Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బాంచెను కాల్మొక్త!!

[శ్రీ సముద్రాల హరికృష్ణ గారి ‘బాంచెను కాల్మొక్త!!’ అనే రచనని అందిస్తున్నాము.]

“అమ్మ! బాంచెను కాల్మొక్కుత, ముప్పై రూపైలు చేస్కొ! ఏమొస్తదమ్మ, ఇయాల రేపు, అన్ని పిరమైపాయె!”

మా వీరవ్వది పక్కా తెలంగాణీయం! మా అమ్మది, పదహారణాల ఆంధ్రీయం!

వీరవ్వంటే మా ఇంట్లో సుమారు 20 ఏళ్ళు పని చేసిన పనిమనిషి! పేరుకే పనిమనిషి! ఇంట్లో మనిషి లాగానే, అందరికీ! ఆ మనిషి మనసంత దొడ్డది.

కానీ కయ్యాలు, అలగటాలు మామూలే! పనిమనుషుల స్వతస్సిద్ధమైన హక్కులాయెను అవి, inalienable rights!

ఆమె భాషలో డుమ్మాలూ, అమ్మ భాషలో నాగాలూ – ఇవన్నీ కూడా మామూలే!

అడపాదడపా, సరదా సంభాషణలు కూడా! అన్నీ ఆవిడ గారి మూడూ, తీరికా బట్టీ!

***

“వీరవ్వా, మధ్యాహ్నం వస్తావా, మిరపకాయలు దంచాలి”, అమ్మ విచారణ – అదే ఎంక్వైరీ!

“ఆఁ, నేనెప్పుడు రావాల? అన్నపూన్నమ్మ ఫర్మాయిష్ యేసింది గద, ఏదో పనుందంట! ఏం పనో జెప్పదు, రమ్మంటది! యేష్ట కొస్తదమ్మో, మకాన్ కొక్కతీరు మా జిందగీల! అన్ని సబర్ జేయాల, మరి ఏం జేస్తం,బువ్వ కావాలె గద నాకూ నా పెనిమిటికీ!”

“వెళ్తున్నాడా సవ్యంగా ఆ ఉద్యోగానికి?!”, అమ్మ కుతూహలపు ఇంటర్జెక్షన్!

వీరవ్వ ఒకటే నవ్వు! “రెండో దినమే మానేసిండమ్మా,ఆడెక్కడ సేయాల సీదాగ?!”

ఉన్న ఒక్క కొడుకూ, ఐదేళ్ళ క్రితం ఏదో లారీ ప్రమాదంలో పోయాడు, వీరవ్వ మనసులో పెద్ద అగాథం నింపి!

ఇప్పుడామే,ఆ భర్తా,ఇద్దరే! ఒకరికొకరు ఆసరా!

అందుకే అతన్ని ఏమీ అనదు, తనే ఇల్లు నడిపించి, అతనికీ ఇంత పెడుతుంది.

ఇంతకీ, ఇక మిరప దంపుడుకి ఆ రోజు రాదనే అనుకునేవాళ్ళం – అమ్మతో పాటు, వింటున్న మిగతా ఇంటి సభ్యుల మందరమూ!

కానీ మధ్యాహ్నానికి తయారయ్యేది, చక్కగా ఇంత కుంకుమబొట్టు పెట్టి కళకళలాడుతూ, ‘వీరవ్వ ది గ్రేట్’, సన్నగా నవ్వుతూ,”ఆఁ, మిర్చిలీయమ్మా!” అంటూ.

“వాళ్ళింట్లో ఏదో పనున్నదన్నావే మరి”, అని అమ్మ అడిగితే,

“అది పూర్తి చేసె వచ్చిన నీ కాడకి,నీ మాట ఎన్నడైన కాదన్ననా, చెప్పమ్మా”, అనేది వీరవ్వ!

గడుసుదనమో, అమాయకతో తెలిసేది కాదు చూస్తున్న పిల్లలం, మాకు!

“ఓసినీ, రానన్నావని సిద్ధం చేయలేదు, ఉండు దింపిస్తాను”, అనేది అమ్మ తబ్బిబ్బవౌతూ. “మా పనిమనిషికి నా మాటంటే ఎంత గౌరవం”, అని మురిసిపోతూ కూడా!

“జల్దీ తేవాలమ్మో,” అని ఒక హెచ్చరిక జారీ చేసి, బావి పక్కన, చెట్టు నీడను కూర్చునేది వీరవ్వ తాపీగా!

గంట తరువాత శుభ్రంగా పని పూర్తి చేసి, అమ్మ నడిగి ఇంత తొక్కు (ఏదో ఒక ఊరగాయ) తీసుకుని,”వస్తనమ్మా” అంటూ గేటు భద్రంగా వేసి వెళ్ళిపోయేది!

***

సికింద్రాబాదులోని ఆ ప్రాంతానికి ప్రతి ఆదివారం ఒక గోసాయీ తరహా మనిషి వచ్చేవాడు. ఏదో కొండ జాతి వాడిలాగా ఉండేవాడు. కొద్దో గొప్పో జ్యోతిషం తెలిసిన వాడిలాగా కనపడేవాడు.

మెలి తిరిగిన మీసాలూ, గిరజాల జుట్టు, కుంకుమతో నామమూ, తెల్ల అంగీ, తెల్ల లుంగీ, మెళ్ళో బోలెడు వరసల పూసలూ – ఇదీ అతని అవతారం!

చూసే వాళ్ళను రూపంతోనే ఆకట్టుకునేట్టు ఉండేది, అతని వేషధారణ!

అతను వస్తూనే – అమ్మ గారానందం, బాబుగారానందం, కొండ మీని కనకదుర్గమ్మానందం, మా మల్లన్నదేవూని రాణి బ్రమరాంబానందం అంటూ పెద్ద లిస్టు చదివేవాడు.

చదివి, భుజాన వేళ్ళాడదీసుకున్న తెల్లటి శంఖం ఊదేవాడు. ఆ వాతావరణాన్ని, ఏదో ఒక వింత శక్తి ఆవహించినట్లు అనిపించేది, పిల్లలం మాకు!

ఏమీ లేకపోయినా అతని ఆ నాటకీయ హావభావాలు ఆ ఎఫెక్ట్ తెప్పించేవి ముఖ్యంగా పిల్లలకు.

ఇక అప్పుడు, కళ్ళు మూసుకుని ఓ రెండు నిమిషాలు, నుదుటి మీద కుడిచేతి మధ్య వేలు, తర్జనినీ పెట్టి, భావి లోకి, బావి లోకి కాదు – చూస్తూ భవిష్యవాణి చెప్పేవాడు.

ఇంట్లో ఆ వేళకు కనబడ్డ అందరు పిల్లలూ గోప్పవాళ్ళైపోతారనే అతని స్టాండర్డ్ జ్యోతిషం.

పెద్దవాళ్ళందరూ సుఖంగా వందేళ్ళు జీవిస్తారనే!

దాంతో ఇంటిల్లిపాదీ సంతోషించే వారు.

మాట కాదూ మనిషిని ఆకట్టుకునేది!

ఆ నేర్పుండే దతనికి, దండిగా!

చివరి అంకంగా తన పొడుగుపాటి జోలె పట్టేవాడు. మాలో ఒకరం ఎవరో లేచీ అమ్మ ఇచ్చిన బియ్యం, పప్పు ఏవైనా కూరగాయలు అందులోకి జారవిడచేవాళ్ళం!

అంతా అయ్యేవరకూ ఆగి, కూరగాయలు విడిగా ఒక సంచీలో పెట్టుకుని, “నమస్తే అమ్మా, వస్తాను మళ్ళాదివారం” అని చెప్పి శంఖం ఒకసారి చిన్నగా ఊది వెళ్ళిపోయేవాడు.

ఒక ఆదివారం అతను వచ్చిన వేళకి వీరవ్వ ఉంది వరండా దగ్గర.

పైన చెప్పిన ఆనందాల వరుస చదువుతూ,ఆ రోజు ‘మా వీరవ్వానందం’, అని కూడా కలిపాడు.

కోపం నటిస్తూ, వీరవ్వ “నా పేరెందుకు తీస్తవ్, కొండసామీ, నా కసలే నిన్ను చూస్తే బయం”, అన్నది.

“ఆఁ, చూస్తే నా కక్క లెక్కున్నవ్, బయం అంటవ్ బయం”, అన్నాడు, అతను నవ్వుతూ!

***

సామెతలు అవలీలగా విసిరేది తన మాటల్లో వీరవ్వ.

ఒకసారి అమ్మ, “ఏవఁన్నా దాచాడా మీ ఆయన నీ కోసం”, అని అడిగింది.

నొసలు విరుస్తూ, “ఏం దాచిండమ్మా.. సెంటు జాగా లేదు పైఖానా అంత ఇల్లు లేదు” అన్నది!

మేమంతా ఆ వింత సామెతకు ఒకటే నవ్వులు!

ఇంకోసారి “ఏవఁమ్మా, ఇపుడు ఒంట్లో బాగుంటోందా”, అని అడిగితే వీరవ్వ జవాబు, “లేదమ్మా, పెయ్ బాగలేదు. అందరిదే సవాల్ యేస్తుండ్రు. సచ్చిన పాముని కొట్టనీ కందరు సిపాయిలే, గన్నట్టుంది. ఆరుస్తరా, తీరుస్తర, యెవ్వని పని వాడు సేస్కోక” అన్నది, ఇంకో కొత్త సామెత విదిలిస్తూ, అభిమానవతి, వీరవ్వ!

***

మానేసి వాళ్ళ ఊరుకెళ్ళిపోయే ముందు, వీరవ్వ కొన్ని నెలలు రాలేదు, ఒంట్లో బాగు లేక!

ఎప్పుడైనా వచ్చి అయిదో పదో అడిగి తీసుకెళ్ళేది అమ్మ దగ్గర.

ఏవైనా బియ్యం పప్పూ తనవి పాత చీరలూ వగైరా సహాయం చేసేది అమ్మ ఎంతో ఇదిగా మాట్లాడి, ఆమె వచ్చినపుడు!

***

తరువాత మా ఇంట్లో పనికి కుదిరిన మనిషి, మైసమ్మ!

ఏదైనా ఇట్టే ఫైసల్ చేసే రకం!

వీరవ్వకు చుక్కెదురు ఈమె వాలకం.

అంతా స్పీడు – రావటం, పని ముగించటం, వెళ్ళిపోవడంగా ఉండేది ఈమె పద్ధతి! ఫాస్ట్ నేచర్.

వాళ్ళబ్బాయి లూనా మీద దించి తన ఫ్యాక్టరీకి వెళ్ళేవాడు.

ఈమె ప్రత్యేకతల్లో చెప్పవలసింది, తాంబూల చర్వణం. సరస్వతీదేవి నిత్య వీణాపాణియైతే, ఈమె నిత్య తాంబూలపాణి. మీఠానో కారానో నములుతూనే ఉండేది.

పని చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, మొత్తం మీద మా ఇంట్లో ఉన్నంత సమయమూ ఆ నోరాడేది కాదు.

అమ్మ పెట్టిన ఆంక్షాబలం అంతటిది.

మైసమ్మ భర్త కూడా ఆవారాగా తిరిగే బాపతే మొదట్లో! సామదానాలన్నిటితో భర్తను దారిలోకి తెచ్చుకోవటంలోనే మైసమ్మ చాకచక్యం అంతా చూపించింది.

అమ్మ మనసూ మా అందరి మెప్పూ గెలిచేసింది.

ఇప్పుడతను బాధ్యతగా తన ఉద్యోగం తాను చేసుకుంటూ భార్యతో ఒద్దికగా జీవనం గడుపుతున్నాడు.

ఈ మైసమ్మ కూడా మంచి ముఖకళ గల మనిషే, వీరవ్వ లాగా!

పైగా ఈమె పాడితే కంఠం బాగుండేది.

అప్పుడప్పుడు పెద్దన్నయ్య ఏడాది పాపాయిని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని శ్రధ్ధగా స్నానం చేయించేది.

భుజాన పిల్లతో అటూ ఇటూ తిరుగుతూ నిద్ర పుచ్చుతూ ఒక పాట పాడేది! అది మా అందరికీ ఎంతో ఇష్టమైన పాట!

ఆ పాట, ఆ జానపద శైలి, ఆ పల్లెటూరు తల్లి గొంతులో మార్దవమూ, పాపాయితో పాటు విన్నవాళ్ళనూ కట్టిపడేసేది!

పాపను సూడవే సల్లంగ మా గౌరి
ఏ పాప మెరుగని ముత్తెమే మా తల్లి!
సనజాజి మొగ్గలే పాప పాలపళ్ళు
వినరావ కోకిలలు పాప పలుకూలు..
మా తల్లి నవ్వితే రతనాలు రాలు
మా పిల్ల సూసింద దివ్వెలేయి యెల్గు!

ఇట్లా సాగేది మైసమ్మ మృదువైన పాట!

కొన్నేళ్ళకు మేము సొంతిల్లు కట్టుకుని దూరప్రాంతానికి వెళ్ళటంతో, పని మానేయాల్సొచ్చింది మైసమ్మకి, మా ఇంట్లో!

గృహప్రవేశానికి మైసమ్మను పిలిచి అమ్మ ఒక పోచంపాడు చీర పెట్టి, కొంత డబ్బు కూడా ఇచ్చింది.

వీరవ్వ కూడా ఉంటే పాపం చూసేది అని అమ్మ చాలా సార్లు అనుకుంది ఆ రోజు.

ఆ మాటే మైసమ్మ వచ్చినపుడు అన్నది కూడా!

“మా వీరవ్వక్క పోయింది గదమ్మా, పోయినేడు! ఆ ఊర్ల మాసుట్టపోళ్ళు సెప్పిండ్రు, ఔనమ్మా నిజాము!”, అన్నది, కొంచెం బాధతో, ఇది మీకు తెలియదా అన్న ఆశ్చర్యంతో!

ఇక్కడ, నిజామా, టిప్పుసుల్తానా అనుకోకూడదని, చిన్న హెచ్చరిక, అది ఆమె ఉచ్చారణలో ‘నిజము’కు వచ్చిన దీర్ఘం మాత్రమే అని అర్థం చేసుకోవాలి.

“వీరవ్వ పోయిందా?!”, అంటూ, అమ్మ రెండు నిముషాలు అట్లాగే నిలబడిపోవటం నాకిప్పటికీ బాగా గుర్తు!

***

ప్రాంతం ఏదైతేనేం, వరాల తెలుగు ఒకటే కదూ, కవిగారు చెప్పినట్లు!

మనుషులలో సరళతా, మనసులలో మనిషంటే ఇంత ప్రేమా ఉంటే చాలు – బాసా, యాసా కూడా కలిపేవే అవుతాయి.

సామాన్య జనుల జీవితాల్లో స్నేహం అనే పాశం పెంచేవే అవుతాయి!.

***

ఔ, గట్లనే ఔతది, బరాబరు!

ఆద్మీ సక్కంగుంటే, అన్ని జబాన్లు మనయే యింక!

మంచిది, పోయొస్తా మల్ల!

Exit mobile version