Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలనాటి అపురూపాలు – 282

సినిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

వైజయంతిమాల – వదంతులు – వాస్తవాలు:

ప్రముఖ సినీనటి వైజయంతిమాలపై ఎన్నో వదంతులున్నాయి. సహనటులతో సంబంధాలు, ప్రేమ వ్యవహారాలపై పుకార్లకి అంతులేదు. వాటిలోని నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

~

వైజయంతిమాలకు దిలీప్ కుమార్‌తో ప్రేమ వ్యవహారం ఉందని, ఆమె రాజ్‌ కపూర్‌తో కలిసి నటించిన సంగం (1964) సినిమాకి సంతకం చేసిన తర్వాత ఆ ప్రేమ వ్యవహారం అకస్మాత్తుగా ముగిసిపోయిందని పుకార్లు వచ్చాయి. దిలీప్, వైజయంతిమాల కలిసి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించినప్పటికీ, తరువాతి సంవత్సరాల్లో వారి సంబంధం బెడిసికొట్టడం బాధాకరం.

ముంబైలో బాలీవుడ్ షోల సందర్భంగా దిలీప్ కుమార్, వైజయంతిమాల యాదృచ్ఛికంగా కలుసుకున్నా కూడా మాట్లాడుకునేవారు కాదు. చాలా సంవత్సరాల తరువాత దిలీప్ కుమార్ భార్య సైరా బాను వారి మధ్య రాజీ కుదిర్చారు. అయితే, తమ మధ్య మాటలు లేకపోయినా, 1968లో విడుదలైన హెచ్.ఎస్. రావైల్ చిత్రం ‘సంఘర్ష్‌’లో అద్భుతమైన నటనను ప్రదర్శించినందుకు వీరిద్దరిని అభినందించాలి. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ, దిలీప్ వైజయంతిమాలతో చివరిసారిగా చేసిన సినిమా కావడంతో దీనికి కొంత మైలేజ్ వచ్చింది. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, దిలీప్, వైజయంతి ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు కానీ ఈ వైరం సినిమాలో కనిపించదు. గతంలో, దిలీప్ కుమార్ తన స్టార్ పవర్ ఉపయోగించి ‘రామ్ ఔర్ శ్యామ్’ సినిమా నుండి వైజయంతిమాలను తొలగింపజేశారు. ఆమె తన ఆత్మకథలో ఈ ఉదంతాన్ని వివరించినప్పుడు, మనకు ఒక రకమైన బాధ, ఆమె పట్ల సంఘీభావ భావన కలుగుతాయి. ‘రామ్ ఔర్ శ్యామ్‌’లో ఆమె స్థానంలో వచ్చిన వహీదా రెహ్మాన్‌కీ వైజయంతిమాల దూరంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు.

ఆమె ప్రధానంగా బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టడం వల్ల తమిళనాడులో సినీ అవకాశాలను కోల్పోయారు. దాంతో తమిళ ప్రేక్షకులు ఆమె గురించి పూర్తిగా మర్చిపోయారు. ఆమె వివాహం తర్వాత తమిళ సినీరంగం నుండి వైజయంతికి ఎటువంటి ఆఫర్లు రాలేదు. డాక్టర్ బాలితో వైజయంతి వివాహానికి ఒక సంవత్సరం ముందు 1967లో వివాహం చేసుకున్న ఆమె సమకాలీనురాలైన సరోజా దేవి హర్షతో వివాహం తర్వాత కూడా మంచి పాత్రలను పొందుతునే ఉన్నారు.

రాజ్ కపూర్ సమ్మోహక శక్తి, స్త్రీవాద విధానాల పట్ల వైజయంతిమాల ఆకర్షణ ఇప్పుడు బాలీవుడ్ కథలలో భాగం. మొదట రాజ్ కపూర్‌తో, తరువాత డాక్టర్ బాలితో ఆమె సాన్నిహిత్యం పెంచుకోవడాన్ని ఆమె అమ్మమ్మ వ్యతిరేకించారు. కానీ తన అమ్మమ్మ – బాద్షా బేగం తీవ్రంగా వ్యతిరేకించటంతో దేవ్ ఆనంద్ పట్ల తన ప్రేమను త్యాగం చేసిన సురయ్యలా కాకుండా, వైజయంతిమాల, తన అమ్మమ్మని ధిక్కరించి తన వైఖరిని నిలుపుకున్నారు. కపూర్ తనను వివాహం చేసుకుంటాడని నమ్మేంత అమాయకురాలు ఆమె.

‘సంగం’ సినిమా షూటింగ్ సమయంలో కపూర్ ఆమెకు మత్తుమందు ఇచ్చి, ఆమెను లోబర్చుకున్నారని పుకార్లు వినబడతాయి. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న ఆమె అమ్మమ్మ కోపగించుకున్నారనీ, తన మనవరాలు పెళ్ళి కాకుండానే గర్భం దాల్చిందని తెలిసి మరింత బాధపడ్డారని పుకార్లు వ్యాపించాయి. ఇందులో వాస్తవం ఎంతో, కల్పన ఎంతో ఎవరికీ తెలియదు. కానీ ఆ వ్యవహారం బయటపడినప్పుడు, వైజయంతిలోని మహిళ జీవితాన్ని వదులుకోవడానికి నిరాకరించి, సొంత నిర్ణయం తీసుకుంది. రాజ్ కపూర్‌తో తన అనుబంధం గురించి తెలిసిన రాజ్ కపూర్ కుటుంబ వైద్యుడు డాక్టర్ బాలిని ఆమె వివాహం చేసుకుంది.

రాజ్ కపూర్, వైజయంతి కలిసి నటించిన మరో చిత్రం ‘నజరానా’. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ ‘కళ్యాణ పరిసు’ (1959) కి రీమేక్.

డాక్టర్ బాలికి అప్పటికే వివాహితుడు. ఆయన మొదటి భార్య రూబీకి వైజయంతిమాల భారీ భరణం చెల్లించారని, మొదటి భార్యకి ముగ్గురు కుమారులు ఉన్నారని చెప్పుకునేవారు. డాక్టర్ బాలి పట్ల ఆమె ఎలా, ఎందుకు ఆకర్షితురాలయ్యారనేది ఇప్పటికీ ఒక రహస్యం. ప్రేమ గుడ్డిదనేది స్పష్టం!

నటి తన ఆత్మకథలో ప్రస్తావించినట్లు, వైజయంతిమాలపై ఆమె అమ్మమ్మ యదుగిరి దేవి ఎప్పుడూ ఆధిపత్యం వహించేందుకు ప్రయత్నించేవారు, తన జీవితంలో పురుషుడు లేని లోటుని వైజయంతి గ్రహించడం ప్రారంభించారు. డాక్టర్ బాలి ఆ శూన్యతను నింపినట్లు తెలుస్తోంది. ఆయన దృష్టి ఆమెపై పడిన రోజు నుండి ఆమె ఆయనని ప్రేమించారు. వైజయంతి అమాయకత్వం, దేన్నైనా తొందరగా నమ్మేసే తత్త్వం, ఆమె చెడు స్వభావం గురించి డాక్టర్ బాలి చేసిన వాదనను ఆమె వినయంగా అంగీకరించారు. అమ్మమ్మ అనే చిరాకు ఉన్నప్పటికీ, వైజయంతి తన ప్రేమికుడిని వివాహం చేసుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నారు.

డాక్టర్ బాలితో వైజయంతి వివాహం కేవలం 18 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది. ఆయన మరణం తరువాత, ఆమె ఆయన కుమారులతో తీవ్రమైన చట్టపరమైన వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడులో (ఊటీలో) డాక్టర్ బాలి పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి, అలాగే బొంబాయిలో ఒక రాజభవనం లాంటి ఫ్లాట్ కూడా ఉంది. తమ తల్లి అడిగిన భరణాన్ని తండ్రి భరించలేడని పూర్తిగా తెలిసిన తర్వాత కూడా డాక్టర్ బాలి కుమారులు న్యాయ పోరాటం చేయడం వింతగా ఉంది. వైజయంతిమాల భావోద్వేగపరంగా తెలివైనవారు. అందుకే ఆమె అన్ని చట్టపరమైన అడ్డంకులను అధిగమించగలిగారు.

ఆమెను చుట్టుముట్టిన వివాదాల నేపథ్యంలో మరే ఇతర నటి అయినా చితికిపోయేవారు. రాజ్ కపూర్‌కి చెందిన వ్యక్తులు – ఆమె మైసూర్ మహారాజు అక్రమ సంతానమని, మహారాజు తన నటి తల్లి వసుంధరా దేవి పట్ల ఆపేక్ష కలిగి ఉన్నాడని ఒక పుకారు పుట్టించారు. వసుంధరా దేవి 1917లో జన్మించారు. డాక్టర్ బాలి గుండెపోటుతో అకాల మరణం చెందిన రెండు సంవత్సరాల తర్వాత వసుంధరా దేవి మరణించారు. వైజయంతిమాల తన తల్లికి కార్బన్ కాపీలా కనిపిస్తారు. ‘సంగం’ సినిమా కోసం ఆమెకు చాలా తక్కువ పారితోషికం చెల్లించినప్పటికీ, ఆ సినిమా కోట్ల రూపాయలు వసూలు చేసింది. రాజ్ కపూర్‌తో తనకు సంబంధం ఉందన్న పుకారుని ఆమె ఖండించినప్పటికీ, అతని కుమారులు మాత్రం వైజయంతి అబద్ధాలు చెబుతున్నారంటూ నగరమంతా చాటారు.

వైజయంతి తన హృదయాన్ని, ఆత్మను ‘ఆమ్రపాలి’ (1966) చిత్రంలో పెట్టారు. ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం బౌద్ధమతం వైపు మళ్లిన వేశ్య గురించి ఈ చిత్రం వచ్చింది. ఆ చిత్రంలో ఆమె నృత్యాల గురించి, ఆ చిత్రంలో ఆమె ధరించిన దుస్తుల గురించి కూడా చర్చలు జరిగాయి. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.

‘ఆమ్రపాలి’ సినిమాలో తన నటనకు వైజయంతి జాతీయ అవార్డు ఆశించారు కానీ ‘రాత్ ఔర్ దిన్’ సినిమా గాను నర్గీస్‌కు ఆ అవార్డు దక్కింది. గాంధీలతో నర్గీస్‍కు ఉన్న సాన్నిహిత్యం ఆ అవార్డును ఆమెకు అనుకూలంగా మార్చిందంటారు. నర్గీస్ అమ్మమ్మ దిలీపా బాయి జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూకు బంధువు.

తరువాత సరోజ్ ఖాన్ ‘ప్యార్ హి ప్యార్’ కోసం కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు, వైజయంతిమాల “నా శరీరాన్ని వేరే విధంగా వంచితే నాకు అవార్డు వస్తుందా?” అని కంగారుపడేవారట. బాలీవుడ్ పట్ల ఆమెకున్న నిరాశ ఆమె అకాల నిష్క్రమణకు దారితీసింది. కథానాయికగా తనకు అవకాశాలు తగ్గుతున్నాయని ఆమె గ్రహించారు (సినీరంగాన్ని వీడినప్పుడు ఆమెకు కేవలం 34 సంవత్సరాలు!).

నెమ్మదిగా ఆఫర్లు తగ్గిపోవడంతో, వైజయంతి తన కెరీర్ ముగింపు దశకు చేరుకుందని గ్రహించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే – మాలా సిన్హా, షర్మిలా ఠాగూర్ ఇద్దరూ వైజయంతి వివాహం జరిగిన సంవత్సరం (1968) లోనే వివాహం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ వివాహం తర్వాత చాలా సంవత్సరాల పాటు బాలీవుడ్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు కొనసాగించారు. మరి వైజయంతి ఇంత త్వరగా ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? తన చుట్టూ జరుగుతున్న ప్రతిదానితో ఆమె నిరాశ చెందారా? బహుశా ఆమె అనుభవాలు బాలీవుడ్‌లో చురుకుగా ఉండటం పులిని దాని తోకతో పట్టుకోవాలని చూడడం లాంటిదని ఆమెను నమ్మించి ఉంటాయి.

బాలీవుడ్ నుండి ఇంతగా అప్రధానంగా నిష్క్రమించిన నటిని, నృత్యం పునరుజ్జీవింపజేసి, ప్రపంచ స్థాయి భరత నాట్య కళాకారిణిగా కొత్త గుర్తింపును ఇచ్చింది. అనుభవం లేని వారికి, నృత్యకారిణిగా వైజయంతిమాల సాధించిన విజయం ఒక అద్భుతమైన విజయంగా కనిపిస్తుంది – కానీ ఆమె అలా అనుకోరు. భారతీయ మహిళగా ఆమె గుర్తింపుకు నృత్యం ప్రధాన కొలమానంగా నిలిచింది.

‘చోటీ సీ ములాకాత్’ లోని నృత్య సన్నివేశాలను నేర్చుకునే సందర్భంలో ఉత్తమ్ కుమార్ నిరుత్సాహపడినప్పుడు, వైజయంతిమాలలోని నృత్యకారిణి అతన్ని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఉత్తమ్ కుమార్ యొక్క హాస్యాస్పదమైన నృత్య భంగిమలు సినిమాలో వైజయంతిమాల యొక్క చురుకైన నృత్య కదలికలకు సరిపోలలేదు.

‘ప్రిన్స్’ సినిమాలో షమ్మీ కపూర్‌తో కలిసి నటించినప్పుడు ఆమె సోమరితనంతో ఉన్నట్లు అనిపించింది, కానీ షమ్మీ తన గురించి దురుసుగా వ్యాఖ్యలు చేసినప్పుడు, అతన్ని పట్టించుకోకపోవడంలో అరుదైన ధైర్యాన్ని ప్రదర్శించారు.

తన సహ నటుల వేధింపులకు గురైనప్పుడు కూడా ఆమె తన దృఢత్వాన్ని పదే పదే ప్రదర్శించారు. ఆమె బిఆర్ చోప్రా, యష్ చోప్రా లకు గొప్ప స్నేహితురాలిగా కొనసాగారు. 1988లో రాజ్ కపూర్ మరణించే వరకు, ఆమె రాజ్ కపూర్‍కు దూరంగా ఉన్నారు, భర్త డాక్టర్ బాలీని కూడా రాజ్ కపూర్‌కి దూరంగా ఉండమని కోరారు.

శత్రుఘ్న సిన్హా తనపై చేసిన వ్యాఖ్యలకు ఆమె తిట్టిపోస్తూ, “అతనెవరు?” అని వ్యాఖ్యానించారు, బిగ్గరగా మాట్లాడే బిహారీ బాబును ‘ఖామోష్’గానే ఉంచారు. తరువాత ఆమె రాజకీయ నాయకురాలిగా మారారు; ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో సైద్ధాంతిక విభేదాలను చూపుతూ రాజకీయాలను విడిచిపెట్టారు.

వైజయంతి 38 సంవత్సరాల వయసులో తల్లి అయ్యారు. కుటుంబం చెన్నైలోని వారి రాజభవనానికి మారే ముందు ఆమె ఏకైక కుమారుడు సుచింద్ర బాలి బొంబాయిలో చదువుకున్నాడు. సుచింద్ర నటుడిగా ప్రయత్నించాడు (ఆంచ్, 2003) కానీ తనకు దానిలో నైపుణ్యం లేదని గ్రహించి సినిమాలను వదిలిపెట్టాడు. ప్రస్తుతం అతను రిసార్ట్‌లను నిర్వహిస్తున్నాడు, దక్షిణ భారతదేశంలో చెయిన్ రెస్టారెంట్లకు అధిపతి.

నాట్యంపై వైజయంతిమాల ఆసక్తిని, మీద పడుతున్న వయసు తగ్గించలేకపోయింది. ఆమె అప్పుడప్పుడు వేదికపై కనిపిస్తారు, తన చురుకైన నృత్య కదలికలతో తన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు. ఒక నటి, వయసు పెరిగినా కూడా గ్లామరస్‌గా కనిపించడంలో తప్పు లేదని ఆమె నమ్ముతారు.

Exit mobile version