[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]
అమృత భారతి
భారత స్వాతంత్ర్య రజతోత్సవాల సందర్భంగా 1947 నుండి 1972 సంవత్సరం వరకు – ఈ పాతికేళ్లలో తెలుగు సాహిత్య ప్రస్థానంపై లబ్ద ప్రతిష్ట కవి, పండిత, విమర్శక, పరిశోధకుల చేత వ్యాసాలను సేకరించి ‘మహతి’ ప్రచురణను తీసుకువచ్చింది. అది ఆనాటినుండి ఈనాటి వరకు బృహత్తరమైన అద్భుత గ్రంథంగా సాహితీ ప్రియుల మన్ననలను అందుకొంటూనే ఉంది.
ఈ గ్రంథంలో సుప్రసిద్ధ సామాజిక వేత్త, ‘లోక్ సత్తా’ అధినేత శ్రీ జయప్రకాశ్ నారాయణ గారు కడచిన ఏబదేండ్లలో దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలను విశ్లేషిస్తూ విశిష్టమైన వ్యాసాన్ని అందించారు. సాహిత్య ప్రక్రియలలో భాగంగా, పద్యకవిత ప్రస్థానంపై శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గార్లు, గేయ కవిత్వ ప్రస్థానంపై డా. వడ్డేపల్లి కృష్ణ గారు చక్కని వ్యాసాలను అందించారు. వచన కవిత్వంపై డా. ఎస్ రఘు గారు విస్తారమైన విశ్లేషణతో వివిధ కవితా రీతులను వివరించారు.
కడచిన ఐదు దశాబ్దాలలో పుంఖానుపుంఖాలుగా వెలువడి పాఠకులకు చేరువైన కథలు, నవలల గురించి డా. ముక్తేవి భారతి గారు, శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు బహు విధాంశాలను ప్రస్తావిస్తూ విస్తృతమైన వ్యాసాలను రచించి అందించారు.
ఈ ‘అమృతభారతి’ నేటి తెలుగు సారస్వత విద్యార్థులకు అదునాతనామ్శాల ప్రస్థానాల పరిశోధన, అధ్యయనాలకు పట్టుగొమ్మగానే గాక, రాబోయే తరాల యువతకు, సాహితీ ప్రియులకు అత్యంత ప్రీతి పాత్రమౌతుందని యువభారతి విశ్వాసం.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
https://archive.org/details/amruthabharathi-12.8.2022-1
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోవచ్చు.
శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర.
విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం.
వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.