Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 284

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

నటి, నిర్మాత అంజలీ దేవి:

అంజలీ దేవి 24 ఆగస్టు 1927 న తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురంలో ఆమె అంజమ్మగా జన్మించారు. ఆమె తండ్రి నూకయ్య. ఆయనో రైతు, నాటకాలంటే పిచ్చి. నాటకాలు వేసే భద్రాచార్యులకు సన్నిహిత మిత్రుడు. తండ్రి తన స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నప్పుడల్లా అంజలి ఆయనతో పాటు వెళ్లేది. భద్రాచార్యులు అంజలిని ఇష్టపడి 1936లో రాజా హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుడుగా నటింపజేశారు. ఆమె చదువుకోవాలనుకున్నప్పటికీ తన తండ్రి కోరికను అంగీకరించి, నటిగా మారిపోయారు. వారు ఆమె పేరును అంజని కుమారిగా మార్చారు. రెండు సంవత్సరాల తర్వాత నూకయ్య తన కుమార్తెను కాకినాడకు పంపి తన స్నేహితుడు ఆదినారాయణరావు వద్ద శిక్షణ ఇప్పించారు, ఆయన బర్మా షెల్ అమెచ్యూర్స్ క్లబ్‌లో తాను వ్రాసి సంగీతం సమకూర్చిన నాటకాలను ప్రదర్శించేవారు. ఆదినారాయణరావు ఆమెకు గురువు, తరువాత ఆమె భర్త కూడా. కూతురు కెరీర్‌ను చూసుకునే సంరక్షకుడు దొరికాడని భావించి నూకయ్య సంతోషించారు. బర్మా షెల్ కంపెనీ మేనేజర్ వాట్స్‌కు, అసిస్టెంట్ మేనేజర్ మెక్‌క్లాడ్‌కు అంజలీ దేవి నచ్చారు. వారు ఆమెకు బట్టలు కొనిచ్చి, ఫోటో షూట్‌లు చేసేవారు. ఆ సమయంలో, వక్కలంక కామరాజు [వక్కలంక సరళ మామగారు] బర్మా షెల్ కంపెనీలో పనిచేసే వారికి డాక్టర్. ఆయనకి కూడా అంజలి నచ్చింది, దాంతో ఆమెను ప్రధాన పాత్రగా పెట్టి ‘గాకో’ అనే నాటకం రాశాడు. వాట్స్ న్యాయనిర్ణేతగా ఉండి ఆమెకు ‘షిర్లీ టెంపుల్ ఆఫ్ మద్రాస్ స్టేట్’ అని పేరు పెట్టాడు.

ఆదినారాయణరావు ఆమెను తన సైకిల్ మీద ఎక్కించుకుని ముందు కూర్చోబెట్టేవారు. అంజలికి కాకినాడలో ఆయన తప్ప మరెవరూ తెలియదు, ఆయన సైకిల్ ఎక్కి ఆయన ఎక్కడికి  వెళ్ళినా వెంట తీసుకెళ్లమని అడిగేవారు. ఒకరోజు ఆయన ఆమెను తీసుకెళ్లడానికి నిరాకరించారు. ఆమె చాలా కోపంతో ఏడ్చారు. ఒక పిన్ తీసుకొని ఆయన సైకిల్ టైర్‍ని పంక్చర్ చేశారు. అప్పటి నుండి ఆయన కాదానేవారు కాదు. క్రమంగా, ఆమె స్వయంగా సైకిల్ తొక్కడం నేర్చుకున్నారు. ఆయనతో మాత్రమే ఆమె ఇలా ప్రవర్తించేవారు. బయటి వ్యక్తుల పట్ల సిగ్గుపడేవారు. యుక్తవయస్సు వచ్చాక ఆమెను తన స్వస్థలానికి తిరిగి పంపారు. ఆమె చాలా నిరుత్సాహపడ్డారు, తన కెరీర్ పట్ల విచారంగా ఉండేవారు. త్వరలోనే ఆమెకు శుభవార్త అందింది. డాక్టర్ సన్యాసి రాజు సామర్లకోటలో వాణి నాట్య మండలి అనే నాటక సంస్థను ఏర్పాటు చేశారు. ఆమెను తన కంపెనీలో చేరమని, తాము ప్రదర్శించే నాటకాల్లో పాల్గొనమని ఆహ్వానించారు. ఆమె చాలా సంతోషంగా అక్కడికి వెళ్ళింది. ఆంధ్రశ్రీ అనే నాటకంలో ఆమె మాంచాలి పాత్రను పోషించారు. ఈ నాటకం మద్రాసులో కూడా ప్రదర్శించబడింది, ఆ సమయంలో ఆంధ్ర నాటక కళా పరిషత్ 11వ వార్షికోత్సవాన్ని నిర్వహించింది. ఆమె నటనకు మొదటి బహుమతిని అందుకుంది. మద్రాస్ వైద్య కళాశాల నుండి అవార్డును గెలుచుకున్నారు. అంజలి ‘రాజనర్తకి’ అనే నాటకంలో పాల్గొన్నారు. ఆమె రాజనర్తకిగా టైటిల్ పాత్ర పోషించారు. ఆమె నటనకు ప్రశంసలు అందుకున్నారు. అప్పటి డిఎఓ లెఫ్టినెంట్ కల్నల్ శంకర శాస్త్రిల్ ఆ రోజు తన ప్రసంగంలో ఆమె ప్రత్యేకతను ప్రస్తావించారు.

త్వరలోనే ఆమెకు ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఏలూరుకు చెందిన తాండ్ర సుబ్బరాయుడు తన ‘మేనరికం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి ఆహ్వానం పంపారు. దీనిని బొంబాయిలో చిత్రీకరించాలని అనుకున్నారు. ఆమె ఆసక్తిగా బొంబాయికి వెళ్ళింది. ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్న ఎల్వీ ప్రసాద్‌ను ఆమె మొదటిసారి కలిసారు. కానీ సినిమా ఊపందుకోవడం లేదు. రోజులు గడిచేకొద్దీ, ఆమె తన దగ్గర ఉన్న డబ్బును ఖర్చు చేసింది. ఆమె తన బంగారు గాజులు అమ్మి, డబ్బు తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయింది. ఈ అనుభవంతో ఆమెకు సినిమాలు అంటే ఇష్టం పోయింది. ఇప్పుడు ఆమె నాట్య ప్రదర్శనలు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకుని ఒక డ్యాన్స్ ట్రూప్‌ను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం వచ్చి మద్రాస్ గవర్నర్ ఆర్థర్ హోల్ మరియు అతని భార్య ముందు నృత్యం చేయమనిఈ ట్రూప్‌కు ఆహ్వానం అందింది. గవర్నర్ ఆమె ప్రదర్శనను ఇష్టపడ్డారు, ఆమెకు మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చారు. కలెక్టర్, జిల్లా జడ్జ్ తమ ప్రసంగాలలో ఆమెను ప్రశంసించారు, ఆమెకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశీర్వదించారు.

ఇది ఇలా ఉండగా, ఆది నారాయణరావు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్‌ను స్థాపించి, అంజలిని తన క్లబ్‌లో నటించడానికి తిరిగి తీసుకువచ్చారు. ఆమె అంగీకరించి కాకినాడకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఆదినారాయణరావు వసంతసేన, నాలుగో పెళ్లి, లోభి, వీధి గాయకులు మొదలైన నాటకాలకు సంగీతం రాసి, స్వరపరిచారు. ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు వారు యుద్ధ నిధి కోసం, రెడ్ క్రాస్ నిధుల కోసం అనేక ప్రదర్శనలు ఇచ్చారు. విశాఖపట్నం వారిని వైజాగ్ క్లబ్‌లో ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానించింది. ఆ రోజు అంజలికి బంగారు పతకం లభించింది. ఆమె, ఆదినారాయణరావు బంగారు భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూడలేదు. అన్ని నృత్య నాటకాలలో ‘వీధి గాయకులు’ నాటకానికి వారిద్దరూ అపారమైన ప్రశంసలని, ధనాన్ని పొందారు. దీనిని ఆదినారాయణరావు రాశారు, సంగీతం అందించారు, ఇంకా నృత్య దర్శకత్వం వహించారు. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్‌ను అనేక ప్రదేశాలకు ఆహ్వానించారు.

1946లో శోభనాచల సంస్థ ‘గొల్లభామ’ అనే సినిమాను నిర్మిస్తోంది. నటి కృష్ణవేణి కథానాయికగా నటిస్తున్నారు, వారు వ్యాంప్ పాత్రకు కొత్తవారిని కోరుకున్నారు. కృష్ణవేణిగారు చాలా మంది కొత్తవారిని చూశారు, కానీ ఎవరూ ఆమెకి నచ్చలేదు. నటుడు రేలంగి ఆమెకు అంజలి గురించి చెప్పారు. ఆమెను ఆహ్వానించమని కృష్ణవేణి చెప్పారు. కానీ అప్పుడే కొడుకుకు జన్మనిచ్చి తల్లి అయ్యారు. 11 రోజులు గడిచేకొద్దీ చాలా బలహీనంగా ఉండేవారు. ఆమె తిరిగి బలాన్ని పొందడానికి ఆమెను బాగా చూసుకుంటానని, తీసుకురమ్మని రేలంగిని కోరారు కృష్ణవేణి ఆమెకు దానిమ్మ రసాన్ని, ప్రత్యేక ఆహార పదార్థాలను ఇచ్చారు [ఈ చిత్రం యూ ట్యూబ్‌లో ఉంది, అంజలీ దేవి చాలా అందంగా ఉన్నా, బలహీనంగా కనిపించడాన్ని చూడవచ్చు]. 1946 జనవరి 13న భోగి రోజున అంజలి మద్రాస్ సినిమా ప్రపంచంలోకి గొప్పగా అడుగుపెట్టారు. షూటింగ్ ముందుకు సాగుతుండగా, నిర్మాతలు రషెస్ చూసి ఆమె ఇంటికి బారులు తీరారు. ఆమె మదాలస, భూలోక రంభ, బాలరాజు, శివగంగ వంటి చిత్రాలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గొల్లభామ విడుదలైనప్పుడే తాను వారి చిత్రాలలో నటిస్తానని ఆమె స్పష్టం చేసింది. ఈ చిత్రం హిట్ అయింది. ఆమె ప్రకటనను ఇష్టపడి నిర్మాత మీర్జాపురం జమీందార్ ఆమెకు ఒక ఇల్లు కానుకగా ఇచ్చారు.

ఆమె ‘మాయా రంభ’ సినిమాలో నటిస్తున్నప్పుడు, టి.పి. సుందరం నుండి కమల్ బ్యానర్ సినిమా ‘మహాత్మా ఉదరంగర్’ లో హీరోయిన్ గా నటించమని ఆహ్వానం అందింది. ఆ సినిమా 1947 లో విడుదలైంది. ఆ సినిమా తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కొద్ది కాలంలోనే ఆమె తమిళం మాట్లాడటం నేర్చుకున్నారు. ఆ సినిమాలో ఆమె గొంతు నిలిచిపోయింది. ఈ సినిమాలో ఆమె రెండు క్లాసికల్ డ్యాన్సులు చేశారు.

అప్పటికి తమిళ సినిమా ‘మర్మయోగి’ విడుదలై సూపర్ హిట్ అయింది. అంజలిని ‘ఏక్ థా రాజా’ సినిమాలో నటించమని అడిగినప్పుడు ఆమెకు హిందీ సినిమా రంగంలోకి అవకాశం వచ్చింది. ఆమె మార్చి 1949లో ఈ సినిమాకి సంతకం చేశారు. కానీ ఆమె హిందీ ఉచ్చారణ బాలేల పోవడంతో, ఆమె పాత్రకి డబ్బింగ్ చెప్పించారు.

బొంబాయిలోని చంద్రిక ఫిల్మ్స్ యజమాని అంజలిని ఇష్టపడి, తమ ‘సుఖ్ రంభ’ అనే చిత్రంలో నటించమని పిలిచారు. ఆమె దేవనర్తకి రంభ పాత్రలో నటించారు. తరువాత ఆమెను AVM తమిళ, తెలుగు, హిందీ భాషలలో నటించమని అడిగింది ఆ సినిమాని హిందీలో  ‘లడ్కీ’ అని అన్నారు, ఇది ఆమె 3వ హిందీ చిత్రం. ఆమెకు హిందీ చిత్రాలలో నటించడానికి మరికొన్ని ఆఫర్లు వచ్చాయి. ఇది 1953లో జరిగింది. ఆమె భర్త అంజలి పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించారు. వారు 1953లో ‘పరదేశి’ చిత్రాన్ని నిర్మించారు. ఇది పూర్తిగా పరాజయం పాలైంది. నేర్చుకునే దశాలో ఇదొక అనుభవమని భావించి, అలాంటి తప్పు మళ్ళీ చేయకుండా జాగ్రత్త వహించాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అంజలి 1948లో ఆదినారాయణరావును వివాహం చేసుకున్నారు. వారు మద్రాసులో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు కుమారులు.

అంజలీ దేవి తన 86వ ఏట 2014 జనవరి 13న చెన్నైలోని విజయ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆమె అవయవాలను రామచంద్ర వైద్య కళాశాలకు దానం చేశారు.

Exit mobile version