[శ్రీమతి బి. కళాగోపాల్ రచించిన రచించిన ‘అమ్మ@నా లైఫ్ గురు..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
లోకం వద్దన్న తన గర్భకుహరంలో నేను పెనుగులాడుతున్నప్పుడు
పసరుమందును జయించిన నా పుట్టువడిని
నిర్ణయించిన సృష్టికర్త మా అమ్మ
తండ్రెవరో తెలీని జోగినోల్ల పిల్లని లోకులు ఆడిపోసుకుంటున్నపుడు
నా బుడిబుడి అడుగులను బడివైపు మళ్లించి
హాజరు పుస్తకంల తన పేరు పక్కన
సగర్వంగా నా పేరు ఎక్కించి
అ- అమ్మ అన్న వర్ణమాలను బతుకు పలకలో దిద్దించిన ఆదిగురువు మా అమ్మ
జోలపాట పాడకున్నా చందమామను చూపెట్టకున్నా
నేనున్నానంటూ ఆనెలు గట్టిన మెరటు చేతుల్తో
తలనిమిరిన ఆత్మవిశ్వాసపు దీవనైంది మా అమ్మ
కుండల్లో ధాన్యం నిండుకున్నా గురుగుల్లో కాసులగలగల్లేకున్నా
రాట్నం కండె లెక్క కరిగిపోతూ
చేదుకున్న బాయికాడి కైకిల్లతో
కూరాడికుండలో తేరుకున్న తేటఅంబలోలె
బతుకు దూప తీర్చిన జీవన చలివేంద్రం మా అమ్మ
గాంధీ బొమ్మ దుక్నాంల చేపయిలు గుబులురేపుతున్నా
కట్టాల్సిన ఫీజుల ఆఖరితేదీలు హెచ్చరిస్తున్నా
తన మదిపొరల కదలికలు తెలియనీయని ఒంటి నిట్టాడి గుంజ మా అమ్మ
గుడిశెల కంతలు వెక్కిరిస్తున్నా
షానీపోరీల స్టేఫ్రీలు కొనీయకున్నా
తన కోటిమాసికల చీర బొత్తులో
నా సిగ్గుల తొలినెలసరిని దాచేసిన జిగ్రీ దోస్తుమా అమ్మ
నే కోరిన కలలను సాకారపర్చిన విజయపు కొవ్వొత్తి మా అమ్మ
భుజాల పై మోశిన బిడ్డ గెలుపుకు సంబురపడే
దిగిపోని సూరీడసొంటి మా
అమ్మ ఋణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది
కన్కకీరమ్మ బిడ్డ పెద్ద ఆఫీసరైందని
ఇప్పుడు అందరూ అనుకుంటుంటే పాడుజిష్టి తగలకుండా
కాలిగ్గట్టిన నల్లగొంగడి దారమై మురిశేటి
అతి (అ) సాధారణ మనిషి గాక
మరేమీ గాని అమృతమూర్తి మా అమ్మ..!!
శ్రీమతి బి. కళగోపాల్ గత దశాబ్ద కాలంగా కవితలు కథల్ని రాస్తున్నారు. పుట్టింది నిజామాబాద్ జిల్లాలో. ఎం.ఎ ఇంగ్లీషు, బిఎడ్ చేసిన వీరు ఆంగ్ల సహ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఇంతవరకు వీరివి 450కి పైగా కవితలు వివిధ వార, మాస సాహిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి. కవితా సంపుటి ‘మళ్లీ చిగురించనీ..’ 2015లో 74 కవితలతో ప్రచురించారు. అంతేగాక స్థానిక నిజామాబాద్ రేడియో ఎఫ్.ఎం.లో 20 కథానికలు ప్రసారమయ్యాయి. 25 వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. 50 కథలు వివిధ పత్రికల్లో అచ్చు అయ్యాయి. వాటిల్లో 20 కథలు వివిధ సందర్భాల్లో అవార్డులను పొందాయి. వీరి కవితలు కూడా అనేక సందర్భాల్లో పలు అవార్డులను పొందాయి. రాధేయ, ఎక్స్ రే, భిలాయ్ వాణి, కలహంస, భూమిక, సాహితీకిరణం, ద్వానా, వాల్మీకి, మల్లెతీగ వారి కవితా పురస్కారాలు పొందారు. సోమేపల్లి, వట్టికోట ఆళ్వారు స్వామి, జలదంకి పద్మావతి కథా పురస్కారాలను పొందారు.