Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అనంతం

“సృష్టిలో అనంతమైన శక్తి దాగి ఉంది, మనం ఏది కోరుకుంటే అది మనకు అందుతుంది, దాన్ని సంకల్ప శక్తి అంటారు, అందుకే మనం మంచి సంకల్పం చేసుకోవాలి, యోగనిద్ర సాధన చేస్తే ఎక్కువ గంటలు అది సాధ్యమవుతుంది, మన ఆలోచనలు మనం ఏ వ్యక్తి గురించి అనుకున్నామో ఆ వ్యక్తికి అందుతాయి ఆ వ్యక్తి ప్రతిస్పందన మనకు అందుతుంది. యోగనిద్రలో సూక్ష్మ శరీరం మనం ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నామో అక్కడికి వెళ్లి మనం చేయాలి అనుకున్న పని చేసి వస్తుంది” అన్నారు స్వామీజీ శిష్యులతో. “మన కలలో జరిగినట్టుగా కానీ అది కల, బ్రాంతి, ఇది నిజం” అన్నారు.

వివేక్ ఆలోచనలో పడ్డాడు. యోగనిద్ర బాగా సాధన చేసి హిమాలయాల దర్శనం చేసుకుని అక్కడే ధ్యానం చేసుకుని ప్రపంచశాంతి కోరుకోవాలని నిశ్చయించుకున్నాడు .

అసంతృప్తి, అలజడి తగ్గి ప్రపంచమంతా శాంతిగా, ధర్మంగా ఉండాలని మౌంట్ అబూలో ఓం శాంతి వారి స్వర్గధామంలా వుండాలని అమ్మమ్మ చెప్పేది, అలా ప్రపంచమంతా ఉండాలని అనేది.

హిమాలయాలు చూడాలి, పుష్కరాల సమయంలో వచ్చే అఘోరాలు మామూలు సమయంలో కనబడరు, వారంతా హిమాలయాల్లో సూక్ష్మ శరీరాలతో ధ్యానం చేస్తూ ఉంటారని, నిజంగా అద్భుతం వారి శక్తి అని అబ్బురపడ్డాడు. ఇప్పుడు ఈ యోగానంద గురువు గారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు మెలకువలు నేర్చుకుంటూ, నియమాలతో సాధనచేసి సూక్ష్మ శరీరంతో కాశ్మీర్ వైష్ణోదేవి గుడి చూసి వచ్చాడు గురువు గారి ఆశీస్సులతో .

“వివేక్, నువ్వు కారణజన్ముడవు, అందుకే నా పరిచయం కలిగింది. నువ్వు సాధనతో ఎన్నో చేయగలవు. మరింత శ్రద్ధగా చేసి నీ కోరికలు సిద్ధింప చేసుకో” అని ఆశీర్వదించారు, గురువుగారు ఏకాంతంలో.

వివేక్ ఆనందపడ్డాడు. “స్వామి మీ ఆశీస్సులతో నాకు హిమాలయ దర్శనం, ప్రపంచశాంతి కోసం నా ధ్యానం వినియోగ పడాలని దీవించండి” అన్నాడు గురువుగారికి పాదాభివందనం చేసి.

“వివేక్ హిమాలయాలు సందర్శించి రా, అక్కడ పూర్తి గా ఉండటానికి మరింత తీవ్రమైన సాధన కావాలి. సూక్ష్మశరీరంతో కాక పూర్తి శరీరంతో వెళ్లి ఇక అక్కడే ఉండిపోవలసి వస్తుంది. కొన్ని వందల సంవత్సరాల పాటు, నీ ధ్యాన శక్తితో కొంత లోకకల్యాణం జరగాల్సి ఉంది. దానికి ఇంకా కొన్ని సంవత్సరాలు నువ్వు సాధన చేయాల్సింది వుంది” అన్నారు.

“అంతా మీ ఆశీర్వాద బలం” అని వినయంగా నమస్కరించి, “లోకకల్యాణం కోసం నా జన్మ ఉపయోగపడుతుందంటే అంతకుమించిన భాగ్యం ఏమి ఉంటుంది స్వామి?” అన్నాడు.

“వివేకా మన పూర్వీకులు చాలా తెలివైన వారు, వారికి తెలిసిన ప్రాణాయామం, ధ్యానం, యోగ నిద్ర, వీటి ద్వారా అద్భుతాలు చేయవచ్చు” అన్నారు గురువుగారు.

“స్వామి ఇన్ని కల్లోలాలు, ప్రకృతి వైపరీత్యాలు, మారణహోమాలు, మనం ఆపలేమా?” అడిగాడు.

“వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అనలేదు మన పెద్దలు. చెరపకురా చెడేవు అన్నారు. అయినా మనిషిలో స్వార్థం విపరీతంగా పెరిగిపోయింది, చెడు హద్దులు దాటింది, హింస విపరీతంగా పెరిగిపోయింది.

ప్రకృతి విపత్తులతో సగం, మనిషి చేసే మారణ హోమాలతో సగం మరణిస్తున్నారు, అలా ప్రకృతి పాపులను శిక్షిస్తుంది, మంచివారిని ఏ విపత్తు అంటదు, అది ఎంత కలికాలం అయినా. వారి ధర్మం వారిని కాపాడుతుంది. అదే మన ధర్మో రక్షతి రక్షితః అని. అందరిలో మంచితనం పెరిగి ప్రపంచ శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ నీ సాధన కొనసాగించు, శుభం” అన్నారు, గురువుగారు.

Exit mobile version