[ప్రసిద్ధ ఒడియా రచయిత శ్రీ హృశికేశ్ పాండా రచించిన నవలని ‘అపరిచిత సూర్యాస్తమయం లోకి’ అనే పేరుతో అనువదించి అందిస్తున్నారు శ్రీమతి స్వాతి శ్రీపాద.]
[చిన్నప్పటి ప్రతీదానికి తన తల్లిని నిందించటం కుంతికి అలవాటు. హాస్టల్లో ఉన్నప్పుడు, తనకి ఎవరూ అన్నం వడ్డించనప్పుడల్లా – తల్లి గుర్తొచ్చి ఆమెను తిట్టుకునేది. అప్పట్లో తల్లి ఆమె కోసం ఎన్నో తినుబండారాలు చేసి తీసుకొచ్చేది. సెలవల్లో ఇంటికొచ్చినప్పుడల్లా కుంతి తన చిన్న తమ్ముడు గొబారాకు స్నానం చేయించేది. కానీ కొన్నాళ్ళకి వాడు పెద్దాడయిపోతే, వాడికి స్నానం చేయించలేక, మళ్ళీ తల్లినే కోపగించుకుంటుకుంటుంది. ఆమె తల్లీ, కుంతీ ఒకరినొకరు మాటలు అనుకునేవారు. ఓసారి భాను, కుంతిని అర్జెంటుగా బయల్దేరి కటక్ రమ్మని ఉత్తరం రాస్తాడు. కానీ కుంతి అక్కడ బస్ దిగేసరికి ఆమెను తీసుకువెళ్ళడానికి రాడు. ఆమె ఎక్కిన రిక్షావాడు నిర్జన ప్రదేశంలో బలాత్కారానికి ప్రయత్నిస్తే, ఓ వ్యక్తి కాపాడి ఆమెను తన బండి మీద ఎక్కించుకుని వెళ్తుండగా, అటుగా మోటర్ సైకిల్పై వెళ్తున్న మకర వాళ్ళని ఆపుతాడు. కుంతి దిగగానే ఆ వ్యక్తి పారిపోతాడు. అతనో రేపిస్ట్ అని చెప్తాడు మకర. తానో పోలీస్ ఆఫీసర్నని చెప్తాడు కుంతికి. తనపై జరగబోయిన అత్యాచారానికీ తల్లినే నిందిస్తుంది. కొన్నాళ్ళకి తల్లికి మతి భ్రమిస్తుంది. చిన్నతమ్ముడు అస్సాం నుంచి వచ్చి తల్లిని, అక్కని చూసి వెళ్తాడు. తల్లికి ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది, కొన్ని రోజులకి మరణిస్తుంది. కుంతి మౌనంగా మారిపోతుంది, మాట్లాడడం అవసరమే లేని దశకు చేరుకుంటుంది. – ఇక చదవండి.]
అధ్యాయం-8
సెటిల్మెంట్కు కుంతి తిరిగివచ్చినప్పుడు అప్పటికింకా సెటిల్మెంట్ అజాపజా లేకపోయినా, ఒక ఆకారం రాకపోయినా ఆమె పరాయితనం, ఆపైన వచ్చే చావు, విమోచనానికి తనేమీ ప్రత్యేకమైన ప్రయత్నాలు చెయ్యకపోయినా ఏదో రకంగా తనను తన ఏకాంతం నుండి రక్షిస్తుందని ఆమెకో నిర్ధారణ అయిపోయింది. ఈ మధ్యన ఆమె చిన్నపిల్లలా చాలా సమయమే తన దేవుళ్లతో తగువుపడుతోంది.
ఏకాంతంగా తన దేవుళ్లతో చిన్నపిల్లలా మాట్లాడుతోంది, “చూడు, దేవుడా, నా మీద కోపం తెచ్చుకోకు. దేవుడా, దయ చేసి నేనెవరికీ ఏ మంచీ చెయ్యలేదా? (ఆమె తను చేసిన దానధర్మాలు, కరుణ పూరితమైన పనులూ ఒక జాబితా ఏకరువు పెడుతుంది). దయచేసి నన్ను భయపెట్టవద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్” బ్రతిమాలుతూ అడుగుతుంది.
ఎవరి ఊహకూ అందనంతగా కుంతి ఛాందసంగా మారిపోయింది. సమయం అంటే అవగాహన ఉన్న ఏ మామూలు మనిషయినా రోజురోజుకీ పెరిగిపోతున్న ఆమె ఐతిహాసిక ఛాందసాన్ని గమనించే ఉంటాడు. కాని ఆ సెటిల్మెంట్కు వలస వచ్చిన వాళ్ళు ఈ మధ్య కాలపు నాగరీకులు అందుకే వాళ్ళీ నిజాన్ని, అదే కుంతి పురాతన భావాలకు మారిపోయే తీరును గమనించలేదు.
సెటిల్మెంట్కు మరీ దూరంగా ఏమీ లేదు ఆ నీటిపారుదల ప్రాజెక్ట్. నఖియా అలియాస్ నియతి నాయక్ ఆ ప్రాజెక్ట్లో పని చేస్తున్నాడు. నఖియాకు పాటలు పాడటం, పొడుపు కథలు వెయ్యడం, రాగాలను పాడి పాటలు ఊహించమనడం అలవాటు. ఎప్పుడో ఏళ్ల క్రితం నియతి పాత్రలో నటించాడు, ఓ యువకుడు భవిష్యత్తుకు ప్రతినిధిగా ఊరి నాటకాల్లో టెన్షన్ పెంచడానికి కొంత చెప్తూ కొంత దాస్తూ పాటలు పాడే పాత్ర.
ఒకరోజు పొద్దున కుంతి నఖియా కనబడక, అతని కొడుకు కోసం కబురుపెట్టి, “చూడూ, మీ నాన్నకు చెప్పు. నాకు చెప్పకుండా పనికి వెళ్లవద్దని” అని చెప్పింది.
ఆ కొడుకు తండ్రితో మాట్లాడక ముందే నఖియా అలియాస్ నియతి సైకిల్ తొక్కుకుంటూ పనికి వెళ్ళిపోయాడు, రెండు లారీల మధ్య సైకిల్ తొక్కుతూ ఏదో ద్విపద ఒకటి, దాని భావం రెండు ఏనుగులు తగువుపడి యుద్ధం చేస్తే మధ్యన తొక్కిసలాటకు తలవంచేది పాపం పచ్చగడ్డి- హమ్ చేస్తున్నాడు. అతని జీవితంలో అతను పాడే చ్చివరి పాట అదే పాపం. మళ్ళీ ఏపాటా లేదా ద్విపద, ఏ పొడుపు కథా, ఎప్పుడూ పాడలేదు. లారీల మధ్యన నలిగి మరణించాడు. చెప్పవలసిన అవసరం లేదు కాని , అతని చావుకు కొందరు కుంతిని నిందించారు, ఏదైనా చెయ్యమని చక్రపాణిని అడిగారు. కాని చక్రపాణి కూడా పాపం అల్పజీవి ఏ మాత్రం కాదు, ఊరూపేరూ లేనివాడూ కాదు. జీవితంలో వాస్తవిక అవసరాల గురించి, అదే భూములూ, కోర్ట్ కేస్ల గురించీ , తన స్వంత నియమాలను రూపొందించుకోగలవాడూ కావలసినంత లోక జ్ఞానం ఉన్నవాడూ, దీనిలో తలదూర్చడానికి భయపడ్డాడు. పైగా, కుంతి అసలు బయట కనబడటమే తగ్గిపోయింది. జనాల విషయాలకు తనను తాను దూరంగా ఉంచుకుంటూ, ఒక నిర్లిప్త సంస్థగా మారిపోతోంది. ఆమె బాల్యం, యౌవనారంభదశ, మరచిపోలేని యౌవనం, ఆమెతో పాటే దాదాపు అందరూ మరచిపోయారు.
అదే నెలలో, మాఘ మాసం వసంతం తొలి నాళ్ళలో అప్పుడొ ఇప్పుడో అద్భుతమైన దక్షిణాది గాలి వీచేది. అది ఆమె ఊపిరిని లాగేసింది, ఏదో పోగొట్టుకున్నట్టు, కాని ఏమిటది? లలిత లలితమైన గాలి మునివాకిట్లో ఆ గుడిసె అంచులను ముద్దాడుతూ, వాకిలికి ఆవల, కొబ్బరాకుల మధ్య నుండి ఎండపొడ అలలు అలలుగా చిన్నపిల్లల్లా ఈదులాడేవి. సెటిల్మెంట్ దేవత పాదాల దగ్గర చిన్న, ఏడాది వయసున్న మందార మొక్క ఎర్రని పూల బరువుకు ఒంగిపోతూ, ఎంత వింతగా అనిపించేది, ఎవరో దాని కొమ్మలకు పూలమాలలు వేసినట్టు (ఆ సెటిల్మెంట్లో మరో పూలమొక్కే కనబడదు). గాలి వీచినప్పుడల్లా, ఒకరకమైన జిల్లుమనే చెదిరిపోయే కలవరం కుంతి ఒంట్లో పాకేది, సముద్రంలోలా, ఎక్కడో దూరంగా సముద్రంలో ఒక ద్వీపం విస్ఫోటించినట్టు, ఆ ద్వీపం కుంతి ఎప్పుడూ చూడనిది, అయినా ఆమెకు ఎంతో స్పష్టంగా ఆ ద్వీపవాసులు భయంతో అరవడం, కేకలు వెయ్యడం ఎలా వినబడేవి? ఎలా వారి వేదన, బాధ, విచారం ఆమెలో ఇంకిపోయేది?
కుంతి ఒంటరితనాన్ని ఎలా వివరించను? ఒకవేళ నువ్వో నిరంకుశమైన సమ్రాజ్ఞివి అయి, పెద్ద బ్రహ్మాండమైన ప్రాసాదంలో నివసిస్తున్నట్టుగా. ఈ ప్రపంచంలో నీకంటూ ఎవరూ, సోదరులో, మిత్రులో, తండ్రో, భర్తో, ఎవ్వరూ లేనట్టుగా. సమయం మిట్టమధ్యాన్నం, ఆయుధాలతో గార్డులు బయట కాపలా కాస్తూంటారు. లోపల పట్టుపురుగు గూడులా ఎలాటి దుష్ట ఆత్మలూ, దయ్యాలూ పిశాచాలూ చేరకుండా మతాధికారులూ, మంత్రగాళ్ళు కాపలా. అంతటా నిశ్చలంగా, చివరికి పశువుల కాపరి పిల్లంగోవి కూడా వినబడదు, చాలా కాలం క్రితమే వాడు పిల్లంగోవి ఊదడం మరచిపోయాడు మరి, మరచిపోడం తన అకాల వార్ధక్యంతో, జీర్ణకోశ వ్యాధి, ఆకలి వల్ల. ఎవరూ ఏ కోర్ట్ పని కోసము రారు, ఎవరినీ కలవడానికి నువ్వు సామ్రాజ్ఞివి కనుక బయటకు వెళ్ళలేవు.
లేదా కనీసం నువ్వు సాధారణ వ్యక్తివైతే, సెలవు రోజయితే, ఒంటరిగా ఎదురు చూస్తూ ఉంటావు, నీ ఆప్త మిత్రురాలు లేదా మిత్రుడు వస్తానని చెప్పి రాలేదు, కనీసం ఏ సమాచారమూ పంపలేదు. దారిన నడిచే వాళ్ళంతా పోస్ట్మాన్ లానే కనబడుతున్నారు. హాల్లో గడియారం గంటలు కొట్టినప్పుడల్లా కాలింగ్ బెల్ శబ్దమేమో అనిపిస్తోంది. సంక్షిప్తంగా ఏదో పనిలో మునిగిపోయావు గనక నువ్వు ఎదురుచూస్తున్నావనే వాస్తవం మాటిమాటికీ మరచిపోతూనే ఉన్నావు. కాని నీ అంతశ్చేతనలో ఘడియకోసారి ఊగిసలాట సాగుతూనే ఉంది.
నువ్వు నీ పేరుందా అని న్యూస్ పేపర్ స్కాన్ చేస్తావు. నీలాటి మామూలు మనిషి న్యూస్ పేపర్లకెక్కడం జరగదని నీకు తెలిసినా కూడా. బయట ఏదో కోలాహలం. బయటకు వెళ్ళి చూస్తావు. ఏమీ ఉండదు, గాలి అలికిడే. కర్టెన్లు పైకెత్తి చెవులు రిక్కిస్తావు. “అతను నిన్ను పిలుస్తున్నాడా? అయితే అతనెవరు?”
కాని నీ ఎదురుగా అదే చంపక వృక్షం, ఒక్క మొగ్గ కూడా తొడగలేదు. ఎక్కడో ఒక పక్షి నిన్ను అవహేళన చేస్తూ పాడుతోంది. “వెళ్ళు నీ అపురూపమైన అతిధిని వెతుక్కో. వెళ్ళు వెళ్ళి చూడు” అంటోంది, క్రూరంగా ఏడిపించే పిల్లలా.
సాయంత్రం అయింది. ఏ చిన్న అలికిడైనా వినబడుతుందేమోనని నీ చెవులు తలుపుకు తగిలించి ఉంచావు, లేకపోతే వచ్చిన అతను వెనక్కి వెళ్ళిపోతాడేమో అన్నట్టు. వెన్నాడుతున్న భయంకరమైన చీకటి పదునైన సూదులు తలుపు పగుళ్ళలోంచి దూరుతూనే ఉన్నాయి, బయట ఎవరూ లేరు. సమయం పన్నెండు కావస్తోంది. ఒకటి కావచ్చు, రెండూ కావచ్చు. ఏ సమయమైతే నేం గాక.
లేదూ రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్న నీ ప్రియమైన వారికెవరికో నువ్వు వీడ్కోలు పలకాలి, రాత్రి చాలా పొద్దుపోయే వరకూ చల్లని చిరుగాలిలో అతని వెంట, పరిమళభరితమైన అడవి పూల గురించి వాదిస్తూ తిరుగుతూనే ఉన్నావు. చిన్న పిక్నిక్ జరుపుకుంటూ మూవీ కి వెళ్ళావు. ఆ ముదిరిపోయిన చీకటి పైన చిన్నపిల్లలా నీ కామెంట్లు విసిరావు. రాత్రి సెలవు తీసుకోబోతూ నిన్ను అడిగాడు, “రేపు బస్స్టాండ్కి వస్తావు కదూ?”
ఏడవటం అవమానకరం గనక నువ్వు చిన్నగా నవ్వుతూ, “వస్తానేమో, పొద్దున మెలుకువ వస్తే” అంటావు.
నువ్వు లేస్తావని నీకు గట్టిగా తెలిసినా నువ్వు రావు. మర్నాడు ఉదయం మామూలు కన్నా చాలా ఆలస్యంగా నిద్రలేస్తావు, అతనితో ఎడబాటు భరించలేవు గనక. నువ్వు లేచేసరికి పది దాటుతుంది. అతను పొద్దున్నే ఆరింటి బస్కి వెళ్ళిపోయి ఉంటాడని నీకు తెలుసు. ఇల్లు దాటి బయటకు వస్తావు. ఇంటి ముందు ఒకే ఒక్క సన్నని అరటి చెట్టు, దాని ఆకుల మీద సస్నేహంగా ఎండ పొడ. ఉన్నట్టుండి ఆశ తళుక్కున మెరుస్తుంది. ఇవాళ బస్ ఇంకా వెళ్ళలేదేమో, తరచూ దానికి ఆలస్యమవడం అలవాటేగా. బస్ స్టాండ్ వైపు పరుగులు తీస్తావు. పరుగెట్టి పరుగెట్టి వెళ్తే బస్ నాలుగ్గంటల క్రితమే వెళ్ళిపోయింది.
లేదూ, వెయ్యేళ్ళ క్రితం, లేదా ద్వాపర యుగంలో నువ్వు రాజకుమారిలా పుట్టి ఉంటావు. నీ స్వయంవరానికి ఎందరో రాకుమారులు ఏనుగుల మీద, గుర్రాలమీద వారి సాహస క్రీడలను, శౌర్యపరాక్రమాలను, సిరిసంపదలు, మేధస్సును ప్రదర్శిస్తూ వచ్చే ఉంటారు. స్వయంవరం ముగిసింది. మిగతా వారందరినీ అవహేళన చేస్తూ ఒక తెలివైన రాకుమారుడు గెలుస్తాడు. కాని నీ హృదయం మరెవరినో కోరుకుంటుంది. అక్కడ గుమిగూడిన అల్పులైన పోటీదారులందరికీ దూరంగా ప్రశాంతంగా కూచున్న అతను, ఇలాటి వికారపు చేష్టలు ఒక రాజుకు సరైనవి కావని, తన, కోరికను, విచారాన్ని మొహం మీద కనబరచకుండా తన హృదయపు బాధ ఏ ఒక్క పలుకునూ మొహం మీద చెక్కుకోలేదు. ఒక్కమాటా పెదవి విప్పి చెప్పలేదు, ఏమీ అడగలేదు, ఏమీ తెలియజెయ్యనూ లేదు. కాని అతని నెమ్మదైన స్వభావం, బిడియం పెద్ద పర్వతంలా నీ హృదయాన్ని లాగేసుకుంది. స్వయంవరం ముగిసినా , నువ్వు అక్కడే కూచుని అతను ఏ మాత్రం అలికిడి లేకుండా వెళ్ళిపోడం, చూపులకు మరుగవడం చూస్తున్నావు, అతను లేకపోడం అనుభవిస్తున్నావు.
ఒకసారు భాను ఆమె కోసం వచ్చాడు. ఆమె తలుపు కొట్టాక చాలా సేపు ఎదురుచూడవలసి వచ్చింది. కుంతి తలుపు ఓరగా తెరిచి లోపలినుండే, “నాకు తెలుసు, నేను పోయాక నా కళ్ళద్దాలు విరక్కొట్టి ఆ నల్ల అద్దాలు ఫ్రేమ్లో బిగించుకుని నువ్వు వాడుకుంటావని. కాని నేను నీకా అవకాశం ఇవ్వను.” అంది.
ఆమె అద్దాలను నెమ్మదిగా తీసి, బలంగా దాని ఫ్రేమ్ విరక్కొట్టి, అద్దాలను భాను అరచేతిలోపెట్టి లీలగా నవ్వింది. ఆపైన ఇంట్లోకి వెళ్ళింది. ఒక గందరగోళపు గుంపు భాను వెనకాల చేరింది.
ఇంట్లో ఇరుక్కుపోయిన చీకట్లలోకి చూస్తూ “నేను వెళ్తున్నాను, మరో రోజెప్పుడో వస్తాను. మరో రోజు నిన్ను కలుస్తాను, (అంటే నేను మళ్ళీ రాననే అర్థం)” అన్నాడు.
భాను తన సైకిల్ కదిపి తన వెనకాల ఉన్న గుంపు వల్ల పైకి లేస్తున్న ధూళిలో నెమ్మదినెమ్మదిగా కలిసి మాయమయిపోయాడు. అతని చెతిలో విరిగిన అద్దాల వల్ల కదంబ పరిమళంలా విచారం కిందకు జారింది. ఎక్కడ వేగంగా వెళ్తే మరో తప్పు చేస్తానో అన్నట్టు తన సైకిల్ను హాండిల్ బార్ పట్టుకుని నడిపించుకుంటూ నెమ్మదిగా వెనక్కు వెళ్ళాడు. కుంతి ఇంటికి తిరిగి వచ్చి గోవిందా తన బెడ్ మీద కూచుని నవ్వుతూ ఉండటం చూసింది. కుంతి అతన్ని గమనించనట్టు నటిస్తూ పూజా గదికి వెళ్ళి ధ్యానంలో కూచుంది. గోవింద బాధపడి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ రాలేదు.
ఆ సాయంత్రం వర్షం కురిసింది. సెటిల్మెంట్ చివరన ఉన్న తెల్లని కొండ అంచు వర్షపు నీళ్ళతో, జీవంతో తడిసిముద్దై సాయంత్రపు నీరెండ పడి మంచులా కనిపించింది. సాయంత్రం కుంతి ఇంట్లోనుండి బయటకు వచ్చి కొండ ఎక్కింది. ఆ కొండ వెనకాల సూరీడు కుంకుమ రంగుకు తిరిగి ఎర్రగా ఉన్నాడు. మబ్బుల మధ్య ప్రకాశవంతమైన రంగుల్లో ఒక స్వర్గం దర్శనమిచ్చింది. తాజాగా, ఆసక్తికరంగా ఉన్న ఆమె మొహంలో మెరుపు కొండ అంచుకు కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న స్వర్గాన్ని ఆమె చేరుకోబోతోందని చెప్పినట్టుగా అనిపించింది. కాని, పాపం, చుట్టూ అప్పటికే వెలసిపోయినట్టు రంగులన్నీ నిష్క్రమించి తెలుపు నలుపుల మిశ్రమం మిగిలింది.
ఈ మధ్యన ఎవరూ కుంతిని గమనించడం లేదు. నెలకోసారో రెండు సార్లో కూరలమ్మే వాడికోసమో లేదా సర్వేయర్ కోసమో, కాదంటే దారి దేవత ఉత్సవాల కోసం, లేదా మర్రి చెట్టు పూజలకు అబ్బాయిలు చందాల వసూలుకు వచ్చిప్పుడో ఆమె తలుపు తెరిచినప్పుడు వాళ్ళో వీళ్లో ఈ మధ్యన కాలం చేసిన సంగతులు వినేది. సెటిల్మెంట్ను చావు క్రమం తప్పకుండా దర్శిస్తున్నట్టుగా, అక్కడి జనాభాలో పదో వంతు ఏ వార్తా తెలిసేది కాదు.
ఏదో జరగబోతోందేమోనన్న ఎదురుచూపు కనిపిస్తోంది గాలి రంగులో, కొబ్బరాకుల విరిగిన చప్పుళ్ళలో. దాసియా బావురి ఇంట్లోని కొడుకులు లేని ముసలిది, హద్దూ అదుపూ లేకుండా వాగే ఆమె నోరు మూసుకున ఉంటోంది.
నెలకు ఒకటో రెండో మరణాలు, పదిహేనురోజులకు ఒకటో రెండో జననాలు ఊళ్ళో మామూలయిపోయాయి. జటాధరి ప్రతిసారీ చెప్తూనే ఉన్నాడు ఎవరో ఒకరు మరణించాక ఎక్కడో ఒక ఇంట్లో ఎవరికడుపునో పుడతారని. కాని ఒక్కళ్ళు కూడా, చివరికి అక్షరాస్యత కూడా లేని స్త్రీలు, శుష్కించిపోయిన వక్షోజాలున్న వారు, ఈ మధ్య అతన్ని నమ్మడం లేదు. దారి దేవత, మర్రి చెట్టుకు బాగా తెలుసు మరణించాక ఎవరైనా దెయ్యంగా మారితే వారు చెట్లపైన ఉంటారని. మరణించిన బ్రహ్మచారి కాలుతున్న దేహాలు తినే దెయ్యాలు, లేదా పెళ్ళికాని యువతల దేహాలను ఆవహించడానికి ఆనందపడే చెడు ఆత్మలు వారిని పిచ్చిపట్టినట్టు ప్రవర్తించేలా చేస్తాయి. అయితే జటాధారి కాని, దారి దేవత కాని గ్రామంలో ఏదో జరగబోతోందన్న తెలుసుకోలేకపోయారు.
ఎందరో వార్రి వారి సిద్ధాంతాలను వెలిబుచ్చారు. ఒకరోజున సర్వేయర్ గ్రామంలో ప్రజలకు దండోరా వేయించాడు అదీ డప్పుకొట్టి మరీ, కొత్త సెటిల్మెంట్ ఏర్పాటు అవుతుందని ఏ భూమి ఎవరికో స్థిరపరుస్తారనీ. పంచయతీ ఆఫీస్ నౌకరు వచ్చి, ఒకకొత్త శాసనం వచ్చిందనీ, ఇహపైన ఎవరూ బీదవారుగా ఉండరనీ, ప్రతి వాళ్ళూ ధనవంతులే అవుతారనీ, భూమితో బాటు ఇల్లు, పశువులు, మేకలు, గొర్రెలు, దుకాణాలు, చెరువులు, సైకిళ్ళు, చెట్లు- ఇలా ఎన్నెన్నో సమకూరుస్తారనీ, ఇలా సంపదలు సమకూర్చుకోలేని వారికి రోజు వారీ కూలీగా పని భద్రత కల్పిస్తారనీ. ఇన్ని ఏర్పాట్లు చేసాక కూడా ఎవరైనా ధనవంతులు కాలేకపోతే వారిని జైల్లో పెడతారు. మహదేవ మందిరం పూజారి, సగం పిచ్చివాడు, బోలానాథ్ ప్రకటించాడు, వచ్చే శివరాత్రి రోజు రాత్రి ప్రభువు శివుడు తల్లి పార్వతి వాళ్ళ స్వంత దేహాలతో మన గ్రామంలో అవతరిస్తారు అని (శ్లోకాలు తప్పుగా చదివి అతనికి పిచ్చి పట్టింది).
స్కూల్ టీచర్ చెప్పాడు, “మన ప్రాథమిక పాఠశాల, ఈ తాటాకు కప్పున్న ఇటుకల ఇల్లు త్వరలో హైస్కూల్గా మారుతుంది, లేదా కనీసం, మైనర్ స్కూల్గా.”
చక్రపాణి అన్నాడు, “ అన్ని న్యాయపరమైన కేస్లు, కోర్టులు, శాసనాలు, అన్నీ రద్దయిపోతాయి. మరోసారి పంచాయితీలకు అధికారపు పగ్గాలు అందుతాయి. గ్రామస్థుల నుండే పంచయతీ సభ్యులు ఎన్నుకోబడతారు.”
నాథూ మాలిక్ ఆశ తక్కువదా?
“సెటిల్మెంట్ మళ్ళీ పాత గ్రామం ఉన్న చోటికే తరలిపోతుంది. అంకమారా సాగునీటి డామ్ పోతుంది.” అని చెప్తున్నాడు.
పెంగా అయితే మళ్ళీ ఆలేఖ బాబా గ్రామానికి తిరిగివస్తాడని అంటున్నాడు.
జమీదార్ రామచంద్ర మంగరాజ్ ఈ భవిష్యత్వాక్కులన్నీ విన్నాడు, అవేవీ జరిగేవి కాదని అతనికి తెలుసు, తన అభిప్రాయం చెప్పలేదు. తనలో తనే అనుకున్నాడు, ‘జనాలను ఈ కాస్త గోరంతను కొందంతలు చెయ్యనీ గాక. చేసి వారికి వారే ఆనందపడుతున్నారు. పాపం కొంచం ఊహించుకోనీ’.
ఆ గ్రామానికి ఇంకా బయటి వాళ్ళు వచ్చి పోతూనే ఉన్నారు. నాటు సారా అమ్మే జిప్సీలు, ఈతకల్లు అమ్మే వారు, చిన్న చిన్న వస్తువులు అమ్మే వారు, గ్రామస్థుల వద్ద నష్టపరిహారంగా వచ్చిన డబ్బులో ఇంకా కొంత ఉంది గనక పోస్టల్ సేవింగ్స్ స్కీమ్లో చేరమని అడగడానికి వచ్చే మనిషి, ట్యూబెక్టమీ ఆపరేషన్ల కోసం స్త్రీలను ఎంచుకునే మిడ్ వైఫ్ ఇలా ఎందరో. ఒక్కోసారి అపరిచితుడెవరో పరాకుగా కుంతి ఇంటికి వచ్చేవాడు. ఇదివరకు రోజుల్లో ఎవరైనా అమ్మకందారు, “ప్రతి వస్తువూ ఆరు అణాలే” అని అరుస్తూ ఆమె ఇంటిముందు విజిల్ ఊదితే చాలు ఒక స్వరం వినబడేది. “అక్రమంగా వచ్చే మోసగాడా, నువ్వు మోసం చెయ్యడానికి ఇంకెవరూ దొరకలేదా? ఈ బీద ముసలిదాన్ని దోచుకుందుకు ఇంతదూరం వచ్చావు?” అని.
కాని ఏం జరిగిందో ఎవరికీ తెలియదు, ఇప్పుడు బయట ఏ కాస్త అలికిడి అయినా కుంతి తలుపు తెరుస్తోంది. వీధి వ్యాపారులు దూరంగా ఉంటే వాళ్ళను పంపమని ఎవరితోనైనా కబురుచేసేది. చేపలు అమ్మేవాడికి, గాజుల వ్యాపారికి, అందుకో, ఇందుకో చందాలు దండుకునే వారికీ, చాకలి వాళ్ళను (చావుకో, పురిటి స్నానమో చేసాక తడి గుడ్డల ను ఉతికే వాళ్ళే కాదు, ఓ పురిషెడు నీళ్ళు చిలకరించే వారంతే.), ఎలెక్షన్ డ్యూటీ చేసే పోలీసు వాడికి, దళారులకు కూడా. వాళ్ళు గనక కింద గ్రామంలో ఉంటే వాళ్ళకోసం కబురుపెట్టేది కూడా. ప్రతి వాళ్ళనూ, “హే మీరు ఆ సంజీవని పండు తెచ్చారా? నాకవి కావాలి” అని అడిగేది.
కుంతి భయపడేది, సెటిల్మెంట్కు రాబోయేది, ఆమె ఎదురుచూసేది చావుకు తప్ప మరొకరు కాదు. ఆ చావు తప్పించుకుందుకు బాల్యం కధల్లోకి వెళ్ళడం తప్ప మరో దారి లేదు. ఆ చావును ఎదుర్కొందుకు సంజీవని పండు తిన్న వ్యక్తి తిరిగి పిల్లవాడిగా మారిపోయిన కథ తప్ప మరో దారి లేదు.
(ముగింపు వచ్చే వారం)
అసంఖ్యాకంగా కవితలు, వందకు పైగా కథలు, అనేక నవలలు రాసిన స్వాతీ శ్రీపాద అనువాదాల ద్వారా తెలుగు సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. స్త్రీ ఎల్లప్పుడూ అభ్యుదయపథంలో సాగాలనేదే ఆమె ఆకాంక్ష. తెలుగు, ఆంగ్లాల్లో పోస్ట్ గ్రాడ్యుయేటైన స్వాతీ శ్రీపాద వార్త దినపత్రికలో వారం వారం చెలి పేజీలో ‘మానస సంచరరే’ శీర్షిక నిర్వహించారు.