకసారి భద్రిరాజువారిని కలిసి, “Prof. Krishnamurthy, if you can accept my theory, I will take you to Japan” అని ఆశ పెట్టబోయాడట. ఎవరైనా ట్యూటర్ పని చేసుకొనే వాడి దగ్గరకు పోయి చెప్పమని ఆయన తిప్పికొట్టినట్టు స్వయంగా భద్రిరాజు వారే వెల్లడించారు.
ఇది ఒక అంతర్జాతీయ స్థాయి భాషావేత్త అంకితభావానికి ఒక తార్కాణం.
ప్రాచీనతా హోదా విషయంలో భద్రిరాజు వారి పాత్ర
తమిళ రాజకీయ పార్టీలతో ఎన్నికల అవగాహన ఫలితంగా తమిళ భాషకు ఉదారంగా క్లాసికల్ భాషా ప్రతిపత్తిని కల్పి౦చే౦దుకు పూనుకొని, కేంద్రప్రభుత్వం ఒక నిపుణుల సంఘాన్ని నియమించింది. కేంద్ర సాహిత్య అకాడెమీ-న్యూఢిల్లీ, భారతీయ భాషా కేంద్రం-మైసూరు ఈ రెండు సంస్థల అధ్యక్షులతో పాటు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర గృహ వ్యవహారాల శాఖ కార్యదర్శి, సాహిత్య అకాడేమీ కార్యదర్శి కూడా అందులో సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ బాధ్యత క్లాసికల్ ప్రతిపత్తిని తమిళ భాషకు కేటాయించే విషయమై సరళమైన మార్గదర్శకాలు రూపొందించటమే అనేది వేరే చెప్పనవసరం లేదు. అందుకు ప్రమాణార్హతలను నిర్ణయించే బాధ్యతను భాషావేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారికే అప్పగించారు. కానీ, భద్రిరాజు వారు ఎక్కడా లొంగకుండా తమిళంతో పాటు అన్ని భారతీయ భాషలకూ సమాన న్యాయం జరగాలని భావించారు.
2004, సెప్టెంబరు, 2వతేదీన ఈ కమిటీ సమావేశమైనప్పుడు భద్రిరాజు వారు నాలుగు ప్రమాణార్హతలను కమిటీ పరిశీలన కోసం ప్రతిపాదించారు.
- High antiquity of the early text/recorded history may be 1500-2000 years: 1500 నుండి 2000 దాకా కనీస ప్రాచీన చరిత్ర కలిగిన భాష అయి ఉండాలి. ఈ సూత్రంలో భద్రిరాజు వారు early texts అనే పదాన్ని, may be అనే పదాన్ని చాలా ముందు చూపుతో ప్రయోగించారు. 1500 నుంచి 2000 సంవత్సరాల నాటి ఒక్క అక్షరం దొరికినా ఆ భాషను ప్రాచీనమైనదిగా గుర్తించవచ్చనేది ఆయన భావన. ఇప్పటికి తమిళానికే ఇచ్చినా, భవిష్యత్తులో తెలుగు కన్నడ, ఇతర దేశీయ భాషలకు కూడా దీన్ని వర్తింప చేయవచ్చనే ఊహ ఆయన మనసులో ఉండటమే ఇందుకు కారణం.
- A body of ancient Literature/Texts which is considered as valuable heritage by generation of speakers: ఆ భాషకు ప్రాచీన పరంపర ఈ నాటిదాకా కొనసాగుతూ ఉండాలనేది రెండవ నియమం. ఇది తెలుగు, కన్నడ భాషలను ప్రత్యేక౦గా దృష్టిలో పెట్టుకొని ఏర్పరచిన నియమం.
- The literary tradition be original and not borrowed from another speech community: భాషా సంప్రదాయాలనేవి స్వయంజన్యమైనవిగా ఉండాలి, ఇంకొక భాషా జాతీయుల నుంచి ఎరువు తెచ్చుకొన్నవి కాకూడదు అనేది మూడవ నియమం.
- The Classical Language and Literature being distinct from modern, there may also be a discontinuity between the classical language and its inner forms or its varieties. ఆధునికంగా వ్యవహారంలో ఉన్న రూపానికి ఆ ప్రాచీన భాష భిన్నమైన రూపం కలిగి ఉన్నప్పుడు ఆ రెండు రూపాలమధ్య కాల వ్యవధి ఉండవచ్చుననేది నాలుగో సూత్రం. ఈ సూత్రంలో ఒక వెసులుబాటుగా పాళీ, ప్రాకృతాలనూ, మళయాళాన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సమదృష్టితో భద్రిరాజు వారు ఈ నాలుగో ప్రమాణార్హత ప్రతిపాదించారని బోధపడుతోంది.
ఆ సమావేశం మినిట్సులో ఈ నాలుగు సూత్రాలనూ భద్రిరాజు వారే సూచించినట్లు రికార్డయి ఉంది.
ఈ ప్రాచీనతా గుర్తి౦పు అనేది భాషకే గానీ ఆ భాషలో వచ్చిన సాహిత్యానికి కాదు అనే విషయంలో భద్రిరాజు వారికి స్పష్టత ఉంది. కనీసం 1500 నుంచీ 2000 సంవత్సరాల ప్రాచీనత ఒక భాషకు ఉన్నప్పుడే అది విశిష్ట సంపన్న ప్రాచీన భాష అవుతుందనేది ఆయన గట్టి నమ్మకం. అత్యంత ప్రాచీనమైన లిఖిత చరిత్ర కలిగిన ఒక ఉదాత్తమైన భాషని, తరువాతి తరాలకు అనుసరణీయమైన, అనుకరణ నీయమైన భాషని క్లాసికల్ భాషగా ఆయన నిర్వచించారు. ప్రమాణార్హతలను కూడా ఈ నిర్వచనాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆయన రూపొందించారు.
2008 ఫిబ్రవరి, 17, 18 తేదీలలో ద్రవిడ విశ్వవిద్యాలయం, మైసూరు భారతీయ భాషా కేంద్రం, కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ సంయుక్త౦గా విజయవాడలో తెలుగు భాష- ప్రాచీనత పైన నిర్వహి౦చిన జాతీయ సదస్సుని ఆచార్య భద్రిరాజు వారు ప్రారంభి౦చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్గతంగా నిపుణుల కమిటీ సమావేశ౦లో జరిగిన ఎన్నో విషయాలను సభా ముఖంగానే వెల్లడించారు. “ఇవన్నీ అప్లై చేస్తే, ఫలాన భాష క్లాసికల్ లాంగ్వేజి అవుతుందని ‘వాళ్ళు’ చెప్పొద్దన్నారు. మీరు నిర్వచనాలు చెప్పండీ, ప్రమాణాలు చెప్పండీ, ఫలాన భాషకు మాత్రమే ఈ గుర్తింపు నివ్వమని మాత్రం చెప్పక౦డి- అన్నారు. ఎందుక౦టే, వాళ్ళు చేయదలచుకొన్నది చేస్తే గదా. రాజకీయం?” అన్నారాయన.
ఈ విషయాలను ఆయన స్వయంగా వెల్లడించకపోతే బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండదు. ఈ నాలుగు సూత్రాలను అనేక దేశీయ భాషలను దృష్టిలో పెట్టుకొని ఎంతో ము౦దు చూపుతో ఆయన ప్రతిపాదించిన సంగతి అప్పట్లో ‘వాళ్ళకు’ గమనింపు ఉండి ఉండదు.
2004 సెప్టెంబరు 17న కేంద్ర క్యాబినెట్ ఈ తీర్మానాన్ని ఆమోదించి, తమిళాన్ని మాత్రం క్లాసికల్ భాషగా ప్రకటించింది. 2004 అక్టోబరు 12న గెజిట్ నోటిఫికేషన్ అయింది. అందులో అత్యంత ఆశ్చర్యకరంగా భద్రిరాజువారి ప్రతిపాదనలను తుంగలో తొక్కి, మొదటి ప్రమాణార్హతలో ఉన్న 1500-2000 సంవత్సరాల ప్రాచీనతను 1000 సంవత్సరాలకు కుదించి తమిళ భాషకు క్లాసికల్ హోదాని కట్టబెట్టింది! నిపుణుల కమిటీ మినిట్సులో ఈ వెయ్యేళ్ళ ప్రస్తావనే లేదు. భద్రిరాజువారి కళ్ళు కప్పి కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్వతంత్ర్య నిర్ణయం తీసుకొన్నారన్నమాట. ఈ చర్య భద్రిరాజువారిని ఎంతో బాధించింది.
“తమిళాన్ని ఇలా గుర్తించారు. అప్పుడింకా సంస్కృతాన్ని గుర్తి౦చలేదు. తర్వాత ఎవరో చెప్పారు. అయ్యా, సంస్కృతాన్ని మీరు ఇప్పటివరకూ చెయ్యలేదు కదా.. మరి, తమిళాన్ని చేస్తే, సంస్కృతం సంగతి ఏమవుతుందీ అని! అప్పుడు వీళ్ళు సంస్కృతాన్ని కూడా క్లాసికల్ భాష అన్నారు. ఇంత అయోమయంగా జరిగిందిది. అక్కడ దయానిధి మారన్ గారు ఉండి, ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాస్తు౦డేవారు. ఇది కేవలం రాజకీయమైంది.” అన్నారాయన.
దయానిధి మారన్ 2005లో జనవరి 27న, మార్చి 22న ప్రధానికి ఉత్తరాలు రాసినట్టు విశ్వసనీయంగా తెలుస్తో౦ది. Revise the antiquity criteria from over 1000 years early texts/recorded history- to over 2000 years and declare Sanskrit also as a classical language along with Tamil -దేశంలోని ఇతర భాషలకు క్లాసికల్ హోదా ఇవ్వాలంటే, ఈ వెయ్యేళ్ళ కాలపరిమితిని 2000 సంవత్సరాలకు పెంచాలనీ, తమిళంతో పాటు సంస్కృతానికి కూడా ప్రాచీనతా హోదా ఇవ్వాలనీ కరుణానిధి గారు కోర్తున్నారనేది ఈ ఉత్తరాలలో సారాంశం.
ప్రపంచం గుర్తించిన సంస్కృత భాషకు తమిళం తరువాత అది కూడా కరుణానిధి గారు దయతలచి ఇవ్వమన్న తరువాతనే భారత ప్రభుత్వం ఇవ్వగలగటం ఒక విచిత్రం. భాషల మధ్య చిచ్చు రగిల్చే ఈ ధోరణిని భద్రిరాజువారు నిర్ద్వంద్వంగా ఖండించారు.
“ప్రపంచంలో ఇలా ఏ ప్రభుత్వాన్నీ ఏ భాషనీ ఆధునిక భాషగా కానీ, ప్రాచీనభాషగా కానీ, క్లాసికల్ భాషగా గానీ గుర్తించవలసిందిగా ఎవరూ అడగలేదు. ఈ గుర్తింపు, ప్రభుత్వాలు చేసే పని కాదు. స్కాలర్స్ చేయవలసినది. సంస్కృతం క్లాసికల్ భాష ఎందుకయింది..? క్లాసికల్ లక్షణాలు అందులో ఉన్నాయి కాబట్టి అయింది.” అన్నారాయన.
ప్రాచీనతే కొలబద్ద అనుకొంటే, తెలుగు భాష నిస్సందేహంగా 3000 ఏళ్ళ క్రితం నాటిదని భద్రిరాజు వారు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
“శాతవాహనుల కాలం నుంచే శాసనాలలో తెలుగు మాటలున్నాయి. టెక్స్ట్ అంటే, సాహిత్యమనే కాదు, రికార్డెడ్ హిస్టరీ.. వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు, గోండి కొండ, కూయి, కువి, పెంగో, మంద.. ఇవి ఒక శాఖ. తమిళం కన్నడం, మళయాళం ఇదొక శాఖ. ఈ రెండు శాఖలు క్రీ. పూ. 10వ శతాబ్దిలో విడివడ్డాయి..”, “ఇప్పుడు మనం ఆధునిక తెలుగు భాషకు ఏ లక్షణాలు ఉన్నాయని అనుకొంటున్నామో ఆ లక్షణాలన్నీ నన్నయకు ముందే తెలుగు భాషకు ఏర్పడ్డాయి. ఏడో శతాబ్దిలోనే శకటరేఫ ‘ఱ’మామూలు రేఫ ‘ర’తో కలిసిపోయింది. ఏఱు ఏటి అవుతుంది. ఊఱు ఊరి అవుతుంది కానీ ఊటి కాదు. క్రావడి ఉన్న అంశాలు కొన్ని అప్పటికే తెలుగులో వచ్చేశాయి. తమిళం కన్నడాలలో ‘మరన్’ అని ఉంది. తెలుగులో మ్రాను అయింది. గోది, కుయి, మంద వీటన్నింటిలో కూడా అట్లా మారిపోయింది. అంటే మొదటి రెండక్షరాలూ టెలిస్కోపయినాయి. మ్రాను, క్రొత్త, ప్రాత ఇలాంటి శబ్దాలు క్రీస్తుపూర్వ౦ ను౦చే ఏర్పడ్డాయి. నన్నయ కాలానికే చాలా వరకూ మార్పు వచ్చేసింది.” అని వివరించారు.
ఏది ఏమయినా ఎంత రాజకీయ చాతుర్యం ప్రదర్శించినా, కరుణానిధి పుణ్యమా అని, తమిళం వెయ్యేళ్ళ ప్రాచీన భాషగానూ, తెలుగు కన్నడాలు 2000 ఏళ్ళ ప్రాచీన భాషలుగానూ గుర్తింపు పొందాయి.
నైతికంగా తమిళులు ఈ విధంగా గొప్ప చారిత్రాత్మక తప్పిదాన్ని చేసుకున్నారు. భాషాభివృద్ధి చేయటానికి క్లాసికల్ భాష అయి ఉండాలనే నియమం పెట్టడాన్ని, అందుకోసం భాషా రాజకీయాలు నడపటాన్ని భద్రిరాజువారు, ఇష్టపడటం లేదు. ప్రమాణార్హతల రూపకల్పన విషయంలో భద్రిరాజు వారు ఇలా చెప్పారు:
“నేను దీంట్లో చిన్న కిటుకు పెట్టాను, High antiquity of the early texts అనే చోట, ఇలా ఎందుకు పెట్టానంటే, తెలుగు, కన్నడం కూడా దీని కిందకు వస్తాయని! దీని కోసమే పెట్టి తరువాత వాళ్ళకి నేనొక నోట్ రాశాను. భాషా శాస్త్ర ప్రమాణాలను బట్టి, తెలుగులో మొట్టమొదటి సాహిత్య గ్రంథం ఐదు లేక ఆరు శతాబ్దాలలోనే వెలువడి ఉండాలని చెప్పాను. ఈ ప్రమాణాలలో శాస్త్రీయత ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో ముందు ఉండి ఉంటుందని నేను ఈ కమిటీ వాళ్ళకు చెప్పాను. తర్వాత ఇంకొకాయన వచ్చారు. ఒక పెద్దమనిషి-నేను పేరు చెప్పను-ఆయనొచ్చి అది అట్లా కాదండీ, తీసెయ్యాలి, మీరు రాసింది తీసేసి 2000 సంవత్సరాల సాహిత్యం అని అనాలి-అన్నారు. నేను అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వం కూడా ఈ పదాన్ని మార్చలేదు. నేను రాసింది అలానే ఉంది ఈ నాటికి కూడా” అని తదనంతర పరిణామాలను ఆయన వివరించారు.
ఇక్కడ ముఖ్య విషయం ఒకటుంది. భద్రిరాజు వారు పంపిన నోట్ శక్తిమంతంగా పని చేసింది. ఆ నోట్ లో ఆయన ముఖ్య మైన 3 అంశాలను ప్రస్తావించారు.
- తెలుగు కన్నడం, మళయాళం మూడు భాషలూ క్లాసికల్ ప్రతిపత్తిని పొందటానికి అర్హమైనవే!
- సంస్కృత ప్రభావం ఉన్నది కాబట్టి తెలుగు కన్నడ మళయాళ భాషలకూ ఈ హోదాని ఇవ్వరాదనటం తప్పు. సంస్కృత ప్రభావం తమిళ భాషమీద కూడా గణనీయంగా ఉంది. తొల్కాప్యం అంటే తొలి కావ్యం. ఇది సంస్కృత పదమే!
- I recommend that, besides Sanskrit, Pali, Prakrit and Tamil, the Government of India should recognize the above three languages-Telugu, Kannada and Malayalam-as classical languages. Otherwise they will be hurting the feeling of 3/4th of the speakers of the Dravidian languages.
భద్రిరాజు వారి నోట్ అందిన అనతి కాలంలోనే కేంద్రప్రభుత్వం వేగంగా స్పందించి తెలుగు కన్నడ భాషలకు క్లాసికల్ హోదాని ప్రసాదించింది. దీని వెనక జరిగిన ప్రజాపోరాటాలు, భాషోద్యమ కార్యక్రమాలు, రాజకీయ వత్తిళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ, ఒక అంతర్జాతీయ భాషావేత్త గట్టి ప్రతిపాదనతోనే ఈ విజయం సాధ్యమయిందనేది వాస్తవం.
భద్రిరాజువారి నోటు లో సూచించిన విధంగా 2024 మహారాష్ట్ర ఎన్నికలకు ఒకనెల రోజుల ముందు, మరాఠీ, పాళీ, ప్రాకృతం, బెంగాలీ, అసామీ భాషలకు క్లాసికల్ హోదాని కేంద్ర ప్రప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల ప్రయోజనానికి క్లాసికల్ హోదాని ముడిపెట్టే ఒక దుష్ట సాంప్రదాయాన్ని 2008లో ఆనాటి కేంద్రప్రభుత్వమూ, 2024లో ఈనాటి కేంద్రప్రభుత్వమూ ఒకే తీరున నుసరించాయి. ఈ భాషలకు కూడా ప్రామాణిక సూత్రాలు ఆనాడు భద్రిరాజు వారు సూచించినవే కావటం విశేషం.
ఇక్కడ ఒక నిజాన్ని తప్పకుండా మనం ఒప్పుకోవాలి.
క్లాసికల్ స్టేటస్ అనేది తమిళులకు ఇచ్చాక మనం పౌరుషం కొద్దీ మా సంగతేమిటి అని అడిగామే గానీ నిజంగా దాని అవసరం మనకు ఎంత ఉన్నది అనేది సందేహమే! ఉద్యమాలు నడిపాము రాజకీయ వత్తిళ్ళు ప్రయోగించాము.. ఆవేశ కావేషాలెన్నో ప్రదర్శించాము కూడా!
విజయవాడలో జరిగిన సభలో భద్రిరాజు వారు ఈ స్టేటస్ వస్తే ఏం చేసుకుంటారని. అది శుద్ధ దండగమారి వ్యవహారం అని, వాళ్లిస్తారనుకుంటున్న 100 కోట్లు మీ ముఖ్యమంత్రిని అడిగి కేటాయింప చేసుకోలేరా? అని తీవ్రంగానే ప్రశ్నించారు.
అప్పట్లో ఉద్యమం నడుస్తోంది కాబట్టి, పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుందని ఊహ లేదు కాబట్టి, ఆయన మాటలు సభలో ఎవరికీ రుచించలేదు. అందరమూ నిజంగానే క్లాసికల్ స్టేటస్ వలన భాషకేదో ఒరిగిపోతుందనే అనుకున్నాం. అంతా పగటి కల అనీ భద్రిరాజువారు చెప్పినట్టే జరిగింది.
ఏ పీఠం కోసం తెలుగు భాషోద్యమం పోరాడి సాధించిందో ఆ ప్రాచీన సంపన్న భాషాపీఠానికి భాషోద్యమం పట్ల రవ్వంత గౌరవం లేదు. అక్కడేం జరుగుతోందో, అది ఏర్పడిన పుష్కర కాలంలో అక్కడ ఎంత పరిశోధన జరిగిందో, భాషకు ఏ ప్రయోజనం దానివలన నెరవేరిందో భాషావేత్తలకు కూడా తెలీదు.
తెలుగువారి పెద్దాయన ఉపరాష్ట్రపతి హోదాలో శ్రీ వెంకయ్య నాయుడు గారు తన భవనాన్నిచ్చి నెల్లూరుకు పీఠాన్ని రప్పించగలిగారు. వచ్చి కూడా పదేళ్ళవుతోంది.. అంతే!
భద్రిరాజు వారి అంతర్జాతీయ స్థాయి
ప్రాచీన గురుకుల పద్ధతిలో, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సంస్కృత శాఖాధిపతి ముర్రే బార్ సన్ ఎమెనూ దగ్గర భద్రిరాజు వారు భాషా శాస్త్రంలో ‘Telugu verbal bases, a comparative and descriptive study’ అనే అంశం పైన పి. హెచ్ డి పూర్తి చేశారు. 1962లో మాండలిక వృత్తిపద కోశం, వ్యావసాయిక పదాల నిఘ౦టువులకు సంపాదకత్వంవహించారు. 1967లో ‘Dravidian Nasals in Brahui’ అనే అంశం మీద Comparative Linguistics భాషా శాస్త్ర విభాభంలో ఆయన వెలువరించిన వ్యాసం సంచలనం అయింది.
1972 లో తిక్కన పదప్రయోగ కోశ౦, Brahuiమాండలిక వృత్తిపదకోశం రెండవ భాగం చేనేత పదప్రయోగాలు వెలువరించారు.
1975-76 Centre for Advanced study in Behavior Science-Stanford University కి Resident fellow గా నియమించింది.
అబ్బూరి వారి సలహా మేరకు భాషా శాస్త్ర పరిశోధన వైపు ఆయన దృష్టి మళ్ళింది.
1949-61 ఆంధ్రవిశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసరుగా 1960-61 కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం రీడరుగా, 1961-62 వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రీడరుగా ఆయన్ కెరీర్ ప్రారంభం అయింది.
1962లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర విభాభం ఆయన తోనే ప్రారంభం అయింది. దాని తొలి అధ్యక్షుడిగా ఎందరో తెలుగు భాషావేత్తలు రూపొందటానికి ఆయన కారకు లయ్యారు.
1986లో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా రెండుమారులు పనిచేశారు.
1993-99 హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, 2003లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్య పదవులను నిర్వహించారు.
1967 మిచిగాన్ విశ్వవిద్యాలయం, 1967, 1970 కార్నెల్ విశ్వవిద్యాలయం, 1974లో ఆస్ట్రేలియన్ నేషనల్ విశ్వవిద్యాలయం, 1982 టోకియో విశ్వవిద్యాలయం, 1983లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, 1995 లో టెక్సాస్ విశ్వవిద్యాలయాలలో ఆయన విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు.
జెర్మనీలోని లీస్జీగ్ ఇవల్యూషనరీ యాంధ్రపాలజీ సంస్థలో కూడా ఆచార్యులుగా వ్యవహరించారు. 1970లో ‘లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా’కూ, 1980లో ‘ద్రవిడియన్ మంగ్విస్టిక్స్ అసోసియేషన్’కూ, ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు.
1975లో హవాయి విశ్వవిద్యాలయం విశిష్ట భారతీయ పరిశోధకుడి పురస్కారం అందించింది. 2004లో సాహిత్య అకాడెమీ ఫెలోగా ఆయన గౌరవం పొందారు.
1990-2002 వరకూ కేంద్ర సాహిత్య అకాడెమీ కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. 1998లో శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, 2007లో ద్రావిడ విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.
2008లో సి పి బ్రౌన్ అకాడెమీ తెలుగు భారతి తొలి పురస్కారాన్ని అందించింది. ఆటా, తానా లాంటి సంస్థలు వీరిని పురస్కారాలతో గౌరవించాయి.
తెలుగుజాతి భద్రిరాజు వారిని ఉదయాన్నే తలచుకొని దణ్ణమెట్టుకోవాలి. మన కోసం, భాష కోసం ఆయన చేసిన కృషి అంతటిది.
భాషకు రాజరికం దక్కించిన భాషా ప్రేమికుడాయన! తెలుగు భాష చరిత్రలో, ఆధునిక శాస్త్రీయ పరిశోధనకు రంగప్రవేశం కలిగించి, అంతర్జాతీయ మంచిపై తెలుగుని నిలబెట్టిన వ్యక్తిత్వం ఆయనదే. పండితపఠనానికే పరిమితమయ్యే భాషా అధ్యయనాన్ని, గ్రామీణ గదుల గట్టులపై వెలిగించిన విద్యుత్ దీపంగా తీర్చిదిద్దిన ధ్యేయవాది.”పదమే శ్వాస – భాషే జీవధార! ఆ శ్వాసలో శాస్త్రీయ పుటలు జోడించి తెలుగుని సంరక్షించిన ఆచార్యుడు భద్రిరాజు కృష్ణమూర్తి.
ఒక సిద్ధుడు, ఒక ప్రసిద్ధుడు, ఒక జగత్పసిద్ధుడు అయిన మహోన్నత భాషా శాస్త్రవేత్త మరణించి నప్పుడు భాష మరణించినంత పెను విపత్తు కలుగుతుంది. అందవలసినంత ప్రాణవాయువు అందకపోతే ఊపిరాడనట్టే అవుతుంది. తెలుగు భాష మూలాలను వెదికే విషయంలో భాషాంతరంగవేది ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి 11 ఆగష్టు, 2012న మరణించినప్పుడు భాషాభిమానులందరికీ ఇదే భావన కలిగింది. ఆయన లేని లోటును మరొకరితో పూరించగలిగే పరిస్థితి లేదు. తెలుగువారికి గర్వకారణమైన, ఆరాధనీయమైన అపురూప వ్యక్తిత్వం, అంతర్జాతీయ ఖ్యాతి మరొకరిలో కానరాదు.
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.