[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘ముఝె జీనే దో’ (Mujhe Jeene Do, 1963) చిత్రం లోని ‘తేరె బచ్పన్ కో జవానీ కీ దువా’. గానం లతా మంగేష్కర్. సంగీతం జయదేవ్.
~
సాహిర్ ప్రతిభకు, అతనిలోని మానవీయ కోణానికి గొప్ప నిదర్శనంగా నిలిచే మరో పాట ‘ముఝే జీనే దో’ సినిమాలో వస్తుంది. ఈ సినిమాలో పాటలన్నీ సాహిర్ రాసారు. ప్రతి పాటా ఓ ప్రయోగమే. అన్ని పాటలలోనూ భాషాపరంగానూ, శైలిలోను, పాట నిర్మాణం లోనూ ఎవరూ ఊహించని ప్రయోగాలు చేసారు.
ఇప్పుడు మనం చర్చించుకోబోయే పాట ‘తేరే బచ్పన్ కో జవానీకీ దువా దేతీ హూ’ అనే ఓ జోల పాట. కొన్ని పాటలు పాపులర్ పాటలలో వినిపించవు. ఎప్పుడో ఒకప్పుడు అనుకోకుండా అవి వినే అవకాశం కలిగితే అవి మనసులో కలిగించే ప్రకంపనలు తట్టుకోవడం కష్టం. ఇలాంటి పాటలను ప్రజలు ఎక్కువగా వినలేకపోవడానికి కారణం వాటిలోని కఠిన వాస్తవాలను, అందులోని అత్యంత విషాద స్థితి జీర్ణించుకోవడం కష్టం. కాని సామాజిక బాధ్యత కల కవి ప్రేమ, ప్రకృతి దగ్గరే ఆగిపోడు. ఈ కఠిన వాస్తవాలను అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ సామన్యుల దరికి చేరుస్తాడు. ఎవరో అన్నట్లు జ్ఞానమూ దంతమూ వచ్చేటప్పుడు చాలా బాధపెడతాయి. కాని ఆ బాధ అవసరం. అది లేకపోతే మనిషి జీవితంలో ఎన్నో అనుభవాలకు దూరం అవుతాడు. సాహిర్ అందుకే తన పాటల ద్వారా ఆ నొప్పిని శ్రోతలకు అందించడానికి వెనుకాడలేదు. ఎందరు కవులు ఎన్ని వేల పాటలు రాసినా, వ్యక్తిగతంగా సాహిర్ని ఎంత మంది ద్వేషించినా ఆయన కలానికున్న పదును, ఆయన మేధాశక్తి, రచన పట్ల ఆయన నిజాయితీ ముందు ఎవరూ నిలవలేరు. సిని గీతాలలో సాహిర్ ఓ మహోన్నత శిఖరం. దాన్ని అందుకునే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోవడమే సాహిర్ నిర్మించుకున్న శైలి ఎంత కష్టమైనదో స్పష్టం చేస్తుంది.
జీవితంలో మనుషులు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తారు. కొంత వయసు వచ్చి, వారికి పిల్లలు పుట్టిన తరువాత ఆ తప్పులు ఆ పిల్లల భవిష్యత్తుకి చేటు అన్నది వారికి అర్థం అయినప్పుడు పశ్చాత్తాపం కలిగి వారి మనసులను నలిపేస్తుంది. ఆ స్థితిని సాహిర్ ఎంత గొప్పగా వర్ణించారంటే అది విన్న వారి మనసులు విషాదంతో వేదనాభరితమవుతాయి. కొందరు పరిస్థితులకు తలవంచి తప్పులు చేస్తే మరి కొందరు పొగరుతో అహంకారంతో తప్పులు చేస్తూ పోతారు. ఈ తప్పులు వాళ్ల పిల్లలకు శిక్షలవుతాయి అన్నది కొందరు ఊహించలేరు. అలాంటి స్థితి ఎదురయినప్పుడు జీవితం ఎంత విషాదంగా ఉంటుందో ఆ పశ్చాత్తాపం ఎంత కంటకప్రాయం అవుతుందో ఈ పాట వింటే అర్థం అవుతుంది. అందుకే ఇది ఎక్కువ మంది వినలేరు. సాహిర్ ఇందులో ప్రతి పదాన్ని ఎంతో జాగ్రత్తగా కూర్చారు. వాటిని విన్న ఎవరూ ఈ పాటలోని భావాన్ని, అది రేకెత్తించే ప్రశ్నలను వ్యతిరేకించలేరు.
సినిమాలో హీరో ఓ బందిపోటు. అతను ఓ తవాయిఫ్ను వివాహం చేసుకుంటాడు. అంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా నైతికంగా దారితప్పిన వాళ్ళే. వీరికి ఓ బిడ్డ. ఆ బిడ్డ ఇంకా పొత్తిళ్లలోనే ఉన్నాడు. ఆ బిడ్డ భవిష్యత్తు పట్ల వారిద్దరిలోనూ భయం కలుగుతుంది. తమ గతం ఆ బిడ్డ భవిష్యత్తుకు ఆటంకం అని వాళ్లకు తెలుసు. ఆ బిడ్డను ఎలా కాపాడుకోవాలి? ఈ సమాజంలో తమ గతాన్ని కప్పి ఎలా జీవించాలి. తమ గతం నీడ ఆ బిడ్డ మీడ పడకుండా తామేం చేయాలి అన్నది వాళ్ళ కున్న సమస్య. ఆ సందర్భంలో ఆ తల్లి పాడే జోల పాట ఇది.
తేరె బచ్పన్ కో జవానీ కీ దువా దేతీ హూ (2)
ఔర్ దువా దేకె పరేషాన్ సీ హో జాతీ హూ
(నీ బాల్యం ఎదిగి యవ్వనంగా రూపాంతరం చెందాలని ఆశీర్వదిస్తున్నాను/ప్రార్ధిస్తున్నాను . ఆశీర్వదించి /ప్రార్థన చేసి ఆందోళన పడుతున్నాను)
ఈ పల్లవి విన్న ప్రతి సారి సాహిర్ మేధకు తలవంచాలి అనిపిస్తుంది నాకు. ఆ తల్లి అందరి మాతృమూర్తుల లాగే బిడ్డ పెరిగి పెద్దవ్వాలని, ఆ పొత్తిళ్లలో ఉన్న బాబు యువకుడిగా ఎదగాలని కోరుకుంది. కాని ఆ కోరిక కోరినందుకు కూడా ఆందోళన చెందుతుంది. ఎందుకంటే పసిగుడ్డుగా ఉన్నంతకాలం ఆ బిడ్డను ఆమె కాపాడుకోగలదు. కాని అతనే యువకుడిగా ప్రపంచంలోకి వెళ్ళాక తల్లి తండ్రుల గతం అతన్ని వెంటాడకపోదు. ప్రపంచం దానికి అతన్ని శిక్షించకుండానూ ఉండదు. బిడ్డ ఎదగాలని కోరుకోవడానికి భయపడే స్థితిలో ఆ తల్లి ఉంది. ఇంత కన్నా నరకం ఏ తల్లి అనుభవిస్తుంది? సాహిర్ అత్యంత విషాదాన్ని ఆ రెండు వాక్యాలలోకి కుదించి పాట రాయగలడం నాకైతే అత్యద్భుతంగా అనిపిస్తుంది. బిడ్డ ఎదగాలి అని కోరుకోవడం తల్లి ప్రేమ. కాని తమ చేతలు ఆ బిడ్డ భవిష్యత్తుకి పరీక్షలవుతాయన్న భయం, పశ్చాత్తాపం ఆమెలో.. ‘బచ్పన్ కొ జవానీకి దువా దేతాహూ’ అన్నది గమ్మత్తయిన కానీ ఈ సందర్భంలో హృదయవిదారకమయిన పద ప్రయోగం. పిల్ల వాడి బాల్యం ఎదిగి యవ్వనం అనుభవించాలని ఆశీర్వదిస్తున్నది తల్లి. ప్రార్ధిస్తున్నది తల్లి. ఎందుకంటే, ఆ పిల్లవాడి తండ్రి బందిపోటు దొంగ. ఏ క్షణంలో పోలీసులు దాడి చేసి చంపుతారో తెలియదు. ఆ దాడిలో తండ్రి మాత్రమే కాదు, కొడుకు కూడా బ్రతికి బట్టకట్టటం కష్టం. అందుకని అతని బాల్యం యవ్వనం వరకూ సజీవంగా నిలవాలని తల్లి ప్రార్ధిస్తున్నది. ఈ పాట వినగానే, శ్రీలంక ఆర్మీ చుట్టుముట్టి వుండగా, మరు క్షణంలో తన ప్రాణాలు పోతాయని తెలియని ప్రభాకరన్ కొడుకు అమాయకంగా బిస్కెట్ తింటూన్న చిత్రం కళ్ళముందు నిలుస్తుంది. బహుషా అతని తల్లి కూడా తన కొడుకు గురించి ఈ పాటే పాడుకున్నదేమో అన్న ఆలోచన కలుగుతుంది. అలా ఎంతమంది తల్లులు ఎన్నెన్ని యుగాలుగా ఈ పాటను పాడుతూ రోదించారో అనిపిస్తుంది. పాట సినిమా పాట స్థాయిని దాటి ఎదుగుతుంది.
మేరె మున్నే మేరె గుల్జార్ కె నన్హే పౌధే
తుఝ్కొ హాలాత్ కీ ఆంధీ సె బచానే కె లియే
ఆజ్ మై ప్యార్ కె ఆంచల్ మె ఛుపా లేతీ హూ
కల్ యె కమ్జోర్ సహారా భీ న హాసిల్ హోగా (2)
కల్ తుఝే కాంటోం భరీ రాహ్ పె చల్నాహోగా
జిందగానీ కీ కడీ ధూప్ మే జల్నా హోగా
తేరే బచ్పన్ కో జవానీ కీ దువా దేతీ హూ
ఔర్ దువా దేకె పరేషాన్ సీ హో జాతీ హూ
(నా కన్నా, నా గులాబీ తోటలోని ఓ చిన్న మొక్కా, నిన్ను పరిస్థితుల తుఫానుల నుండి రక్షించుకోవడానికి ఈ రోజు నేను ప్రేమతో నిన్ను నా కొంగులో దాచిపెట్టుకుంటాను. కాని రేపు నా బలహీనమైన ఆసరా కూడా నీకు ఉండబోదు. నువ్వు ముళ్ళబాటలో రేపు నడవాల్సి వస్తుంది. జీవితపు మండుటెండలో కాలిపోవలసి వస్తుంది. అందుకే నీ బాల్యానికి యవ్వనం చేకూరాలని ప్రార్థిస్తూనే ఆందోళన పడుతున్నాను)
మొదటి వాక్యం గమనించండి. ఆ బిడ్డను ప్రేమగా కన్నా అంటూ, నా గులాబి తోటలో ఓ చిన్న మొక్కా అని సంబోధిస్తుంది ఆ తల్లి. ఆమె ఇప్పుడు ప్రేమగా చూసుకునే భర్తతో ఆనందంగా ఉంది. ఒక స్త్రీగా ఆమెకు కోరుకున్న ప్రేమ దొరికింది. ఆమె ప్రస్తుత జీవితం గులాబి తోటలాగే పరిమళిస్తుంది. అందులో ఓ చిన్న మొక్క ఆ బిడ్డ. కాని తన గతం ఆ బిడ్డకు కష్టతరం కాబోతుంది అని ఆమెకు తెలుసు. తన జీవితంలో దొరికిన ప్రేమ గుబాళింపుల మధ్య కూడా ఆమె బిడ్డ భవిష్యత్తు కోసం కలవరపడుతుంది. సాహిర్ ఎన్నో సందర్భాలలో జీవితంలో ప్రేమ ఒక్కటే చాలదు అని చెప్పారు. ఎన్నో పాటలలో ఆయన ఈ విషయం ప్రస్తావించారు. ఇక్కడ కూడా ఆయన అదే భావాన్ని ప్రకటిస్తున్నారు. ఆమె జీవితం గులాబీ తోటే ప్రస్తుతం అయినా అమెలో అభద్రత పొంచే ఉంది. కారణం ఆమె గతం. పరిస్థితుల ప్రభావంతో చెడు దారి పట్టిన వారి సంగతి పక్కనపెడదాం. అహంకారంతో చెడు మర్గాన నడిచే వాళ్ళు ఒక్క క్షణం ఆలోచించాలి. గులాబీ తోట మధ్య కూడా పొంచి ఉండే ఆ అభద్రతా భావం మీకు కూడా అనుభవం అయితే? ఆలోచించండి.. సాహిర్ ‘గుల్జార్ కే నన్హే పౌధే’ అని ఇక్కడ ప్రాస కోసం రాయలేదు. దాని వెనుక జీవితానుభవం ఉంది. లోతు ఉంది. జీవితం పట్ల సమాజం పట్ల అవగాహన ఉంది.
ఇప్పుడు నిన్ను ప్రేమగా కొంగు చాటున దాచుకోగలను కాని కొన్నాళ్ళకు నా చేతులూ బలహీనమవుతాయి. ఈ ప్రపంచాన్ని నువ్వు ఒంటరిగా ఎదుర్కోవాలి. అది నీ తరం అవుతుందా? నీ భవిష్యత్తు ముళ్ళ బాట అవుతుంది. మండుటెండలో నీది ఒంటరి ప్రయాణం అవుతుంది. అందుకే నీకు సంపూర్ణ జీవితం, పరిపూర్ణమైన యవ్వనం దైవం ప్రసాదించాలని కోరుకుంటూ కూడా ఆందోళన పడుతున్నాను అని ఆ తల్లి ఎంతో వేదనతో బిడ్డ భవిష్యత్తు గురించి తన కున్న భయాన్ని ఆ జోల పాటలో ప్రస్తావిస్తుంది.
తేరె మాథె పె షరాఫత్ కీ కొయీ మొహర్ నహీ
చంద్ బోసే హై మొహబ్బత్ కె సొ వో భీ క్యా హై
ముఝ్సీ మావో కీ మొహబ్బత్ కా కోయీ మోల్ నహీ (2)
మెరె మాసూమ్ ఫరిష్తే తూ అభీ క్యా జానే
తుఝ్కొ కిస్ కిస్కె గునాహో కీ సజా మిల్నీ హై
దీన్ ఔర్ ధర్మ్ కె మారే హుయె ఇంసానో కీ
జొ నజర్ మిల్నీ హై తుఝ్కో వొ ఖఫా మిల్నీ హై
తేరే బచ్పన్ కో జవానీ కీ దువా దేతీ హూ (2)
ఔర్ దువా దేకె పరేషాన్ సీ హో జాతీ హూ
(నీ నుదుటిన మర్యాద అనే గుర్తింపు లేదు. కొన్ని ప్రేమతో నిండిన ముద్దులు ఉన్నాయి కాని అవెంతని? నా లాంటి తల్లుల ప్రేమకు ఇక్కడ విలువ లేదు. నా అమాయక దేవదూతా నీకిప్పుడు ఎలా తెలుస్తుంది ఎవరెవరి తప్పులకు నీకు శిక్ష పడబోతుందో. మతం, ధర్మం ప్రాతిపదికన జీవించే మనుషులతో నువ్వు కళ్లు కలపవలసి వచ్చినప్పుడు వాళ్ల కోపాన్ని నువ్వు ఎదుర్కోవాలి. అందుకే నీ బాల్యానికి యవ్వనం చేకూరాలని ప్రార్థిస్తూ కూడా దానికి ఆందోళన పడుతున్నాను)
ఆ బిడ్డకు మర్యాద అనే రక్షణ కవచం ఆ తల్లి తండ్రులు ఇవ్వలేకపోయారు. ఈ వాక్యాన్ని సాహిర్ ఎంత గొప్పగా రాసారో గమనించండి. ప్రపంచంలో తల్లి తండ్రుల మంచి, మర్యాద పిల్లలకు కవచంలా ఉపయోగపడతాయి. వారికి మేలు చేయకపోయినా ఆ కవచం వారిని కొన్ని ఆపదల నుండి రక్షిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవలసిన విషయం. జీవితంలో మనిషి జాగురూకతతో వ్యవహరించాలి. ఎందుకంటే జీవితం ఒక్కరితో అంతం కాదు. ఆ పర్యవసనాలు తరువాతి తరాలకు పాకుతాయి. ఇది ప్రకృతి నియమం. సమాజాన్ని మనిషి ఎదిరించాలి ప్రశ్నించాలి కాని మర్యాద మరచి ప్రవర్తించకూడదు. ఎందుకంటె మనం చేసేవి మన పిల్లలు అనుభవించాలి కాబట్టి.
ఆ బిడ్డకు మర్యాద అనే కవచం లేదు. నుదుటిన తల్లి ఆశీర్వదించి పెట్టిన ముద్దులు మాత్రమే ఉన్నాయి. అంటే ఆ బిడ్డ అనాథ కాదు. తల్లి తండ్రుల ప్రేమతో పెరుగుతున్న వాడే. కాని దారి తప్పి జీవించిందని ముద్రపడిన ఆ తల్లి ప్రేమకు విలువ ఎంతని? ఆ చంటి బిడ్డ ఓ దేవదూతే ఆ తల్లికి. కాని ఇప్పుడు పొత్తిళ్ళలో ఉన్న ఆ బిడ్డకు తన భవిష్యత్తు గురించి ఏం తెలుసని? రాబోయే రోజుల్లో మతం, ధర్మం సూత్రాలతో బతికిన మనుషులను ఈ బిడ్డ ఎలా ఎదుర్కోగలడు. వాళ్ల కళ్ళల్లో ఈ బిడ్డ పట్ల అసహ్యం కోపం నిండి ఉంటాయి. వాటిని ఈ బిడ్డ ఎలా ఎదుర్కోగలడు. ఇది ఆ తల్లి మనసులోని భయం. అందుకే బిడ్డ యవ్వనాన్ని తలచుకుని ఆమె అందరి తల్లుల్లా సంతోషపడలేకపోతుంది. అలాంటి ముళ్ళ బాట బిడ్డకు పరచడంలో తన పాత్ర కూడా ఉందని ఆమె పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది.
బేడియా లేకె లపక్తా హువా కానూన్ కా హాథ్
బేడియా లేకె
బేడియా లేకే లపక్తా హువా కానూన్ కా హాథ్
తేరే మా బాప్ సె జబ్ తుఝ్కో మిలీ యే సౌగాత్
కౌన్ లాయేగా తేరే వాస్తే ఖుషియో కీ బారాత్ (2)
మేరే బచ్చె తేరే అంజాం సె జీ డర్తా హై
తెరీ దుష్మన్ హీ న సాబిత్ హో జవానీ తేరీ
కాంప్ జాతీ హై జిసే సోచ్కే మమ్తా మేరీ
ఉసీ అంజాం కొ పహుంచే న కహానీ తేరీ
తేరే బచ్పన్ కో జవానీ కీ దువా దేతీ హూ
ఔర్ దువా దేకె పరేషాన్ సీ హో జాతీ హూ(2)
(సంకెళ్ళతో పట్టుకోవడానికి వస్తున్న చట్టం చేయి, నీ తల్లి తండ్రుల నుండి నీకు దొరికిన కానుక. ఎవరు నీ కోసం సంతోషపు ఊరేగింపు తీసుకొస్తారు? నాన్నా నీ జీవితపు పరిణామం గురించి నా మనసు భయపడుతోంది. నీ యవ్వనమే నీ శత్రువు కాబోతుందని భయంగా ఉంది. నా తల్లి ప్రేమ నీ గురించి ఆలోచనలతో ఎలాంటి భయాలు నింపుకుని వణికిపోతుందో ఆ దిశగా నీ జీవితం మళ్ళకూడదు. అందుకే నీ బాల్యానికి యవ్వనం చేకూరాలని ప్రార్థిస్తూ కూడా నేను ఆందోళన పడుతున్నాను)
ఆ బందిపోటు అయిన భర్త కోసం చట్టం వెతుకుతుంది. సంకెళ్ళతో వాళ్ళవైపు చట్టం చేయి క్రమంగా సాగుతుంది. ఆ చేయి ఈ బిడ్డను కూడా తాకకుండా ఉండదు. అలాంటి గతం ఉన్న అ బిడ్డ జీవితంలో సంతోషం వస్తుందా? తల్లి తండ్రులే అతనికి ముళ్లబాటను పరిచి ఉంచితే ఆ బిడ్డ జీవితంలోకి సంతోషాన్ని ఎవరు మోసుకు వస్తారు? ఆ బిడ్డ యవ్వనం అతని శత్రువుగా మారబోతుందని ఆ తల్లి బాధ. ఎలాంటి ఆలోచనలతో ఆమె మనసు వణికిపోతుందే అటువైపు తన బిడ్డ జీవితం సాగకూడదని, ఆ తల్లి కోరుకుంటుంది. కాని దాన్ని ఆపగల శక్తి ఆమెకు లేదు. అందుకే బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని కోరుకుంటూనే బిడ్డ జీవితం, భవిష్యత్తు గురించి ఆమె ఆందోళన పడుతుంది.
ఇలాంటి పాట సినీ సాహిత్యంలో మరొకటి ఉందా.. శ్రోతలు చెప్పాలి.. బిడ్డ జీవితం గురించి బాధ పడే మాతృత్వపు వేదనను సాహిర్ సందర్భం వచ్చినప్పుడల్లా పాటలుగా రాసారు. ఆయన గీతాలలో తల్లి ఎంతో బాధ్యతగా కనిపిస్తుంది. మాతృత్వం గురించి ఎంతో గొప్పగా రాసిన కవులు ఉన్నారు. కాని స్త్రీ జీవితంలో ఎదుర్కునే దోపిడి వివక్షల మధ్య మాతృత్వం ఆ స్త్రీలో ఎంతో భయాన్ని కూడా నింపుతుంది. ఈ ప్రపంచంలో సుఖం కన్నా దుఃఖం ఎక్కువ. సంఘర్షణ మరీ ఎక్కువ. దాన్ని ఎదుర్కునే స్థాయిలో బిడ్డలు ఉండాలంటే తల్లి తండ్రులు అత్యంత బాధ్యతగా వ్యవహరించాలి. అది సాధ్యపడనప్పుడు ఆ మాతృత్వం తల్లడిల్లుతుంది. అలాంటి స్థితిలో ఉన్న తల్లి మనసును ఇంత సున్నితంగా ఇంత గొప్పగా వర్ణించి చెప్పగల కవి నాకు మరొకరు కనిపించలేదు. అందుకే సాహిర్ అంటే నాకు గౌరవం. ఎలాంటి మానవ అనుభవాలను అనుభూతులను తన పాటల్లో బహిర్గతం చేసారో అర్థం చేసుకుంటే ఆయనను ఆరాధించకుండా ఉండలేం.
సాహిర్ లుధియాన్వి రాసిన ఈ పాటను లత అంతే గొప్పగా గానం చేసారు. సాహిర్ తన పాటలలో ఓ నాలుగు లైన్ల పల్లవి, నాలుగు లైన్ల చరణం లాంటి సూత్రాలను చాలా సార్లు అతిక్రమించారు. చెప్పాలనుకున్నదాన్ని తనకొక శైలి నిర్మించుకుని చెప్పుకుంటూ వెళ్లారు. అప్పుడే ఆ చరణం ఆయనకు సంతృప్తిని ఇచ్చేది. ఈ పాటలో పల్లవి రెండు వాక్యాలయితే, చరణం ఓ కవితలా సాగుతుంది. ఇలాంటి ప్రయోగాలు సాహిర్ తన పాటల్లో చాలా చోట్ల చేస్తారు.
ఈ పాటకు సంగీతాన్ని కూర్చిన జయదేవ్ని మర్చిపోకూడదు. వీళ్లిద్దరూ ఒక్కప్పుడు మంచి మిత్రులు, తరువాత గొడవపడ్డారు. కాని సాహిర్ పాటలకు జయదేవ్ సంగీతం గొప్పగా కుదిరేది. సాహిర్ చాలా సందర్భాలలో స్నేహితుల దగ్గర అసహనాన్ని ప్రదర్శించేవారు. చాలా సార్లు ఇంటికి పిలిచి వారితో సమయం గడిపి మళ్ళీ కోపంతో వారిని ఇంటి నుండి గెంటేయించేవారట. ఆయనలోని విపరీతమైన ఆత్మాభిమానం చాలా సందర్భాలలో ఇతరులకు కష్టంగా ఉండేది. అయినా సాహిర్ తన పంథాలోనే జీవించారు. అలాగే మరణించారు. సినీ ప్రపంచంలో ఆయనను ఇష్టపడేవారి కన్నా ఆయనకు భయపడేవారి సంఖ్యే ఎక్కువ. కాని కవిగా మాత్రం మిగతా అందరూ ఆయన తరవాతే.
ఈ పాట విన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. హిందీ చిత్ర గీతాలలో కంపోజ్ చేసిన అత్యంత హృదయ విదారకమైన పాటల్లో ఇది ఒకటి అయి ఉండాలి. అందుకే ఇది రేడియోలో కూడా ఎక్కువగా వినిపించదు. కాని ఇష్టపడినా పడకపోయినా ఇది విని తీరవలసిన పాట.
తేరే మా బాప్ సె జబ్ జుఝ్కో మిలీ యే సౌగాత్
కౌన్ లాయేగా తేరే వాస్తే ఖుషియా కీ బారాత్
తల్లి తండ్రులు ఆలోచించండి. మీరే పిల్లలకు ముళ్ళబాట వేస్తే వారి జీవితంలో ఆనందాన్ని ఎవరు మాత్రం తీసుకురాగలరు..
Images Source: Internet
(మళ్ళీ కలుద్దాం)