Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 288

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

నసీరుద్దీన్ షా రెండు పెళ్ళిళ్ళు:

దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా తొలి వివాహం ఆయనకు 19 ఏళ్ళ వయసులో, తనకన్నా 15 ఏళ్ళు పెద్దదైన పర్వీన్ మురాద్‌తో జరిగిందని చాలామందికి తెలియదు. అయితే నటి రత్నా పాఠక్‌తో జరిగిన పెళ్ళి గురించి అందరికీ తెలుసు. మొదటి భార్యతో విడాకులు, ఆమెకు భరణం చెల్లించడానికి దశాబ్ద కాలం పాటు జరిగిన న్యాయ పోరాటం చేసిన సంగతి ఎక్కువమందికి తెలియదు. ఆయన జీవితంలోని ఈ అంతగా తెలియని అధ్యాయం గురించి, ఆ ప్రముఖ నటుడి తన ప్రస్ధానంలో ఎదుర్కున్న వ్యక్తిగత సవాళ్లను, చేసుకున్న అసాధారణ ఎంపికలను తెలుసుకుందాం.

ఓ పత్రికలో వెల్లడించిన వివరాల ప్రకారం నసీరుద్దీన్ ఆలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో విద్యార్థిగా ఉండగా, తొలిసారి పర్వీన్ మురాద్‌ని కలిసారు. అప్పుడాయన వయసు 19 ఏళ్ళు. 34 ఏళ్ళ పర్వీన్‌కి అప్పటికే పెళ్ళయి పిల్లలున్నారు, భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. వయసు తేడా ఉన్నప్పటికీ, నసీర్ ఇంకా విద్యార్థే అయినప్పటికీ వారు ధైర్యం చేసి 1969లో సాంప్రదాయబద్ధంగా పెళ్ళి చేసుకున్నారు. మరుసటి సంవత్సరం వారికి ‘హీబా’ అనే కుమార్తె జన్మించింది.

వారి వైవాహిక జీవితంలో, చాలా తొందరగా సమస్యలు తలెత్తాయి. ప్రధాన సమస్య, పెళ్ళికి ముందే నసీరుద్దీన్ షా కుటుంబం ఈ వివాహాన్ని వ్యతిరేకించటం. పర్వీన్ విడాకులు తీసుకున్న స్త్రీ, పైగా పిల్లలున్నారు, అందువల్ల నసీరుద్దీన్ కుటుంబంలోని పెద్దలు ఆ పెళ్ళిని వద్దన్నారు. అదే సమయంలో పర్వీన్ కుటుంబ సభ్యులకూ అనేక అనుమానలు ఉండేవాట. ఒకవేళ భవిష్యత్తులో విడిపోతే, భారీ మొత్తంలో భరణం ఇవ్వాలని షరతు పెట్టారట. కాలక్రమంలో ఆ దంపతుల మధ్య విభేదాలు తలెత్తి, అవి విడాకుల వరకూ వెళ్ళాయి.

విడాకులు మంజూరయ్యాకా, తొలుత అంగీకరించిన విధంగా పర్వీన్‌కు పెద్ద మొత్తంలో భరణం చెల్లించాల్సి వచ్చింది. ఈ ఆర్థికపరమైన నిబంధన వల్ల ఆయన ముందుకు వెళ్ళలేకపోయారు. మొత్తం భరణం చెల్లించడానికి ఆయనకి 12 ఏళ్ళు పట్టిందట. ఈ కాలంలో నసీరుద్దీన్ షా నటన కొనసాగించారు. కొన్నేళ్ళకి ‘మాసూమ్’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నుండి లభించిన ఆదాయం – పూర్తి భరణం చెల్లించడానికి వీలు కల్పించింది, చివరికి 12 సంవత్సరాల తర్వాత ఈ అధ్యాయాన్ని ముగించారు.

మొదటి భార్యకు భరణం చెల్లిస్తూనే, 1975లో నాటకాలలో నటించసాగారు నసీరుద్దీన్ షా. రంగస్థలంలో పనిచేస్తున్న సమయంలో రత్న పాఠక్‌ను కలిశారు. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది, వారు డేటింగ్ ప్రారంభించారు. అప్పటికి నసీరుద్దీన్ తన మొదటి వివాహం నుండి ఇంకా చట్టబద్ధంగా విముక్తి పొందలేదు కాబట్టి, ఆ సమయంలో వారు వివాహం చేసుకోలేకపోయారు, కాబట్టి ఆ జంట లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.

దాదాపు ఏడు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత, నసీరుద్దీన్, రత్న 1982లో వివాహం చేసుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ జంటకు త్వరలోనే ఇమాద్ షా, వివాన్ షా అనే ఇద్దరు కుమారులను జన్మించారు. 2025 నాటికి, నసీరుద్దీన్, రత్నా పాఠక్ నాలుగు దశాబ్దాలకు పైగా కలిసి ఉన్నారు, ఒకరికొకరు అచంచలమైన మద్దతునిస్తున్నారు.

నసీరుద్దీన్ షా భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన నటులలో ఒకరు, 1970లలో ‘నిశాంత్’, ‘ఆక్రోష్’ వంటి ప్రభావవంతమైన చిత్రాలతో ప్రారంభించి, ఆయన పారలల్ సినిమాలలోనూ, ‘మాసూమ్’, ‘కర్మ’, ‘త్రిదేవ్’ వంటి మెయిన్ స్ట్రీమ్ హిట్‌లలోనూ మెరిశారు. తన నటనకు ఆయా అంతర్జాతీయ ప్రశంసలు పొందారు, అనేక జాతీయ అవార్డులు పొందారు. భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందించింది. ఆయన నట ప్రస్థానం, స్టోరీటెల్లింగ్ – జీవితకాలపు అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి..

Exit mobile version