Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అసాధారణ కథానిక ‘బదరి’

[డా. రాపోలు సుదర్శన్ రచించిన – అసాధారణ కథానిక ‘బదరి’ – అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము.]

ఆరంభం:

మహాకవి దాశరథి బాల్యం నుంచే కవిత్వం రాస్తున్నా, ఇరవై ఏళ్ళ వయసు దాటిన తర్వాతనే కథలు రాసినట్లు లభించిన ఆధారాన్ననుసరించి చెప్పుకోవచ్చు. దొరకుతున్న కథానికల్లో ఆగస్టు, 1948 ‘అభ్యుదయ’లో ముద్రితమైన ‘తెలంగాణా అమరవీరుని రక్తాంజలి’ మొట్టమొదటిది. దీని తర్వాత కవిత్వంలో పలు కావ్యాలు, అనువాద రచనలు, సినీ గేయ కవిగా ప్రసిద్ధి, కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీల అవార్డులు, తెరసంకు తొలి అధ్యక్షులు కావడం, ప్రధానమంత్రి చేతుల మీదుగా స్వాతంత్య్ర సమరయోధుడుగా తామ్రపత్రాన్ని అందుకోవడం, గ్రామ పంచాయతీ, ఆకాశవాణి మొదలైన చోట్ల ఉద్యోగాలు చేయడం, పలు బిరుదులు, లెక్కలేనన్ని సన్మానాలు అందుకొంటూ 1977 నుంచి ఆంధ్రప్రదేశ్‌ ‘ఆస్థాన కవి’గా ఉంటున్న వేళ ఈ ‘బదరి’ కథానిక 13-3-1978 నాడు మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైంది. దాశరథి రాసిన కథానికల్లో లభిస్తున్న మొదటి కథకు దీనికి మధ్య ముప్పయ్‌ సంవత్సరాల వ్యవధి ఉంది. అంటే ఈ మధ్యలో వీరి జీవితానుభవం, ఎంతో సాహిత్య పఠనం వల్ల కలిగిన రచనలో రాటుతేలినతనంతో రాసిన స్త్రీ ప్రాధాన్యత గల ఈ కథానికను వివరించడం ఈ వ్యాస పరిధి.

ఇతివృత్తం:

తల్లి లేని వాడైనందుకు చిన్నప్పటి నుంచి మరిది రఘును వదిన వనజ పెంచింది. వదిన చెప్పిన కథలు వింటూ బాల్య దశ నుంచి రాత్రి నిద్రపోవడం రఘుకు అలవాటు. ఈ అలవాటు వల్ల మొదటి నుంచీ అటు భర్త, ఇటు మరిదిల మధ్య ఇబ్బంది పడుతూనే సర్దుకుంటూ నెట్టుకొస్తున్నది వదిన. బాల్య స్థాయి దాటినా ఇప్పటికీ కథ చెప్పందే నిద్ర పోని తన మరిది రఘుకు ఒక రోజు తను చెబుతున్న ఇద్దరు అన్నదమ్ముల జానపద కథను చెప్పనారంభించింది వదిన వనజ. ఇది కూడా వదిన, మరుదులకు సంబంధించిందే. ఈ కథలో మరిది రాఘవులుకు పెళ్ళి కానందుకు రేగు పండులాంటి రాజకుమారిని పొందాలంటే ఏడు నదులు దాటింతర్వాత వచ్చే అడవిలో ఉన్న చెరువు మధ్యలోని దిబ్బమీదున్న ఒక రేగు చెట్టుకు పెరిగిన ఒకే ఒక్క పెద్ద రేగుపండులో రాజకుమారి దొరుకుతుందని వదిన చెప్పగానే, మరిది రాఘవులు బయలుదేరి అడవికి చేరి, అక్కడున్న ఒక ఋషి ద్వారా ఆ పండు సాధిన ఉపాయమెరిగి, ఆ పండును సాధించి మళ్ళీ ఋషిని కలవగా ఈ పండును ఇంటికి తీసుకెళ్ళి పగల గొట్టాలేగానీ మార్గమధ్యంలో కాదన్న విషయం తెలుసుకొని కూడా మార్గంలోనే పండును పగలగొట్టగానే అందులోంచి రాకుమారి వస్తుంది. ఆమెను వెంటబెట్టుకొని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ఓ చోట సేదతీరుతుండగా రాఘవులుకు నిద్ర రావడంతో ఆమె ఒళ్ళో నిద్రిస్తాడు. అక్కడున్న ఒక కమ్మరి అమ్మాయి మోసపూరితంగా బదరిని నదిలోకి తోసేసి తనే బదరిగా రాఘవులును నమ్మించడంతో కమ్మరి అమ్మాయికి, రాఘవులుకు పెళ్ళిఅవుతుంది. కొంత కాలం తర్వాత తనకు దొరికి ఓ తామర పువ్వును రాఘవులు తెచ్చి ఇంట్లో పెట్టగా దాన్ని ఆయన భార్య అయిన కమ్మరి అమ్మాయి బైట పడేస్తుంది. అది పడిన దగ్గర రేగుచెట్టు పెరిగి కాయకాస్తే, దాన్ని తినడానికి తోటమాలి కొసుకొని పగులగొట్టగా అందులోంచి బదరి బయటికొస్తుంది. తనకు సంతానం లేనందుకు పెంచుకుంటాడు. ఈ విషయం తెలిసిన కమ్మరి అమ్మాయి మళ్ళీ మోసపూరితంగా బదరిని చంపేయిస్తుంది. పాతేసిన బదరి శవం సమాధిపైన చెట్టు పెరుగుతుంది. విచారంగా ఉన్న రాఘవులును చూసి ఓ ఋషి అడగ్గా బదరికి సంబంధించి జరిగినదంతా చెబుతాడు. ఇది విన్న ఆ ఋషి ఓ ఉంగరం ఇచ్చి ఇది ధరిస్తే నీ కష్టాలు తొలగుతాయని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ ఉంగరం ధరించి ఓ తోటలో కూర్చొని ఉండగా, తాను ఏ చెట్టు క్రింద కూర్చున్నాడో ఆ చెట్టు మీద చిలుకలు రాఘవులుకు జరిగిన మోసం మాట్లాడుకుంటుండగా అది అర్థమై ఈ కష్టం నుంచి బైటపడే మార్గం తెలపమని చిలకలను కోరుతాడు. బదరి సమాధిపై పెరిగిన చెట్టుకు మొలిచిన రేగు పండులో రాకుమారి బదరి ఉందని చిలక చెప్పగానే వెళ్ళిపోయి చెట్టు నుంచి రేగుపండును కోసి, చితగ్గొట్టి చూడగా బదరి బైటకు వస్తుంది. ఆమెను తీసుకొని ఇంటికి వెళ్ళి తనకు మోసం చేసిన తన భార్య కమ్మరి అమ్మాయిని రాఘవులు చంపబోతే రాకుమారి బదరి ఆపుతుంది. కమ్మరి అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోవడంతో కథ సుఖాంతమవుతుంది. అప్పుడు ఈ జానపద కథ వింటూ రాఘవులు రాకుమారి బదరి ఒడిలో, మూల కథ వింటున్న రఘు తన వదిన వనజ ఒళ్ళో నిద్రలోకి జారుకుంటారు. కథ ముగియగానే వనజ భర్త ఆమెను పిలుస్తాడు. వనజ వెళ్ళబోతుంటే తన ఒడిలోనిద్రిస్తున్న ఆమె మరిది రఘు తనను “బదరీ! నిన్ను వెళ్ళనివ్వను” అంటూ కౌగిలిలో బంధిస్తే “రెక్కలు నలిగిన పక్షిలా ఉండిపోయింది” అనే మాటతో కథానికను ముగించారు రచయిత దాశరథి. ఇదీ ఇందులోని ఇతివృత్తం.

పాత్రలు:

ఈ కథానికలో వదినె మరిదిలకు సంబంధించిన రెండు కథలు సమాంతరంగా సాగుతుంటాయి. ఒకటి మూలకథ. రెండోది కథలో కథ. మూల కథలో వనజ, రఘు, రఘు అన్న మాత్రమే పాత్రలు. రెండో కథ అయిన అంతర్గత కథలో చెప్పబడుతున్న కథ ‘రాజకుమారి బదరి’కి సంబంధించిన జానపద కథ. ఈ కథలో రాఘవులు, రాఘవులు వదిన, రాజకుమారి బదరి, ఇద్దరు ఋషులు, కమ్మరి అమ్మాయి, తోటమాలి, చిలుకలు పాత్రలుగా ఉంటాయి. ఒక్కొక్క పాత్రను చూద్దాం.

వనజ

ఈ కథను మొత్తం నడపడం, బాధల్ని భరించడం ఈ పాత్రలో చిత్రించారు రచయిత దాశరథి. ఈ పాత్ర పేరు వనజ. తల్లి లేని తన మరిదిని తల్లిలా బాల్యం నుంచే పెంచుతుంది ఈ స్త్రీ పాత్ర. ప్రతీరోజు “రాత్రిపూట రఘుకి కథ చెప్పాలంటే ‘వనజ’కి చిక్కే. ఒక వైపు శ్రీవారి పోరు. మరోవైపు రఘు రభస! అయినా సర్ధుకుంటూ వస్తోంది ఇంతకాలంగా” (పుట-25, నిప్పుపూలు) అని ఈ పాత్ర గొప్పతనం చిత్రితమైంది. ఈమెను “నువ్వు కథలు రాస్తావుగా! నీకు కథలేం కరువు. చెప్పు వదినా” అన్నాడు రఘు (పుట-26, నిప్పుపూలు) అనే మాటను బట్టి ఈవిడ రచయిత్రి అని తెలుస్తుంది. యౌవనంలోకి అడుగిడిన తన మరిది రఘుకు కథ చెప్పేప్పుడు అతని ప్రవర్తన ఎంత ఇబ్బందికరమైనదైనా భరిస్తున్న పాత్ర వనజ.

రఘు

వనజ మరిది రఘు. ఇతని గురించి “..బాల్య దశ దాటినవాడు మరి. అయినా అతన్ని పిల్లతనం యింకా వదల్లేదు. తల్లిలేని పిల్లవాడు. చిన్నతనం నుంచీ అతన్ని తల్లిలా పెంచింది. రోజూ కథ చెప్పంది నిద్రపోయేవాడు కాదు రఘు” (పుట-25 నిప్పుపూలు) అని చూపాడు మనకు రచయిత దాశరథి. ఇటువంటి ఈ పాత్ర ఒకనాడు “..ఆకాశంలోకి చూస్తుంటే దెయ్యంలా నల్లగా ఆకాశం యిటే వస్తున్నట్టనిపించింది” (పుట-25, నిప్పుపూలు) కాబట్టి భయపడుతూ ‘ఫేయిరీ టేల్స్‌’ అందమైన రాజ కుమార్తెల కథలు చెప్పమని రఘు అడుగుతున్నప్పుడు “రఘు పసికంఠంలోని మెత్తదనం పోయి బొంగురు గొంతు వినపడిరది. బాల్య గడిచిందన్న మాట!” (పుట-26, నిప్పుపూలు) అని పాత్ర ప్రస్తుత స్థాయిని తెలిపారు రచయిత. ఇంకా ఈ పాత్ర వదిన చెబుతున్న ఒక ఊళ్ళో అని, ఇద్దరు అన్నదమ్ములు అని, అన్నకు పెళ్ళయింది, తమ్ముడికి కాలేదు అని చెబుతున్న కథ వింటూ అన్నీ తనకు ఆపాదించుకుంటున్న అమాయకునిగా ఈ పాత్ర చిత్రితమైంది.

వనజ భర్త (రఘు అన్న)

ఈ పాత్రకు పేరు లేదు. దీన్ని బట్టే ఈ పాత్ర ప్రాధాన్యత అర్థమవుతుంది. ఇతని నిద్రకు భంగం కలగకుండా పడక గదిలోంచి బైటికి వనజ వచ్చే సందర్భం; ఈమె తన మరిదికి కథను ఆరంభించేప్పుడు నిద్రిస్తున్న ఇతని గురక వినబడుతున్నప్పుడూ ఈ రెండుసార్లూ వనజ ‘శ్రీవారు’గా; కథాంతంలో రఘు అన్నగా పేర్కొన ఒక సందర్భంలో మాత్రమే ఈ పాత్రను పేర్కొనడం జరిగింది.

రాజకుమారి బదరి

ఈ కథానికలోని (జానపద) కథలో ఉన్న కథానాయిక ఈమె. అందమైంది. ఈమెను సాధించి పెళ్ళి చేసుకుంటాడు రాఘవులు. తనను మోసం చేసిన కమ్మరి అమ్మాయి పట్ల మానవతా దృక్పథాన్ని ప్రదర్శిస్తుంది బదరి.

రాఘవులు

తన వదిన ద్వారా ‘అందమైన రాజకుమార్తె బదరి’ కథను విని ఎన్నో కష్టాలను భరించి సాహసవంతంగా ఆమెను సాధీనం చేసుకొని పెళ్ళి చేసుకున్న కథలోని జానపద కథానాయకుడు.

రాఘవులు వదిన

తన మరిది రాఘవులుకు ‘బదరి’ కథ చెప్పి ఆమెను సాధించి, పెళ్ళి చేసుకునేట్టుగా చేసిన పాత్ర. ఈ పాత్రకు పేరు పెట్టలేదు రచయిత.

బదరిని సాధించాల్సిన తీరు చెప్పిన ఋషి

బదరిని సాధించడంలో వచ్చే ఇబ్బందులేమిటో, వాటిని ఎలా అధిగమించాలో చెప్పిన పాత్రనే ఈ ఋషి.

కమ్మరి అమ్మాయి

బిందెతో నీళ్ళు తీసుకెళ్ళడానికి చెరువు దగ్గరికొచ్చిన ఈ కమ్మరి అమ్మాయి, అక్కడ బదరిని చూసి ఆమె గురించి తెలుసుకొని మోసపూరితంగా బదరిని నీళ్ళలోకి తోసేసి, తను బదరి పాత్రను నిర్వహిస్తుండగా, చివరికి బండారం బయటపడి భర్త చేతిలోనే హత్యకు గురవబోతుంటే బదరి వల్ల ప్రాణం నిలుపుకొని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది.

తోటమాలి

చెట్టుకు కాసిన పెద్దకాయని తిందామని కోసుకొని పగలకొట్టితే అందులోంచి ‘బదరి’ బయటికి వస్తుంది. సంతానం లేని తను ఆమెను పెంచుకుంటాడు.

ఉంగరం ఇచ్చిన ఋషి

తనకు భార్య కావలసిన ‘బదరి’ని చంపి తన భార్య అయిన కమ్మరి అమ్మాయి వల్ల మూడు సార్లు బదరి హత్యకు గురైనందుకు విచారంగా ఓ చెట్టు క్రింద కూర్చున్న రాఘవులుతో మాట్లాడి, అతనికి మంచి జరగడానికై ఉంగరం ఇస్తాడు ఋషి. ఈ పాత్రకు కూడా కథలో పేరు లేదు.

చిలకలు

మాయా ఉంగరం ధరించి ఏ చెట్టు క్రింద రాఘవులు కూర్చున్నాడో, ఆ చెట్టుపై రెండు చిలకలు అతనికి జరిగిన మోసం గురించి మాట్లాడుకుంటుంటే, అతనిక అర్థమై ఇప్పుడు తాను ఏమి చేయాలో కోరిన మీదట ఆ చిలకలు జరగాల్సింది చెప్పి, అతను బదరిని పొందేట్టుగా చేస్తాయి ఈ చిలకలు.

ఇలా పాత్రలు తీర్చిదిద్దబడిన ఈ కథానికలో ఉన్న మరో విశిష్టత ఈ కథలో ఉన్న రెండు కథల్లో వదిన మరిదికి కథ చెప్పడం. ఈ కథ వింటున్న ఈ రెండు మరిది పాత్రలు రఘు, రాఘవులు పేర్లు పోలికల్లో ఒకేలా ఉండడం వల్ల పాఠకులు మరింత జాగరూకులై ఈ కథాపఠనం సాగించాలి.

భాష:

ఈ కథానిక ప్రథమ పురుషలో సాగింది. పూర్తి వ్యావహారికంలో రాశారు రచయిత. ఇందులో “..ఆకాశంలో చుక్కలు, కిటికీల చువ్వలు పట్టుకుని, గది లోపలికి దూరడానికి ప్రయత్నిస్తున్నాయి. దయ్యంలా జుట్టు విరబోసుకుని, ఆకాశం తన నల్లటి ఇనుప చేతుల్తో చుక్కల్ని వెనక్కి లాగుతోంది. తాను చొరబడాలని చూస్తోంది” (పుట-25, నిప్పుపూలు) అనే విధంగా చక్కటి వర్ణనాత్మక వాక్యాలు ఉంటాయి.

తిట్లు:

ఓసి దీని సిగదరగ (పుట-30, నిప్పుపూలు); నేను కమ్మరి అమ్మాయిని నరుకుతా (పుట-30, నిప్పుపూలు); సరే చెప్పు వదినా! దాని అంతు తేలుస్తా..; అమ్మో! రాజకుమారిని మళ్ళీ చంపిందా పాడుముండ (పుట-31, నిప్పుపూలు) ఇలా ఈ కథానికలో అక్కడక్కడ యథేచ్ఛగా తిట్లను కూడా రచయిత దాశరథి ప్రయోగించారంటే పాత్రోచిత, సందర్భోచిత భాషను ‘వాడి’నట్లు గమనిస్తాం.

చిన్నచిన్న వాక్యాలు:

“ఆయన చెప్పినట్టే చేస్తే పోలా వదినా?” అన్నాడు రఘు. “రుషి వద్ద సెలవు తీసుకుని, ఇంటికి బయలుదేరాడు రాఘవులు. కొంతదూరం వచ్చే సరికి సంధ్యా సమయం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఒక చెరువు వొడ్డున కూచున్నాడు రాఘవులు. అలసి వున్నాడు కదా! నిద్ర వచ్చింది. పరిసరాలు ఎంతో అందంగా వున్నాయి. చల్లని గాలి. ‘అసలు రేగుపండులో రాజకుమారి వుందో లేదో! రుషి మోసం చేయలేదు కదా! పగులగొట్టి చూద్దాం!’ అనుకున్నాడు రాఘవులు” (పుట-29, నిప్పుపూలు) ఇలా చిన్న వాక్యాలతో కథను నడుపుతూ పాఠకులకు పఠన సౌలభ్యతను సాధించారు రచయిత దాశరథి.

నాటకీయత:

నాటకాలు రాసిన ఏ రచయిత అయినా కథలు, నవలలు రాసినప్పుడు తనకు తెలవకుండానే సంభాషణలు రాయడం చూస్తాం. ఆ తీరు ఈ కథానికలో:

“ఒక వూళ్ళో అంటే మన వూళ్ళో కాకూడదా?

ఇద్దరు అన్నదమ్ములంటే నేనూ మా అన్నయ్యా కాకూడదా? అన్నాడు రఘు

అలాగే అనుకో, ఇద్దరన్నదమ్ముల్లో అన్నకు పెళ్ళైంది

తమ్ముడికి కాలేదు – అంది వనజ

అవును , మరినాకు కాలేదుగా – అన్నాడు రఘు” (పుటా26, నిప్పుపూలు)

ఇలా ఈ చిన్న కథానికలో అక్కడక్కడ నాటకీయతను గమనిస్తాం.

విశిష్టత:

ఈ కథానిక దాశరథి కథల్లోనే కాదు, తెలుగు సాహిత్యంలోని కథానికల్లోనూ చాలా విశిష్టమైనది. ఈ కథానికలోని ‘ప్రధాన కథ, కథలోని కథ’ ఈ రెంటిలోనూ వదిననే మరిదికి కథ చెప్పడం జరుగుతుంది. ఇట్లా రచయిత ఈ కథను నడపడంలోనూ ఏ రచయితకు అంత సులువైంది కాదు. ఇటువంటి కథలో ఏ కథలోని కథ నడుస్తున్నదో జాగ్రత్తగా పాఠకుడు చదవకపోతే కథ అంత సులభంగా పట్టువడది. కాబట్టి మిగతా కథలను చదివినట్లుగాక ఎక్కువ దృష్టిని కేంద్రీకరించి చదవాల్సి ఉంటుంది.

ఇది స్త్రీ ప్రాధాన్యత గల కథానిక. ఇందులో తల్లిలేని రఘును బాల్యం నుంచే వదిన వనజ తల్లిలా పెంచుతున్నది. మరిదికి రోజూ రాత్రి వదిన కథ చెబితేనే నిద్రపోతాడు. కాబట్టి “..రాత్రిపూట రఘుకి కథ చెప్పాలంటే ‘వనజ’కి చిక్కే. ఒకవైపు శ్రీవారి పోరు. మరోవైపు రఘు రభస! అయినా సర్దుకుంటూ వస్తోంది..” (పుట-25) వనజ పాత్ర. అంటే ఈ పాత్ర ప్రతీరోజు మానసికంగా ఎంత ఇబ్బందికి గురవుతుందో పాఠకులు ఊహించగలరు. బాల్య దశ నుంచి యౌవనంలోకి అడుగిడినా కథ చెప్పాల్సిందేనని మారాం చేస్తున్న రఘుకు ‘రాజకుమారి బదరి’కకు సంబంధించిన జానపద కథ చెబుతుంది వనజ. మధ్య రాత్రి మరిది పిలవడం వల్ల భర్త ప్రక్క నుంచి నిద్రలోంచి లేచి వచ్చి వనజ ఈ కథ చెబుతుంటే కథ వింటూ రఘు మధ్య మధ్యలో అమాయకంగా వదినతో మాట్లాడుతున్న తీరు, ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఆమెకు ఎంత ఇబ్బంది కలిగిస్తున్నదో రచయిత చెప్పినవి చూద్దాం. 1. “రఘు పసికంఠంలోని మెత్తదనం పోయి బొంగురు గొంతు వినపడిరది. బాల్యం గడిచిందన్న మాట! అనుకుంది వనజ” (పుట-26); 2. “నువ్వు కథ చెప్పాల్సిందే చెప్పంది కదలనివ్వను” అని వనజ కొంగు పట్టుకున్నాడు రఘు. వనజ వొళ్ళు ఝల్లుమంది (పుట-26); 3. “వదినా! నువ్వు కథ చెప్పంది నేను నిద్రపోను. నిన్ను నిద్రపోనివ్వను” అన్నాడు రఘు ఆమె ముంగురులు సవరిస్తూ.. (పుట-26); 4. “ఫేయిరీటేల్స్‌” అందమైన రాజ కుమార్తెల కథలు అన్నాడు రఘు వదిన చెయ్యి పట్టుకుని, వనజ వొంట్లో విద్యుత్తు ప్రవహించినట్లైంది. తల్లి స్థానం, వదిన స్థానం దాటి మరెక్కడికో మారినట్లనిపించింది (పుట-26); 5. “అలాగే.. అడ్డురానులే.. చెప్పు వదినా” అన్నాడు వదిన వొళ్ళో పడుకుని.. ఆమెలో ఎన్నడూ లేని జలదరింపు కలిగింది (పుట-27); 6. “అమ్మో!” అని అరిచాడు రఘు బిగ్గరగా వదిన్ని కౌగిలించుకున్నాడు. వదిన ఉక్కిరి బిక్కిరైపోయింది (పుట-28); 7. “బిడ్డా ఈ పెద్ద రేగుపండును భద్రంగా ఇంటికి తీసికెళ్ళి పగులగొట్టు, అప్పుడు అందమైన రాజకుమారి బదరి బయటికి వస్తుంది. సుందరంగా సుకుమారంగా వుంటుంది” అన్నాడు రుషి. “నీ కంటేనా?” అన్నాడు రఘు వనజతో!. “నాకూ రాజకుమారికీ ఏం పోలిక.. కథ విను” అంది వనజ (పుట-29); 8. రాకుమారీ నాకు అలసటగా వుంది. నీఒడిలో కాస్సేపు పడుకుంటా అన్నాడు రాఘవులు. “నేను నీ ఒడిలో పడుకున్నట్టేనా?” అన్నాడు రఘు (కథ చెబుతున్న వనజతో). “అవును అంతే అనుకో ..రాజకుమారి బదరి అందుకు సమ్మతించింది. (పుట-29); 9. “అందాల రాజకుమారి ఒడిలో రాఘవులు సుఖంగా నిద్రపోయాడు” అంది వనజ. రఘు మాట్లాడలేదు, ఆమె ఒడిలో ప్రశాంతంగా నిద్రపోయాడు రఘు. (పుట-32); 10. “బదరీ! మళ్ళీ వెళ్ళిపోతావా? నిన్ను వెళ్ళనివ్వను వెళ్ళనివ్వను” అంటూ వనజను తన కౌగిలిలో బంధించి వేశాడు. ఉక్కిరి బిక్కిరైపోయిన వనజ రెక్కలు నలిగిన పక్షలా ఉండిపోయింది (పుట-32). ఇలా వనజ పాత్ర మధ్య రాత్రి భర్త పిలిచినా వెళ్లలేకపోవడమనేది ఎంత మానసిక క్షోభకు గురిచేస్తున్నదో జీవితానుభవమున్న ఎవరికైనా అర్థమవుతుంది. ఈ పాత్ర బయటికి ఎవ్వరికీ చెప్పుకోలేక బాధను తనలో తానే దిగమింగుకుంటున్న తీరు ఎందరో స్త్రీలకు నమూనాలా రచయిత ఈ పాత్రను తీర్చిదిద్దారనిపిస్తుంది.

నామౌచిత్యం:

ఈ కథా రచయిత మహాకవి దాశరథి తన ఏ ప్రక్రియ రచనకైనా శీర్షిక పెట్టడంలో ప్రత్యేక దృష్టి కనిపిస్తుంది. ఈ కథలో, పిట్ట కథలోని నాయిక అయిన రేగు పండులాంటి ‘రాజకుమారి ‘బదరి’ అనేది పాత్ర పేరు. జానపద కథ మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతుంది. కాబట్టి ఈ పాత్ర పేరైన ‘బదరి’ పేరే ఈ కథానికకు పెట్టారు రచయిత. అయితే ఈ పాత్ర గురించిన కథను చెప్పేది, బాల్య దశ నుంచి యౌవన దశలోకి అడుగిడిన మరిదికి కథ చెబుతూ తనలోని స్త్రీత్వంతో ఇబ్బంది పాలైన ఓ తరుణి తల్లడిల్లిన తీరును ప్రధానంగా చెప్పాలనుకున్నప్పుడు కథలోని పిట్ట కథ కథానాయకురాలు గాకుండా మొత్తం కథను నడిపిన పాత్ర అయిన ‘వనజ’ పేరు ఈ కథానికకు ఉండి ఉంటే మరింత ఔచిత్యంగా ఉండేదనిపిస్తుంది.

ఆరంభ-ముగింపులు:

ఎత్తుగడ, ముగింపులు అత్యంత ఆకర్శనీయంగా ఉంటూ పాఠకులను ఆకట్టుకునేట్టుగా పత్యేక శ్రద్ద వహిస్తారు చెయ్యి తిరిగిన రచయిత ఎవ్వరైనా. ఈ కథలో కూడా అది గమనిస్తాం. అది:

“నాలుగు సున్నాలు. Zero.. Zero.. Zero.. Zero..

అనగా రాత్రి 12 గంటలు!

ఇంకా నిద్రపట్టదేం? అనుకున్నాడు రఘు.” (పుట-25, నిప్పుపూలు) అంటూ కథారంభ కాలంతో పాఠకుల్లో ఉత్సాహం రేకెత్తించే విధంగా చక్కగా ఆరంభించారు ఈ కథానిక రచయిత దాశరథి.

ఇలాగే ముగింపుగా “‘బదరీ! మళ్ళీ వెళ్ళిపోతావా? నిన్ను వెళ్ళనివ్వను వెళ్ళనివ్వను’ అంటూ వనజను తన కౌగిలిలో బంధించి వేశాడు. ఉక్కిరి బిక్కిరైపోయిన వనజ రెక్కలు నలిగిన పక్షిలా ఉండిపోయింది” అని చెప్పడం వల్ల స్త్రీలు మౌనంగా ఎలా బాధను భరిస్తున్నారో చెప్పకనే చెప్పి కథను ముగించారు దాశరథి.

ముగింపు:

సాధారణంగా కథా ప్రక్రియ అంత సులువైంది కాదంటారు. చిన్న కాన్వాసులో చెప్పదలచినదంతా ప్రభావ వంతంగా చిత్రించి చూపాలి. అటువంటిది ఈ కథానికలో మరిదికి కథను చెప్పే వదినకు చెందిన రెండు కథల్ని సమాంతరంగా నడుపుతూ అత్యద్భుతంగా నిర్వహింపబడిన ఈ ‘బదరి’ కథానిక తెలుగు సాహిత్యంలోనే మణిపూస వంటిదంటే అతిశయోక్తి కాదు.

Exit mobile version