Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అతనొక్కడూ దేవుడు కాదా?

[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘అతనొక్కడూ దేవుడు కాదా?’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]

ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దేశే అర్జున! తిష్టతి।
భ్రామయస్సర్వభూతాని యంత్రారూడాని మాయయా॥

ఉదయం టిఫిన్ బన్సీరవ్వ ఉప్మా చేశారు. తిని బయటకు వచ్చేటప్పటికి.. నాగమల్లి చెట్టు నీడలో ఎదురు చూస్తున్నారు అద్దేపల్లి రామ్మోహనరావు.

“నేను విన్నది నిజమేనా?” అడిగారు.

“ఏం విన్నారు?” అన్నాను.

“ఈ సంవత్సరం మినహాయింపు మామిడికాయల పంపిణీ బాధ్యతలు కూడా మీ మీదే పెట్టారట కదా?” అడిగారు.

“అవును. అవును గత సంవత్సరాలలో ఆ కార్యక్రమంపై సెక్రటరీ గారికి పిర్యాదులు అందాయట. అందుకు నన్నే చూడమన్నారు” అన్నాను.

“అంటే.. మీ శత్రువులు రెట్టింపు అవుతున్నారన్నమాట” అన్నారు.

“అదేంటి? ఇందులో విశేషం ఏముంది? కాట్రాక్టర్ నుండి రావాల్చిన మినహాయింపు కాయలు సరిగా తీసుకుంటాము. వాటిని ముగ్గించి ఎలా పంపిణీ చేయాలో సెక్రటరీ గారు చెప్పినట్టు పంపిణీ చేస్తాము. అంతే కదా” అన్నాను.

“కాంట్రాక్టరు నుండి తీసుకోవడం లోనూ లిటిగేషన్ వుంది. వాటిని పంపిణీ చెయ్యడంలోనూ లిటిగేషన్ వుంది. అన్నీమీకే తెలుస్తాయి” అంటూ వ్యంగ్యంగా నవ్వి వెళ్లిపోయారు.

ఉదయం సత్సంగానికి టైమ్ అవ్వడంతో మేమూ గోశాల లోని శ్రీకృష్ణ మందిరానికి బయలుదేరాము. అద్దేపల్లివారు చెప్పిన విషయం మరపుకు రావడం లేదు. ఈ ఆశ్రమంలో నన్ను బాగా ఆకర్షించింది గోశాల తర్వాత మామిడి తోటే!

వంద ఎకరాల మామిడి తోటలో పది ఎకరాల కుటీరాలు పోను మిగిలిన తొంబై ఎకరాలు మామిడి తోటే! సీజన్ కావడంతో విరగ కాసేసినయ్! ఆ కాయలు చేతికి అందే ఎత్తులో ఉండి కోసుకో అంటూ ప్రలోభ పెడుతున్నాయి. కింద రాలిన కాయలు ఏరుకోవాలనిపిస్తుంది. కానీ.. ప్రక్కనే నోటీసు బోర్డు ‘ఎవరూ మామిడికాయలు కోయరాదు. రాలినవి కూడా ఏరరాదు’. కానీ ఆ కాయలు చూస్తుంటే కొయ్యాలనిపిస్తుంది.

ఆ విషయం బంగార్రాజు మామయ్య దగ్గరంటే “ఈ లోకంలో అందరికంటే సంపన్నుడు, కోరికలన్నీ తీరినవాడు ఎవరో తెలుసా?” అడిగారు.

“మీరు చెప్పండి మామయ్యా!” అన్నాను

“ఏ కోరికా లేనివాడు” బంగార్రాజు

“ఏ కోరికా లేనివాడు కోరికలన్నీ తీరినవాడెలా అవుతాడు? కోరికలు అణుచుకున్న వాడౌతాడు గానీ..” అన్నాను.

“నువ్వన్నది కొంత నిజమే! కోరికలన్నీవిడిచి పెట్టినవాడే యీ లోకంలో అందరి కంటే సంపన్నుడు. అదే సన్యాసం అంటే!” చెప్పారు.

“కోరికలన్నీ విడిచి పెట్టినవాడి దగ్గరకు ఆ కోరికల ఫలితాలన్నీ వచ్చి చేరతాయా?” అడిగాను.

“ఎందుకు అడుగుతున్నావ్ అలా?” అడిగారు.

“నన్ను ఇక్కడి మామిడి చెట్లు వాటి కాయల్ని కోసుకోమని పిలుస్తున్నట్టు అనిపించేది. నాకూ కోసుకోవాలని చాలా కోరికగా ఉండేది. ఆ ప్రలోభానికి లొంగకుండా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. అయినా నేను లొంగలేదు. ఒక విధంగా ఆ కోరికను త్యాగం చేసాను. ఈ రోజు ఆ త్యాగం చేసిన దాని ఫలితం వాటి మీదే అధికారం వచ్చేలా చేసింది. ఇక శత్రువులంటారా ఉండనివ్వండి” అన్నాను.

“యదేవ భవతి తదేవ మంగళాయ” అంది సువర్ణ.

ముగ్గురం సత్సంగం జరిగే శ్రీకృష్ణ మందిరం దగ్గకొచ్చాము. లోపలంతా నిండిపోయి వుంది. ఎక్కుమూర్తి విసవిసలాడుతూ తిరిగి వెళ్లిపోతున్నాడు.

“ఎందుకు వెళ్లిపోతున్నావు? పైగా కోపంగా వున్నావ్?” అడిగారు బంగార్రాజు.

“సీట్లు లేవు” అన్నాడు బెల్లంకొండ ఎక్కుమూర్తి.

“క్రింద కూర్చోవచ్చుకదా?” బంగార్రాజు.

“నాలాంటి సర్వీస్ చేసేవాడు క్రింద కూర్చోవడం అవమానం కదా” అంటూ ఎక్కుతూ వచ్చిరాని మాటలతో అన్నాడు బెల్లంకొండ మూర్తి.

“ఏమి సేవ చేస్తున్నారు?” బంగార్రాజు.

“వృద్ధులను హాస్పిటల్‌కు తీసుకెళతాను. వారికి కావాల్సిన మందులు-మాకులు తెచ్చి ఇస్తుంటాను. ఇది సేవ కాదా?” తిరిగి ప్రశ్నించాడు ఎక్కుమూర్తి.

“నీ సేవ గురించే అందరూ చెప్పుకొంటున్నారు. అందరి దగ్గరా కమిషన్ బాగా తీసుకొంటున్నావట! ఆఫీసు మేనేజర్ ధనరాజు చెప్పాడు. జనరిక్ మందులు తెచ్చిపెట్టి బ్రాండెడ్ ధరలు తీసుకొంటావట. ఈ వృద్ధుల వద్ద నీ సంపాదన నెలకు కనీసం పదివేలు ఉంటుందని అంచనా వేశారు. ఇదే కదా నీ సేవ?” ఏకి పారేసారు బంగార్రాజు. మొహంలో రంగులు మారిపోయిన మూర్తి వడి వడిగా వెళ్ళిపోయాడు.

మందిరం లోకి వెళ్లగా నేనూ సువర్ణా కూర్చొనే ఆసనాలు తప్ప అన్నీ నిండిపోయాయి. క్రింద కూర్చోడానికి బంగార్రాజు సమాయత్తం అవుతుండగా తమ్మిన శ్రీధర్ బాబు లేచి తన కుర్చీ ఇచ్చి తాను క్రింద కూర్చున్నాడు.

***

సువర్ణ చేసిన ప్రార్థనతో సత్సంగం మొదలైంది.

“ఈ జగత్తులోకి భోగం ముందు వచ్చిందా? భగవంతుడు ముందు వచ్చాడా?” అడిగింది బి.కె. అనబడే మాయ.

“ఇది కూడా ఒక ప్రశ్ననా? నీలాంటి వారున్నప్పుడు భోగాలుంటాయి. ‘భోగే రోగ భయం’ అన్న భర్తృహరి వైరాగ్య శతకం చదవలేదా? సృష్టిలో మొదట కోరిక పుడుతుంది. దాన్నుండి భోగం పుడుతుంది. ఆ భోగం నుండి రోగం పుడుతుంది. ఆ రోగం నుండి భయం పుడుతుంది. ఆ రోగం భయాల నుండి బయట పడటానికి భగవంతుడిని సృష్టించుకొంటావు. అందుకే భోగాల వెంట పడకూడదు. కానీ నీలాంటి వారి మనస్సు వాటి వెంటే పరుగులు తీస్తుంది” చెప్పింది భారతమ్మ.

“అసలు.. కోరికలు వుండకూడదా?” అడిగాను.

“కోరికలు ఉండని మనిషి ఉండడు. అయితే అవి – ఒకటి ‘అవసరాలు’, రెండు ‘సౌకర్యాలు’, మూడు ‘భోగాలు’ అని మూడు రకాలు” చెప్పారు రొంగలి సూర్యనారాయణ.

“వివరించండి” అడిగాను.

“అది లేకపోతే కుదరదు అనుకొనేది అవసరం. అది వుంటే సుఖం కలుగుతుంది అనుకొనేది సౌకర్యం. ఏది వుంటే జీవితం పూర్ణమవుతుందని భావించి భ్రమపడతారో అది భోగం అవుతుంది. ఉదాహరణకు మనమంతా ఆశ్రమంలో వుంటున్నాము. కూడు-గుడ్డా-చిన్న కుటీరం అవసరం. గాలికి ఫ్యాను, చిన్న మంచం సౌకర్యం. షికార్లు కొట్టడానికి కారు, అందులో ఏసీ, కుటీరంలో ఏసీ, ఈ మాయా కుమారి లాగా ఉయ్యాలా, కుటీరంలో పనిచేయడానికి, ఒళ్ళు తోమడానికి, మాలిష్ చేయడానికి నౌకర్లు ఉండటం భోగాలు అవుతాయి” వివరించారు రొంగల సూర్యనారాయణ గారు.

“కోరికలు ఎప్పటికైనా పూర్తిగా సఫలమౌతాయా?” సువర్ణ.

“ఎప్పటికీ కావు. ఒకటి తీరగానే మరొకటి పుడుతుంది” భారతమ్మ జవాబు.

“వాటికి మందేమిటి?” తమ్మిన శ్రీధరబాబు ప్రశ్న.

“వైరాగ్యమే!” రొంగల సూర్యనారాయణ.

“తిరుపతి, అన్నవరం, శ్రీశైలం వెళితే భగవంతుడిని మనం చూడగలమా?” బ్రహ్మచారిణి శ్రీలక్ష్మీచైతన్య ప్రశ్న.

“అక్కడికి వెళితే మనం చూడగలిగేది మనమే తయారు చేసి పెట్టుకున్న దేవుడి ప్రతిరూపాలైన విగ్రహాలు మాత్రమే!” చెప్పారు బంగార్రాజు.

“మరి.. దేవుణ్ణి చూసే మార్గమే లేదా?” లక్ష్మీచైతన్య.

“ఎందుకు లేదూ? మనిషి తాను చూస్తున్నది జగత్తు అనుకొంటాడు, నామ రూపాలు అనుకొంటాడు. కానీ తను చూస్తున్నది దైవాన్నే! ‘ఏకం సత్ విప్రాబహుదా వదంతి’

అంటే అదే! శ్రీ శాంతి ఆశ్రమ స్థాపకులు శ్రీ ఓంకారులు చెప్పింది అదే! ఋషికేశ్ స్వామి దయానందులు ‘నువ్వు దేవుణ్ణి తప్ప ఎవరినీ, దేనినీ చూడలేవు’ అనేవారు” అంటూ చెప్పారు బంగార్రాజు.

“నాకు ఆత్మ దర్శన మౌతుందా? ఆత్మ జ్ఞానం కలుగుతుందా?”అడిగారు నూలునారాయణ

“మీకే కాదు ఎవరికీ ఆత్మ దర్శనం కాదు. ఆత్మ జ్ఞానం మాత్రం కలుగుతుంది” చెప్పారు రొంగల సూర్యనారాయణ.

“ఆ రెండూ ఒక్కటే కదా?” కాటమరెడ్డి.

“మీకు కనిపించినది ఏదీ ఆత్మ కాదు. ఆత్మను చూడటం అంటూ ఏమీ ఉండదు. తెలుసుకోవడం మాత్రమే వుంటుంది. ఈ జగత్తులో ఆత్మ జ్ఞాని అంటూ ఎవరూ వుండరు. ఆత్మ జ్ఞానం మాత్రం ఎప్పుడూ వుంటుంది” సూర్యనారాయణ.

“మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. భగవాన్ రమణులు, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి ఓంకారులు ఆత్మదర్శనం అయినవారు కాదా?” కాటమరెడ్డి.

“కోప్పడకండి రెడ్డిగారూ. నేను చెప్పేది సావధానంగా వినండి. చూడటం వేరు తెలుసుకోవడం వేరు. మీకంటే భిన్నంగా జడమైన దానిని మీరు చూస్తారు. జ్ఞానాన్నిఎవరూ చూడలేరు. తెలుసుకోవడమే జ్ఞానం. మీరు పైన పేర్కొన్న మహానుభావులందరూ ఆత్మ జ్ఞానం కలిగిన వారే! అంటే వారు ఆత్మలైన వారే గానీ ఆత్మ జ్ఞానులుగా మిగిలివున్నవారు కాదు. అందుకే అన్నాను ఆత్మ జ్ఞానులంటూ ఎవరూ వుండరు. ఆత్మ జ్ఞానం మాత్రం ఎప్పుడూ వుంటుంది” రొంగలివారు వివరించారు.

“జగత్తులో ఇన్నిఆశ్రమాల అవసరం ఏమొచ్చింది?” ప్లీడర్ అనంత శ్రీనివాసరావు ప్రశ్న.

“ఈ జగత్తులో అజ్ఞానికి, అజ్ఞానులకు, భయస్తులకు కొదవ లేనంత కాలం ఆశ్రమాలు ఉంటాయి. కొత్తవి వెలుస్తుంటాయి” బంగార్రాజు జవాబు.

“మరి.. ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు మార్కెట్ లోని వ్యాపారస్తులేనా?” గునివాడ అప్పలరాజు ప్రశ్న.

“అవును వారు స్థానిక సమస్యల్నిపట్టించుకోరు. వేదాంతాన్ని(తత్త్వ్తాన్ని) పట్టుకోరు. పీఠాల్ని, మఠాల్ని మాత్రం గట్టిగా పట్టుకొని కూర్చుంటారు. వారు వ్యాపారులు కాక మరేమవుతారు? ది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అఫ్ ఇండియా ఆల్వేస్ హావింగ్ టూ (2) ప్రొఫెషన్స్.. పొలిటిక్స్, అండ్ గాడ్‌మెన్‌షిప్ (దేవుడమ్మ). తాను ఈ లోకానికి సంబందించిన వాడిని కానూ, కానీ ఈ లోకం మాత్రం తనకు సంబంధించిందే ఆధ్యాత్మిక విప్లవం అని తెలుసుకోవాలి” బంగార్రాజు.

“మన దేహాన్ని, ఇంద్రియాలను నడిపించే దెవరు?” రావులపాలెం సూర్యనారాయణ ప్రశ్న.

“విజ్ఞాన శక్తి, క్రియా శక్తుల స్థానం ఆత్మ చైతన్యం. అదే దేహ ఇంద్రియ మనో సంఘాతాన్ని నడిపిస్తుంది. బయటి దీపం అన్నీఎలా కనిపించేటట్టుచేస్తుందో అలాగే లోపలి దీపం (చైతన్యం) అన్నీతెలిసేటట్టు చేస్తుంది!” బంగార్రాజు.

“నన్నునేను తెలుసుకొనే క్రమంలో వేదాంత శాస్త్రం పాత్ర ఏమిటి?”వకీలు అనంత శ్రీనివాసరావు ప్రశ్న.

“వేదాంత శాస్త్రం చదువుకోడానికి వచ్చేముందు మీ గురించి మీరు ఏదో అనుకొని (ఉహించుకొని) వస్తారు. మీరు ఉహించుకున్నదంతా తప్పు అని మీరు అది కాదని తెలుసుకుంటారు. శాస్త్రం ఒక దీపం లాంటిది. దాని వెలుగులో మిమ్మల్ని మీరు వెదుక్కోవాలి, సరి చేసుకోవాలి. జీవన విధానాన్నివిశ్లేషించే శాస్త్రం వేదాంతం. ఎముకను కొరికి ఆనందించే కుక్క నామ రూపాల నుంచి ఆనందం లభిస్తుందనుకొనే మనిషి వేదాంతం దృష్టిలో ఒక్కటే!” బంగార్రాజు వివరణ.

“ఆత్మ జ్ఞానానికి అర్హులైన మహాత్ములు ఈ వర్తమానంలో ఎవరూ లేరా?”అడిగింది సువర్ణ.

“లేకేం తోటపల్లి కొండల్లోని శాంతి ఆశ్రమం లోని ఉత్తరాధికారి స్వామిని వినమ్రానంద సరస్వతి, సికింద్రాబాద్ బ్రహ్మవిద్యాకుటీరమ్ లోని స్వామి తత్త్వవిదానంద, తమిళనాడు స్వామి పరమార్ధ ఆనంద, గుజరాత్ స్వామి విదితాత్మానంద నాకు తెలిసిన మహాత్ములు, నాకు తెలియని వారు కూడా వుంటారు” రొంగల సూర్యనారాయణ.

“మన ఆశ్రమంలో గుహలో ఉంటూ జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం చెప్పి భయపెట్టే హిమాలయాల నుండి వచ్చిన సురేశ్వరాచార్య మహాత్ముడు కాదా?” లక్ష్మీచైతన్య ప్రశ్న.

“కాదు. ఉదర నిమిత్తం బహు కృత వేషం వేసిన వాడు. మనిషి చనిపోతాడు అన్నది జన్మించిన నాడే నిర్ణయమైన సత్యం. వాస్తంటారా మన భారత దేశానికే వాస్తు అన్వయించదు. పల్లంగా వుండాల్సిన ఉత్తరం దిక్కున హిమాలయ పర్వతాలున్నాయి. ఈ జగత్తు సినిమా లాంటిది. సినిమాల్లో కాలం వుంటుంది, దేశం కూడా వుంటుంది. అమలాపురం లోని ప్రేమికులు అమెరికాలో డ్యూయెట్స్ పాడతారు. సినిమా అసత్యం, కల లాంటిది. జీవితం కూడా అంతేనని బుద్ధితో తెలుసుకోవాలి. జ్ఞానంతో జీవించాలి” చెప్పారు బంగార్రాజు.

“అయినా మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? ఆత్మను తెలుసుకోవాల్సింది ఏ అవస్థలో?” మళ్ళీ అడిగింది.

“అవిద్య వల్ల కలిగిన అజ్ఞానం వల్ల. జాగ్రత్తు అవస్థలో, స్వప్న సుషుప్తిల యొక్క స్మృతి కూడా వుంటుంది కనుక ఆత్మను తెలుసుకోవాల్సింది ఆ అవస్థ లోనే!” బంగార్రాజు.

“సంసారికి.. సాక్షికి తేడా ఏమిటి బాబూ?”నూలు నారాయణ.

“రంగుల రాట్నం ఎక్కితే సంసారి. దూరంగా ఉండి గమనిస్తే సాక్షి! స్వప్నంలో చూసింది సత్యం – కానీ స్వప్నం మాత్రం అసత్యం. రోగం వేరు, రోగి వేరు. రోగం యెడల సాక్షిగా ఉండాలి” చెప్పారు రొంగల సూర్యనారాయణ.

సువర్ణ పాడిన మంగళ గీతంతో సత్సంగం ముగిసింది. మందిరం నుండి బయటకు వచ్చేటప్పటికి నా కోసం తోట కాంట్రాక్టర్ పంపిన మనిషి ఎదురుచూస్తున్నాడు.

***

“ఆయ్! మా బాస్ మార్ని నాగరాజు గారు మినహాయింపు కాయల్లోంచి మూడు వేలు పళ్ళు పంపించారండి! ఈవేళ, రేపు లోగా వాడేసుకోవాలండి. లేపోతే పాడయిపోతాయాని చెప్పమన్నారు. మీ గోడౌన్ దగ్గర ట్రేలు పెట్టించానండి. ఒకసారి మీతో మా బాస్ స్వయంగా మాట్లాడాలటండి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వత్తారటండి” చెప్పాడు.

“ఎప్పుడో ఎందుకు? ఇప్పుడే రమ్మను. నేను గోడౌన్ దగ్గరుంటాను” చెప్పాను.

సువర్ణ కుటీరానికి వెళ్లగా నేను గోడౌన్ దగ్గరకెళ్లాను. పంపించిన మూడు వేల పళ్ళు చూసాను. పళ్ళు బాగానే వున్నాయి కానీ అన్నీ నాసి రకాలు. సువర్ణరేఖ, గోవా, పంచదార కల్తీ, రెండు దేశవాళి రకాలు వున్నాయి. కొత్తపల్లి కొబ్బరి, పండూరు, హైదర్ సాహెబ్, చెరకురసాలు, బంగినపల్లి లాంటి మంచి రకాలు లేవు. చూస్తుండగానే నాగరాజు వచ్చారు.

“నమస్కారం రెడ్డిగారూ!” అన్నాడు. ప్రతి నమస్కారం చేసి “ఏమిటి అన్నీ నాసి రకాలు పంపించారు?” అన్నాను.

“ముందు ముందు అన్ని రకాలు వస్తాయి లేండి! మీతో ఒక ముఖ్య విషయం, ఇక్కడ ఎప్పటినుండో ఆచరణలో ఉన్నదే చాలా కాంఫిడెన్షియల్ మేటర్ మాట్లాడటానికి వచ్చాను. ఉభయ తారకమైనదే లేండి!” అన్నాడు.

“చెప్పండి నాగరాజు చౌదరి గారూ!” అన్నాను.

“మినహాయింపుకు సంబంధించిన అగ్రిమెంట్ ప్రకారం అమలు జరిగితే నేను చాలా నష్టపోతాను. కాబట్టి నే చెప్పబోయేదేంటంటే.. ఇప్పుడు మీకు మూడు వేలు కాయలు ఇచ్చాను. ఇలాంటివే మరో రెండు వేలు ఇస్తాను. మిగిలిన ఐదు వేల కాయలకు మార్కెట్ వేల్యూలో నలబైశాతం క్యాష్ ఇస్తాను. అదనంగా కొత్తపల్లి కొబ్బరి, చెరుకురసాలు రెండు వందలు మీ కుటీరానికి నేరుగా పంపిస్తాను. ఏమంటారు? ఆలోచించుకొని చెప్పండి” అన్నారు.

“ఇందులో ఆలోచించుకోవడానికి ఏమీ లేదు. నాకు సెక్రటరీ గారు ఏమి చెప్పారో అలానే చేస్తాను. మీరు అగ్రిమెంట్ దగ్గర పెట్టుకొని దాని ప్రకారం పంపించండి” అన్నాను

“ఇలా అయితే మీరు చాలా సవాళ్లు ఎదుర్కోవాలి” అన్నాడు.

“ఏది జరిగినా నా మంచి కోసమే అనుకుంటాను. వెళ్ళి రండి” అన్నాను. అద్దేపల్లివారు గుర్తొచ్చారు.

నేరుగా ఆఫీస్ కు వెళ్లాను. ఇంచార్జ్ బాలకృష్ణరెడ్డి నుండి ఆశ్రమవాసుల, సేవకుల వివరాలు, మామిడి పండ్లు అందించాల్సిన చుట్టుపక్కల వూళ్ళలోని ఆశ్రమ భక్తుల లిస్ట్ తీసుకున్నాను. తరవాతి రోజు పండ్లు పంచడానికి ఆశ్రమ వాన్ ఏర్పాటు చేయమని, ఇద్దరు సహాయకుల్ని ఏర్పాటు చేయమని కోరాను. నేను నేరుగా గోడౌన్‌కు వెళ్లాను. పచ్చ గడ్డిక్షేత్రం నుండి లంచ్ కోసం వచ్చిన వారి లోనుండి ఇద్దర్ని భోజనం తర్వాత నాతో ఉండిపోమన్నాను. నేనూ భోజనం చేసి వచ్చాను. కవర్లు తీసుకొని ప్రతి కవర్ డజను పళ్ళతో నింపేసాము. ఆశ్రమవాసులకు, సేవకులకు ప్రతి ఒక్కరికి ఒక కవర్ పంపిణీ చేసాము. పాలు తీసే సమయం కావడంతో పనివారు గోశాలకు వెళ్లిపోయారు. నేను ఆఫీస్‌కు వెళ్లాను.

“సారీ రెడ్డిగారూ! రేపు మీకు వ్యాను పురమాయించలేము. డ్రైవర్ సెలవు పెట్టాడు. మీరడిగిన సేవకులను కూడా ఇవ్వలేనని కోఆర్డినేటర్ నాగుర్ బాబు చెప్పాడు. ఇదంతా చూస్తుంటే వీళ్లంతా మీ మీద కక్ష కట్టారనిపిస్తుంది” అన్నారు బాలకృష్ణారెడ్డి.

“మరెలా? పండ్లు పాడయిపోతాయే!” అన్నాను.

“మీ సొంత ఏర్పాట్లు చేసుకోండి! ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నాను. మీ వల్ల ఆ నాగుర్ బాబుకు ఒక యాభైవేలు లాస్ అట. అలాగే నలుగురు ఆశ్రమ స్టాఫ్‌కు నష్టం కలుగుతుందట. మామిడి పండ్ల పంపిణీ పనిలో వారెవరూ మీకు సహకరించరు, యీ విషయం మనసులో ఉంచుకోండి” బాలకృష్ణారెడ్డి.

“సరే అయితే” అంటూ అక్కడినుండి గోశాలకు వెళ్లాను.

నాకు తెలిసిన ఆటో డ్రైవర్ గణేష్‌కు ఫోన్ చేసి ఉదయమే రమ్మని చెప్పాను.

తర్వాతి ఉదయం ఆటో నిండా పళ్ళు నింపేసుకొని, గోశాల నుండి ఇద్దరు సేవకులను ఎక్కించుకొని చింతపల్లివైపు బయలుదేరాము. ప్రతి సెంటర్ లోనూ వుండే ప్రతీ ఆటో డ్రైవరకు, ప్రతీ భిక్షగాడికి రెండు పళ్ళు ఇస్తున్నాము ప్రతీ ఊరి లోనూ ప్రముఖులకు లిస్ట్ ప్రకారం కవర్‌లో నింపిన పళ్ళు ఇస్తూ చింతపల్లి చేరుకున్నాము. అక్కడి తెలిసిన వ్యాపారస్థులకూ పళ్ళ కవర్లు అందజేశాము.

కనిపించిన ప్రతి భిక్షగానికి రెండు పళ్ళు ఇచ్చాము. ప్రణవానందుల ఆశయాన్నిఅలా నిలబెడుతున్నాము. ఆశ్రమానికి ఖాతాలున్న ప్రతి బ్యాంకు శాఖ లోనూ స్టాఫ్ ప్రతీ ఒక్కరికీ పళ్ళ కవర్ అందజేస్తున్నాము. యూనియన్ బాంక్ అఫ్ ఇండియా బ్రాంచ్ వద్ద కవర్లు నింపుతున్నాము.

అప్పుడు ఒక అడుక్కునే కుర్రాడు వచ్చి “బాబూ ధర్మం” అన్నాడు.

చాలా చిరాగ్గా వున్న నేను “ఛీ పో” అన్నాను.

వాడు రెండోసారి అడక్కుండా వెనక్కు వెళ్ళిపోయాడు.

కవర్లు నింపేసిన తర్వాత తళుక్కుమంది మనస్సులో, కొరడాతో కొట్టినట్టయింది. ఆ అడుక్కునే కుర్రాడు వెళ్లిన వైపు చూసాను. కనిపించలేదు. ఎంతో మందికి పళ్ళు ఇచ్చుకొంటూ వచ్చి ఆ కుర్రాడికి ఎందుకు ఇవ్వలేకపోయాను అన్న ప్రశ్న లోపల తొలిచేస్తుంది. అన్యమనస్కంగానే ఆటో లోని పళ్ళన్ని పంచిపెట్టేసి ఆశ్రమం చేరేటప్పటికి సాయంత్రం అయ్యింది.

ఋషీకేశ్ శివానంద ఆశ్రమం నుండి స్వామి హంసానంద వచ్చారు, ప్రవచనం వుంది అని తెలిసి. నేనూ సువర్ణా ప్రణవానందుల సమాధి మందిరానికి వెళ్ళాము.

స్వామి అనుగ్రహ భాషణం మొదలైంది. ఆద్యంతం ఆసక్తిగా చిన్న కథలతో సాగుతుంది ప్రవచనం. స్వామి హంసానంద చెప్పిన కథల్లో ఒక కథ నన్ను ఆకర్షించింది. అది..

“భారతదేశంలో భగవంతుడు భక్తుల కలలో మాత్రమే దర్శనమిస్తాడు. అదే క్రమంలో ఒకడికి కలలోకొచ్చిన దేవుడు ‘భక్తా! రేపు పగలు నేను నీ ఇంటికి వచ్చిభోజనం చేస్తా’నన్నాడు. ఆ తర్వాత రోజు ఆ భక్తుడు ఇంటిని పూల మాలలతో అలంకరించి, షడ్రుచులతో పిండి వంటలు చేయించి దేవుడి కోసం ఎదురు చూస్తూ వున్నాడు, దేవుడు ఎంత సేపటికీ రాడు. ఆకలి దంచేస్తుంది. ఆగలేకపోయాడు. కొద్దిగా ఎంగిలిపడి పొట్ట నిమురుకొంటూ దేముడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఎంత సేపయినా దేముని జాడ లేదు. ఇంతలో ఒక గజ్జికుక్క వచ్చి లోపలికి రాబోగా కర్ర తీసుకొని తరిమేశాడు. కొంత సేపయ్యాక ఒక పిచ్చిస్త్రీ ఆకలంటూ వచ్చింది. ఆమెను కసురుకొని పొమ్మన్నాడు. మరికొంత సేపయ్యాక ఒక కుష్టురోగి వచ్చాడు. చీదరించుకు పొమ్మన్నాడు. దేవుడు రాలేదు. రాత్రి అయిపోయింది. విసుక్కొంటూ వెళ్లి భోజనం చేసి నిద్ర పోయాడు. దేవుడు కలలో కొచ్చాడు. ‘ఇది అన్యాయం. భోజనానికి వస్తానని రాలేదు. నీ కోసం ఎన్ని రుచ్యములు చేయించానో’ అన్నాడు. ‘భక్తా!నీకు ఇష్టమైనవే కదా చేయించావు. నువ్వు రెండు పూటలు తిన్నావు. నువ్వు తింటే నేను తిన్నట్టే! అయినా నేను మాట తప్పలేదు. మూడు సార్లు నీ ఇంట ప్రవేశించ ప్రయత్నించాను. నువ్వు రానియ్యలేదు. ఒకసారి కర్రతో కొట్టి తరిమేశావు. ఒకసారి కసురుకొని పొమ్మన్నావు, మరోసారి చీదరించుకొని పొమ్మన్నావు. పోయాను’. ఆ భక్తుడి గుండెల్లో గునపం దిగవేసినట్టుంది.”

కథ పూర్తిచేసారు స్వామీజీ.

ఆ గునపం నా గుండెలో దిగబడిన ఫీలింగ్. చింతపల్లి యూనియన్ బాంక్ దగ్గర చిరాకుపడి పొమ్మన్న కుర్రాడు తళుక్కుమన్నాడు నా మనసులో. అందరూ, అన్నీ ఆత్మ స్వరూపమే అయినప్పుడు ఆ కుర్రాడు ఒక్కడూ ‘భగవంతుడు’ కాకుండా పోతాడా???

Exit mobile version