[ప్రసిద్ధ ఒడియా రచయిత శ్రీ హృశికేశ్ పాండా రచించిన నవలని ‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు శ్రీమతి స్వాతి శ్రీపాద.]
[కుంతి ఏకాంతంలో ఉండడం అలవాటు చేసుకుంటుంది. చిన్నపిల్లలా దేవుళ్ళతో గొడవలు పడుతుంది. అనూహ్యంగా ఛాందసంగా మారిపోతుంది. నీటిపారుదల ప్రాజెక్టులో పనిచేసే నఖియాతో, తనకి చెప్పకుండా వాళ్ళ నాన్నని ఎక్కడికి వెళ్ళొద్దని అంటుంది కుంతి. ఆ మాట తండ్రితో చెప్పకముందే నఖియా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతాడు. కుంతి ఒంటరితనానికి మహారాణి అయిపోతుంది. తనలో తానే మాట్లాడుకుంటుంది. ఒకరోజు భాను ఆమెను చూడడానికి వస్తే, ఆమె తన కళ్ళద్దాలను తీసి, దాని ఫ్రేమ్ విరగ్గొట్టి, అద్దాలను భాను చేతుల్లో పెడుతుంది. ఆమె భావం అర్థం కాక, భాను అక్కడ్నించి వెళ్ళిపోతాడు. గోవిందా వస్తే, అతనిని గమనించనట్టు ప్రవర్తిస్తుంది కుంతి. అతను బాధపడి వెళ్ళిపోతాడు. సెటిల్మెంట్ వాళ్ళు కుంతిని గమనించడం మానేస్తారు. కొన్ని మరణాలు సంభవిస్తాయి, కొత్తగా పిల్లలు పుడతారు. బయటివాళ్ళు సెటిల్మెంట్ లోకి వచ్చి రకరకాల వస్తువులు అమ్ముతుంటారు. చావు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కుంతి. – ఇక చదవండి.]
కాని రాబోయే చిత్రమైన వ్యక్తి, ఎవరినుంచైతే ఆమె ఒక మాట తీసుకుందో, ఏ మాట వల్ల ఆమె ఇంతవరకూ సజీవంగా ఉందో, ఆ మనిషి గురించి ఆమెకేమీ తెలియదు. ముందుగా వచ్చేది ఒక సమాచారం, “నా మాట విను. రాత్రి గనక నేను వచ్చానంటే, వర్షపు తూటాల ఆయుధాలతో వచ్చిన దోపిడి దొంగగా అనుమానిస్తారేమో. పగటి పూట వస్తే నేను వారి రాజకీయ ప్రత్యర్థినని దారి సగం తవ్వేస్తాననీ అనుకుంటారు. నువ్వక్కడే నిలబడి, నేనొస్తున్నానని జడలో పూలమాలతో పొడవైన నీ పవిటకొంగు ఊపుతావు.
ఈ సమాచారం గాలి మోసుకువచ్చింది. కాని రాళ్ళతో దుమ్ముకొట్టుకుపోయిన ఆ సెటిల్మెంట్లో స్వచ్ఛమైన గాలే తక్కువ, ఉన్న కాస్తా కుంతి పీల్చేసుకుంది. దాంతో తనలోని మలినం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందనుకుంది.
ఆ వార్త వచ్చిన ఒకటి రెండు రోజులయాక రైతుల గురించి ఏ మాత్రం పట్టించుకోని సన్నని వెండి అంచుల మేఘాల తోరణాలు, ఉరుములూ దిగబడ్డాయి. వరి పొట్టులా తేలికపాటి జల్లులు కురిసినప్పుడు, జనం గట్టిగా అరిచారు, అదిగో వర్షం వచ్చేసింది అంటూ బయట ఆరేసిన బట్టలు లోనికి తీసుకెళ్ళారు, గడ్డి మేస్తున్న పశువులను కొట్టాల్లోకి తోలారు. పనులన్నీ మానుకుని వర్షాన్ని చూస్తూండిపోయారు. అప్పుడే జరిగింది అద్భుతం. వర్షం కురిసినది నీటితో కాదు, పూలజల్లులతో.
అప్పుడు కురిసింది ఉరుములూ మెరుపులతో కుంభవృష్టి. సంతకు వెళ్ళిన వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా సమయానికి ఇళ్ళకు రాలేకపోయారు. మబ్బులు, వాన గాలి పూలు గ్రామస్థుల నిర్లిప్తతను తుడిచేసాయి. ఇళ్ళకు తిరిగి రాలేని జనం లాంతర్లు, దీపం బుడ్లు పట్టుకుని ఇళ్ళు చేరుకున్నాక అడిగారు, “దాసియా తిరిగి వచ్చాడా? చంద్రా నీ కొడుకు వచ్చాడా? సాకియా నీ భర్త ఎక్కడ?”
ఈ ప్రశ్నలు వర్ష భయాన్ని వందరెట్లు చేసాయి.
“ఆ పశువుల కొట్టం తలుపు వెయ్యి”
“వరి గడ్డి మోపులు ఎండటానికి వేసాం తడిసిపోతాయి. గడ్డి చాపలతో వాటిని కప్పండి”
“పొయ్యిలో బూడిద అక్కడ వెయ్యద్దు. గాలి వీస్తోంది. ఒక నిప్పురవ్వ ఉన్నా అగ్ని ప్రమాదమే”
కలరా దేవతలా వాన దారిలో ఉన్న ప్రతిదీ అందుకుంటుంది. ఏదో రకంగా సానియా తల్లి కొట్టుకుపోకుండా ఆగింది. ఈదురుగాలి ఆమె గోనె సంచీ, వైధవ్యపు తెల్లదోవతీని చెదరగొట్టి కుదిపేసినా.
అపాటికి కుంతి ఒక తరం పురాతనురాలైపోయింది. ఆమె రోజులన్నీ కార్చిచ్చు వ్యాపించిన కారడవిలా ఉండి, ఈ జ్వాలలు తప్పించుకుందుకు నిద్రకోసం బెడ్ మీద వాలగానే ఆమె నిద్ర ముక్కలై గాలిలో ధూళిలా ఎగిరిపోయింది. అయినా ఎగ్గూ సిగ్గూ లేని రాత్రి నిర్లజ్జగా బైఠాయించింది. సమయం అక్కడక్కడే తచ్చాడుతూ ఏ మాత్రం కదల్లేదు. సగం రాత్రి నిద్రలోకి జారుకుని మిగతా సగం అంతులేకుండా ఒకదాని వెనక ఒకటి వస్తున్న కలలలో గడిపిందామె. వేసవి రాత్రులు ఎలాగో ఫాన్ కింద, పండుగ సంబరాలలో జనాల మధ్య, చంద్రుడు ఉన్నప్పుడు వెన్నెల్లో గడిచిపోయాయి. కాని ఈ వర్షపు రాత్రులను ఎలా గడపాలామె? ఆ రోజుల్లో కుంతి ఎవరి గురించీ ఆలోచించలేదు. వానలు మొదలవగానే తన తమ్ముడు గొబారాను ఒక్క క్షణం తలుచుకుని, “అస్సామ్లో రాత్రులనేవి ఉంటాయా? లేదా ఆర్నెల్లు పగటి నీలి వెలుతురు ఆర్నెల్లు రాత్రి నీలి వెలుతురు ఉంటుందా?” ఇది తప్ప మరో విషయమే ఆమె ఆలోచనల్లోకి రాలేదు.
ఏడు రోజులు వర్షం కురిసాక, గ్రామ దేవత పరిసరాల్లో బండల గరుకు తగ్గింది. వాటి వాటి నెరియల్లో చిన్న చిన్న పూల, పళ్ళ మొక్కలు మొలిచాయి. వానల్లో ఆ మొక్కలు కనిపించని బద్ధకంతో సొమ్మసిల్లిపోయాయి. చిన్నగా నర్తిస్తున్నట్టే ఊగేవి. ఆరోజుల్లోనే ఒకనాడు కుంతి గ్రామ దేవత ప్రాంగణం నుంచి రంగూన్ మల్లెలు, కదంబ పుష్పాలు, లిల్లీలు బంతిపూలు, వేరే పువ్వులు తెంపుకుని వస్తోంది. ఉన్నట్టుండి ఆమె తలమీద మెరుపు తళుక్కుమంది. కాని ఆమె బహిష్కరణ గురించి అందరికీ తెలుసు అందుకే బుట్టనిండా పూలు తెచ్చుకుంటున్నా ఎవ్వరూ, చివరికి వరండాలో ముగ్గురు పిల్లలతో ఉన్న ముది వగ్గు ధూసి కూడా కుంతిని చూడనే లేదు.
ధూసి అయదేళ్ళ పిల్లాడిని అడుగుతోంది, అక్కడ చుట్టరికం ప్రకారం వాడి మనవడు ఎవరని? “హే నువ్వో బిడ్డను కంటావా అనీ.”
ఆ పిల్లాడు జవాబిచ్చాడు, “నేను కాదు, మా అమ్మ కంటుంది.”
“మరి నీ భార్యో?”
పిల్లవాడు జవాబిచ్చేలోగానే పెద్ద మెరుపులు ఆ వెనకే ఉరుములు. అందరూ ఇంట్లోకి వెళ్ళారు. అ ముసలావిడ రొమ్ముల కోసం పిల్లలు దెబ్బలాడుకున్నారు. అందరిలోకీ అయిదేళ్ళ పిల్లడు అకారణంగా, మొండిగా రెండు రొమ్ములను ఒకేసారి నోట పెట్టుకున్నాడు.
ధూసి అంది, “అయితే నీకు మాత్రమే మనసూ, శరీరమూ, కోరికా, ఆకలీ ఉన్నాయా? మిగతా పిల్లలందరికీ లేవా? అందరిలోనూ అదే మనసు ఉంటుంది, నువ్వు వేరు వేరు అనుకుంటున్నావేమో?”
ఆ రాత్రి మోసేందుకు నాలుగు వైపులా కర్రలతో పూలపల్లకి కుంతి వాకిట్లో దిగింది. నింగి నుండి పూలవాన కురిసింది. ఆ వెంటే పెద్ద వర్షం. బయటకు వెళ్ళి ఇంకా ఇళ్ళకు తిరిగిరాని జనం కోసం ఇళ్ళల్లో వాళ్ళు వానలో వచ్చే వారికోసం వరండాల్లోకి వచ్చి చూస్తూ, పూజచేస్తున్న అలికిడి శంఖారావం విన్నారు. (ఎప్పుడు మినిస్టరునో ముఖ్యమంత్రినో కలవడానికి వెళ్ళానని గొప్పలకుపోయే చంద్రభాను తిరిగి రాలేకపోయాడు. వరద బాధితులకు పరిహారం ఏర్పాట్లలో ఉండి రాలేకపోయానని చాలా రోజుల తరువాత చెప్పాడు.) వానలు వారి మనోధైర్యాన్ని ఎంతగానో దెబ్బతీసాయి. వానలు నాని ముద్దవడానికి వాళ్ళు ఇంటి మెట్లు కూడా దిగలేదు, పూజ చూడటానికి వెళ్ళలేదు. వాళ్ళు ఏదీ చూడదలుచుకోలేదు.
వానలో పూలమొక్కలన్నీ ఎరుపు పసుపు రంగుల్లో అతిశయించాయి. ఎంతగా వాన కురిసిందో ఎవరి అంచనాకు అందలేదు. కిలోమీటర్ల దూరంలో ఏర్పరచిన వాన కొలత పరికరం కూడా రోజూ ముంచెత్తే వానలో మునిగి కుంభవృష్టిలో కొట్టుకుపోయింది. ఆ తరువాత ఆ పరికరం మునిగినదే లేదు. ప్రభుత్వం కట్టిన ఇళ్ళన్నీ నాని తడిసిపోయాయి (నిజానికి ఇళ్ళకప్పుల నుండి వాన ఉరివడం వల్ల జనం ఇల్లు వదిలి వెదురు – తాటాకుల గుడిసెలు వేసుకుని అక్కడికి మారిపోయారు. కాని అవన్నీ చెప్పను నేను. చెప్తే నేనేదో సివిల్ ఇంజనీరింగ్ విభాగం అవినీతి బయటపెడుతునానని అనుకుంటారు. నా పని ఏదో కథ చెప్పడమే గాని ఈ సమస్యల్లో ఇరుక్కోడం కాదు.).
ఉక్కు ఎలక్ట్రిక్ స్తంభాలు, వాటి అల్యూమినమ్ వైర్లు కరెంట్ లేకపోయినా వెండిలా మెరిసాయి. కాని వానలు జనాలకు వెర్రెక్కించాయి. అవి వెండివని భ్రమపడి స్థంభాలు, వైర్లు అమ్మేసుకున్నారు, రిపోర్టులో వానల మూలంగా పాడైపోయాయని చెప్పవచ్చని. టెలిఫోన్లు వాడలేరు – రిసీవర్లు క్రెడిల్స్ మీద ఇరుక్కుపోయాయి, పైకి రావడం లేదు. మాటి మాటికీ రోడ్ల మీద వాహనాలు మట్టిలో దిగబడి మాయమైపోయాయి.
రేడియోలో స్వరాలు, టివీలలో దృశ్యాలు బరువైన మబ్బుల్లో ఇరుక్కుపోయాయి. సెటిల్మెంట్కి వచ్చే న్యూస్ పేపర్లు, ఉత్తరాలు తడిసి బరువెక్కి వార్చిన వేడి గంజి మీద పొరలా మారాయి. ఊళ్ళో పశువులు పచ్చగడ్డినే ఇష్టపడుతూ దానికే మాత్రం కరువు లేకపోడంతో పేపర్ల వాసన కూడా చూడటం లేదు. అవి పచ్చగా లేవుగా మరి. ఆ న్యూస్ పేపర్లు ఉత్తరాలు ఏం చెయ్యాలో జనానికి తెలియడం లేదు.
ఇదివరలో జరిగినట్టే కొందరు గ్రామస్థులు ప్రపంచం అంతమైపోతుందని సాధికారికంగా చెప్పడం చేసినా కొందరు మాత్రమే దాన్ని నమ్మారు. ఇరవై నాలుగ్గంటలు వాన కురిసినప్పుడే ఈ విషాదకరమైన భవిష్యవాణి చెప్పారు.
వాన ఆగకుండా కురుస్తుంటే అంకమార సాగునీటి పథకానికి గండి పడి చాలా ప్రాంతాలు, జనాలు కొట్టుకుపోడంతో, పరీవాహక ప్రాంతాల్లో మాగాణీ భూములున్న వాళ్ళు సెటిల్మెంట్ సమీపించి లోపలకు బలవంతాన దూరాలని చూసారు. ప్రవేశం దగ్గరే ఇల్లున్న మహాదేవ్ మహాలింగ వానలను చూస్తూ కొత్తగా పెళ్ళైన రోజులు నెమరువేసుకుంటున్నాడు. చొరబాటుదారులను చూసి అరిచాడు, “వెనక్కు వెళ్ళండి, మైదానాలు ఆక్రమించిన స్వార్థపరుల్లారా, మా గ్రామం జనం మీ ఇళ్ళకు వచ్చి ఈ భూకబ్జాదారులను మెడపట్టుకు గెంటేస్తారు.”
పనికి బయటకు వెళ్ళినవాళ్ళు వాన వల్ల ఇంకా ఇళ్ళకు తిరిగి రాలేదు. నానమ్మతో ఉన్న పిల్లవాడొకడు బయటకు పరుగెత్తుకు వచ్చి గట్టి గట్టిగా – “వెయ్యేళ్ళ కిందట నువ్వు మమ్మల్ని మైదానాల్లోంచి బయటకు లాగి అంకమారా గ్రామం కొండలపైకి పంపావు. మళ్ళీ వెయ్యేళ్ళు గడిచాక, ఇప్పుడు అంకమారా నుండి రాతి, బీడు పర్వతానికి పంపావు. ఇప్పుడు నీకేం కావాలి? ఎందుకిలా చేస్తున్నావు? ఇక్కడేంఈ లేదు. వెళ్ళండి, ఇక్కడి నుండి వెళ్ళిపొండి.” అన్నాడు.
చొరబాటుదార్లపైకి విసరడానికి ఆ పిల్లాడు ఒకరాయందుకున్నాడు..
చిన్న రాయి కింద ఆ మొక్కను చూడండి..
అందరి ముందరా ఆ చెట్టు పెరిగింది. ఆ పిల్లాడు రాయందుకున్నాక గ్రామం వెనకాల కొండల్లో ఫెళ ఫెళమనే ధ్వని, నెమ్మదిగా అది పెరిగి పెద్దదై రాళ్ళు, బండలు ఉరుముల శబ్దంతో కిందకు దొర్లసాగాయి. రాళ్ళ జలపాతం సెటిల్మెంట్ ఆక్రమించుకుందుకు వచ్చిన జనాన్ని చెదరగొట్టింది. ప్రతి బండ కిందా ఒక చెట్టు సెటిల్మెంట్ మొత్తం పచ్చని చెట్లతో నిండిపోయింది. జనం కళ్ళముందే చెట్లు పందిరిలా అల్లుకుని కలగలిసి పెద్ద గొడుగులా తయారైంది.
అక్కడ కుంతి రోజూ పూలు సేకరించేది, వాటితో ఆడుకునేది. చెట్లు పందిరిలా అల్లుకుని సెటిల్మెంట్కు గొడుగుపట్టాక ఒక్క వాన చినుకు కూడా నేల మీద పడలేదు. పూలను రెండు కుప్పలు చేసింది కుంతి. ఒకదానితో మాల అల్లింది. దాంట్లో లేత మావి చిగుర్లు, దేవకాంచనం, గన్నెరు ఆకులు కూడా కలిపింది. ఆ మాలను ధరించింది. జనం ఆరోగ్యపరీక్షకు ఆయుర్వేద డాక్టర్ ఇంటింటికీ వెళ్ళాడు. కుంతి ఇంటికీ వెళ్ళాడు. బయటకు వరండాలోకి వచ్చి గట్టిగా ప్రకటించాడు.
“వాతం, తీవ్రమైన వాతం.”
వాతం అనేది ఒక రకమైన శారీరిక అవస్థ అనీ గాలి, ప్రదేశం ముఖ్య పాత్ర వహిస్తాయనీ వివరించాడు. వ్యక్తి సృజనాత్మకత, జాలి గుండె, మతి మరుపు వల్ల ఒంట్లో నీరు చేరవచ్చును. కాని ఆ మాటలు విన్న జనం అతన్ని అపార్థం చేసుకుని వారి వారి కాళ్ళూ చేతులూ పరీక్షించుకున్నారు.
కుంతి పూల పల్లకిలో పడుకుంది. వాన కురుస్తున్నా పూలన్నీ తాజగా, వానలవల్లే కూడా కావచ్చును. రెండో పూలకుప్ప తన మీద చల్లుకుంది. అప్పుడే ఆయుర్వేద డాక్టర్ వచ్చి చిన్న వేదిక (సమావేశాల కోసం ఏర్పాటయినా, ఎప్పుడూ ఏ సమావేశమూ జరగలేదు) మీద ప్రకటించినది.
“పిత్తవాతం, పిత్తవాతం”
పిత్తం – నిప్పు నీటి సమ్మేళనం అనీ, దానివల్ల కడుపులో మంట, విసుగూ, కోపం వచ్చి రోగులు వాదనలు ఇష్టపడరనీ వివరించాడు డాక్టర్. సెటిల్మెంట్లో జనానికి ఈ లక్షణం బాగా తెలుసు అందుకే కూల్గా ఉన్నారు.
చెట్ల పందిరి వల్ల గ్రామంలో పెద్దగా వర్షం కురవలేదు. కాని ముందు కురిసిన వాన నీళ్ళు ఇంకడానికి చాలా రోజులే పట్టింది. నెఫిడి వాళ్ళ చూరు నుండి ఒకటీ రెండు కాదు ఇరవై రెండు గుమ్మడి కాయలు, కీటక భక్షి మొక్కలూ దిగి నీళ్ళల్లో ఈదుతూ ఆమె తండ్రి వైపుఏడేడు తరాల శత్రువు, అంకమారాలో పెళ్ళైన కూతురి ఇంట్లో చేరాయి. కింద వీధిలో మాధా రౌత్ ఇంట్లో బెడ్ రూమ్కీ పశువుల కొట్టానికీ మధ్య గోడ కాస్త విరిగి అతని కాలిపై పడి ఎముక విరిగింది. దాంతో కొడుకు వల్ల పెరిగిన అతని ఆర్భాటం, గర్వాతిశయం ముక్కలైపోయింది (అతని కొడుకు టౌన్లో మాజిస్ట్రేట్, అక్కడే పెద్ద ఇల్లు కట్టాడని జనం అంటారు మరి).
పెంగా సోదరి, వానలకు ముందే కాలు బెణికిన మనిషి, వడ్డీ వ్యాపారి కోడలు, ప్రసవానికి దగ్గరలో ఉండి ఇల్లూడ్చడం, గిన్నెలు తోమడం కాకుండా వానల వల్ల వంట చెరుకు దొరకదని తడి ఆకులూ అలమలూ తన తాటాకు చాప మీద ఆరబెట్టి వరండాలో నేలమీదే పడుకుంటోంది.
దట్టంగా ఉన్న చెట్ల వల్ల సూర్యకాంతి ప్రసరించలేక పగలు కూడా మసక చీకటిగానే ఉంటోంది. ఈ విషయం ఎవరైనా గొణుక్కుంటే చూడలేని వాళ్ళూండే ప్రాంతంలో హరికేన్ లైట్లు చూపించే చక్రపాణి అనేవాడు, “మన జనం ఇలాగ. అప్పుడో ఇప్పుడో కాస్త అసౌకర్యం కూడా ఓర్చుకోలేరు” అని.
ప్రభుత్వానికి ఎవరూ ఫిర్యాదు కాని సమాచారం కాని ఇవ్వలేదు. అందుకు అధికారులనెందుకు నిందించడం? వాళ్ల జీతాలు తక్కువ, ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళు చిన్నవి, అసౌకర్యంగా గాలీ వెలుతురూ సోకనివి. రాజకీయనాయకులు, రాజకీయ కుట్రగా సహాయ నిధులు అందని ప్రతి వారినీ పరామర్శించి తమ అసంతృప్తిని ప్రదర్శించారు. ముఖ్యంగా స్థానిక స్వయం ప్రభుత్వ ఎన్నికలు సమీపించే వేళ, ఉద్యోగం సద్యోగం లేని వారికి న్యాయమైన అధికారాన్ని, అవకాశాలనూ ఇస్తుంది. ధర్మ విరుద్ధంగా ధన సంపాదనకు ఈ సంక్లిష్టమైన లేని సమస్యల పరామర్శ వల్ల ఊరి జనాల ప్రకృతి వైపరీత్యాలు చూసే సమయం ఎవరికుంది? సెటిల్మెంట్ నుండి ఎవరైనా ప్రభుత్వ అధికారులకు తమ సమస్యలు సమర్పించుకుందుకు వెళ్తే ఊళ్ళో ప్రతి వాళ్ళనూ అల్లర్లు సృష్టించే వారనీ, తగువుల మారి వారనీ, దళారులనీ ముద్రవేస్తారు.
క్రమేణా నీటి ప్రవాహం సద్దుమణిగింది. సెటిల్మెంట్ తట్టుకుని నిలుస్తుందని నమ్మకం కుదిరింది. ఈ లోగా చాలా మంది ప్రవాహంలో బోట్లు నడుపుకుంటూ గ్రామానికి తిరిగి వచ్చారు. పెద్ద వర్షాల వల్ల ఇన్నాళ్ళూ ఎర్రటి ఎండలో ఏళ్ళకేళ్ళు బాగా కాలిన ఇళ్ళూ ఏ మాత్రం దెబ్బతినలేదు. వానలు తగ్గుముఖం పట్టగానే జనమంతా కలిసి వీధుల్లో చెత్తా చెదారం శుభ్రం చేసారు. ఇది మెచ్చుకుని తీరవలసిన విషయమే, లేకపోతే ఆ ఊరిని చూడటానికి వచ్చే ప్రభుత్వ అధికారులు, ఇతర స్త్రీ , పురుషులు ఊరివాళ్ళు అనాగరికులనీ , ఆటవికులనీ దురభిప్రాయం ఏర్పరచుకునేవారు.
ఇవన్నీ జరిగే సమయంలో జనం ఒకరకమైన సంక్షోభ స్థితిలో ఉండి కుంతి సంగతే మర్చిపోయారు. వానలు ఆగక ముందు వానతో పాటే ఆమెకో సమాచారం అందింది, జీవితాన్నించి తనను తప్పించే వారెవరో వస్తున్నారనీ, ఆ వార్త చాలా సార్లే వచ్చినా ఎప్పుడూ ఎవరూ రాలేదు మరి. ఇక్కడ ఆమె కనిపించినంత కృశించిపోయి చీర చాలా పెద్దదై ఆమె శరీరానికి తెగ చుట్టుకుని పడిపోయేది. ఇంకా ఆ వస్తానన్న వ్యక్తి రాడం ఆలస్యమయితే కుంతి క్రమంగా మరీ కుంగిపోయి మాయం అయేదేమో, ఒకసారి ప్రకృతి గనక స్పష్టంగా, గట్టిగా నిద్రలేవాలని అనుకుంటే ఆపడం మామూలు మనిషికి సాధ్యమా?
జీవితాన్నుండి గట్టెక్కించే ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ కుంతి అదే తన చివరి శ్వాస అనుకుంది. కాని కాదు. ఆ ధూళితో అనుబంధమేదో తనను రక్షించడం నుండి ఆపేస్తున్నట్టు చీర దుమ్ము గట్టీగా దులిపింది. ఊరు మళ్ళీ ఇదివరకులా అడవిలా మారాక అంకమారా గ్రామానికీ, సెటిల్మెంట్కూ తేడా లేకపోయాక ఊళ్ళో లేళ్ళు గంతులు వేస్తున్నాయి. రాత్రిళ్ళు పులుల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ అడవి చీకట్లలో ఒక లేడిపిల్ల కుంతి ఇంటికి పరుగులు తియ్యడం ఎవరూ చూడలేదు. ఎవరైనా దాన్ని పరీక్షగా చూసి ఉంటే చాలా దూరం నుండి పరుగెత్తుకు వచ్చిన అలసట, ఎన్నో రహస్యాలు తెలిసిన చిరునవ్వు, వారు చేసే పని మీద ఎవరిదో అవరోధం కనిపించేవి. ఆ లేడిపిల్ల కుంతి ఇల్లు చేరాక చిన్నపిల్లగా మారి కనిపించింది. ఆమె శరీరమంతా కప్పేసి ఉండటం వల్ల కాళ్ళూ చేతులూ కూడా కనబడటం లేదు. భుజాలు మొదలయ్యేచోట రెండు రెక్కలు మొలిచాయి. ఆమె ఏ మాత్రం ఆగలేదు. ఆ లేడిపిల్ల మీద కూచుంది, వెంటనే అది అడవి లోకి దట్టమైన అడవిలోకి పరుగుతీసింది. సూర్యాస్తమయం కాబోతోంది.
మర్నాడు ఆయుర్వేద డాక్టర్ కాస్త పెద్ద మొత్తంలో ఫీజు అందుకోవాలని కుంతి ఇల్లు చేరి చూస్తే కుంతి లేదు.
వార్త విన్నాక ఓ చిన్నపిల్ల అడిగింది, “ ఆ లేడి కుంతికి ఎవరూ లేరని ఆమెను తీసుకెళ్ళిపోయిందా?”
ఆ ప్రశ్న నన్ను కదిలించి వేసింది. కలతపెట్టింది. నిజమే ఆ లేడి కుంతినెందుకు తీసుకెళ్ళింది? అయితే నాకింక మిగిలిన మరో దారి ఏది? కుంతి ఎలా వెళ్ళింది?
ఆమెకు పెన్షన్ డబ్బు సక్రమంగా రాలేదు, పోస్టాఫీసులో ఆమె సేవింగ్స్ ఎవరో కొట్టేసారు. ఆకలి దాహంతో మరణించిందా తులసి? లేదూ టౌన్ మార్కెట్ నుండి కావలసిన అత్యవసర సర్రుకులూ మందులూ తెచ్చేవాళ్ళెవరూ లేకనా? ఇళ్ళు రిపేర్ చేసేవాళ్ళెవరూ లేకపోడం వల్లా, ఆమెతో పాటు ఇల్లూ కొట్టుకుపోయిందా?, ఒంటరితనం వల్ల, ఎడతెరిపి లేని వానల్లో చలికి చావులో ముణగ దీసుకుందా? లేదా తడిసి నాని నాని జబ్బు పడి నిర్లక్ష్యం చేసిందా? ఇలాటి అధిక్షేపణలు కథల్లో ఉండవు మరి.
గ్రామంలో ఇంకా ఎవరు మరణించారు? నీరు కారే శంఖం ఎంత నోటితో ఊదినా అనుమానాస్పదమైన, ప్రోత్సహించే ధ్వనిని ఏ జీవితమూ చెయ్యలేదు. ఊళ్ళో ఎవరూ చావలేదు. పుట్టుకతో వచ్చిన ఆత్మలు చావుతో తిరిగి వెళ్ళాయి. చావు పుట్టుకల భ్రమణం నుండి తప్పించుకున్న తులసి ఆత్మ మళ్ళీ తిరిగి రాదు.
ఇక్కడ కథ ముగుస్తుంది. నేను బాగా చెప్పాను.
పూలు పూస్తున్న చెట్టు తన అంతాన్ని చేరుకుంది.
(సమాప్తం)
అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, అనేక నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో ‘మానస సంచరరే’ శీర్షిక నిర్వహించారు.