[ప్రసిద్ధ ఒడియా రచయిత శ్రీ హృశికేశ్ పాండా రచించిన నవలని ‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు శ్రీమతి స్వాతి శ్రీపాద.]
[కుంతికి మాయమంత్రాలు వచ్చని, ఆమెకి శక్తులున్నాయనీ అందరూ నమ్ముతూంటారు. జనాలు రకరకాల సమస్యలతో వచ్చేవారు. కుంతి ఏదో అస్పష్టంగా జవాబులిచ్చేది. వాటిని వారు తమ తమకి సమస్యలకి అన్వయించుకుని, పరిష్కార మార్గాలుగా భావించుకునేవారు. తాగుబోతయిన చక్రపాణి కుంతితో గొడవపడతాడు. మరునాటి నుండి అనూహ్యంగా అతనిలో మార్పు వస్తుంది. తాగుడు పూర్తిగా మానేస్తాడు. గతంలో ఓసారి అంకమారా గ్రామంలో నాటకాలు వేసే బృందంలో సభ్యులైన హలాధర్, మార్కండా గొడవ పడి కొట్టుకుంటారు. మార్కండ కుంతి ఇంటికి వెళ్తాడు. ఆమెను రాజకీయాల్లో నిలబెడతానంటాడు. తనకు వయసు మించిపోయిందని అతన్ని పంపించేస్తుంది. ఆ రోజు గోవింద కుంతి దగ్గరికి వస్తాడు. తమ చిన్నప్పటి విషయాలనూ, యవ్వనపు రోజుల ముచ్చట్లను చెప్పి, తనని ఎందుకు వదిలేశాడో చెప్పమంటుంది. అతనేం జవాబు చెప్పడు. కాసేపాగి వెళ్ళిపొతాడు. కొద్ది రోజులకి కుంతికి మెనోపాజ్ అవుతుంది. తరువాత ఇక్కడికి వచ్చి ఉండడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆమెలో ఏదో మార్పు వస్తుంది, ఊర్లోనూ వసంతమేదో వచ్చినట్టవుతుంది. – ఇక చదవండి.]
అధ్యాయం-6
కుంతి అప్పుడో ఇప్పుడో మాత్రమే ఇల్లుదాటి బయటకు వస్తోంది. అదీ కాస్సేపే. ఆమె ప్రత్యేకంగా మతసంబంధిత ఉత్సవాలకు, ఆత్మత్యాగం చేసే పండుగలకు, సామూహిక భజనలు, పూజలకు, భక్తులైన వాళ్లకు దేవతలు ఆవహించే ప్రదేశాలకే వెళ్తోంది, అక్కడ కూడా ఏమీ పట్టనట్టు, అతి పవిత్రమైన అద్భుతం నిచ్చెన ఆమెను ఒంటరి చేసినట్టు ఉండేది. యజ్ఞం ముందు సమస్థితిలో, ప్రశాంతంగా ధ్యానంలో ఉన్నట్టు కూచుని, బాధ్యతగా సహనంతో కూడిన పరిహాసంతో పూజారి (సైకిల్ మీద వచ్చేవాడు) చెప్పిన విధంగా దర్భ గడ్డి నీళ్ళలో ముంచడం, అగ్నిలో నెయ్యి వెయ్యడం, చేతులు జోడించడం మొదలైనవి చేసేది. పైపైకి శూన్యం లోకి పొగలా లేస్తున్న ఎర్రని మంటలకు ఆమె మొహం మంటపెట్టేది.
“మంటకు అంత దగ్గరగా కూచోకు” ఆమె తల్లి ఒకసారి చెప్పింది (ఆమె తల్లి మరణానికి ఏడాది పాటు దుఃఖించింది. సహజంగా ఉండే ఈ ఏడాది సూతకం నుండే పన్నెండు రోజుల కర్మకాండకు కుదించారు అని కుంతి తనలో తనే వాదించుకునేది.). కుంతి ఉలిక్కిపడి తలెత్తి తల్లి వంక చూసింది. తల్లి మొహానికి అంత స్పష్టమైన రూపు రేఖలు లేవు.
సైకిల్ మీద వచ్చే బ్రాహ్మడు అడిగాడు, “అమ్మాయ్, ఎవరికోసం ప్రార్థిస్తున్నావు?”
“ఆ విషయం దేవుళ్ళకు తెలుసు” అని చీకట్లోకి చూసింది కుంతి, తల్లి వెళ్ళిపోయింది.
“మరికొంచం నెయ్యి వేస్తావా?” పూజారి అడిగాడు. కుంతి గిన్నె వంక చూసింది.
“లేదు” అని చెప్పి అన్యమనస్కంగా అక్కడే కూచుంది. మంట ఆరిపోయింది. కణకణలాడే నిప్పులు మిగిలాయి.
“మరి వెళ్ళిరానా అమ్మాయ్, రేప్పొద్దున్నే ఆ వడ్డి వ్యాపారుల కోసం పూజ చెయ్యాలి.” బ్రాహ్మణ పూజారి అడిగాడు. “రేపు ఎలాటి పూజా ఉండదు. రేపు ఉదయం వాళ్ళింట్లో బిడ్డ పుడుతుంది. వాళ్ళకు పురిటి మైల ఉంటుంది.” అంది కుంతి.
వెన్నెల ఆమె మొహం మీద పడింది. నిప్పులు బూడిదగా మారాయి. వెన్నెల వెలుగులో బూడిదరంగు నేల మీద కుంతి ముసలిదానిలా కనిపిస్తోంది. ఆమె మొహం ధూళితో అస్పష్టంగా ఉంది. ఆమె శుభ్రమైన తెల్లని బట్టలు కూడా పొగ చూరి కనిపిస్తున్నాయి. రేపు ఆ వడ్డి వ్యాపారి ఇంట్లో బిడ్డ పుడతాడని కుంతికి ఎలా తెలుసని ఆ పూజారి అడగలేదు.
ఒకరోజున నలభై అయిదేళ్ళ, రైతు నాథు మహాలిక, తన ఊరి వాడే, పొలంలోనే పనిదొంగగా చెడ్డ పేరు తెచ్చుకున్నవాడు, మృదంగం, తబలా వాయించడం తెలిసినవాడు, కుంతిని నవ్వించాలని చూసాడు, “నీకు తెలుసా అక్కా, నువ్వు రాడం మంచిదైంది.”
“అక్కడికి మీరంతా నాకోసం ఎదురు చూస్తున్నట్టు?” అంది కుంతి.
“మేం ఎదురు చూడటం, చూడకపోడం, అదేమన్నా అంత ముఖ్యమా డియర్? నీ మూలాలు నిన్నిక్కడికి పిలవడం వల్లే నువ్వు తిరిగి రాగలిగావు.”
“నాకేం ప్రవచనాలు చెప్పకండి, నా జీవితమంతా నేను టీచర్ గానే పనిచేసాను.”
“నాకు, ఒక పల్లెటూరి మడ్డి మొహం నాకు బోధిస్తుందా? లేదక్కా లేదు. నేను ఊరికే మూర్ఖంగా మాట్లాడాను. ఏం అనుకోకు. నేను నిన్నొకటి అడగనా? నీకీ దైవిక శక్తి ఎలా వచ్చింది? నీ గురువు ఎవరు? ఎవరి దగ్గర దీక్ష తీసుకున్నావు?”
“అరే, మీ అక్క పొలాల కావల పక్క ఊళ్ళో ఉంటుందిగా, ఒకసారి అక్కడికి పరుగెత్తు” అంటూ ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది.
నాథు నిజంగా మందబుద్ధే. అతను సరాసరి తన అక్క ఇంటికి వెళ్ళాడు, “తిండి తిని వెళ్ళు” అని అతని భార్య అరుస్తున్నా కూడా వినిపించుకోకుండా.
నాథు తన సోదరి ఇల్లు చేరే సరికి అప్పుడే ఒక భూమి కారణంగా గొడవ మొదలయింది. అతని బావ ప్రత్యర్థుల మధ్య నిస్సహాయంగా పడి ఉన్నాడు. సరిగ్గా గొడవ తీవ్రస్థాయికి చేరి అమానుషంగా రక్త తర్పణాలు జరగబోయే క్షణంలో నాథు వాళ్ల మీద విరుచుకుపడ్డాడు. ఆ గుంపు కేవలం ఆశ్చర్యంతో విడిపోయి స్పృహలోకి వచ్చారు.
అదే రోజు మధ్యాన్నం వేళకు ఒక సన్నటి బక్కచిక్కిన మనిషి, ఇస్త్రీ బట్టల్లో ఒక పాత సైకిల్ మీద వచ్చాడు. అతని చూపుల్లో ఒక ఆత్మ విశ్వాసపు ముద్ర, ఒక కులీన దర్పంతో ఉన్న ఉదాసీనత అతను స్థానికుడు కాదనే నిజాన్ని పట్టి ఇస్తూ, అతను వేసే ప్రతి అడుగూ అతను వదిలి వెళ్తున్న దారిలో ఈ వంచన కనబరుస్తోంది.
అతని జుట్టు కొట్టొచ్చినట్టు కనబడుతున్న ముళ్ళ కంచె మోపు కట్టినట్టున్న జుట్టు, వెంటనే ధూసి దృష్టిని ఆకట్టుకుంది, ఏదో ఒకటి అర్థం పర్థం లేకుండా తనలో తనే మాట్లాడుతూ నిరంతరం వాగే అలవాటున్న ముసలి చుప్పనాతి, ఒక గీతం పాడింది.
తలవైపు చూడు
ఒక్క వెంట్రుకా లేదు
అయితే అతను మరేం చేస్తాడు
ఉన్నాయిగా బోలెడన్ని సాలెగూళ్ళూ
తలను దాల్చడానికి.
అతను ఎవరి వంటగదిలోకో
వెళ్ళి ఉంటాడు
లేకపోతే ఈ తలను
మంగలి వాడు మకుందా చూడనే లేదు
ఆ పైన ఆ ముసలిది మకుందా గురించి అవిధేయుడైన మంగలి గురించి ఏదో చెప్తూనే పోయింది. ఆపైన పల్లపు భూముల్లోకి వెళ్ళిపోయింది.
ఆ అపరిచితుడికి అప్పటికే ఉన్న కాస్త అధైర్యం ఆ ముసలి వెర్రిది ధూసి సంఘటనతో మరింత పెరిగిపోయింది.
వందో సారి నీళ్ళు నమిలి మింగి గుటకవేసి, తడబడే నాలుకతో, “దయచేసి నాక్కొంచం చెప్పగలరా, నాక్కాస్త చెప్తారా ఆమె ఎక్కడ ఉంటుందో, అదే ఈ మధ్యనే మీ ఊరికి వచ్చి ఉంటున్న ఆవిడ.”
ఆ కొత్త మనిషి ఈ ప్రశ్నను ఓ చిన్నపిల్లాడిని అడిగాడు. ఈ అస్పష్టమైన అడగడంతో వాడు ఏమీ అర్థం కాక వెనక్కు వెనక్కు వెళ్తూ చివరికి, చీమిడి ముద్దలు మింగుతూ, నియంత్రణ లేకుండా అరుస్తూ పోయాడు. మరో పిల్లాడు ఆ పాత సైకిల్ అంచును దొర్లిస్తూ పరుగెత్తుకు వచ్చాడు.
ఆ పాటికి అపరిచితుడు అడిగిన ప్రశ్న, ఓ పిట్టలాగ, ఎగురుతూ వెళ్ళి, కంచె రిపేర్ చేస్తున్న పెంగాను, పదహారేళ్ళ, అందమైన మంచులా మెరిసిపోయే వడ్డి వ్యాపారి కోడలు, ఇద్దరు పిల్లల తల్లిని చేరింది. వారిలో ఒకరు మరణించారు (కోడలి పిల్లల్లో, వడ్డీ వ్యాపారి, కోడలు కాదు). ఆ తరువాత ఆమె పిడకలు చేస్తోంది. డ్రైవర్ చంద్రభాను, మామూలుగా పాంట్స్ వేసుకుంటాడు, కాని ఇప్పుడు సర్పంచ్ పదవి కోసం ఎదురుచూస్తూ పంచెలు కట్టుకుంటూ ఎగిరిపోయాడు. వినే వాళ్ళందరూ ఆ మనిషిని అతని ప్రశ్నను గమనించారు. వాళ్ళంతా ఆ ఎదురుచూడని అపరిచితుడి చుట్టూ మూగారు. మరో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు తమ వరండాలలోంచే అతన్ని శల్య పరీక్ష చేసారు. అదేదో ఈ పరాయి అపరిచిత వ్యక్తి తన జేబు రుమాలు పొరలలోంచి మనోహరమైన పావురాన్ని, కుంతి దాచుకున్న గతాన్ని ఆమె పూర్వ ప్రేమ వ్యవహారాలు జనానికి ప్రదర్శనకు పెడతాడని చూసారు.
ప్రేక్షకులలో చంద్రభాను అందరికన్న తెలివైన వాడు (అతని చిన్నతనంలో అతని తండ్రి సన్యాసుల్లో కలిసిపోవాలని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వాళ్ళు వాళ్ళ భూములను కూడా డామ్ నిర్మాణంలో కోల్పోయారు. నష్టపరిహారపు డబ్బు పంచినప్పుడు చంద్రభాను తన వాటా అడగడానికి వచ్చాడు. ఆ విషయం పరిష్కారమవక, సెటిల్మెంట్కి వచ్చి తనకున్న బలం, అధికారంతో హౌసింగ్ స్కీం కింద కొంత భూమి ఆక్రమించుకున్నాడు. కోర్టులలో ఎలాటి న్యాయమూ లేదు, కేవలం ఆటవిక న్యాయం అంతే. బలమే సత్యం, బలమే నిత్యం అనేది నియమం. ఈ కారణాల వల్ల అంకమారాలో ఎవరికీ చట్టం అంటే గౌరవం లేదు.).
చంద్రభానుతో సహా అందరూ, అతను కుంతి ఇంటి గురించి అడుగుతున్నాడని తెలిసినా, అదెక్కడో తెలిసినా ఏమీ తెలియనట్టు నటించారు, గాబరాపడిపోయారు. ప్రతివాళ్ళూ ఆందోళనపడినా పెంగా మాత్రం తొణకలేదు, పెంగా ఎంత మందబుద్ధి అంటే అతనికి ఏమీ అర్థం కాలేదు. అందుకే ఏదీ అపార్థం చేసుకునే అవసరమే లేదు. అతను ఆ అపరిచితుడికి కుంతి ఇల్లు చూపించాడు.
పెంగా ఎంత పనికి మాలిన మూర్ఖుడంటే అతని గురించి ఏం చెప్పకపోడం నయం. పశువుల కొట్టంలో కట్టేసినప్పుడు వాళ్ల ఆవు ఒకటి మరణించింది. అది పెంగా చేసిన భయంకరమైన పాపం. కాని పాపాల గురించి ఒక మూర్ఖుడికి ఎవరు వివరించగలరు?
ఆ చనిపోయిన ఆవు ఆత్మ అతని మూడేళ్ళ చిన్నకూతురిని ఆవహించింది. అతను వెంటనే మంత్రగాడి కోసం కబురు పెట్టలేదు, నిజానికి నాలుగు నెలలు గడిచే వరకూ ఆ మాటే ఎత్తలేదు.
ఆ మంత్రగాడు రుసరుసలాడాడు, “ముందే ఎందుకు పిలవలేదు?” అని.
ఆ మట్టి బుర్ర మనిషి, “ఆమె కూడా పాలిస్తుందని అనుకున్నాము. ఆమెలో ఆవు ఆత్మ ఉంటే ఎందుకు పాలివ్వదు మరి?” అని జవాబిచ్చాడు. ఆ రోజు మొదలుకుని పెంగా కూతురిని ఎంతగా ఎగతాళి చేసే వారంటే ఊళ్ళో ఎవరికీ తన మొహం చూపించలేకపోయింది పిల్ల. ఆమె పెళ్ళై కూడా ఏళ్ళు గడిచి పోయాయి. కాని ఇప్పటికి కూడా ఆమె పుట్టింటికి వచ్చినప్పుడల్లా వీధిలో అబ్బాయిలు ఏడిపిస్తారు.
కుంతి వరండాలో ఒక మూలన సైకిల్ ఆనించి పెట్టి, ఆ వచ్చిన అపరిచితుడు ఆమె తలుపు తట్టాడు. ఎవరో వస్తారని ఎదురు చూస్తున్నట్టు కుంతి వెంటనే బయటకు వచ్చింది. ఎక్కడి నుండి అంతమంది వచారో కాని, ఆమె ఇంటి ముందు పెద్ద గుంపు చేరింది. వాళ్ళంతా ఆత్రంగా, ఆశావాహకంగా, ఉత్సుకతతో కనిపించారు, ఈ అపరిచిత పరాయి వ్యక్తి కుంతిని తమకు, లేదా ఆమెను ఒక వింతకు, పరాయి ప్రపంచానికి బహుశా ఒక మహనీయమైన ప్రపంచానికి లేదా వారి అల్పమైన ప్రపంచానికి అనుసంధానిస్తాడోనని. వారి నిశ్చలమైన శ్వాస గాలిలో ప్రతి ప్రాణవాయు కణాన్నీ పీల్చేసుకుని. తాటాకులు కప్పిన పైకప్పు వారి ఊపిరితో ఊగిపోయింది. పైకప్పు మీదున్న గడ్డి రూఫ్ కూలిపోతుందా అన్నట్టు ఎగిరిపోయింది.
జనాలేమీ అరవడం లేదు, గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. దగ్గరలో ఒక వెయ్యి తూనీగలు హమ్ చేస్తున్నట్టు ఒక అస్పష్టమైన రాగం నెమ్మదిగా కదులుతోంది. అక్కడ మూగిన గుంపు ఆత్రుతకు ఆ మనిషి కున్న గుప్పెడు వెంట్రుకలు కూడా వణికి పోతూ చెదిరిపోయాయి.
“నేను” అన్నాడు ఆ మనిషి.
“భాను” కుంతి ఆశ్చర్యపోయింది.
“కూచో” కుంతి చాప చూపించింది.
భానుకి అర్థమయింది, తన ఎదురుగా కనిపిస్తున్నది నిజమనేది నమ్మలేకపోడం, కుంతి ఎదురుగా ఉన్నా కూడా ఆమె అనుకోలేక. అది కేవలం ఒక వేసవి మేఘం, మెరుపులు కమ్ముకున్న మేఘం, జిగేల్ మనే మెరుపులు, చిమ్మ చీకటి ఒకదాని వెనక ఒకటి సాగే మేఘం.
మొదటిసారి భాను కుంతిని కలిసినప్పుడు, యౌవనారంభ దశలో అతని బుగ్గలు నున్నగా ఉండేవి. స్కూల్కు, ఇంటిలో మంచి బాలుడిగా, తన ఫుట్బాల్, మధ్యన ఉండే అతని జీవితంలో కుంతి ఒక పిల్లవాడి తల్లి లాటి పాత్ర తీసుకుంది-అతి సున్నితమైన పదహారేళ్ళ యౌవనారంభ బాలుడి చివరి ఆశగా, లేదా చిన్న రాక్షసులు, దయ్యాల క్రుంగి పోయిన చీకటి గుహలో పాటకు గీతం వెతుక్కునే మాదిరి. భాను పెళ్ళికాని పెద్దక్కయ్య కూడా కుంతి పనిచేసే స్కూల్లోనే టీచర్. ఆ ఇద్దరు ఆడవాళ్ళూ ఒక మెస్లో ఒక అంధురాలైన మ్యూజిక్ టీచర్తో కలిసి ఉన్నారు. ఆ అంధురాలైన టీచర్కి చిన్నప్పుడు ఒకేసారి కడుపులో పాములు, కంటి కలక ఒకేసారి వచ్చాయి దాంతో ఆమె కంటి చుక్కలమందు మింగేసి, పాముల మందు కళ్లలో వేసుకుంది. దాంతో దృష్టిని పోగొట్టుకుంది. భానుకి బాగా తెలుసు తను పండితుడు కాలేనని, అతని తండ్రి వ్యాపారం విస్తరిస్తూ ఉండటంతో తన చదువు వదిలేసి వ్యాపారంలో చేరాడు (ఆ వ్యాపారం చదువుకోసం వదిలేసాడు.). తన వయసుకు సరితూగే డబ్బా కొట్టుకుందుకు తరచు కుంతి టౌన్కి వచ్చేవాడు.
సన్నగా మరీ సన్నగా నరాలు కనిపిస్తూ, మట్టి రంగులో ఉండే కుంతి మణికట్టుకు ఉన్న బంగారపు వాచీ. ఎడారిలో ఒయాసిస్లా ఉండే అపురూపమైన చిరునవ్వు, ఆకులు కమ్మిన అడవిలో చిటికెన వేలంత సన్నని నదీ ప్రవాహం పక్కన ప్రతిధ్వనించే కోయిల కుహూరవమూ వంటి ఏవో కొన్నింటిని, మినహాయించి భానుకు కుంతి పైన మరే వితృతమైన అభిప్రాయమూ లేదు. ప్రతి, ప్రతి చోటా, తాజాగా వెన్నెల వెల్లువా, పూలు వికసిస్తున్న చెట్లు ముంచెత్తే పరిమళమే ఉండేది.
మొదటిసారి కుంతి టౌన్కు వచ్చినప్పుడు, బస్లో ఎవరో ప్రయాణీకుడితో తగువుపడి, అది పోట్లాటగా మారి కుంతి మెస్కు రక్తం కారుతున్న పెదవులతో చేరుకున్నాడు. దారిలో, తన టౌన్కు వెనక్కు వెళ్ళి డబ్బిచ్చి కొందరు రౌడీలను వెంటేసుకు రావాలని అనుకున్నాడు గాని, ఆ ప్లాన్ గురించి బాగా ఆలోచించుకుని అది పెద్ద సాధ్యమయేది కాదని, అదీ గాయపడి, అహంతో బుసలుకొడుతున్న కోపంతో అసాధ్యమేనని తన సోదరి మెస్ చేరుకున్నాడు.
అప్పటికి, కుంతి తన హృదయం విప్పి ఎవరితో నైనా చెప్పుకోవాలని చూస్తూ, చాలా కాలంగా బాధపడుతూ, తీవ్రమైన ఆసక్తితో ఎవరో ఒకరికోసం చూస్తూ, అయినా ఈ మగవాళ్ళు మంచి వారిపట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో అనుకుంటూ, అందరు మగవాళ్ళనూ ద్వేషించడం మొదలుపెట్టింది. తన సహోద్యోగుల ముందు గోవిందా వంచన ప్రస్తావించక లేక, (ఇన్నేళ్ళుగా ఆ వంచన ఆమె మనసులో పెరిగి పెరిగి, ఆటవికంగా మారిపోయింది.), లేదా వ్యక్తం చెయ్యలేని పురుష ద్వేషం వల్ల తక్కువగా మాట్లాడేది. గత కొన్నాళ్ళుగా, దాదాపు నెలరోజులుగా, ఆమె తక్కువ డోస్ స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకుంటోంది. ఒక్కోసారి తను మెంటల్ ఆసుపత్రిలో చేరతానేమోనని కూడా అనుకునేది. కాని ఆ భావన ఏదో ఓదార్పు నిచ్చేది, దేనికంటే అక్కడ, మెంటల్ ఆసుపత్రిలో ఆమె ఏదనుకుంటే అది చెయ్యచ్చును కదా. అరటి తొక్కలు ఎక్కడంటే అక్కడ విసిరెయ్యవచ్చు, గట్టిగా తేన్పులు తీయ్యవచ్చు, డాక్టర్లపై పోకిరి అశ్లీలపు మాటలు విసరవచ్చు, అన్నింటినీ మించి, గట్టిగా, ఎలాటి జంకూ గొంకూ లేకుండా, చిన్నప్పటి నుండీ విన్నా, సంస్కారవంతమైన పెంపకం వల్ల ఎప్పుడూ ఉచ్చరించని నాలుగక్షరాల మాటలు అనెయ్యవచ్చును. ఆ మెంటల్ ఆసుపత్రిలో బట్టలు విప్పెయ్యవచ్చు, అర్ధనగ్నంగా స్త్రీ పురుషుల ముందు తిరగనూ వచ్చు, సినిమాల్లో చూపించినట్టు.
బస్లో జగడం తరువాత భాను తన సోదరి మెస్ చేరగానే, ఆమె లేదక్కడ. కుంతి అతన్ని జాగ్రత్తగా, నెమ్మదిగా తీసుకు వెళ్ళింది. ఆ ఎనిమిది రోజులు ఆమె మెస్లో అతని జీవితానికి అత్యుత్తమ శృంగార చికిత్స జరిగి, ఆమె స్వంతమయిపోయాడు. అతనికి తన స్వంత అక్కకన్నా కుంతి ఆత్మీయంగా అనిపించడంతో ఇద్దరు ఆడవాళ్ల మధ్య ముక్కు చీదుకోడం, వెక్కిళ్ళు మొదలయాయి. భాను మెస్ వదిలి వెళ్ళినప్పుడల్లా కుంతి, అమ్మయ్య అనుకునే అతని అక్కలా కాక, కన్నీళ్ళు పెట్టుకునేది. ఆ తరువాత భాను కుంతి ఒడిలో తలపెట్టుకుని పడుకుని, గాఢనిద్రలో ఆమె నగ్నంగా ఉన్న వక్షోజాల మీద చెయ్యి వేసాడు. ఈ సంగతి కుంతి మర్నాడు ఉదయం అతనికి చెప్పి పడీ పడీ నవ్వింది, భాను తన యౌవనారంభ కోరికలను అణుచుకునే వ్యర్థ ప్రయత్నంలో చితికి ముక్కలయాడు. మర్నాడు కుంతి స్కూల్కి వెళ్లాక, పాప ప్రక్షాళన కోసం అన్నట్టు వేసవి ఎండలో ఎనిమిది గంటలపాటు మైళ్ళు నడుస్తూనే పోయాడు.
కుంతి వచ్చాక, అతను ఎండలో కందిపోయి నల్లబడిపోయి, తిరిగి వచ్చాడు. “నన్ను చూసి ఎందుకు నవ్వావు? నేను పిల్లాడిని, నన్ను నమ్ము.” అన్నాడు.
కుంతి భయపడింది. ఆ రాత్రి భాను తన తల కుంతి భుజం మీద ఆనించాడు తను పిల్లవాడినని నిరూపించుకుందుకు. కాని అతనిలో లోపల ఒక చూపు లేని పెద్ద పాకే జంతువు నెమ్మదిగా పెద్ద ఎండుగడ్డి మోపు, ఆకుల కింద కదులుతూనే ఉంది. కుంతి నవ్వే సాహసం ఎంత మాత్రం చెయ్యలేకపోయింది.
“నా ఎద నొప్పెడుతోంది” అంటూ అతని తల నెమ్మదిగా తొలగించింది. అతను దూరంగా జరిగి నిద్రపోయాడు.
అర్ధరాత్రి అతను మేల్కొని కుంతి పక్కన, అతని తల ఆమె కాళ్లను హత్తుకునేలా, చేరి పడుకుని, బొంగురు స్వరంతో, “నన్ను నమ్ము, నేనింకా పెద్ద వాడిని కాలేదు.” అన్నాడు.
కుంతి హాయిగా నిద్రలోనే ఉంది, వేసవి జాబిలి పాకుతూనే ఉన్నాడు ఆ మట్టి ఇంటి చిన్న కిటికీ పక్కన. ఒక పక్షి ఎక్కడో తన అస్తిత్వాన్ని చాటుకుంటోంది, గుడ్లగూబ కావచ్చును. కుంతి చీర చెదిరిపోయింది, నగ్నంగా ఉన్న ఎదపైనుండి, ఆమె బాడీ కాని బ్రా కాని వేసుకోదు, అర్ధగోళాలుగా ఉన్న ఆమె వక్షోజాలు వెదజల్లే వెచ్చని పరిమళం, పొగలు పొగలుగా కమ్మేస్తూ మొహం మీదకు వ్యాపిస్తోంది. భాను భయంతో గోడవైపు తిరిగి నిద్రపోయాడు. రాత్రంతా కలలు కంటూనే ఉన్నాడు, కుంతి రైల్లో ఎక్కడికో తెలియని గమ్యానికి వెళ్ళిపోయినట్టు. అతను స్టేషన్ వైపు పరుగెడుతున్నాడు, అతని వదులుగా ఉన్న నిక్కరు మాటి మాటికీ నడుం దగ్గర నుండి జారిపోతోంది, అతను స్టేషన్ చేరుకోగానే , ప్లాట్ఫామ్ వదిలి గంభీరంగా
రైలు కదలిపోయింది, ఏం పట్టించుకోకుండా.
ఆ తరువాత కొన్నేళ్ల తరువాత కుంతికి ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం వచ్చి, పాత ప్రైవేట్ స్కూల్ వదిలేసి, దాంతో పాటే పచ్చని పచ్చికలు, వరిపొలాలు, గ్రామీణ ప్రశాంతత ఉన్న ఆ చిన్న టౌన్ వదిలేసింది. ఆమె వెళ్ళిపోయాక భాను ఒకసారి వచ్చాడు, ఆమెను చిన్న మట్టి ఇంటి మెస్ బయట, మామిడాకుల తివాసీ మీద తెల్లని చీరలో ఎగిరిపోడం చూసాడు. ఆమెను చూసిన వైపు పరుగెత్తుకు వెళ్ళాడు, గాలిలో ఒక ఎండుటాకు మాత్రం వణుకుతూ కనిపించింది.
ఈ సంఘటన జరిగిన అయిదేళ్ళకు, కుంతికి, భాను టౌన్ భద్రక్కు బదిలీ అయింది. అప్పటికి భాను పెద్దవాడయాడు. ఒక జ్యోతిష్యుడు భృగు సంహిత మీద ప్రమాణం చేసి చెప్పినదాని ప్రకారం, అతను గత జన్మలో ఒక విప్లవకారుడనీ అదే కారణంగా జన్మించాడనీ తెలుసుకున్నాక భాను తనను తాను ఒక సూర్యుడిగా భావించుకున్నాడు. అతను ఇంకా సాకర్ టీమ్ లీడర్ గానే ఉంటూండగా, అతని తండ్రికి వృషణాల కాన్సర్ సోకి, అతని వ్యాపారం కన్నా ఎక్కువ ప్రత్యర్ధులు మరింత పెరిగిపోయారు. అతని జుట్టు నెరవడం మొదలై, అతని అక్కను పెళ్ళి చేసుకునే వయసున్న బ్రహ్మచారులందరూ ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోయారు.
ఈలోగా కుంతి, నవలలు చదవడం, పాకశాస్త్ర ప్రావీణ్యత, మత సంబంధిత సంస్థలకు తిరగడంతో విసిగిపోయి, చదువు చెప్పడం, ఆమె విద్యార్ధుల ఫిర్యాదులు, స్కూల్ పాలనా వ్యవస్థ, అనివార్యమైన దళారీలు వంటి చిన్న చిన్న సమస్యల్లో ఇరుక్కుంది. భాను పెరిగి పెద్దవాడవడం వల్ల తనకున్న చిన్న చిన్న భయాలను తట్టుకోలేక భానును చూసి తనను తాను తెలుసుకుని, మొహానికి మాయిస్చరైజర్ రాసుకుని పౌడర్ అద్దుకునేది. భానుకు ఆమె పట్ల ఉన్న తేలుతున్న మేఘం లాటి వ్యామోహం, చిక్కబడి ఘనీభవించింది. ప్రతి చోటా అతని వ్యాపారం ఇరుక్కుపోయి ఆగిపోతోంది. భూమి తాలూకు వ్యవహారం తాసిల్దారు వద్ద, పెట్టుబడి సొమ్ము బాంక్ వద్ద, నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్, తన వాటా మూలధనం, మొదలైనవి. అతనింకా జనాలను పెద్దగా నవ్వుతూనే పలకరించేవాడు.
రాత్రిళ్ళు అప్పుడప్పుడు కలలు కనేవాడు – చాల శ్రమపడి జాగర్తగా దారికి తెచ్చుకున్నాక కుంతిని ఒక దట్టమైన అడవిలో కుటీరానికి తెచ్చినా ఆమె డ్రెస్ తీసెయ్యకముందే చల్లబడిపోయినట్టు. అయినా కుంతి దగ్గరకు క్రమం తప్పకుండా వెళ్తూనే ఉన్నాడు, ప్రతిసారీ అక్కడి నుండి తిరిగి వచ్చేప్పుడు అనుకునేవాడు, “ఎందుకు వచ్చానిక్కడికి?” అని.
కుంతి ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఆమె మజ్జిగ తీసుకువస్తోంది. ఆమె మొహం మీద ఇంకా నమ్మశక్యంగాని భావనే, భాను ఇంకా, “నన్ను నమ్ము, నేనింకా చిన్న పిల్లడినే, పెద్దవలేదు.” అంటున్నట్టు.
గ్లాస్ కాస్త దూరంలో ఉంచి “తాగు” అంది కుంతి, బయట మూగిన పెద్ద గుంపు నిశ్శబ్దపు సుడిగాలిలా ఊపిరి పీల్చుకుంది.
భరించలేని నిశ్శబ్దంలో భాను అదిగాడు, “నేనంత అంటరానివాణ్ణా?”
“కాదు, నేనే మైలపడ్డాను. నేనింకా చీర మార్చుకోలేదు” అంది కుంతి.
భాను గ్లాస్ అందుకున్నాడు తాగడానికి. బయట మూగిన గుంపు ఏకీకృత దాహపు ఊపిరి ఆ మజ్జిగను పీల్చేసింది. చివరికి గ్లాస్ అడుగు భాగాన్ని కూడా లోపలికి లాగేసింది.
భానులో ఒక అద్భుతమైన రంగు గాజుముక్కలు, స్పటికాలున్న కెలిడోస్కోప్ కదలాడింది. అక్కడ ఒక జిగేలమనే తెల్లని సూర్యకిరణం మిగిలిపోయింది. లేచి నిల్చుని, అయోమయంతో, తను కుంతి తెగిపోయిన స్లిప్పర్స్ను ఇదివరకులా ముద్దుపెట్టుకోగలడా అలా చేస్తూ కన్నీళ్ళలో ఒదిగిపోగలడా?
ఒక భయం అతన్ని పట్టి పీడించగా ఆ గుంపు మధ్యనుండి బయటకు గబగబా నడిచి, గ్రామాన్ని వదిలి వెళ్తుంటే కుంతి పిలుస్తున్నట్టుగా “రా, వెనక్కురా నా దగ్గరకు, నా చిన్ని బుజ్జాయీ” అనిపించింది. ఆమెను విననట్టు నటిస్తూ, ఎందుకంత భయపడిపోయాడో అర్థం కాకపోయినా ఎందుకంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక తన సైకిల్ మీద ముందుకు వెళ్ళిపోయాడు.
(సశేషం)
అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, అనేక నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో ‘మానస సంచరరే’ శీర్షిక నిర్వహించారు.