[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘అందమైన పద్మవ్యూహం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఎప్పటి రమ
నాడు వయసు పదహారు
అందం జలతారు
చూసిన గుండెలు బేజారు
అసలు ముద్ద బంతి పువ్వులా ఉండేది కదా
ఆ పరువం పదనిసలు పలికేది కదా
ఎదలో బాధను పెంచేసి
చేదు మందు తాగించేసేది
కనిపిస్తే చాలు కనక వర్షమే
ఆమెను చూసేందుకు ఎంతటి నిరీక్షణ
చదువు పక్కన పడేసి మరీ
ఆమె కోసం పడిగాపులు
అలా ఎన్ని కరిగాయో రేపులు.. మాపులు
అర్ధరాత్రి ఒక్కసారిగా లేచి
ఉలిక్కిపడిన వేళ
నిజానికి కలలో రమ కనిపించి
కనీసం పలకరించకుండా వెళ్ళిపోతున్నాదన్న బెంగ
అంతటా పరధ్యానం
అన్నిటా ఆమే ద్యానం
ఆమె మాత్రం అన్ని మరచి
వూరినే విడిచి
ఎక్కడికో ఎగిరిపోయిందిగా
ఎంత వగచినా
మరెంత కుమిలినా
కనిపించలేదుగా
కాలండర్ లో ఏళ్ళు
అలా గిర గిరా తిరిగేసి
దశాబ్దాలు మేసేసి
బతుకులు సైతం మాసిన చోట
ఇన్నాళ్ళకు మళ్లీ అమే కనిపించింది
అమెలో ఓ పెద్దరికం
ముత్తైదువతనం
ధైర్యం చేసి పలకరించా
నేనెవరో చెప్పా
తన గురించీ చెప్పా
గుర్తు లేదంది
అహా అలాగునా అని నవ్వేసి
వస్తాను అని వెళ్ళిపోయింది
నే స్థాణువునైనా
ఆ పదహారు ప్రాయం
అందమైన పద్మవ్యూహం
అంతా అభిమన్యులే
అందరూ పరాజితులే
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్నారు.