[ప్రసిద్ధ ఒడియా రచయిత శ్రీ హృశికేశ్ పాండా రచించిన నవలని ‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు శ్రీమతి స్వాతి శ్రీపాద.]
[కుంతి ఇంట్లో పూజ చేయించి, వెళ్ళడానికి సిద్ధమవుతూ, మర్నాడు ఉదయం వడ్డీ వ్యాపారి ఇంట్లో పూజ చేయించాలని అంటాడు పూజారి. బదులుగా, మర్నాడు ఎలాంటి పూజ జరగదని, వారికి పురిటిమైల వస్తుందని జోస్యం చెబుతుంది కుంతి. ఆ విషయం కుంతికి ఎలా తెలుసని ఆ పూజారి అడగకుండానే వెళ్ళిపోతాడు. ఓ రోజు నాథు మహాలిక అనే రైతు – నీకీ దైవిక శక్తి ఎలా వచ్చింది? నీ గురువు ఎవరు? – అని కుంతిని అడుగుతాడు. వెంటనే, ముందు మీ అక్క వాళ్ళ ఊరికి వెళ్ళు అంటూ అతన్ని అక్కడికి పంపుతుంది. అతను ఆ ఊరికి చేరేసరికి, ఏదో భూమి గొడవలో అతని బావగారిపై ప్రత్యర్థులు దాడి చేయబోతుంటారు. సమయానికి వెళ్ళిన నాథు బావగారిని కాపాడుకోగలుగుతాడు. ఓ రోజు ఓ అపరిచితుడు సైకిల్ తొక్కుతూ ఊర్లోకి వచ్చి కుంతి గురించి ఆరా తీస్తాడు. అందరికీ అతను కుంతి గురించే అడుతున్నాడని తెలిసినా, ఎవరూ కుంతి ఇల్లు ఎక్కడో చూపించరు. చివరకు అతను కుంతి ఇల్లు చేరి తలుపు తడతాడు. ఒకప్పటి తోటి టీచర్ తమ్ముడు భానుగా గుర్తించి లోపలికి ఆహ్వానిస్తుంది. అతనితో ఒకప్పుడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటుంది. అతనికి మజ్జిగ ఇచ్చి తాగమంటుంది. మజ్జిగ తాగేసి, ఎంత వేగంగా వచ్చాడో, అంతే వేగంగా తిరిగి వెళ్ళిపోతాడు. – ఇక చదవండి.]
అధ్యాయం-7
చిన్నతనం నుండీ ప్రతిదానికీ తల్లిని నిందించడం కుంతి అలవాటు. హాస్టల్లో చేరి తనను తను చూసుకోవలసివచ్చినప్పుడు, ఎవరూ ఆమెకు భోజనం వడ్డించనప్పుడూ, ప్రతి ముద్దా నోట్లో పెట్టుకోబోతూ తల్లినే తిట్టుకునేది, ఆమె తండ్రి అప్పటికింకా బ్రతికున్నాడు కాని పెద్ద లెక్కలోకి తీసుకునేది కాదు. చాలా కాలం క్రితం మాట అది, తనే వడ్డించుకు తినాలంటే ఇప్పుడు ఆకలి ఆమెను బాధించడం లేదు.
ఆ రోజుల్లో తల్లి తరచు ఊరగాయలు, రేగుపళ్ళు, వడియాలు, కూరగాయలు తీసుకుని వచ్చేది. కుంతి కూడా ఇంటికి వెళ్ళినప్పుడు గ్లూకోజ్ పాకెట్లు, విటమిన్ టానిక్ బాటిల్స్, బట్టలు తీసుకు వెళ్ళేది. అమె అన్నలు అప్పటికే బుర్రనిండా నిండిన అహంకారంతో వాళ్ళ జీవితాలు వారి వారి భార్యల చుట్టూనే తిరిగేవి. కలకత్తాలో ఉన్న ఆమె పెద్దక్క భర్త తన టీబీ రోగానికి నల్లమందు సేవిస్తూ కుంతిని ఏడిపించడం మానేసాడు. సెలవల్లో కుటుంబాన్ని కలవడానికి వెళ్ళినప్పుడల్లా కుంతి తన చిన్న తమ్ముడూ గొబారాకు స్నానం చేయించేది. చాలా రోజులు గడిచాక, ఒకసారి వేసవి సెలవల్లో ఆమెకు తెలిసివచ్చింది ఇహ తను వాడికి నగ్నంగా స్నానం చేయించలేదని, ఆమెకెంత పిచి కోపం వచ్చిందంటే తరచు వాడీని చావబాదుతూ ఉండేది. సెలవల తరువాత తిరిగి వెళ్ళాక కుంతికి తెలిసి వచ్చింది, తన తమ్ముడిగా కాక గొబారాతో ఎంత గాఢమైన అనుబంధం ఏర్పడిందో. ఆమెకు మూడేళ్ళ కిందటే నెలసరి మొదలైంది. అన్నీ తమ్ముడితో పంచుకోలేదు. దానికి కూడా ఎప్పటిలానే తల్లినే నిందించింది కుంతి.
ఒక సారి ఆమె తల్లి చెప్పింది కూడా, “ఇది నీ దురహంకారం తల్లీ, ప్రతి పెళ్ళికూతురినీ ఎగతాళి చేసి వేలెత్తి చూపించావు, అందుకే దేవుడూ సహించలేక నీకు పెళ్ళికూతురయే యోగం ఇవ్వలేదు.” అని.
కుంతి వెంటనే కొట్టినట్టే చెప్పింది, “ఇదంతా నీ తప్పు. నువ్వు నాకు జన్మ నివ్వడం వల్లే.”
అకాల మరణం వల్ల అతని దోషమంతా మాయమయిపోయినట్టు కుంతి తండ్రినెప్పుడూ నిందించలేదు. అంచేత కుంతి సాధింపు, నిందా తిరస్కారాలన్నీ తల్లిపైనే, ఆమె జీవితం పైనే. ఒక్కోసారి ఆమె మరీ దుర్భరంగా ఉండేదంటే ఎంత ఓపికమంతులకైనా కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి. అయినా ఆమె కూతురి ముందు ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టుకోలేదు. గొప్ప సహనంతో బాగా గాయపడే వరకూ ఆమె కూతురి ఎగిరిపడటాలు భరించేది. ఒక్కోసారి ఒంటరిగా ఉన్నప్పుడు మౌనంగా గంటలు గంటలు ఏడ్చేది.
ఒకసారి కుంతికి వెంటనే కటక్ రమ్మని భాను నుండి ఉత్తరం వచ్చాక (అప్పటికి కుంతికి ఇంకా కటక్ బదిలీ కాలేదు), భాను ఏదో ప్రమాదంలో ఉన్నాడేమోనని సాయంత్రం చివరి బస్లో వెంటనే బయలుదేరింది. కటక్ చేరేసరికి చీకటి పడిపోయింది. ఒక రిక్షా మాట్లాడుకుని ఎక్కి కూచుంది. ఎక్కడికని, ఏ దారిన వెళ్ళాలని రిక్షా వాడు అడుగుతూనే ఉన్నాడు. అతనికి వివరాలు చెప్పలేకపోయింది. అతను రిక్షా టౌన్కి దూరంగా, ఒంటరి ప్రదేశానికి మళ్ళించాడు. ఆ రిక్షావాడు తనను తప్పుదారిన తీసుకువెళ్తున్నాడని కుంతికి అర్థమయింది. ఏం చెయ్యాలి? అరవాలా? అరిస్తే ఒకవేళ ఆ మనిషి సరిగానే తీసుకువెళ్తుంటే ఎంత సిగ్గుచేటు? జనం ఆమెను పల్లెటూరి బైతు అనుకోరూ. అమెకు తన మీద తనకే అయిష్టం అనిపించింది. చిన్నతనం గుర్తుకువచ్చింది, ఏదనుకుంటే అది చెప్పెయ్య గలిగేది. టౌన్కి దూరంగా వచ్చేసారు, తనను రేప్ చేస్తాడని గట్టిగా అనుకుంది. భయపడింది. అయినా నోరు విప్పలేకపోతోంది. నెమ్మదిగా ఒక సంక్లిష్టమైన , దృశ్యమానమైన స్థితి ఆమెను మింగేసింది. ఒక భీకరత్వం అపరిచితమైన పరిసరాలతో చేతులు కలిపింది. ఆమె కళ్ళముందు ఇసుక, సంక్షిప్తమైన అడవి మహానదీ, కథ్జడ్లి నదీ సంగమం వైపు వ్యాపించాయి. కుంతి గట్టి గట్టిగా అరిచింది, కన్నీటిపర్యంతమైంది, ఆమె ఎక్కిళ్ళు గుండెలు పిండేసే అరుపుల్లో కలగలిసిపోయాయి. ముత్యాల్లా మెరిసిపోతున్న పలువరస ఉన్న మనిషి, కులీనత, నాగరీకత సమ్మిళితమైన అణువులు మొత్తం తడిపేస్తున్న మనిషి ఆమెను రక్షించడానికి వచ్చాడు. రిక్షావాడికి నాలుగు తగిలించి, తన మోటర్ సైకిల్ మీద కాస్సేపు ఆ రిక్షాను అనుసరించాడు. ఇంతలో యునిఫాంలో ఉన్న పొలీస్ ఆఫీసర్ ప్రత్యక్షమయాడు (నిజానికి ఆ పోలీస్ ఆఫీసరే రేప్ చేసే వాడిలా ఉన్నాడు.). అతన్ని చూడగానే ఆ మోటర్ సైకిల్ మీదున్నవాడు వేగం పెంచుకుని వెళ్ళిపోయాడు.
“మళ్ళీ మొహం చూపించే సాహసం చెయ్యకు” అన్నాడు శంభు కొడుకు మకర. (మకర కుంతి గ్రామస్థుడే. అతని తండ్రి సరదాగా ఉండే మంచి మనిషి. మరోసారి అతని గురించి చెప్తాను.)
కుంతి మొత్తం సంఘటనతో అయోమయంలో పడిపోయింది. ఆమెను అంతగా ఉలికిపడేలా చేసిన సంగతి, “మకర ఆ మనిషిని ఎందుకు వెన్నాడుతునాడు?”
“నేనిక్కడ పొలీస్ సబ్ ఇన్స్పెక్టర్ను. ఆ మనిషి రూలింగ్ రెయిన్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్. నిన్ను రేప్ చెయ్యడానికి వెనకాల వస్తున్నాడు. కొన్నాళ్ళ క్రితం సంచలనం రేపిన రేప్ కేస్ గురించి చదివే ఉంటావు. వీడే ఆ నిందితుడు. హైకోర్ట్లో అతన్ని వదిలేసారు. ఈ రోజుల్లో దేనిమీదా ఎవరికీ ఏ విధమైన అధికారమూ లేదు. ఏం చెయ్యలేము. ఎవరినీ ఏమీ చెయ్యకుండా ఆపలేము.” అన్నాడు మకర.
కుంతి బలహీనమైన, బాధ్యతా రహితమైన న్యాయవ్యవస్థ పట్ల ఏ మాత్రం ఆందోళన పడలేదు. ఎప్పటికీ పూర్తికాని విషయం పట్లే ఆమె కలతపడింది. తను మరణించినప్పుడు ఆమె పాప పుణ్యాలు కూడా ఒక ముగింపుకు వస్తాయి. కాని ఆమె చెయ్యబోయిన పాపాలు, గోవిందాతో, భానుతో ఆ నాగరీకపు రేపిస్ట్తో అలాటివన్నీ సుందరి చేసింది. ఇలాటి పాపాలు ఆమె చెయ్యలేదు. అలాటి పాపాలను అడ్డుకున్న మకర, అవన్నీ కూడా ముగింపుకు వస్తాయి. అయినా ఆమెకు ఏదో గొరకలేదు, ఒక అనుభవం, పాప పుణ్యాలకు అతీతమైన అనుభవం, వాటికి కనెక్షన్ లేనిది, ఎప్పటికీ ఆమె పొందలేని అనుభవం, ఎప్పుడు అనుభవించలేని ఒక పులకింత. ఈ ఎన్నటికీ సాధ్యపడని తనం పూర్తిగా ఆమెదే. పూర్తిగా వ్యక్తిగత నష్టం. ఆమెకు మృత్యువు తప్ప మరి దేనిమీదా నమ్మకం లేదు. ముఖ్యంగా ఈ జీవితంలో ఇచ్చిపుచ్చుకోడాలు ముగిసిపోయాక. ఋణాలన్నీ తీర్చేసుకున్నాక, ఆమె దేనికోసం ఎదురుచూడగలదు, ఎవరి సాయం, పరిరక్షణతో, అదీ ఈ ప్రపంచంలో ఆని సంబంధాలూ ఋణానుబంధాలే అయ్యాక.
ఇంతవరకూ ఆమె అనుభవించిన జీవితంలో ఒక్క అద్భుతమూ జరగలేదు. ఇహ మిగతా అద్భుతమైన జీవితంలో దేని ఉనికిని ఆమె అనుమానిస్తోందో, పూర్తిగా సందేహిస్తోందో, దానికి ఎందుకు ఎదురు చూడాలి? ఆ రాత్రి, సన్నటి వర్షపు జల్లుల్లో, ఇసుక మేటలు, పొదలమధ్య, నదీ తలాల నుండి వచ్చే పొగమంచులో ఆమెను గనక రేప్ చేసి ఉంటే అది మరింత అర్థవంతంగా ఉండేది కాదా? ఆమె భయంతో, లజ్జతో అవమానంతో జీవితమంతా ఆ భయానక అనుభవాన్ని మోసుకుంటూ సిగ్గుతో, కన్నీళ్లతో హిందీ సినిమాలలో చూపించినట్టు బ్రతికేదా?
తన భుజాలమీద జరగబోయిన రేప్ అనే దౌర్జన్యాని మోస్తూ తిరిగి వచ్చాక ఎప్పటిలా తల్లినే నిందించింది. అమ్మ ఊళ్ళో ఉండేది, వచ్చినప్పుడు కూడా ఒక రోజో అరో గడవగానే ఏం తోచక మళ్ళీ ఊరికి వెళ్ళిపోయేది. ఒక భయంకరమైన పుకారు చక్కర్లు కొట్టసాగింది, గ్రామం నీట మునిగిపోతుందని ఒకవేళ అమ్మ మరింతకాలం ఉండి ఉంటే అనేదేమో, ఊరు మునిగిపోతే నా ఇల్లేమవుతుంది, ఆవులు, గిన్నెలూ చెంబులూ, దేవుళ్ళు, వరిపొలాలు, మొదలైనవన్నీ ఏమవుతాయి? అమ్మకు తెలుసు కుంతి ఏదో ప్రమాదాన్ని ఎదుర్కోబోతోందని (అమ్మలకు ఇలాటి విషయాలు ఎప్పుడు తెలుస్తూనే ఉంటాయి, అదేమిటో వాళ్ల ఒక్కళ్ళకే తెలుస్తాయి). గ్రామ దేవతలకు, నది డామ్ వల్ల ఆ దేవతల జీవితమే కుదించుకు పోతున్నా, బలి ఇవ్వడం, ప్రార్థనలు చేయించడం ఆపైన ఒంటరిగా, నిశ్శబ్దంగా ఏడవటం చేసింది. రోజంతా ఆమె శపిస్తూనే ఉంది, కొడుకు, కోడలిని అనవసరంగా కేకలు వేసింది, వాళ్ళను తిట్టినందుకు రాత్రంతా బాధపడింది. మర్నాడంతా కుంతిని తిట్టుకుంటూనే ఉంది, నానా రాకాలుగా పేర్లు పెడుతూ దూషించింది, ఆమె వల్లే తప్పు లేకపోయినా వాళ్ళను దూషించినందుకు. మళ్ళీ రాత్రి ఆమె బాధపడి, దురదృష్టవంతురాలు, ఒంటరిగా ఉండే కూతురిని ఎందుకు శపించానని ఒంటరిగా ఏడ్చుకుంది.
గ్రామం నిజంగా మునిగిపోయినప్పుడు తల్లి కాని, కొడుకులు కాని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొత్త సెటిల్మెంట్లో ఉండటానికి వెళ్ళలేదు. అక్కడ వాళ్ళ వాటాలు అమ్ముకున్నారు, అక్కడినుండి టౌన్కో, ఎక్కడో తెలియని ప్రదేశాలకో వెళ్ళిపోయి దేశదిమ్మరులైపోయారు. కుంతి వాటానే అమ్మకుండా మిగిలిపోయింది. దాన్ని ఎవరూ ఆక్రమించలేదు. తల్లికి మతిభ్రమించి నిరంతరం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేది. శారీరికంగా కుదించుకుపోయి అస్థిపంజరంలా, ఆమె మనసు బీడు బారి, కఠినమైన రాతిపొలంలా మారిపోయాయి. ఆమె రెల్లుపోచలా సన్నబడిపోయి ఆమె నడిచినప్పుడో, కాళ్ళూ చేతులూ కదిలించినప్పుడో ఎముకలు ఒరుసుకునేవి. కుంతి పెద్దన్నయ్య దగ్గరలో టౌన్కి వలసపోయాడు, తన బంగారు ముక్కపుడక భార్యతో, ముగ్గురు ఆరుద్ర పురుగుల్లాటి పిల్లలతో. అక్కడ ఒక మురికివాడలో పాత గుడ్డలు, రేకు పైకప్పు, గోనెసంచులతో వేసిన గుడిసెలో ప్రశాంతంగా సెటిలయాడు. తన వాటాగా అతను అందంగా చెక్కిన పురాతన తలుపులను వారి ఉమ్మడి ఆస్తి నుండి తీసుకువెళ్ళాడు. కాని ఈ కథ ముగింపుకు వచ్చే సమయానికి కూడా ఆ తలుపులు బిగించుకునే ఇల్లు కట్టలేకపోయాడు. వాళ్ళ గుడిసెలో ప్రవహించే డ్రైనేజీ కాలువ కప్పడానికి ఆ తలుపును వాడుతున్నారు.
గ్రామం మునిగిపోయాక తల్లి కుంతి దగ్గరకు మళ్ళీ రాలేదు, ఆ గ్రామమే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అన్నట్టు. ఆమె చివరిసారి వచ్చినప్పుడు ఒక వేరు ముక్కను తీసుకుని వచ్చింది, అది యౌవనాన్ని ప్రేరేపిస్తుందని. కాని ఆ నిజాన్ని కుంతికి చెప్పకుండా దాచి అది పైల్స్ నివారిస్తుందని చెప్పింది. కుంతి ఆ వేరును ఏదమ చేతి దండకు కట్టుకున్నప్పుడు ఆమెకు రక్తం వల్ల ఎరుపెక్కుతున్నట్టు అనిపించింది. కొత్త రక్త ప్రసరణతో కాళ్ళు చేతులూ గులాబీ రంగుకు తిరిగినట్టు, దాని విపరీతమైన వెచ్చదనం వల్ల ఒళ్ళంతా వేడెక్కి హృదయం ఉత్తేజపడినట్టు అనిపించింది. ఆ తరువాత కుంతి పూర్తిగా, తన జీవితంలో సాయంత్రాలను గుళ్ళూ గోపురాల్లో భజనలకూ, ప్రవచనాలకూ, పొద్దున్నే నగర సంకీర్తనలకూ , ధ్యానానికీ, మంగళ వారాలూ శుక్రవారాలూ భజన కీర్తనలు పాడేందుకు, మతసంబంధిత సోదరులతో కేటాయించుకుంది. ఏడాది తరువాత అవన్నీ వదిలేసింది. ఎక్కువగా విసుగొచ్చి పెద్ద నిరాశపడకుండా. మళ్ళీ నిరాశతో అనాచారం అలవరచుకుంది.
ఈలోగా గొబారా అస్సాం వెళ్ళాడు. మధ్యలో ఒకసారి వచ్చాడు, కొంత డబ్బు అవసరమై అడగటానికి, తిరిగి వెళ్ళేప్పుడు కన్నీళ్ళు పెట్టుకునే నటన దృశ్యాలు బాగా పండించాడు.
(రెండు రోజుల తరువాత భాను వచ్చాడు. కుంతి గొబారాను అరికాలి నుండి నడినెత్తి వరకూ, పొగుడుతూనే ఉంది.
“గొబారా మరి ఇంటికి తిరిగి రాడు, అక్కడే పెళ్ళి చేసుకుని సెటిల్ అవుతాడు” అన్నాడు భాను.
“అదేం కాదు,అందరూ నీలా కాదులే” అంది కుంతి దురుసుగా.
కుంతి హడావిడిగా ఒక జత ఊల్ సాక్స్ కొని తెచ్చింది. వంటల పుస్తకంలో చూసి ఏదో వంట చేసి పెట్టింది. ఆ రాత్రి తన తల్లితో తనతో మూర్ఖంగా ప్రవర్తించే హెడ్ మిస్ట్రెస్ గురించి, రేప్ జరగవలసిన సంఘటన గురించి, పీరియడ్స్ టైమ్ లో కడుపునొప్పి గురించి చెప్పింది. తల్లి కూడా తనపై ద్వేషంతో మూర్ఖంగా ఉండే కోడలి గురించి, ఈ మధ్యనే కొత్తగా గ్రామంలో పుట్టి చక్కర్లు కొడుతున్న పుకారు గురించి, తన సియాటికా నొప్పి గురించి, తిన్నది అరగకపోడం గురించి మాట్లాడింది. కుంతి ఎందుకో తను సురక్షితంగా ఉన్నాననే అనుకుంది. శూన్యత ఏ మాత్రం విస్తరించడం లేదు. ఆమె దగ్గరలో ఘనమైన సహాయం చేరువలోనే ఉందని అనిపించింది.
గొంతులో ఇంకా దుఃఖం తాలూకు వెక్కిళ్ళు తగ్గకుండానే, “నీకు తెలుసు కదా అమ్మా, నాకెప్పుడు బాధనిపించినా నిన్నే తిట్టుకుంటాను” ఆంది.
“అమ్మలు ఉన్నది అందుకే గదా, డియర్, అందుకే నేను నీకు అమ్మను.”
“గోవిందా తప్పుదోవన వెళ్ళక పోయిఉంటే నేను అతన్ని పెళ్ళిచేసుకుని ఉండేదాన్ని. నేనతన్ని ప్రేమించాను” అంది కుంతి.
“గోవిందా ఒక స్కూల్ టీచర్ని బాగా లావుగా ఉన్నావిడను ఉంచుకున్నాడని మార్కండ అన్నాడు” చెప్పింది కుంతి తల్లి.
“నాన్న మరికొంత కాలం బ్రతికుండి ఉంటే పరిస్థితులు బాగుండేవి” అంది కుంతి.
“మీ నాన్న ఎందుకూ పనికిరాని మొహం. అతను నన్నే చూసుకోలేకపోయాడు, నా పిల్లల సంగతి తర్వాత” అంది కుంతి తల్లి.
“ప్చ్, అలా మాట్లాడి పాపం చెయ్యకు” అంది కుంతి. అమ్మకు నాన్న స్వరం వినబడి నోరు మూసేసుకుంది. గ్రామం మునిగిపోయే సమయానికి అమ్మ పుర్తిగా పాడయిపోయింది.
ఆమె చాలా ముసలిదైపోయింది. అయితే రోజులకొద్దీ నోరే విప్పేది కాదు లేదంటే గంటలకొద్దీ ఏదో ఒకటి వాగుతూనే ఉండేది. అవేవో ఆవిడ చివరి గంటలన్నట్టు పోయేముందు నిలవ చేసుకున్న మాటలన్నీ ఖాళీ చెయ్యాలన్నట్టు. కాని ఎంత వేగంగా హడావిడిగా మాట్లాడేదంటే ఏమాటా స్పష్టంగా అర్థమయ్యేలా ఉండేది కాదు.
కుంతి సెటిల్మెంట్కి తిరిగివచ్చాక చాలా రోజులకు తల్లి తిరిగి వచ్చింది. ఆపాటి తల్లి చూపు పూర్తిగా పోయింది. గోడలాగా చెవిటిదైపోయింది. ఆమె చేతివేళ్ళతో కుంతి శరీరాన్ని నిమిరింది.
“ఎలా నీ చర్మం కొంగ ఈకల్లా ఇంత మృదువుగా ఉంది?” ఆమె అడిగింది. ఆమె స్వరం ముక్కు నుండి వస్తున్నట్టుగా ఉంది.
(చాలా కాలం క్రితం అమ్మకు పసుపుపచ్చని, ఒరిస్సా ఇక్కత్ చీర ఉండేది. ఆమె ఆ చీరలో ఎంతో ఉజ్వలంగా అనిపించేది, అచ్చు లక్ష్మీదేవిలా, అప్పటికే అయిదుగురు పిల్లల తల్లి అయినా కూడా. కుంతి ప్రత్యేకమైన ఉత్సవ సమయాల్లో తల్లి చీర తీసుకుని మట్టిగోడలో బిగించిన అద్దం ముందు నిల్చుని అమ్మలా ఎందుకంత అందంగా లేనని అనుకునేది). తల్లి తన ఒళ్ళు నిమరగానే గిలిగింతలు పెట్టినట్టైంది కుంతికి. నిజానికి చిన్నప్పటినుండీ కుంతికి చక్కిలి గిలి ఎక్కువే. అది ఆమెను ఎప్పటికీ వదల్లేదు.
తల్లి దాదాపు మూగదైపోయింది. నడుస్తుంటే ఒక కట్టెల మోపులా శబ్దం చేసేది. కూర్చుంటే గొల్లభామలా అనిపించేది. ఆమె ఆ నిశ్శబ్దంలోనే కుంతితో సంభాషణలు జరపాలని అనుకునేది. కాని కుంతి మాత్రం ఈ అనుబంధాలకు అతీతంగా అధిగమించింది. తనముందు కనిపించే రంగురంగుల దేదీప్యమైన దారి నుండి, వెనకాల కుక్కిన చీకటి నుండి మరో ఎత్తుకు ఎదిగిపోయింది. ఆమె వెనక్కు తిరిగివచ్చి మళ్ళీ ఆ అనుబంధం పునరిద్దరించుకోగలదు.
ఒక రోజు ఉదయం అమ్మ వచ్చినట్టుగానే మళ్ళీ శూన్యంలోకి ఆవిరై కలిసిపోయింది. కట్టెల మోపు శబ్దంతో. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ఊళ్ళో ఉన్న వడ్రంగిపిట్టలన్నీ ఒకేసారి చెట్లకు తొర్రలు చెయ్యడం మొదలెట్తాయి. అమ్మ కట్టెల మోపులా చేసే శబ్దం ఆ వడ్రంగిపిట్టల ధ్వనిలో కలిసిపోయి ఆమె వెళ్ళిపోడం ఎవరూ గమనించనే లేదు.
అమ్మ వెళ్ళిపోయాక, కుంతికి తేలిపోతున్నట్టు అనిపించింది తన జీవితంలో మొత్తం జ్ఞాపకాలను తన నిండా నింపుకుని, చీరకొంగుకు గ్రానైట్ గులకరాళ్ళులా గనక ముడివేసుకుని ఉండకపోతే ఎగిరిపోయి ఉండేదే. బరువు లేకుండా తేలిపోయే అర్థం లేని భయం మినహా మిగతా అంతా ఎంతో ప్రశాంతంగా, శాంతంగా ఉండేది. కాని పుర్తిగా నిశ్శబ్దంలా మారిపోయింది. ప్రతి సంఘటనా ఆమెకు ముందుగానే తెలిసిపోయేది, ప్రతి అడగని ప్రశ్నకూ ఆమె నాలుక చివర జవాబు సిద్ధంగా ఉండేది. అంతే కాదు ప్రతి ప్రశ్నా ప్రతి జవాబూ అనవసరమైనవేననీ ఆమె తెలుసుకుంది. ఆమె ఏ దశకు చేరుకుందంటే మాట్లాడటం అవసరమే లేదనే వరకు. నిజానికి శబ్దం అనేది అస్వభావికమైపోయింది. అతి ముఖ్యమైన, అత్యవసరమైన విషయాలు నిశ్శబ్దంలోనే తెలియచేయబడతాయి.
(సశేషం)
అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, అనేక నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో ‘మానస సంచరరే’ శీర్షిక నిర్వహించారు.