Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అపరిచిత సూర్యాస్తమయం లోకి-7

[ప్రసిద్ధ ఒడియా రచయిత శ్రీ హృశికేశ్ పాండా రచించిన నవలని ‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు శ్రీమతి స్వాతి శ్రీపాద.]

[కుంతి సెటిల్‍మెంట్ చేరేసరికి అక్కడున్న ఆడవాళ్ళంతా రకరకాల పలకరింపులతో పలకరిస్తారు. ఆమె తన పరిచయస్థులనెవరినీ పట్టించుకోకుండా, తన ఇంటికి వెళ్ళిపోతుంది. సెటిల్‍మెంట్‍లో జనాలు పలు విధాలుగా ప్రవర్తిస్తుంటారు. అజ్ఞానం వల్ల, విద్య లేకపోవడం వల్ల – జ్యోతిష్యులు ఏం చెబితే అవి పాటిస్తూ, తమలో తాము గొడవపడుతుంటారు. అలాంటి కొన్ని భూతగదాలను గుర్తు చేసుకుంటుంది కుంతి. మార్కండ తండ్రి చంద్ర భూమి కోసం జరిపిన కోర్టు కేసు, అతన్ని పోలీసులు అరెస్టు చేయడం జ్ఞాపకం చేసుకుంటుంది. కుంతికి క్షుద్రవిద్యలు తెలుసన్న పుకారు ఊరంతా వ్యాపిస్తుంది. ఓ రాత్రి చంద్ర వచ్చి కుంతిని కలుస్తాడు. తనకి జరిగినదంతా వివరిస్తాడు. మర్నాడు సాయంత్రం కుంతి చిన్నప్పటి నేస్తం సుందరి తల్లి వచ్చి కుంతిని పలకరిస్తుంది. చిన్నప్పటి విషయాలు కలబోసుకుంటారిద్దరూ. గోవిందా బారిన పడి సుందరి వేశ్యగా మారిన సంగతి గుర్తు చేసుకుని ఇద్దరూ బాధపడతారు. – ఇక చదవండి.]

అధ్యాయం-5

కుంతి దగ్గరకు రోజూ ఎంతో మంది, ఎక్కడెక్కడి నుండో దూర ప్రాంతాల నుండి, సెటిల్మెంట్ నుండి వారి వారి సమస్యలతో వస్తారు. తలనొప్పితో, గాస్ సమస్యతో, కీళ్ళనొప్పులతో వచ్చే జనం, ఏదో చికిత్స లేని జబ్బుతో బాధపడే రెండేళ్ళ బిడ్డ తలిదండ్రులు, కోర్ట్ కేసులు గెలిచే వాళ్ళూ, ఓడిపోయే వాళ్ళూ, చదువూ సంధ్యా లేని వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, మతి భ్రమించిన వాళ్ళు, మరణించిన కన్యలు, భర్తలను మోసం చేసి అశుద్ధం తిన్న స్త్రీలు ఆత్మలై పట్టిపీడించే మగవాళ్ళు, రక్తం తాగే పిశాచాలు, ఆవునో దూడనో, బంగారాన్నో పోగొట్టుకున్న వాళ్ళు, ఉద్యోగాలు, పెళ్ళి సంబంధాలు వెతుక్కునే వాళ్ళు, జనాలకు సక్రమంగా లేని స్కూల్ టీచర్ వల్ల, అతను రాజకీయాల్లో తిరుగుతూ చాలీచాలని రేషన్ ఇవ్వడం వల్ల కూడా సమస్యలే. కుంతి ఎవరి సమస్యలైనా తీర్చడానికి ఎప్పుడూ ఏ ప్రయత్నమూ చెయ్యలేదు (ఆమెకు సోషల్ వర్కర్ గా ఎప్పుడూ పెద్దపేరు లేదు.). వాళ్ళకు ఏవో ఒకటి రెండు మాటలు విసిరేది అంతే, వాటి అర్థాలు వెతుక్కోడం వాళ్ళిష్టం.

ఒక్కోసారి అది సన్నటి చిరునవ్వు కావచ్చు: “నేను, ఒక ముసలి స్త్రీని, నిజానికి నేనేం చేసాను?”

ఇతర సమయాల్లో ఏమీ అనేదే కాదు, నిశ్శబ్దంగా చూస్తూ తన గురించి నమ్మశక్యం కాని వింత కథలు మరింత జటిలంగా, పౌరాణికం చేసేది.

చక్రపాణి కొడుకు జాంకియా కుంతిని తలుసుకోవాలని ప్రయత్నించేవాడు. జనం మాత్రం తన కొడుకును కుంతి దత్తత తీసుకోవాలని కోరుకుంటూన్నాడని మాట్లాడుకునేవారు. దాని వల్ల ఎలాటి ఖర్చు లేకుండా కుంతి ఆస్తిని పొందవచ్చని ఆశ. కాని క్రమంగా ఈ విషయం అతని భార్య, జాంకియా తల్లికి భరించరానిదైపోయింది. ఆమె ఒక రోజున భర్త మీద మండిపడుతూ, “ఓరి దేవుడా, నువ్వో పిచ్చివాడివి. ఆస్తి కోసం నీ పిచ్చి నీ తోనే ఉంచుకో. నేనేం చేస్తానో చూడు. గుర్తుంచుకో, నేను నిన్ను వదిలేస్తాను. నువ్వు గుర్తుంచుకో కావలసినంత మంది మగవాళ్ళు దొరుకుతారు గాని కొడుకును మాత్రం తెచ్చుకోలేను.”

కాని చక్రపాణి మాత్రం ఆస్తి కోసం వేటాడ్డం మానలేదు. మరి అతను ఆ ప్రాంతంలో ఒక డజన్ గ్రామాలకు పెద్దమనిషాయె. ఒకరోజు టౌన్‌కి వెళ్ళి ఫుల్లుగా తాగి వచ్చాడు. గ్రామ వీధిలో కుంతిని దూషించాడు. తరువాత తన భార్యను శపించాడు. ఏం జరిగిందో భగవంతుడికే తెలియాలి మరి కుంతి ఇంటివైపు తిరిగి మోకాళ్ళ మీద వాలి, తనను ఏదో ఆత్మ ఆవహించినట్టు, “అరే ఏమిటిదంతా నాముందు? అరే మొహం మీద ఆ రంగేమిటి? యాగాగ్నిలో కాల్చే రంగు ఇదేగా? నేను నీ కాళ్ళ దగ్గరకు ఎందుకు దిగి వచ్చాను? ఓ యువతీ అదేమిటీ నీ కాళ్ళు అంత లోతుకు వెళ్ళిపోయాయి చెట్ల వేళ్ళలా? ఓ నెనెంత దౌర్భాగ్యుడిని? చుట్టూ అమృతం ఉన్న నేలను ముద్దాడుతూ నేనిక్కడ పడి ఉన్నానేమిటి? మీకు తెలుసా, నేనిక్కడ అమృతం రుచి చూసాను.”

ఈ సంఘటన జరిగాక, చక్రపాణి ఒక ఉత్తముడిగా మారిపోయాడనడం అతిశయోక్తే. కాని ఆపైన మరెప్పుడూ కుంతి గురించి కాని ఆమె ఆస్తి గురించి కాని చర్చించ లేదనడం నమ్మితీరవలసిన నిజం.

కొత్త సెటిల్మెంట్‌లో ఒక సంగీత రూపకం ప్రదర్శించాల్సి ఉంది. పాత గ్రామంలో పూర్తి రూపక ప్రదర్శకుల గ్రూప్ ఉంది. అక్కడొక నానుడి కూడా బాగా ప్రసిద్ధి చెందింది, స్టేజి అనుభవం లేని మనిషి అంకమారా జమీందార్ పొలం దున్నడానికి కూడా పనికి రాడని.

అంకమారా గ్రామంలో సంగీత నాటకానికి కావలసిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఎత్తైన వేదిక, దాని ఎదురుగా పెద్ద విశాలమైన గ్రౌండ్, దాని చివర ఎత్తైన టెర్రేస్‌తో ఉన్న ఇల్లు కొత్తగా పెళ్ళైన యువతులకు, ముసలివారికి అది బాల్కనీలా పనికొచ్చేది. కాని కొత్త సెటిల్మెంట్‌లో ప్రేక్షకుల కోసం గ్రౌండ్ కాని, నాటకం వేసే వారికోసం ఎత్తైన వేదిక గాని లేవు. కాని ఈ విషయాల గురించి శ్రద్ధ తీసుకునే ముందే సంగీత నృత్య నాటకం ప్రదర్శించాలని నిర్ణయమైపోయింది.

సంగీత నాటకం రిహార్సల్ సెటిల్మెంట్ వెనకాల పొడవైన తెల్లని రాతి స్లాబ్స్ మధ్యలో. ఆ రకరకాల రాళ్ళు సింహాసనానికీ, స్క్రీన్‌కూ బాగా అమరిపోతాయి. కాని పొద్దుపైకెక్కే కొద్దీ బండలు వేడెక్కిపోయాయి. గుడ్డలు కూడా సరిగ్గా లేక నగ్నంగా ఉన్న పిల్లలు, గుడ్డల్లేని చంటి పిల్లలను చంకల్లో ఎత్తుకుని ఆ రిహార్సల్ జరిగే చుట్టుపక్కలే ఉండేవారు. అంకమారా పాత నాటక సమాజం గ్రూప్ మాస్టర్స్ అసలు సిసలైన నాటక కళ సహజ సిద్ధమైన గురువులనుండి అనుభవశీలురనుండీ నేర్చుకున్న వారు ప్రతిదీ సీరియస్‌గా విశ్లేషించినా ఏమీ వ్యాఖ్యానించేవారు కాదు.

గాంధారి (హలాధర్ బాగా బలిసిన కొడుకు) తన సీతాకోక చిలుకలాటి మీసం, నూనే రాసి అణిచిపెట్టిన జుట్టుతో దుర్యోధనుడి పాత్ర పోషిస్తున్నాడు. “మేలుకో, ధీర రాకుమారా, బద్ధకించకు, వృథా చేసేందుకు సమయం లేదు. నీ ఎదురుగా ఉన్న క్షేత్రాన్ని చూడు. కురుక్షేత్రం. ధర్మ క్షేత్రం. వెళ్ళు. అది గొడుగుల పార్టీ ముగింపైనా సరే.”

ఆ క్షణంలో మార్కండ, చందారా కొడుకు, గొడుగుల పార్టీ గ్రామ స్థాయి కార్యదర్శి, పేడ మరకలతో ముడతలు పడిన షర్ట్‌తో గ్రామం నుండి బయటకు వెళ్తున్నాడు. మార్కండకు అప్పటికే ఎనిమిది మంది పిల్లలు, వారిలో నలుగురు మరణించారు. అతని వెనకాలే అతని భార్య పరుగెత్తుకుంటూ వచ్చింది, దాదాపు అతని మీద దూకుతూ, “హే ఎక్కడికి, నీ రాచరికపు బట్టల్లో ఎక్కడికి వెళ్తున్నావు? శివా పొలం కోతలకు వెళ్ళడం లేదా? పొద్దుటినుండీ వాళ్ళు నీ కోసమే చూస్తున్నారు?”

కాని మార్కండకు ఎలాటి ప్రమాదమూ కనబడలేదు. ఆ రోజుకు సరిపడా బియ్యం ఉన్నాయి. అందుకే మాట్లాడకుండా మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు, ఆ సమయంలో గాంధారి డైలాగ్ అతని చెవుల్లో దూరి, హార్మోనియమ్ మీద ఏ తాళం, ఏ తబలా, ఏ రాగం ఆ డైలాగ్‌కి సరిపోతుంది అని ఆలోచిస్తుంటే గొడుగుల పార్టీ ప్రస్థావన అతని చెవిన పడింది. అది బియ్యానికీ, రాగానికీ, తాళానికీ అన్నింటికీ ముగింపు. అతను ఊపిరిపీల్చుకోడం కూడా మరచిపోయి నోరుతెరుచుకుని ఉండిపోయాడు.

“మీ అందరి సంగతీ తేలుస్తాను” అంటూ మార్కండ వెళ్లబోయాడు. దుర్యోధనుడు, రెయిన్ పార్టీ ఆర్గనైజర్ల దగ్గర తీసుకున్న రెండు రూపాయల నాటు సారా తాగి ఉన్నాడేమో, అయినా రెండు లక్షల రూపాయల విలువైన ధైర్యం, విశ్వాసంతో ఒక బాధ్యతను గమనించి, పాండవుల నుండి ఇతర శత్రువుల నుండి బ్రేక్ తీసుకుని మార్కండ దగ్గరకు వచ్చి గట్టిగా ఒక్కటిచ్చుకున్నాడు. మార్కండ్ నోటినుండి పళ్ళ సెట్ ఊడిపడింది. దుర్యోధనుడు ఆ పళ్ల వంక చూసాడు. ఆపైన మార్కండ నోటి లోకి దృష్టి సారించాడు రాబోయే రక్తం కోసం ఎదురుచూస్తూ. కాని ఏ రక్తమూ రాలేదు. అవి కృత్రిమంగా పెట్టుకున్న పళ్ళసెట్. క్రితం జనరల్ ఎలెక్షన్ల సమయంలో గొడుగుల పార్టీ మార్కండకు ఆ పళ్ల సెట్ ధరను చెల్లించింది. మార్కండా ఆ పళ్ల సెట్ అందుకుని కుంతి ఇంటికి వెళ్లి ఆమె తలుపుకొట్టాడు.

చాలా సేపటి తరువాత చెక్కలా ఉన్న మొహం ఒకటే కనబడేలా తలుపు మెల్లగా తెరుచుకుంది.

“డియరీ, నేను ఇక్కడ, మార్కండా. చందారా కొడుకును. మార్కండా” అన్నాడు మార్కండ.

కుంతి ఏమీ అనలేదు. మార్కండ ఎన్నో అతిశయోక్తులు, నిజాలు వాగాడు.

“ఇవన్నింటికీ నా వయసు దాటిపోయింది, అనవసరంగా నన్ను ఇరికించకు” అంది కుంతి. అని లోపలికి వెళ్లిపోయింది. మార్కండ చిన్నపిల్లడిలా భయపడి పరుగెత్తి వెళ్ళిపోయాడు.

కుంతి తలుపు గడియపెట్టి కాస్సేపు విశ్రాంతి తీసుకుందుకు హాల్ లోకి వెళ్ళింది. ఆమె మంచం మీద గోవిందా న్యూస్ పేపర్ కిరీటం పెట్టుకుని కూచుని ఉండటం కనిపించింది. ఆ కిరీటం ఒకవైపు కాస్త వంగి ఉంది, దాన్ని పట్టి ఉంచిన చెత్త దారం వదులయింది. అతను ఆమె బెడ్ మీద సౌకర్యంగా సెటిల్ అయ్యాడు. అతని బొజ్జ బయటకు నెట్టుకు వస్తోంది. అతని అవివేకపు నవ్వు పాన్‌తో గారపట్టిన పళ్లను ప్రదర్శిస్తూ తనకు ఎలాటి స్వాగతం లభిస్తుందో తెలియనట్టు కనిపిస్తోంది.

ముక్కుతో పలికే స్వరంతో అడిగాడు గోవిందా, “నేను నీ ట్రాన్స్‌ఫర్ కాన్సెల్ చేయించలేదని కోపం వచ్చిందా డియర్?”

కుంతి వినోదంగా ముసిముసి నవ్వులు నవ్వింది. ఈ రకమైన తెలివితక్కువతనంతో ఏం చెయ్యగలదు?

“నేను నిన్ను కలుసుకున్నాక నా ఉద్యోగానికి రాజీనామా చేసాను. మరింక నా ముందు ఏ నాటకాలూ వెయ్యకు. నేను నీకు ప్రతిదీ చేసాను. నాతో ఆటలాడుకుని సుందరిని ప్రేమించావు. ఆ ఘర్షణల్లో ఆ రోజున నువ్వు గాయపడ్డావు. అమ్మ నిన్ను ఇంటికి తీసుకుని వచ్చింది. నువ్వు రావడం నాకు ఆనందాన్నిచ్చింది. కాని నీ పరిస్థితి నాకు ఎంతో దుఃఖాన్ని ఇచ్చింది. అమ్మ నీ తల మీద నీళ్ళు చల్లి రాళ్ల ఉప్పు వాసన చూపించింది. నేను మా పొలంలో ఉన్న ఇంట్లో నీపడక ఏర్పాటు చేసాను.”

“నేను రాత్రి భోజనం చేసాక చెయ్యి కడుక్కుందుకు బయటకు వచ్చాను. చాలా దూరం ప్రయాణించాను. తరతరాలుగా తెలుసుకుని ఉన్న నీతి నియమాల సరిహద్దులు దాటేసాను. నేను గేట్ తెరిచి వరి గడ్డి వాములను, నూర్చడానికి పెట్టిన వరికంకులను దాటుకుని వచ్చాను.

నా గుండె దడదడలాడుతోంది, ఎవరో దాని మీద రోకలితో దంచుతున్నట్టు. నువ్వు కాదని నన్ను వెనక్కు పంపేస్తే, ‘ఎక్కడికి వచ్చావు? నేను నీకేమవుతాను, నీకు తెలీదా నేను నీకు, నీ బంధువులకు, నీలాటి మిగతా భూస్వాములందరికీ శత్రువుగా ఉన్నాన’ని, అని అడిగితే. తలుపు తాకానో లేదో నువ్వు తలుపు తీసావు. అదేదో నాకోసం ఎదురుచూస్తున్నట్టు. నేను ఆశ్చర్యపోయి బయటకు చూసాను. బయట ఎంత పారదర్శకంగా ఉంది వెన్నెల. నా ధైర్యానికి నాకే నమ్మకం దొరకడం లేదు. ఈ వెలుగులో వచ్చినది నిజంగా నేనేనా? ఎవరో ఒకరు నన్ను గమనించే ఉంటారు, అయినా నేనేం లెఖ్కచెయ్యను. నీ దగ్గరకు రాడానికి నన్నారోజున ఏదీ ఆపలేకపోయేది, ఈ ప్రపంచం లో ఏ భయాలూ కూడా.”

ఓ దేవుడా, అప్పుడా జాబిలి ఎంత వెర్రిగా ఉన్నాడు!

“నేను ఇంద్రియ జ్ఞానాన్ని కోల్పోయాను. నేను నీ కాళ్లకింద ఉన్నానా, నువ్వు నాకాళ్ళకిందా అనేద్ది తెలియలేదు. నేను ఆ పొగమంచు వెన్నెల జ్ఞాపకాల్లో వణుకుతున్నాను. నేను గుసగుసలాడాను. ఇహ నన్నిక్కడ వదిలేస్తావా? నా చీర జారిపోతోంది, చేత్తో నేసిన ఆ నేత చీర ఎంత మోటుగా ఉంది? మరింత మోటుగా అనిపిస్తోంది. ఈ వ్యభిచార పాపం వల్ల నా మీద నా మిగిలిన జీవితం మీద పేరుకునే మురికి ఎప్పటికీ, ఎప్పటీకీ కడిగేసుకోలేను. అయినా నేనేం లక్ష్యపెట్టను.

నువ్వస్సలు కదల్లేదు. ఏమయిందో నీకు నాకర్ధం కాలేదు, ఒక జెర్రిలాగ నీలో నువ్వు చుట్టుకుని చాపమీద పడుకున్నావు. నేను నిన్ను తోసాను, పక్కకు దొర్లించాను. నేను నిన్ను అడిగాను, ‘అసలు లేచి నిల్చోలేకపోయాక నువ్వు నన్నెందుకు పిలిచినట్టు?’ నువ్వు మౌనంగా ఉండిపోయావు. నేను అడిగాను, బట్టలు వేసుకోనా అని? అయినా నువ్వు ఒక్కమాటా మాట్లాడలేదు, నన్ను ఆగమని కూడా అనలేదు. చీర కట్టుకుని పరుగెత్తుకుని వెళ్ళిపోయాను. చెప్పు, నేను వికారంగా ఉన్నానా? నీకు అంత తగని దాన్నా?, అవసరం లేని దాన్నా?”

“నీకు తెలీదు, నాలో ఎలాటి బీభత్సాన్ని ఉత్పన్నం చేసావో, నాలో ఏం నాశనం చేసావో. నా జీవితంలో నేను మరెన్నో సులభంగా సాధించి ఉండేదాన్ని. అన్ని సంకెళ్ళు తెంచుకుని కటకటాలు విరగ్గొట్టి అన్ని గేట్లు గోడలు కూల్చేసి మరొక మహనీయమైన ప్రపంచానికి వెళ్ళి ఉండేదాన్ని. కాని ఆ రోజు రాత్రి నిర్ధాక్షిణ్య నిరాకరణ తరువాత, ప్రతిసారీ ఒక అడుగు ముందుకు వేద్దామని చూసినప్పుడల్లా, ఒక దౌర్భాగ్యపు నిరుత్సాహం నన్ను కట్టిపారేస్తుంది. ఒక గాయపడిన అపనమ్మకం నా శరీరమంతా చొచ్చుకు పోతుంది. ఒక హతాశమైన చీకటి నా బోన్ మారోను కుదించి వేస్తుంది. నన్ను సమీపించిన ప్రతిసారీ, నా లోలోపలి భాగాలన్నీ ఆ రాత్రి భయంకరమైన, మంచులాటి భయంతో గడ్డకట్టిపోతాయి. కారణం నేను దేనికీ పనికిరాననే గుర్తింపుతో స్థిరపడిపోయాను. ఆ వెన్నెల రాత్రి నుండి నాలో మొలకెత్తిన, మొత్తం జీవితపు ఓ బస్తాడు తిరస్కారం, స్వయంగా వద్దని మొరపెట్తుకోడం, ఆ రాత్రి జరిగిన అవమానానికి నేను కృంగిపోయాను, నువ్వు నన్ను అంతం చేసావు.”

కుంతి ఉత్తేజితురాలైంది. గోవిందా ఏ మాత్రం ఇబ్బంది పడలేదు. అతను ఏ మాత్రం ప్రభావితం అవక నవ్వుతూన్నాడు ఓ పక్కకు ఒరిగిన న్యూస్ పేపర్ టోపీతో.

మొక్కుతో మాట్లాడుతూ, “నువ్వు చిన్న పిల్లవు హనీ. ఆ రోజున నీలో గనక చొరబడితే ఎంత పాపం చేసి ఉండేవాడిని?”

కుంతి హఠాత్తుగా ఊపిరిపీల్చుకుంది. చాలా కాలం క్రితమే కుంతి గోవిందాకి వ్యతిరేకంగా ఏదైనా అమ్మే శక్తిని కోల్పోయింది. ఆ రాత్రి గోవిందా తనను చేరగలిగే సుందరి కోసం ఎదురుచూస్తున్నాడనేది, ఆ తరువాత అతనెంత మాత్రం తప్పు చేశానని అనుకోకపోడం కూడా కుంతి నమ్మలేదు. ఒక నిజాయితీ గల సంబంఢం వాళ్ళ మధ్య ఉన్నదనేదానికీ సిద్ధంగా లేదు.

కాస్సేపయాక గోవిందా అక్కడి నుండి వెళ్లిపోయాడు, భూమ్మీద ఉన్నంత బిజీగా స్వర్గం లోనూ ఉండటానికి. అదే నెలలో కుంతి మెనోపాజ్ మొదలైంది.ఆ రాత్రంతా, ఆమె మెనోపాజ్ కొనసాగుతుంటే, తన నలభై రెండేళ్ళ శరీరం తో కుంతి విపరీతమైన పవిత్రమైన కోరికలో మునిగిపోయింది. మూలమూలలా నిండిపోయి, చెట్లలో స్పష్టం అవుతూ, ఎండుగడ్డీ మీద వెలుగుతూ, సాలెగూళ్ళ మీద పరిమళమవుతూ, ఉదయం చాలా స్పష్టంగా క్రిస్టల్ మాదిరి గడ్డికొసలమీద నిష్పలంగా నిలిచే తుహిన కణంలా పవిత్రత ప్రతి చోటా ఉంది, కుంతి ఆ ఇంట్లో ఉండటానికి వచ్చినప్పటినుండిఅక్కడ రాజ్యమేలే తుప్పుపట్టిన ఇనుము వాసన ఆ రోజు నుండి ఉన్నట్టుండి అదృశ్యమయిపోయింది. గాలిలో ధూళి, వేడీ కూడా తగ్గాయి. ఎక్కడి నుండి వచ్చిందో కాని ఆ భగవంతుడికే తెలియాలి, తేనె వాసనలా అనిపించే అడవి పూల వింత పరిమళం ప్రతి మూలా అలుముకుంది.

గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. “ఎలా ఇలా అకాలపు వసంతం?”

కుంతికి స్పష్టంగా అనిపించసాగింది, ఆమె ఆలేఖ్ బాబా వరండాలో కూచుని తన బాల్యం గురించి కథలు కథలుగా వింటున్నట్టు, గొప్ప ఆయుర్వేద వైద్యుడు చరక పుస్తకం సంహితలో పేర్కొన్న రోగాలన్నింటితో బాధపడుతున్న ఆ బద్ధకస్తుడైన పౌరాణిక రాజు కథ, ఆ రోగాలు తగ్గించనూ లేక, నయం చెయ్యలేక పోడంతో అందరు ఆయుర్వేద వైద్యుల తలలు తీస్సెయ్యమని ఆజ్ఞాపించిన రాజు కథ, ( ఆలేఖ్ బాబాకు ఎత్తరుగుల వరండా, లో-రూఫ్‌తో ఒక గుడిసె, బయట గార్డెన్‌లో ఎగిరే సీతాకోకచిలుకలు ఉండేవి). రాజు కలవరపడిపోయి, అందరినీ ఇబ్బందిపెట్టి అలేఖ్ బాబాలా అనిపించే ఒక ముని దగ్గరకు వెళ్ళాడు, బొమ్మలతో ఉన్న కథల పుస్తకంలో. అతను రాజుకు ఒక పావురాన్ని ఇచ్చి రోజంతా దాని వెనకాల పడి పరుగెత్తమని చెప్పాడు. అతని అనారోగ్యం బద్ధకం వల్ల అవడంతో, అతను బాగుపడ్డాడు. కుంతికి ఇప్పుడు స్పష్టంగా తెలిసింది, ఆ పావురం వెంటపడిన రాజు గోవిందా అని తనే ఆ పావురమనీ ఎక్కడికో తెలియకుండా ఎగురుతూ పోతోందనీ. ఏ కారణం లేకుండా, ఏ లాలస లేకుండా, ఏ భయం లేకుండా, నిర్ణయించిన విధి కథ చెప్పే మనిషి ఆమెకు తెలీడు, ఎవరైతే లేడో ఆ అలేఖ్ బాబాకు ఆమె తెలియదు. అతని ఇల్లు కూడా లేదిప్పుడు.

(సశేషం)

Exit mobile version