[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన ఏ. అన్నపూర్ణ గారి ‘అనుబంధాల సంకెళ్లు!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“మధూ! విలేజ్లో ఉన్న గ్రానీ ఫోను చేసింది. ఆవిడ చివరి రోజులు మనతో గడపాలని ఆశపడుతోంది. వెడదామా..?” అన్నాడు రోహన్ ఆఫీసునుంచి ఇంటికి వచ్చాక.
“అబ్బా! నాకు అక్కడ తోచదు. నీకు సెలవు దొరకదు” అంది మధు ఆసక్తి లేనట్టు.
“అది కాదు మధూ నీకు చెప్పేనుగా. మా అమ్మా నాన్నా కార్ యాక్సిడెంట్లో చనిపోతే నెలల పసివాడిని నన్ను చేరదీసి పెంచి చదివించింది. ఆవిడ చివరి దశలో వుంది. నువ్వు త్వరలో బిడ్డకు జన్మనిస్తావు. ఆ బిడ్డను చూడాలని ఎదురుచూస్తోంది. నా జాబ్కి కొంతకాలం బ్రేక్ ఇస్తాను.”
“ఇప్పుడు మనం చాలా ఖర్చులో వున్నాం. డెలివరీ, బేబీని పెంచడం, మామూలు విషయం కాదు. జాబ్ మానేసి కూర్చుంటే ఎలా?”
“గ్రానీకి నర్సరీ వుంది. గ్రాండ్పా ఎప్పుడో ప్రారంభించారు. అందులో పనిచేస్తా. గ్రామంలో పెద్ద ఖర్చు ఉండదు. స్వంత ఇల్లు. ఏమి ఇబ్బంది ఉండదు. ప్లీజ్ మధూ నా కోరిక తీర్చవా?”
“ఏమో బాబూ! నాకు అసలు ఇష్టం లేదు. డాక్టర్ సదుపాయం ఉండదు.”
“సరే. నీ ఇష్టం” అన్నాడు రోహన్.
మధు వాళ్ళ అమ్మ నాన్న కూతురు డెలివరీ కోసం వచ్చారు.
కొద్దిరోజుల తర్వాత రోహన్ చెప్పేడు.
“మధూ నేను గ్రానీ దగ్గిర కొద్దిరోజులు ఉండి వస్తాను. మీ అమ్మా నాన్నలు నీకు తోడు వున్నారుగా!”
“ఐతే నువ్వు ఉండవా?” కోపంగా అడిగింది మధు.
“నీకు నార్మల్ డెలివరీ అని డాక్టర్ చెప్పింది. పర్వాలేదు. అంతా బాగా జరుగుతుంది. నేను వెళ్లితీరాలి” అన్నాడు.
ఆ రాత్రికే రోహన్ గ్రానీ వుండే గ్రామం తోటపల్లి వెళ్ళేడు.
చంద్రమతి మనవడిని చూసి మురిసిపొయింది. ఒక్కడే వచ్చినందుకు బాధపడింది.
“మధూని వదిలి వచ్చావా..” అని మందలించింది.
“మధూ బేబీ పుట్టేక తీసుకుని వస్తుందిలే గ్రానీ. వాళ్ళ అమ్మ-నాన్నలు వున్నారు. నీకు ఎవరూ లేరు. ఎన్ని రోజులుగానో అడుగుతున్నావు. అందుకే వచ్చేసాను.” అన్నాడు.
చంద్రమతి ఇంకా నర్సరీలో పని చేస్తూనేవుంది. కొత్త మొక్కలు తెప్పించడం, వాటి సంరక్షణ, పూల బొకేలు తయారుచేసి వారం మార్కెట్లో అమ్మడం వగైరా.
ఇంటికి రోజూవచ్చి తాజా పూలను కొని తీసుకువెడతారు రెగ్యులర్ కష్టమర్స్. సీజన్ వారీగా కూరగాయ మొక్కలు, పూలమొక్కలు చంద్రమతి దగ్గిరే కొంటారు.
అలా వచ్చే పారిజాత రోహన్ ను చూసి “ఎవరీ బంధువు? ఇన్నాళ్లు కనబడనేలేదు” అంటూ అడిగింది.
“వీడు రోహన్. నా మనవడు. సిటీలో పెద్ద ఆఫీసర్. తీరిక వుండదులే. నేనే వెళ్లి వచ్చేదాన్ని” అంటూ చెప్పింది.
“ఓసోస్.. నాకు తెలియకుండా నువ్వెక్కడికి వెళ్ళేవు? మనవడిని మా బాగా వెనకేసుకు వస్తున్నావులే!” అని చంద్రమతితో అని, “ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా ఈవిడ?” అంటూ దులిపేసింది రోహన్ని.
“ఇక ఇక్కడే ఉండిపోతా. ఇంతకీ నువ్వెవరు?” అన్నాడు.
“నేనా ఈ తోటకు రాణిని. గ్రానీ మంచి చెడ్డా చూస్తూ వుంటాను. క్రితం నెల చాలా జబ్బుచేసింది. బతుకుతుంది అనుకోలేదు. నీ కోసం ఎంతగా కలవరించిందో. ఫోను చేస్తాను నంబర్ ఇవ్వమంటే ఇస్తేనా.. నేను ఊరుకుంటానా.. ఇల్లంతా తిరగేసి తెలుసుకుని ఫోను చేస్తే పని అమ్మాయి నువ్వు లేవని చెప్పింది..” అంటూ గల గలా మాట్లాడింది.
“అబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకు పారిజాతా? నీ నోరు క్షణం మూతపడదు కదా!” అంటూ చంద్రమతి అడ్డుకుంది.
“నువ్వు చెప్పవు. నన్ను చెప్పనీయవు. ఈ ఇంటిమీద లోను ఇంకా తీరలేదు. మొన్న పంచాయితీలో వార్నింగ్ ఇచ్చారు. డబ్బు కట్టకపోతే నర్సరీని స్వాధీనం చేసుకుంటామని. కోవిడ్ వచ్చినపుడు చాలా నష్టపోయింది. ఒక్కరోజన్నా వచ్చి చూశావా? ఏమి మనవడివి.. నిజంగా బంధువా కాదా?” అంటూ చీవాట్లు పెట్టింది.
“సారీ పారిజాత. తప్పంతా నాది. కోవిడ్ టైమ్లో నన్ను వేరే దేశానికి పంపించారు మా ఆఫీసువాళ్ళు. మా స్నేహితుడిని పంపించాను గ్రానీ దగ్గిరకు.”
“ఆఁ.. వచ్చాడులే నీ స్నేహితుడు. ఒంటి స్తంభం మేడలో గ్రానీని కూర్చోబెట్టేడు. ఏడాదిపాటు మాకు ఇద్దరు కనిపించనే లేదు” అంది పారిజాత.
“ఊరుకోవే తల్లి. ఇప్పుడు అంతా బాగున్నాంగా! నువ్వు ఇల్లంతా సర్దు. కూరగాయలు కోసి వండి తీసుకురా. అన్నట్టు రోహన్కి బెడ్రూములో దోమతెర కట్టాలి. తెచ్చేవా?”
“ఇవన్నీ చేయడానికి నేను నీ కోడలినా? రోహన్తో పెళ్లి చేస్తాను అంటే అలాగే నువ్వు చెప్పినట్టు చేస్తాను” అంది కొంటెగా.
“ఆ ఇంతోటి పనిమంతురాలివి చదువుకున్నదానివి దొరకవని! ఈ పల్లెటూరి మేళాన్ని బంగారంలాంటి మనవడికి కట్టబెడతాను. వాడికి పెళ్లి అయిపోయింది. రేపో మాపో కూతురు పుడుతుంది.”
కళ్ళు తుడుచుకుంది పారిజాత.
‘పిచ్చిదానా! పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావ్. బంధాలు అంటూ లేకుండా పెరిగావ్. నాకు నువ్వు నీకు నేను తోడు అయ్యాము. ముందు రోజులు ఎలా గడుస్తాయి నీకు…’ అనుకుంది చంద్రమతి.
అలా సందడిగా రోజులు గడిచిపోతున్నాయి. నర్సరీ పచ్చగా కళకళలాడింది. ఇంటిమీద లోను తీర్చేసి గ్రానీ భారం తీర్చేసాడు రోహన్.
మధుకి ఆడబిడ్డ పుట్టింది. గ్రానీకి వీడియోలు చూపించాడు.
“ఎప్పుడు వస్తావ్? అక్కడే ఉండిపోతావా ఏం?” అంది మధు.
“నిజమే నాకు ఇక్కడే బాగుంది. రావాలనిపించడంలేదు” అన్నాడు రోహన్.
“అయితే నేను బేబీని తీసుకుని వస్తాను.” అంది మధు.
నిజంగా వస్తే బాగుండును అనుకున్నాడు.
పారిజాతకి అనుమానం వచ్చింది. మధు, రోహన్ విడిపోయారా? అని.
చంద్రమతి ఒకరోజు పూలబొకే కడుతూ చెట్లమధ్య తిరుగుతోంది.
పారిజాత వెదుక్కుంటూ వెళ్లేసరికి నేలమీద పడిపోయి ఉంది. “రోహన్” అంటూ కేకపెట్టింది.
హాస్పిటల్లో చేర్పించారు..అదే సమయానికి మధూ బేబీని తీసుకుని వచ్చింది.
“గ్రానీ ఇదిగో నీ మునిమనుమరాలు, బుల్లి చంద్రరేఖ వచ్చింది. చూడు” అంటూ చూపించాడు రోహన్.
మెల్లగా మగతలోవున్న చంద్రమతి కళ్ళు తెరచి చూసింది. ఆమె పెదవులపై చిరునవ్వు వెలిసింది.
“సమయానికి వచ్చాను. లేకుంటే చాలా బాధ కలిగేది” అంది మధు.
“పారిజాతా! ఈ ఇల్లు నర్సరీ నీ పేరున రాసింది గ్రానీ. నువ్వే అందుకు అర్హురాలివి..” అంటూ పేపర్స్ ఇచ్చాడు రోహన్.
“అప్పుడప్పుడు ఈ వూరు వస్తూవుండు రోహన్” అంది కన్నీళ్లతో పారిజాత.
“నేను చంద్ర కూడా వస్తాం పారిజాత! మాట ఇస్తున్నాను” అంది మధూ మనస్ఫూర్తిగా .
కన్నీటి మసకలో, దూరం అవుతున్న వాళ్ళని కనుచూపు మేరకు చూస్తూ ఉండిపోయింది పారిజాత.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లు గారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంథకర్త. వారు రాసిన ‘మహర్షుల చరిత్ర’ టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథ వారి ‘ఏకవీర’, శరత్ బాబు, ప్రేమ్చంద్, తిలక్, భారతి మాసపత్రిక, నాన్నగారు రాసిన వ్యాసాలు ప్రింట్ అయిన తెలుగు-ఇంగ్లీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్న ‘ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ’ కి వచ్చే పిల్లల పత్రికలూ, వార మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటైంది. పెళ్ళయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపులతో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చాయి. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమ సంస్థలో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే వెళ్ళి వస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, శాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనే వున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్టులలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.